30, మార్చి 2014, ఆదివారం

తెలుగు సంవత్సరాది ఉగాది


             పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలువులు తదితరాలు మన సంస్కృతిలో భాగం. వీటిలో అన్ని మతపరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించినవి. అందులో వ్యవసాయం, పశుపోషణ వంటివి ముఖ్యమైనవి. కొన్ని మానవుడు ప్రకృతిపై సాధించిన విజయాన్ని కూడా పండుగలుగా జరుపుకుంటారు. కొన్ని పండుగలు పూర్తిగా మత నమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అయితే వాటన్నింటిని విడివిడిగా చూడటం కష్టం. మానవుడు ప్రకృతిపై, ఉత్పత్తులలో సాధించిన విజయాలలో కూడా మతపరమైన నమ్మకాలు ఉండవచ్చు కూడా. పూర్తిగా మతపరమైన కథలలో కూడా పరిశీలిస్తే మానవ సమూహాల అభివృద్ధి చారిత్రక విషయాలు కనిపిస్తుంటాయి. ఏదేమైనా పండుగ ఉత్సవాలను మతం, మూఢనమ్మకాల పేరుతో కొట్టిపారేయరాదు. ఆధ్యాత్మిక విషయాలను భూజాన వేసుకుని మోయరాదు. పండుగలలో ఉగాది వ్యవసాయ ఆధారామైనది. తెలుగువారి కొత్త సంవత్సరం ఆరంభ దినాన్ని ఉగాది అంటున్నాం. చైత్రశుద్ధ పాఢ్యమి నాడు తెలుగు వారికి, కన్నడీగులకు, మరాఠిలకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. చంద్రమానాన్ని అనుసరించి వీరికి ఇప్పుడు ఉగాది. సౌరమానాన్ని అనుసరించే తమిళ, మాలయాళ, బెంగాళీ, పంజాబీ, అస్సామీ ప్రజలకు ఉగాది వేరే రోజున వస్తుంది. గుజరాతీలు, మార్వాడీలు బృహస్పతి మానాన్నను అనుసరించి ఉగాది జరుపుకుంటారు. ఉగాదిని కేరళలో ‘విషు’ పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది వసంత ఋతువులో వస్తుంది గనుక చెట్టన్నీ కొత్త చిగుళ్లను వేసి కోయిల పాటలతోను, కొత్త పూల పరిమళాలతో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. చెరుకు, మామిడి, చింతపండువంటివి చేతికి వస్తాయి. అందువలననే కొత్త చింతపండు, కొత్త బెల్లం, చెరకు, వేపపువ్వు, పచ్చిమిరప, ఉప్పు, అరటిపండు కలిపి షడ్రుచులు గల ఉగాది పచ్చడి చేసుకొని తింటారు. సంవత్సరం ప్రారంభం కాబట్టి ఆరోజున పంచాంగం చూసి వర్షాలు పరిస్థితి, పంటల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుంటారు. పురోహితులు చదివే ఈ పంచాంగాన్ని అందరూ శ్రద్ధగా వింటారు. సంవత్సరం ప్రారంభం గనుక ఆరోజు ఏం జరిగితే సంవత్సరమంతా అదే జరుగుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. గ్రామీణా ప్రాంతాల్లో కుస్తీపోటీలు, బల ప్రదర్శనలు, పరుగు పందెలు, ఎడ్ల బండ్ల పందెలు వంటి వినోద కార్యక్రమాలు జరుగుతాయి. ఉగాది నాడు కవి సమ్మేళనాలు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోను ఉగాది రోజున జరుగుతాయి. ఇప్పుడు ఈ సాంప్రదాయం బాగా తగ్గుముఖం పడుతున్నట్లు అనిపిస్తుంది. 
ఉగాది పచ్చడి 
              ఉగాది పచ్చడి అంటే ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. అనే ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కోసం చెరుకు, అరటి పళ్లు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వినియోగిస్తారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాల్లో  నింబకుసుమ భక్షణం, అశోకళికాప్రాశనం అని వ్యవహరించేవారు. రుతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫి, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందని అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చి మిరపకాయలు, మామిడి చిగుళ్లు, ఆశోక చిగుళ్లు,  వేసి చేసే వాళ్లు. ఈపచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని చెబుతారు. 
గోదావరి ఉగాది పచ్చడి చేసే విధానం
            గోదావరి జిల్లాల్లో చేసే గాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలను పరిశీలిద్దాం. వేపపువ్వు, కప్పుబెల్లం పొడి, కప్పు కొబ్బరి కోరు, కప్పు బాగా మగ్గిన అరటిపండ్లు, మామిడికాయ, చిటికెడు కొత్తకారం, అరస్పూను ఉప్పు, శనగ పప్పు, నిమ్మకాయంత చింతపండు, కొద్దిగా చెరుకు ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు, అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటి పండు తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి.  వేపపువ్వు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి. ఇలా తయారు చేసిన పచ్చడికి గోదావరి జిల్లాలో మంచి గుర్తింపు ఉంది.  ‘విజయ నామ’ సంవత్సరానికి వీడ్కోలు పలికి ‘జయ నామ’ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.  అందరికీ జయం చేకూర్చాలని ఆశిద్దాం. 

14, మార్చి 2014, శుక్రవారం

ఆవేశం....ఆత్మవిమర్శ

కాంగ్రెస్‌ను గద్దే దించాలి....దేశాన్ని కాపాడాలి
‘ జనసేన ’ పార్టీ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌
‘ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, గతుకుల దారి, గుండెల నిండా ధైర్యం’ఉందంటూ బాలగంగాధర్‌తిలక్‌ పద్వంతో జనసేన నేత ప్రముఖ సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాన్ని ప్రారంభించి రెండు గంటలపాటు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. సాయంత్రం ఏడు గంటల ఏడు నిమిషాలకు పవన్‌కళ్యాణ్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  ‘అందరికీ హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దౌర్జన్యాన్ని, అవినీతిని అరికట్టడానికి ముందుకు సాగుతాన్నా పిరికితనంతో నీ బాంచెన్‌ కాల్మోక్తా అనే పిరికిపందను కాదు, ఢల్లీిలో ఉన్నవారిని కాల్మొక్తా అంటూ  మన రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తెచ్చారు’ అని పవన్‌ కళ్యాణ్‌ ఆవేశంగా చెప్పారు.  2014 మార్చి 14న సాయంత్రం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ హైటెక్స్‌ నోవాటెల్‌లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ   పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.  రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌పార్టీ అనుసరించిన విధానాన్ని  తూర్పారపట్టారు.  అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేశానని, అన్నయ్య పార్టికీ ఎదురుగా నిలబడాల్సి రావడం దురదృష్టకరమని, తండ్రి లాంటి అన్నయ్యను తాను ఎదిరించలేనని, అలాంటి పరిస్థితిని ఢల్లీిలో కాంగ్రెసువాళ్లు కల్పించారని ఆయన అన్నారు. గొప్పగా బతకాలంటే సాహసాలు చేయాల్సి వస్తుందని అన్నారు. తాను బానిసను కాదని ఆయన చెప్పారు. ఐదేళ్ల క్రితం గుంటూరులో రాజకీయాలు మాట్లాడానని, ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితి మీద గానీ, రాజకీయాల గురించి గానీ మాట్లాడలేదని అన్నారు. రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని, ఎంపీగా గెలవాలని లేదు, మంత్రినీ ముఖ్యమంత్రిని కావాలని లేదని, అవన్నీ తనకు తుచ్ఛమని వ్యాఖ్యానించారు. నా తెలంగాణ, మన తెలంగాణ, పోరు తెలంగాణ అని గట్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పరిస్థితిని చూసి బాధపడ్డానని అన్నారు.  తాను అందరిలాగా బతకాలని అనుకున్నానని, కానీ సమస్యలు తన వద్దకే వచ్చాయని తనకు ఎదురైన సమస్యలు ఈ సందర్భంగా వివరించారు. రాజకీయాల గురించి మాట్లాడుతానని  2014 మార్చి రెండున ప్రకటన చేసిన నాటినుండి తనపై నోటికి వచ్చినట్లు కొంతమంది మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గద్దెదింపాలని, దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్‌ హఠావో ... దేశ్‌ బచావో’ అని నినదించారు. సభకు హాజరైన అభిమానుల చేత ఆ నినాదం  పదేపదే చేయించారు. ‘ మిస్టర్‌ జైరామ్‌రమేష్‌, అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, వీరప్ప మెయిలీ...మీరు రాష్ట్రాన్ని విభజించిన తీరు మమ్మల్ని గాయపరిచింది. మేం నెత్తురోడుతున్నాం. తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్మారు. మీకు అధికారం అప్పగించారు. మీరు మాకు వెన్నుపోటు పొడిచారు. అందుకే నేను దేశ వ్యాప్తంగా ప్రజలందరికి పిలుపునిస్తున్నా ...’ అని అన్న ఆయన ఆ వెంటనే  కాంగ్రెస్‌ హఠావో...దేశ్‌ బచావో అంటూ పెద్దగా నినాదం చేశారు. కార్యకర్తల చేత చేయించారు. అంతకుముందు ఆయన వేలాది మంది అభిమానుల సమక్షంలో పార్టీ పేరును ప్రకటించారు. ‘పార్టీ పెట్టాను.  దాని  పేరు జనసేన’ అని ఆయన హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తన  పార్టీ సామాన్యుల సేన అని అన్నారు. భారతీయుల సేవకోసమే పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌, జైరాంరమేష్‌ వంటి తదితర నేతలపై నిప్పులు చెరిగారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన కెసిఆర్‌, కేటిఆర్‌, కవిత, వి.హనుమంతరావు, వెంకయ్యనాయుడులకు చురకలంటించారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే అందరి వ్యక్తిగత జీవితాలను బయటపెడతానని హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై ఆయన నేరుగా విమర్శలు చేశారు. చట్టం కొంతమందికి చుట్టం గాకుండా ఎవరికైనా సమానంగా పనిచేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. జగన్‌పై విమర్శలు చేయకపోయినా అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ మినహా అన్ని పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అన్నయ్య చిరంజీవిపై కోపం లేదని, ఆయనకు వ్యతిరేకంగా నిలబడడానికి కాంగ్రెస్‌పార్టీనే కారణమని అన్నారు. కాంగ్రెస్‌ హఠావో.. దేశ్‌ బచావో అన్నరీతిలో పనిచేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా టిడిపిని గానీ, ఆ పార్టీ నేతలను గానీ ఒక్క విమర్శ చేయలేదు. తనకు నచ్చిన నేతల్లో జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) ఒకరని మెచ్చుకున్నారు.  
టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై విసుర్లు, సెటైర్లు
      జనసేన అనే తన పార్టీని కాంగ్రెస్‌పార్టీలో కలపాలని దిగ్విజయ్‌సింగ్‌ చెప్పడంపై పవన్‌ మండిపడ్డారు. దిగ్విజయ్‌ సింగ్‌ను ఆయన ఢల్లీి పవిత్రాత్మగా అభివర్ణించారు. కాంగ్రెస్‌పార్టీలో కలపడానికి అది ఏమైనా గంగానదా అని ఎద్దేవా చేశారు. తాను ఎలా కనిపిస్తున్నానని దిగ్విజయ్‌ను ప్రశ్నించారు.  కెసిఆర్‌పై కూడా ఆయన దుమ్మెత్తి పోశారు. నువ్వు నన్ను చెప్పనీరాదే అని కెసిఆర్‌పై సైటెర్లు వేశారు. క్షమాపణ చెప్పి పార్టీ పెట్టాలని అన్న కల్వకుంట్ల కవితపై ఆయన విరుచుకుపడ్డారు. నా తెలంగాణ గురించి క్షమాపణ చెప్పమనే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తనను తిడితే పైకి వద్దామని అనుకుంటున్నారా అని ఆడిగారు. రెండు నెలల ఎన్నికల ముందు ఇలా వచ్చి భయపడేవాడినైతే నిలబడగలిగేవాడినా అని అడిగారు. పిరికితనమంటే తనకు చిరాకు అని అన్నారు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతానని సవాల్‌ విసిరారు. జనసేన పార్టీ రిజిస్ట్రేషన్‌ అయిపోయిందని ఆయన అన్నారు. రాజకీయాల విషయంలో గుండెల్లో పెట్టుకునే అన్నయ్యను చూసిన తర్వాత ఆగిపోవాలా అనుకున్నానని ఆయన అన్నారు. నాలుగు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలుసుకున్నానని, సమాజం ముఖ్యమా, వ్యక్తిగతం ముఖ్యమా అని ఆలోచించుకున్నానని, అప్పుడు సమాజం ముఖ్యమని అనుకున్నానని ఆయన అన్నారు. సమాజం ముఖ్యమని అనుకున్నప్పుడు కుటుంబం చిన్నదిగా కనిపించిందని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు శత్రువులు లేరని, కోపం కూడా రాదని, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేదని, తనకు మిత్రులు చాలా మంది ఉన్నారని, వారిలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా ఒకరని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి తాను రావడం త్రివిక్రమ్‌కు ఇష్టం లేదని పవన్‌ చెప్పారు. ప్రజలకు తెలియని మిత్రుడు ూన్నారని, కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను ఆపలేదని, అది ఇప్పుడు జనసేన అయిందని ఆయన అన్నారు. పార్టీ పెట్టడానికి వరంగల్‌కు చెందిన తన మిత్రుడు రాజు రవితేజ కారణమని అన్నారు. సినిమాల మీద ఆసక్తి లేదని, ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని, కొత్త సినిమాలు తీయడం లేదని అన్నారు. ప్రతి పార్టీలోనూ వ్యక్తిగతంగా తనకు తెలిసిన నాయకులున్నారని, సన్నిహితంగా మెలిగేవారున్నారని, కానీ సైద్ధాంతికంగా విభేదిస్తానని, వాళ్ల ఆలోచన సరళికీ తన ఆలోచనా సరళికీ కుదరదని ఆయన అన్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, సీమాంధ్ర ఆత్మగౌరవం దెబ్బ తింటే ఊరుకోనని, తెలుగు ప్రజలను కించపరిస్తే క్షమించబోనని పవన్‌ హెచ్చరించారు. గౌరవంగా తేవాల్సిన తెలంగాణను పార్లమెంటులో ఎలా తెచ్చారో అందరూ చూశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నేత వెంకయ్యనాయుడుపై వ్యాఖ్యలు చేశారు. భగత్‌సింగ్‌ ఆశయాల సాధనకు పనిచేస్తానని అన్నారు. ఆయన జీవితం తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిందని, ఇంకా తిట్టుకోవడం వల్ల పలితం లేదని అన్నారు. ‘నన్నయ్య గొప్పవాడా పాల్కూరికి సోమనాధుడు గొప్పవాడా అని ఇంకా మాట్లాడుకుంటే బంగారు తెలంగాణ రాదు’ అని ఆయన అన్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు  నోవాటెల్‌కు చేరుకున్నారు. మెగా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం స్థాయిలో పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ఆవిర్భావ ప్రకటన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికకు ఇరువైపులా రెండేసి ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడు గంటల ప్రాంతంలో పవన్‌ కళ్యాణ్‌ వేదిక మీదికి చేరుకున్నారు. తెల్ల ప్యాంట్‌, బూడిద రంగు కుర్తా వేసుకుని ఆయన వేదిక మీదికి చేరుకున్నారు. ఆయనను వేదిక మీద చూడగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇది సామాన్యుడి సేన, ఇది ప్రతి ఒక్కరి సేన, ఇది మనసేన, జనసేన అనే అనే నినాదం తెరపై ఉంది. 

7, మార్చి 2014, శుక్రవారం

మార్కెట్‌ శక్తులను నియంత్రించాలి


సామాజిక న్యాయ సాధనలో అందరికీ భాగస్వామ్యం'ప్రజాస్వామ్యం, సోషలిజం'పై అంతర్జాతీయ సదస్సులో వక్తలు ,అహింసాయుత పద్ధతుల్లో బలమైన ఉద్యమాలు - జైపాల్‌రెడ్డి , రాజకీయాలను శాసిస్తోన్న మాఫియాలు - జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి 
            మార్కెట్‌ శక్తులను నియంత్రించటం ద్వారా సహజ వనరుల లూటీని అడ్డుకోవాలని రాజకీయ, ఆర్థిక, న్యాయ, సామాజికరంగాలకు చెందిన పలువురు వక్తలు సూచించారు. రాజ్యం ప్రోత్సహించే పెట్టుబడిదారీ విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి విధానాల వల్ల పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తులు, బహుళజాతి కంపెనీలు మొత్తం రాజకీయాలను, రాజ్య వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకుంటాయని తెలిపారు. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పెను ప్రమాదంలోకి నెట్టబడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
         'ప్రజాస్వామ్యం, సామ్యవాదం, 21వ శతాబ్దపు దృక్పథం' అనే అంశంపై నాలుగు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సు 2014 మార్చి7న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ విద్యావంతుల వేదిక, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌, డెమోక్రసీ డైలాగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతికరంగాలశాఖ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ...ప్రజాస్వామ్యం, సోషలిజం అనేవి 19వ శతాబ్దం నుండే ప్రారంభమయ్యాయని అన్నారు. అప్పటి సోషలిజం నుండే కమ్యూనిజం రూపాంతరం చెందిందని, ప్రస్తుతం అది ఆధునిక ప్రజాస్వామ్య సోషలిజంగా రూపాంతరం చెందిందని చెప్పారు. వివిధ దేశాల్లో సంపద అతి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవటంతో ఆయా దేశాల్లోని కార్మికులు, కర్షకులు, శ్రామికులు అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట దేశ సంపదను లూటీ చేసేందుకు ప్రయత్నించే శక్తులకు వ్యతిరేకంగా ఈ పోరాటాలు జరిగాయని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో మొత్తం రాజ్యాన్నే తమ చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంటాయని వివరించారు. ఏ దేశంలోనైనా ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, అసమానతలు తారాస్థాయికి చేరితే అక్కడ కచ్చితంగా ఉద్యమాలు పుట్టుకొస్తాయని చెప్పారు. ఇదే సమయంలో పార్లమెంటరీ వ్యవస్థలోనే ఇలాంటి ఉద్యమాలకు ఆస్కారముంటుందని అన్నారు. మరోవైపు ప్రపంచదేశాల్లో సందప విపరీతంగా పెరుగుతూ వస్తోందని, అయితే ఈ సంపదను దేశంలోని అన్ని వర్గాలవారికి సమానంగా పంపిణీ చేయకపోవటం వల్ల అభివృద్ధి అనేది డోలాయమానంలో పడిపోతోందని చెప్పారు. ఫలితంగా ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శక్తివంతమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరముందని అన్నారు. ఇవన్నీ అహింసాయుత పద్ధతుల్లోనే సాగాలని సూచించారు. సామాజిక న్యాయం, సామాజిక మార్పు పేరుతో హింసను ప్రేరేపించటం ఫాసిజమవుతుందని విమర్శించారు. ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలన్నీ తమ దేశ స్థూల జాతీయోత్పత్తిలో అత్యధిక భాగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాల మీదకాకుండా సైన్యం మీద ఖర్చు పెడుతుండటం శోచనీయమన్నారు. అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికాలో సైతం ఇప్పటికీ 3 కోట్ల మంది ప్రజానీకం బీమా సౌకర్యాన్ని పొందలేక పోతున్నారని చెప్పారు. ఆ దేశంలో నివసిస్తున్న భారత సంతతి వారిలో సైతం శతకోటీశ్వరులున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోన్న మార్కెట్‌ శక్తుల్ని క్రమక్రమంగా నియంత్రించాలని సూచించారు. తద్వారా సంపదలో అందరికీ వాటా దక్కేలా చూడాలని కోరారు. అంతర్జాతీయ సదస్సులో ఈ విషయాలన్నింటిపైనా సమగ్రంగా చర్చించాలని జైపాల్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ... పెట్టుబడిదారులు మార్కెట్‌ శక్తుల రూపంలో దేశంలోని అటవీ సంపద, నదులు, ఖనిజాలు, నూనెలు (ఆయిల్‌) తదితర సహజ సంపదలను కొల్లగొడుతున్నాయని చెప్పారు. ప్రచార, ప్రసార మాధ్యమాలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాలను కూడా కబళిస్తూ ఒక పెద్ద మాఫియా రాజ్యాన్ని నిర్మిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు దేశ రాజకీయాలను, పార్టీలను సైతం శాసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా రాజకీయ అజెండాను సైతం ఖరారు చేసే స్థాయికి ఆయా శక్తులు ఎదుగుతున్నాయని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. మైనింగ్‌ మాఫియాతో పాటు ఇతర మాఫియాలు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు, జాతులను ఐక్యం చేసి బలమైన ఉద్యమాలను నిర్మించాలని సూచించారు. తద్వారా పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయ సాధన అనే లక్ష్యాల్ని సాధించాలని సూచించారు. సదస్సు ప్రారంభంలో ప్రజా గాయకుడు గద్దర్‌, అరుణోదయ సమాఖ్య విమలక్క బృందం ఆలపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విశ్రాంత ఐఎఎస్‌ అధికారి కాకి మాధవరావు, హెచ్‌ఎమ్‌టివి ప్రధాన సంపాదకులు కె.రామచంద్రమూర్తి, ఆహ్వాన సంఘం ఛైర్మన్‌ చుక్కా రామయ్య, సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, బూర్గుల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎమ్‌.గేయానంద్‌, ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు తెలకపల్లి రవి, పూర్వ సంపాదకులు ఎస్‌.వినయకుమార్‌, విశాలాంధ్ర ఎడిటర్‌ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈనెల 10 వరకు జరిగే ఈ సదస్సుకు 30 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఆర్థిక వేత్తలు, విద్యా వేత్తలు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాల ప్రతినిధులు, మానవ హక్కుల సంఘాల నేతలు హాజరవుతు న్నారు. 
              ఈ సదస్సులో '21వ శతాబ్దంలో సామ్య వాదంపై దృక్కోణం' అనే అంశంపై కాటు ఆర్కోనాడా (బొలీవియా), అమియా బగచీ (ఇండియా) ప్రసంగించారు. 'భూమి, కూలీలు, సహకార వ్యవస్థ' అనే అంశంపై అడాల్‌బెర్టో మార్టిన్స్‌ (బ్రెజిల్‌), గాస్‌పర్‌ మోర్కెన్చో (మెక్సికో), వినీత్‌ తివారీ (ఇండియా), సందీప్‌ చంద్రా (ఇండియా) ప్రసంగిం చారు. 'నూతన సమాజ నిర్మాణంలో కొత్త దృక్కో ణాలు' అనే అంశంపై యాన్నిస్‌ ఆలమ్‌పనిస్‌ (గ్రీస్‌), మిచెల్‌ లెబోవిజ్‌ (కెనడా), కెఆర్‌ వేణుగోపాల్‌ (ఇండియా), పి.టాన్యా (ఇండియా), డి.నర్సింహారెడ్డి (ఇండియా) ప్రసంగించగా, 'తెలంగాణలో వామపక్ష చరిత్ర నిర్మాణం' అంశంపై మల్లేపల్లి లక్ష్మయ్య, రమా మెల్కొటే, జి.కృష్ణారెడ్డి, డివి కృష్ణ, శాంతా సిన్హా మాట్లాడారు. '21వ శతాబ్దంలో వ్యవసాయిక విప్లవం' అనే అంశంపై అడాల్‌బెర్టో మార్టిన్స్‌ (బ్రెజిల్‌), గాస్‌పర్‌ మొర్కెన్చో (మెక్సికో), శామ్‌మోయో (జింబాబ్వే), గద్దర్‌ (ఇండియా), సంతోష్‌ రత్నా (ఇండియా) ప్రసంగించారు.