25, జనవరి 2018, గురువారం

‘పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం


               గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్రం ఈ అవార్డులను గురువారం సాయంత్రం ప్రకటించింది.
 
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా- పద్మవిభూషణ్
 
పద్మశ్రీ అవార్డు గ్రహితలు వీరే...
మహారాష్ట్ర- అరవింద్‌ గుప్తా (శాస్త్రవేత్త)
కేరళ- లక్ష్మీ కుట్టి
తమిళనాడు- ఎంఆర్‌ రాజగోపాల్ (వైద్యరంగం)
మధ్యప్రదేశ్‌- బజ్జూ శ్యామ్‌ (కళారంగం)
బెంగాల్‌- బిశ్వాస్‌ (సేవారంగం)
కర్ణాటక- సులగట్టి నర్సమ్మ (వైద్యరంగం)
మహారాష్ట్ర- నవనీతకృష్ణన్‌ (విద్యారంగం)
హిమాచల్‌ప్రదేశ్- యేషి ధోడెన్‌ (వైద్యరంగం)
మహారాష్ట్ర- మురళీకాంత్‌ పెట్కర్‌ (క్రీడారంగం)
బెంగాల్- సుభాషిణి మిస్త్రీ (సామాజికసేవ)
తమిళనాడు- రాజగోపాలన్‌ వాసుదేవన్‌ (సైన్స్‌-ఇంజినీరింగ్‌)
నాగాలాండ్- లెంటినా ఠక్కర్- (సమాజ సేవ)
మహారాష్ట్ర- రాణి అభయ్‌ బాంగ్- (వైద్యరంగం)
నేపాల్- సందుఖ్‌ రుట్ (వైద్యరంగం) 
మహారాష్ట్ర- సంపత్ రామ్‌ టెకే (సమాజసేవ)

14, జనవరి 2018, ఆదివారం

తెలుగు ప్రజలకు ఆనందాల హరివిల్లు సంక్రాంతి


              తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన పండగలలో సంక్రాంతి ముఖ్యమైనది. నాలుగు రోజులపాటు జరుపుకునే విశిష్టమైన పండగ. రైతులు చేతికొచ్చిన పంట సమృద్ధిగా వస్తే ధనం సమృద్ధిగా వస్తుందని నమ్మకం. పండగంటే కొత్తబట్టలు, పిండివంటలొక్కటే కాదు జానపదకళలకు ప్రాధాన్యతనిచ్చే పర్వదినం. ఎంతో వైభవంగా జరుపుకునే సంక్రాంతి విశిష్టతలతో ప్రజాశక్తి ప్రత్యేక కథనం..
భౌగోళికంగా..
                   మేషాది పన్నెండు రాశులలో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక రాశిలో ప్రవేశిస్తాడు. ఇలా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణంగా పిలుస్తారు. అయితే మకరరాశిలో ప్రవేశించే మకర సంక్రమణానికి ప్రాముఖ్యత వుంది. ఈ సంక్రమణంతోనే ఉత్తరాయణం ఆరంభమవుతుంది. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు భూమధ్య రేఖకు ఉత్తరంగా, ఆరు నెలలు దక్షిణంగా అక్షాంశాలను మార్చుకుంటూ సంచరిస్తాడు. ఇలా ఉత్తర అక్షాంశంలో సంచరించే ఆరునెలల కాలాన్ని ఉత్తరాయణం అనీ, దక్షిణ అక్షాంశంలో సంచరించే కాలాన్ని దక్షిణాయనమని అంటారు. ఈ ఉత్తరాయణాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. ఈ కాలంలో స్వర్గం పన్నెండు ద్వారాలు తెరచి వుంటాయని పురాణాల్లో నమ్మకం. సంక్రాతి పండుగకా నాంది ధనుస్సంక్రమణం. సంక్రాంతికి నెలరోజుల ముందు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసాన్ని ధనుర్మాసం అంటారు. వైష్ణవులకు పవిత్రమైన మాసం. ఈ మాసంలో వైష్ణవాలయాలను అత్యంతవైభవంగా అలంకరిస్తారు. ప్రతి ఇంటి ముంగిట్లో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరిస్తారు.
                                                సంక్రాంతి మూలకథ..
               బలి చక్రవర్తి ప్రహ్లాదుడి మనువడు. ఈయనకు దానవచక్రవర్తిగా పేరు. అనాదిగా దేవదానవులకు గొడవలున్నందువల్ల బలిచక్రవర్తి స్వర్గం మీద దండెత్తి ఇంద్రుడిని తరిమికొడతాడు. కుమారుడు ఇంద్రుడికి పట్టిన ఈ గతికి తల్లి అదితి చాలా బాధపడి విష్ణువును ప్రార్థిస్తుంది. విష్ణుమూర్తి ఆమె కడుపున వామనుడిగా అంటే మరుగుజ్జుగా జన్మిస్తాడు. ఒకరోజు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వెళ్తాడు. యాగదీక్షలో ఉన్న బలిని మూడు అడుగుల స్థలం దానంగా ఇమ్మని విష్ణువు అడుగుతాడు. బలిచక్రవర్తి కులగురువు శుక్రమహర్షి బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలం ఇవ్యకు, అడిగిన వాడు మహా విష్ణువు అని హెచ్చరిస్తాడు. అడిగిన వారికి లేదనుకుండా ఇచ్చే దానగుణమున్న బలి చక్రవర్తి శుక్రమహర్షి మాటలు పట్టించుకోకుండా దానమిస్తాడు. వామనుడు మొదటి అడుగుతో ఆకాశం, రెండో అడుగుతో భూమి ఆక్రమించి మూడో అడుగుకు స్థలం చూపించమని వామనుడు కోరతాడు. విష్ణుపాదాన్ని తన తలపై మోపమని బలిచక్రవర్తి తన తలను చూపిస్తాడు. వామనుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి అతనిని రసాతలం అనే అధో లోకానికి పంపిస్తాడు. దానగుణశీలి అయిన బలిచక్రవర్తిని శ్రీమహావిష్ణువు ఒక వరం కోరుకోమంటాడు. అప్పుడు బలిచక్రవర్తి నేను ఈ భూమిని చాలా సుభిక్షంగా పాలించాను. నా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. వారు నన్నెంతో ప్రేమగా అభిమానించారు. సంవత్సరానికొకసారి భూమిని, భూలోకవాసులను కళ్లారా చూసుకునే భాగ్యం ప్రసాదించమని కోరుతాడు. ప్రతి సంవత్సరం మకర సంక్రమణ దినాన నువ్వు భూలోకాన్ని, లోకవాసులని దర్శించమని వరమిస్తాడు. అప్పటి నుండి సంక్రాంతి రోజున బలిచక్రవర్తి ఈ లోకాన్ని సందర్శిస్తాడు. బలి చక్రవర్తిని ఆహ్వనించడం కోసమే ఇంటి ముందు ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దుతారు. రథం ముగ్గులను గృహ ప్రాంగణంలో వేయడం సంప్రదాయంగా భావిస్తారు.
సంక్రాంతి విశిష్టత..
                 భోగి రోజున కొత్తబట్టలు కట్టుకుని, విందుభోజనాలు చేస్తారు. భోగాలు జరుపుకుంటారు. కావున భోగి అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు చెరకు ముక్కలు, కొత్తనాణెలు, రేగు పళ్లు నెత్తిమీద నుంచి ముతైదువులు పోస్తారు. భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు. మకర సంక్రమణాన్నే మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి రోజున దైవకార్యాలు, పితృకార్యాలు చేస్తారు కాబట్టి భోగిరోజునే కొత్తబట్టిలు ధరించడం ఆనవాయితీ. సంక్రాంతి పండగ మరుసటిరోజున కనుమ. ఈ రోజు మినుము తప్పని సరిగా తినాలి. కనుమ పండగ నాడు ఏడాదంతా కష్టపడే పశువులను రైతులు పూజించి కృతజ్ఞతలని తెలుపుకుంటారు. పూలదండలు, పూసల దండలు, పూలదండలు, చిరుగంటలతో అలంకరిస్తారు. రైతులకు సిరిసంపదలొచ్చేది ఈ పంటల వల్లనే గనుక వాటిని పూజించడం తెలుగు ప్రజలు ఆనవాయితీగా పెట్టుకున్నారు. కనుమ నాడు కాకి అయినా ఇల్లుకదలదంటారు. మూడు రోజుల సంక్రాంతి అనంతరం జరిపే పండుగను ముక్కనుమ అంటారు. స్త్రీలు సావిత్రి గౌరీదేవి వ్రతాన్ని ఆరంభించి తొమ్మిది రోజులపాటు గౌరీదేవులను పూజించి 10వ రోజున వాలలాడింపు పేరుతో నిమజ్జనం చేస్తారు.
కర్నూలు జిల్లాలో...
             కర్నూలు జిల్లా జానపద కళలలకు పెట్టింది పేరు. గంగిరెద్దుల సందడి, హరిదాసుల సంకీర్తనలతో పలుచోట్ల జానపద ఉత్సవాలు జరుగుతాయి. తోలుబొమ్మలాటలు కూడా ఈ సందర్భంగా ఆడిస్తారు. ఆలూరు మండలం రామదుర్గం గ్రామంలో తోలుబొమ్మలాట కళాకారులున్నారు. వీధి నాటకాలు, బుర్రకథ, హరికథలు సంకురాతిరి సంబరాల్లో భాగంగా పల్లెల్లో చేస్తారు. ఈ సంక్రాంతి సమయంలోనే ఎక్కువగా గ్రామాల్లో పౌరాణిక నాటక ప్రదర్శనలు జరుగుతాయి. సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించే జానపద నృత్యకళ కర్నూలుకు ప్రత్యేకం. సంచార జీవనం చేస్తున్న ఈ కళాకారులు జిల్లా వాసులు అనేక ప్రాంతాలు తిరిగి గంగిరెద్దులతో విన్యాసాలు చేయిస్తారు. ఆదోని ప్రాంతంలో కన్నడ, తెలుగు భాషల్లో ఈ కళావిన్యాసాలు ప్రదరిస్తారు. ప్రపంచీకరణ విషపంజా సమాజంపై విసరడం వల్ల కళలు కనుమరుగవుతున్నాయి.