21, ఆగస్టు 2011, ఆదివారం

రాజీనామా డ్రామా?

               ఒక పక్క అవినీతిపై చట్టం చేయాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రదర్శనల్లో పాల్గొన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఎమ్మె ల్యేలు ఆంధ్రప్రదేశ్‌లో అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారెందుకు. అవినీతి అంతం కావాలని అంటారు. జగన్‌ అక్రమార్జనపై చర్యలు తీసుకోవాలంటే వ్యతిరేకిస్తున్నారు. ఇదేంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ వైఎస్‌ జగన్‌ అక్రమార్జనపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని జగన్‌ అనుచరులు జీర్ణించుకోలేకున్నారు. సిబిఐ విచారణలో ఆయన నీతిమంతుడని తేలితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది కదా? ఎందుకు ఆయన అనుచరులు తొందరపడుతున్నారో... మరీ కథేంటో కొంత పరిశీలిద్దాం. .....
           సిబిఐ సోదాలతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బెెంబేలెత్తుతుండటంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీ నామా అస్త్రం ప్రయోగించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రూపొందించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇద్దరు ఎంపీలతో పాటు, 28 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణా ఏర్పాటు కోసం రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తమ పార్టీ పదవులకే కాకుండా కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈ నిర్ణయం జరిగిన వెంటనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పీకర్‌, గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను, సాయంత్రం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత బస్సు యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆదివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ దిశలో కొందరితో ఇప్పటికే చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు.
రాజీనామాలు చేసేది వీరే
        సమావేశానంతరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ రాజీనామాలు చేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించారు. నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, అనకాపల్లి ఎంపీ సబ్బంహరి రాజీనామాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ్యులుపిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (రామచంద్రాపురం), బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ఒంగోలు), కొండా సురేఖ (పరకాల) మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), టి. శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), బి. శివప్రసాద్‌రెడ్డి (దర్శి), భూమా శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ), సిహెచ్‌ ఆదినారాయణరెడ్డి( జమ్మలమడుగు), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), కోర్ల భారతి (టెక్కలి) , కె. శ్రీనివాసులు (రైల్వే కోడూరు), గొల్ల బాబూరావు (పాయకరావుపేట), పూతలపట్టు రవి (పూతలపట్టు), కె. సత్యవతి (భద్రాచలం), జయసుధ (సికింద్రాబాద్‌), బాలరాజు (పోలవరం) కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి( పాణ్యం), బి.గుర్నాథరెడ్డి(అనంతపురం), ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), ఆళ్ల నాని(ఏలూరు), ఎం. ప్రసాద్‌రాజు (నరసాపురం), కె. చెన్నకేశవరెడ్డి ( ఎమ్మిగనూరు), ఎన్‌. శేషారెడ్డి (అనపర్తి), సుచరితారెడ్డి (ప్రత్తిపాడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ (కాకినాడ సిటి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు), ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట) రాజీనామాలు సమర్పించనున్నారు.
ఏంటీ రాజీనామాలు ?
         వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనుంగు శిశ్యులుగా, ఆయన అనుచరులుగా సిగ్గుశరం ఉన్న వాళ్లయితే రాజకీయాలకు దూరంగా వెళ్లి పోండి? కాంగ్రెస్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని భావిస్తున్న మీరు నీచ రాజకీయాల్లో ఎందుకు ఉండాలనుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి , ఆయనకు మారుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒకే టానులోని గుడ్డకాదా? ఆయన కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే నీతి మంతుడే అవుతుండె నేమో. అబద్దాలను నిజాలను చేసే రాజకీయాల్లో మీరెందుకున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణను ఆహ్వానించండి?. జగన్‌ వేసే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే ఇలాంటి రాజీనామా డ్రామాలాడుతున్నారని జనం అనుకోరా? ఆలోచించండి. న్యాయస్థానాల పట్ల మీకు గౌరవం లేదా? ఉంటే ఎందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు?. జగన్‌కు ఒక పరీక్ష పెట్టారు. ఆపరీక్షలో నెగ్గితే అంటే అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా సంపాదించాడని తేలితే మీకూ మంచిదేగా? బుడమ కాయలదొంగంటే భుజాలు తడుముకుంటున్నంత పని ఎందుకు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నిజాయితీగా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజలు ఐదేళ్లు అధికారంలో ఉండాలని మీకు ఓట్లేశారు. కాని వేర్పాటు వాద ఉద్యమాలకోసమో, స్వార్థ ప్రయోజనాలకోసమో, కొందరు వ్యక్తుల కోసమో రాజీనామా చేస్తే ఎలా? ప్రతి దానికి రాజీనామా రాజీనామా అంటారేంటీ. తుమ్మితే ఊడే ముక్కు ఎన్నాళ్ల్లుంటుందీ. ఇదంతా కుట్రపూరిత డ్రామా. ఏం చేస్తారో చూడాలి.

20, ఆగస్టు 2011, శనివారం

'నేను సైతం' పార్టీ ఫిరాయించగలను

                2009 ఎన్నికలకు ముందు సామాజిక న్యాయం పేరుతో ప్రముఖ సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను. అనే శ్రీశ్రీ గీతం కాస్త చిరంజీవి విషయంలో తిరబడిందనిపిస్తోంది. నేనుసైతం పార్టీ ఫిరాయించగలను అని చిరంజీవి నిరూపించుకున్నారు. ఎన్‌టి రామారావు మాదిరిగా రాజకీయ రంగంలో గొప్ప సంచలనం సృష్టిస్తారని అనుకున్నారు ప్రజాదరణ చూసి. కాని సినీ నటుడు కావడం వల్లనే జనం అంతగా వచ్చారని ఎన్నికల తరువాత తేలిపోయింది. ఆయన సామాజిక న్యాయం అనే గొప్ప నినాదం చేశారు. ప్రజారాజ్యం పార్టీలో అంతా డబ్బున్న వాళ్ళకే ప్రాధాన్యత ఉందని కొందరు నాయకులు చిరంజీవి కంటే ముందే పార్టీ ఫిరాయించారు. సామాజిక న్యాయం అనగానే అప్పుడప్పుడే ఎదుగుతున్న కొందరు బడుగు, బలహీన వర్గాల నాయకులు ప్రజారాజ్యంలో చేరారు. సామాజిక న్యాయం సాధ్యం కాదని తెలుసుకుని ఆపార్టీకి కార్యకర్తలు దూరమయ్యారు. 20-08-2011న రాజీవ్‌ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు చిరంజీవి. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తానని , సామాజిక న్యాయం కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. చిరంజీవి. ఆరు దశాబ్ధాల కాలంలో సాధ్యం కాని సామాజిక న్యాయం చిరంజీవి కాంగ్రెస్‌లో చేరగానే ఎలా సాధ్యమో చిరంజీవి ఆలోచించాలి. ఆర్థిక అంతరాలు పెంచి సామాజికంగా వెనుకబడిన వారిని దోపిడీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీతో సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుంది?.