26, జులై 2011, మంగళవారం

తెలంగాణ ఆందోళనకు తెరపడే దెన్నడు?

               తెలంగాణ ఆందోళనకు తెరపడే దెన్నడు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పాలన స్తంభించి పోయింది. పాలకుల ఆగడాలను ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం కూడా తెలంగాణ ఆందోళనలోనే తలమునకలయ్యింది. ప్రశ్నించే వామపక్షాల్లో కూడా సిపిఎం తప్ప తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. విపరీతంగా ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తున్న పాలకులు ప్రజల మధ్య తగువు పెట్టి చూస్తున్నారు. ఐక్యంగా ఉంటే ఆటలు సాగవని భావించిన పాలకుల కుట్రలను ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఎదుర్కొనే పరస్థితి లేదు. రాష్ట్రాన్ని విడగొట్టండని గట్టిగా చెబితే సీమాంధ్రలో వ్యతిరేకత వస్తుందని .... ఐక్యంగా ఉంచండని చెబితే తెలంగాణలో రాజకీయం చేయలేమని ప్రజల పక్షాల నిలబడాల్సిన ప్రజాప్రతినిధులే దోబూచులాడుతున్నారు. దోబూచులాడుతున్న రాజకీయ నాయకులను ప్రశ్నించాల్సిన ప్రజలు మధ్య కూడా ఐక్యతను దెబ్బతీయడానికి సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు. సిద్ధాంతం... చిత్తశుద్ధి లేని స్వార్థ రాజకీయ నాయకుల ఆటలు తెలుసుకోనంత కాలం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇలాంటి సమస్యలను ఎదురవుతూనే ఉంటాయి. ప్రాంతాలకతీతంగా ప్రజలు తిరగబడితే తప్ప ద్వందవైఖరితో వ్యవహరించే రాజకీయ నాయకులకు తిక్కకుదరదు.

18, జులై 2011, సోమవారం

అనైతిక రాజకీయాలు

                  కర్నూలు జిల్లాలో అనైతిక రాజకీయాలు మరో సారి అరంగేట్రం చేశాయి. రాజకీయాలు కాదండోరు నీతిమాలిన నాయకులు అని చెప్పాలి. రాజకీయాల్లోకి నీతి మాలిన వారు రావడం వల్ల ఇలాంటివి మామూలు అయిపోయాయి. నవ్విపోదురు కాక నాకేంటి అన్నట్లు రోజుకో పార్టీలో తిరిగే నాయకుల చర్యలు రోత పుట్టిస్తున్నాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మిగనూరుకు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వీరిద్దరూ కాంగ్రెస్‌ పార్టీ హస్తం గుర్తుతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టిడిపి సైకిల్‌ గుర్తుతో గెలిచారు. పార్టీలు పిరాయిస్తారనే ముందుజాగ్రత్తగా కాంగ్రెస్‌ పార్టీ ఎస్వీ మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ముఖ్యమంత్రి పదవి దక్కలేదని కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వారు నలుగురూ చేరారు. 2011 జులై 18న జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆయన ఓదార్పులో ఆ నలుగురూ కలిశారు. అప్పటికే పలుమార్పు పార్టీలు పిరాయించిన భూమా దంపతులు జగన్‌కు బంధువులు కావడం వల్ల ఆయన వెంటే ఉన్నారు. వారు ముందుగా టిడిపికి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం కాస్త కాంగ్రెస్‌లో కలిసి పోయిన సంగతి తెలిసిందే. దీంతో వారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో జతకట్టారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా పలువురు నాయకుల అనుచర గణం ఎందరో వైఎస్‌ఆర్‌ పార్టీలోకి వలస వెళ్తున్నారు. అక్కడ ఎన్నాళ్లుంటారో చూడాలి మరి.

12, జులై 2011, మంగళవారం

సమస్త కళల సారాంశం 'మనిషి'

సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు
        సమస్త కళల సారాంశం 'మనిషి' అని ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాష్‌రావు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ టిటిడి కళ్యాణ మండపంలో వేకువ కళాసమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కవితాపురస్కారోత్సవాన్ని 2011 జులై 10న ఘనంగా నిర్వహంచారు. ప్రఖ్యాత సాహితీ వేత్తలు శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణ చార్యులు, విద్వాన్‌విశ్వం పేర్లతో మూడు వేదికలుగా ఈ పురస్కారోత్సవాలను నిర్వహించారు. ప్రముఖ అష్టావధాని, డాక్టర్‌ శావాది ప్రకాష్‌రావు పుట్టపర్తి నారాయణ చార్యుల వేదికకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆశావాది మాట్లాడుతూ కళలకు, సాహిత్యానికి ఎల్లలు లేవన్నారు. వాటి ద్వారా సమాజాన్ని మేల్కొల్పవచ్చునని అన్నారు. అన్నిరంగాల్లో ప్రజలను చైతన్యం చేయడానికి కళలు, సాహిత్యం ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 13 మంది ప్రముఖ సాహితీవేత్తలు, ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. కేంద్రసాహిత్య అకాడమి అవార్డు గ్రహిత శివారెడ్డి శ్రీశ్రీ వేదికకు, నెలవంక- నెమలీక సంపాదకులు శ్రీరాములు విద్వాన్‌ విశ్వం వేదికకు అధ్యక్షత వహించారు. ప్రముఖ ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న సీమ సంస్కృతి, సాంప్రదాయాలపై, అనంతకరువుపై పాడిన పాటలు అలరించాయి. బి.కెభవ్య, సుగమ్య, శంకర్లు చేసిన శాస్త్రీయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జూపల్లి ప్రేమ్‌చంద్‌, ప్రముఖ శ్రీవాద కవయిత్రి శిలలోలిత, కవయిత్రులు లోయాల, డా.ఆశాజ్యోతి, ప్రముఖ కవులు బిక్కికృష్ణ, యాకోబ్‌, మాలేపల్లిలు పలు అంశాలపై కవితలు వినిపించారు. ఈసందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో వందమందికిపైగా వర్ధమాన కవులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి కవితా పురస్కారోత్సం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయిలోఎంపికైన కవితలను ఆయా కవితల రచయితలు వినిపించారు. రచయితలకు జ్ఞాపిలకలను, ప్రశంసపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేకువ సంస్థ అధ్యక్షులు జాబిలి జయచంద్ర అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పురస్కార ప్రస్తావకునిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి జయలక్ష్మమ్మ, ఉపసర్పంచి శ్రీరాములు, పలువురు పట్టణ ప్రముఖులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

11, జులై 2011, సోమవారం

వేర్పాటువాద లొల్లి దేనికి..?

అవినీతిని కప్పిపుచ్చుకోవడానికా..?
ధరల భారం మరిచిపోవడానికా..?
          తెలంగాణా ఉద్యమాన్ని అవమాన పరచడం లేదనుకుంటే నాకున్న కొన్ని సందేహాలు చెప్పాలనుకున్నా. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్‌ ఈనాటిది కాదు. అయితే ప్రస్తుతం విస్తరించింది. ఒకప్పుడు ప్రసార, ప్రచార మాధ్యమాలు తక్కువ కాబట్టి ప్రజల్లోకి వెళ్లడానికి సమయం పట్టేది. ఇప్పుడు విస్తృతి పెరిగింది. ప్రజల్లోకి వెంటనే చేరుతుంది. ప్రస్తుతం సిపిఎం మినహా అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. అధికార పార్టీ నాటక మాడుతోంది. కెసిఆర్‌ దీక్షలకు స్పందించి శ్రీకృష్ణ కమిటీ వేశారు. తెలంగాణా రాష్ట్రం వచ్చేస్తుందనే భ్రమలు కల్పించాయి చిదంబరం వ్యాఖ్యలు. శ్రీకృష్ణకమిటీ నివేదిక వచ్చింది. అందులోని అంశాలన్నీ బహిరంగ పరిచారు. కొన్ని రహాస్యాలన్నారు. చివరికి అవి కూడా బయటకు పొక్కాయి. ఏకాభిప్రాయ సాధన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు. మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర ఇవ్వలేమని స్పష్టం చేయవచ్చు. లేదా పలాన సమయానికి ఇస్తామని అయినా చెప్పవచ్చు. రెండూ చెప్పకుండా అవకాశ వాద ధోరణితో వ్యవహరించడం ఎంతవరకు సమంజసం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిష్ట పడిపోయింది. మంత్రులు కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. జనలోక్‌పాల్‌ బిల్లు తెస్తామని అన్నారు. అందులో ప్రధాన మంత్రిని చేర్చాలని దీక్షలు మొదలయ్యాయి. ప్రధాన మంత్రిని చేర్చాలో లేదో తేలకముందే ఇంధన ధరలు పెంచారు. ఈ పరిణామాల క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని భావించి దీని నుంచి ప్రజల ధృష్టిని మరల్చేందుకు తెలంగాణా రాజీనామాల అస్త్రాలను ప్రయోగించింది అధికార పార్టీ. దీని మర్మాన్ని గ్రహించిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. అధికార పార్టీ వాళ్లతోపాటు మనం కూడా రాజీనామా చేయకపోతే ఎక్కడ ప్రజలకు దూరమవుతామోననే ఆలోచనతో టిడిపి, బిజెపి, సిపిఐ ఇతర ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలు గవర్నర్‌కు సమర్పిస్తే రాజ్యాంగ సంక్షోభం ప్రభావం వెంటనే తెలిసేది. స్పీకర్‌ లేని సమయంలో రాజీనామాలు సమర్పించారు. ఈసారి గొడవలో కొందరి స్వార్థముందని కొన్ని పత్రికలు రాశాయి. స్వార్థముందనేది వాస్తవమే కానీ అధికార పార్టీదే స్వార్థముందనేది మాత్రం రాయలేదు. అబ్బో అధిష్టానం కోపపడినట్లు నటించింది. అందులో కోపం లేదు .... పాడులేదు. తాము వేసుకున్న పథకం బాగా విజయ వంతమయిందనే ఆనందం తప్ప. అయితే తెలంగాణా ఎప్పటికయినా సపరేటు అవుతుందనే చర్చ మాత్రం జనంలో సాగుతోంది. 2014 ఎన్నికల వరకు తేల్చరనేది కూడా అనుకుంటున్నారు. మరి అధికార పార్టీ ఏం చేస్తుందో వేచి చూడాలి.