7, జూన్ 2020, ఆదివారం

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం... డబ్ల్యుహెచ్ఓ సూత్రాలివే...

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) ఐదు సూత్రాలను ప్రకటించింది. డబ్ల్యుహెచ్ఓ కిందటి సంవత్సరం ‘ఆహార భద్రతా దినోత్సవం’ను మొదలుపెట్టిన విషయం విదితమే. తింటున్న తిండి వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, తద్వారా మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, వ్యవసాయానికి సాయపడటం లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు సూత్రాలు పాటిస్తూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించమని చెబుతోంది. 
* వంట గదిలోకి వెళ్లిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. తడి లేకుండా చూసుకోవాలి. 
* నిల్వ ఆహార పదార్ధాలను వీలైనంత వరకు తీసుకోకుండా ఉంటే మంచిది.
* వండిన, వండని ఆహార పదార్థాలను వేర్వేరు డబ్బాలలో నిల్వ చేసుకోవాలి.
* ఆహారాన్ని బాగా ఉడికించి తీసుకోవాలి. అప్పుడే క్రిములు నశిస్తాయి. పోషకాల స్థాయి పెరుగుతుంది.
* శుభ్రమైన నీటిని ఉపయోగించి ఉప్పు నీటిలో కూరగాయలు కడగాలి.

మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని పాడుచేయకుండా ఉండేందుకు పొలంలోని రైతు మొదలుకొని, విధానాలు రూపొందించే ప్రభుత్వాధినేతల వరకూ ప్రతి ఒక్కరు తమదైన పాత్ర పోషించాలని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఫలితంగా కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల భారం తగ్గి సమాజం అభివృద్ధి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేస్తోంది.