22, అక్టోబర్ 2010, శుక్రవారం

బుడమ కాయల దొంగంటే బుజాలు తడుముకున్నట్లు!!!...

రక్తచరిత్ర చిత్రంపై బాబు ఆగ్రహం -రాష్ట్రవ్యాప్తంగా తమ్ముళ్ల నిరసనలు
ఓ ప్యాక్షనిస్టుకు టిడిపి సభ్యత్వం ఇచ్చింది. ఎమ్మెల్యేనూ చేసింది. మంత్రి పదవీ ఇచ్చింది. ఆయన గొప్ప నేత అయ్యాడు. ఆ నేత చరిత్రను, అనంతపురం ఫ్యాక్షన్‌ రాజకీయాలను ఇతివృత్తంగా ఎంచుకుని రాంగోపాల్‌ వర్మ సినిమా తీశాడు. ఆనేతను ఆపార్టీ అధినేత ప్రోత్సహించినట్లు సన్నివేశాలుంటే ఎందుకంత ఆగ్రహం. ప్యాక్షన్‌ నేతను ఎమ్మెల్యేను చేసినప్పుడు ఎవ్వరూ నిరసన తెలుపలేదే. మంత్రిని చేసినప్పుడూ నిరసన తెలుపలేదే. ఉన్నది ఉన్నట్లు చెబితే ఉలుకెక్కువ అన్నట్లు ' బుడమకాయల దొంగలంటే బుజాలు తడుముకున్నట్లు' లేదూ...ఎంత కాకపోతే రాంగోపాల్‌ వర్మను క్షమాపణ చెప్పాలని కోరుతారు. మరి ఈసంఘటటనలను పరిశీలిద్దాం......
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావును రక్తచరిత్ర చిత్రంలో కించపర్చే విధంగా చిత్రీకరించిన సన్నివేశాలు, వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో లేకరులతో మాట్లాడుతూ తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహానాయకుడిని అవమానపరిచి నందుకు వెంటనే ఎన్టీఆర్‌ అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ను తప్పుబట్టిన వారెవరూ లేరన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన హయాంలో జరగని వాటిని జరిగినట్లు చిత్రీకరించారని, ఇది ఎన్టీఆర్‌ను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లకుపైగా ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ దేశ రాజకీయాలను మార్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అలాంటి నేతను 'రక్తచరిత్ర' నిర్మాతలు, దర్శకులు ఈ విధంగా చిత్రీకరించడం మంచి పద్థతి కాదన్నారు. ఒక చిత్రాన్ని నిర్మించినప్పుడు వాస్తవాలతో కూడుకున్నదై ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ చరిత్ర కలిగిన వ్యక్తిని అవమానపరిచేలా ఉండకూడదని పేర్కొన్నారు. నమ్మిన సిద్దాంతాల కోసం పని చేసిన ప్రజల మనిషి ఎన్టీఆర్‌ అని అన్నారు. చరిత్రను వక్రీకరించి చూపించడానికి ప్రయత్నించినా ప్రజలు నమ్మరని చెప్పారు. సెన్సార్‌ బోర్డుకు తెలియకుండా చిత్రం విడుదలయిందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ సెన్సార్‌బోర్డుకు అన్ని విషయాలూ తెలుసు, ఎవరి ఒత్తిడి వల్ల తీశారో కూడా వారికే తెలుసన్నారు.
నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం
అనంతపురం జిల్లా ఫ్యాక్షన్‌ రాజకీయాలను ఇతివృత్తంగా ఎంచుకుని విడుదలైన 'రక్త చరిత్ర' సినిమాలోని సన్నివేశాలపై టిడిపి కార్యకర్తలు, ఎన్‌టిఆర్‌ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ధర్నాలు చేశారు. రాంగోపాల్‌వర్మ క్షమాపణ చెప్పాలని ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సినిమాలో శివాజీ రావు పాత్ర ఎన్‌టి.రామారావులా ఉందని, పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్‌ రాజకీయాన్ని ప్రోత్సహించేలా ఉందని, రామారావు హత్యారాజకీ యాలను ప్రోత్సహించలేదని ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం నగరంలో తెలుగుయువత నాయ కులు కొందరూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అదుపు లోకి తీసుకున్నారు. నగరంలో తొలి ప్రదర్శనను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులు చూశారు. పరిటాల రవీంద్ర, ఎన్టీరామారావు అటువంటి వారు కాదని, రవీంద్ర ఎటువంటి హత్యలు చేయలేదని వారి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. దీన్ని కేవలం సినిమాగానే చూశామని పరిటాల శైలజ, మహేందర్‌ తెలపడం బాగుంది. చంద్రబాబాబు , టిడిపి నేతలు మాట్లాడితన తీరు మాత్రం బాగలేదు.
ఆ సన్నివేశాలు తొలగించాలి : తమ్మినేని, గుండ
ఎన్‌టిఆర్‌పై చెడుగా చిత్రించిన సన్నివేశాలను తొలగించాలని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు తమ్మినేని సీతారాం, గుండ అప్పల సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడుతూ ఆ సన్నివేశాలను తొలగించకుంటే, సినిమాను ప్రదర్శించనీయబో మని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ధియేటర్ల వద్ద టిడిపి కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు జరిపారు.

5 కామెంట్‌లు:

Alapati Ramesh Babu చెప్పారు...

తడుముకుంటె యెలాగొలా కన్విన్స్ చెయవచ్చు కాని వీళ్ళు తడుముకుంటూ వాళ్ళ గుడ్డలు వాళ్ళె వూడదెసుకునెలా గోక్కూంటున్నారు.`

Praveen Mandangi చెప్పారు...

పరిటాల రవికి సపోర్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. NTR తన పార్టీ కార్యకర్తల చేత తన చెప్పులకి దండం పెట్టించేవాడు. నిజమే కానీ అతను పరిటాల రవి లాంటి వాళ్లకి సపోర్ట్ ఇచ్చే మనిషిలా కనిపించలేదు.

కమల్ చెప్పారు...

అసలు పరిటాల రవి ఫ్యాక్షనిస్టేనా...? ఎవరన్న కాస్త ఈ సందేహాన్ని తీర్చగలరా..? రవి టి.డి.పి పార్టీలో చేరడానికి ముఖ్యకారకులెవరో మీలో ఎవరైనా చెప్పగలరా..? అసలు వర్మగారికి ఎంతవరకు నిజాలు తెలుసు...? ఆయన ఓబుళరెడ్డిని చంపిన వ్యక్తిని మాత్రమే జైలులో కలిసారు..ఇక పరిటాల సునీతను, మద్దలచెరువు సూరిని కేవలం మర్యాదపూర్వక కలయకమాత్రమే కాని..అందులో ఫ్యాక్షన్ విషయాలలో నిజనిజాలు తెలుసుకోవడానికి ఆస్కారమే లేదు ..??
అయ్య ప్రవీన్‌శర్మ గారు..మీరు గతంలో టి.డి.పి కార్యకర్తనా..? యన్.టి.ఆర్ తన పార్టీ కార్యకర్తల చేత చెప్పులకు దండం పెట్టించేవాడని చెబుతున్నారు..? మీకు స్వీయానుబవమా..? నేను ఎక్కడా వినలేదు..ఎప్పుడూ చూడలేదు..!!

Praveen Mandangi చెప్పారు...

MLA అభ్యర్థులు పార్టీ టికెట్ల కోసం NTR చెప్పులకి దండం పెట్టి అతని ఆఫీస్ రూమ్ లోకి వెళ్లేవాళ్లని అప్పట్లో టాక్ ఉండేది. కానీ NTR పరిటాల రవికి సపోర్ట్ ఇచ్చాడని నేను ఎక్కడా వినలేదు. అందుకే రక్త చరిత్ర సినిమాలో చూపించిన కారెక్టర్ మీద డౌట్ వచ్చింది.

కమల్ చెప్పారు...

MLA అభ్యర్థులు పార్టీ టికెట్ల కోసం NTR చెప్పులకి దండం పెట్టి అతని ఆఫీస్ రూమ్ లోకి వెళ్లేవాళ్లని అప్పట్లో టాక్ ఉండేది.

@ప్రవీణ్ గారు, అవన్ని పుకార్లు యన్.టి.ఆర్ మీద చాలా జోకులు ఉండేవి అందులో ఇదొకటి మాత్రమే వాటినే పట్టుకొని అవే వాస్తవాలనే చందాన మాట్లాడడం ఎంతవరకు సబబు..?? యన్.టి.ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన గదిలోకి వెళ్లావాలందరు బయట చెప్పులు వదిలి వెళ్ళాలి..! అది సాంప్రదాయంగా ఉండేది..కాని దానిని ఉల్లంగించినవారు ఆనందగజపతిరాజు..ప్రస్తుత అశోకగజపతిరాజు అన్నగారు..! తనొక రాజుననే అహం ఉండడం మూలాన కాళ్ళ బూట్లతోనే లోపలికి వెళ్ళెవారు ఆ విషయం మీద చాలారగడే జరిగింది..! ఇలాంటివి జరిగాయి వాటికి నాలాంటివారు పేపర్ ద్వార చదివాము ఆ కాలంలో..! మీరు చెబుతున్న విషయం మాత్రం ఒక పుకారు కింద నానుడు మాత్రమే..! అందుకు కారణం యన్.టి.ఆర్ ప్రవర్తన కాస్త నాటకీయతతో కూడిన అతి ఉండేది ..దానికి ఇలాంటివి జోడించేవారు అంతే..!!