30, మార్చి 2015, సోమవారం

నటశేఖరుడి విజయప్రస్థానం


                                            ఘట్టమనేని శివరామ‘కృష్ణ’కు ప్రస్తుతం 70 వసంతాలు పూర్తయ్యాయి. సాధారణ స్థాయి నటుడిగా జీవితాన్ని ప్రారంభించి టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గా ఆయన ఎదిగిన వైనం అబ్బరపరుస్తుంది. విజయాలు వరించినా సినీ కళామతల్లికి వినమ్రంగా ఉండే ఆయన తీరు అత్యద్భుతం. ఆయన నిర్మాతల హీరో.. ఆయన దర్శకుల హీరో.. ఆయన కోసం అభిమానులు ఏమైనా చేస్తారు.. ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటశేఖరుడాయన. సినిమా నిర్మాణంలో సరికొత్త ఆవిష్కరణలు చేసి రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ ‘సూపర్‌స్టార్‌’ అనిపించుకున్న ఘనత ఆయన ఒక్కడికే దక్కింది. సరికొత్త పాత్రలకు పర్యాయపదంగా నిలిచిన నటశేఖర కృష్ణ తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతూ నిర్మితమైన ‘తేనేమనసులు’ విడుదలై నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసు కుంది. 1965 మార్చి 31న ‘తేనె మనసులు’ చిత్రం విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో సంచలన విజయం సాధించింది. ‘తేనె మనసులు’... 50 ఏళ్ళ సుదీర్ఘ విజయ ప్రస్థానానికి నాంది పలికిన వైనాన్ని.. గుర్తు చేసుకుంటూ మీడియాతో ‘సూపర్‌స్టార్‌’ కృష్ణ పంచుకున్న అనుభూతుల సమాహారం ఆయన మాటల్లోనే..
                                                           తొమ్మిదేళ్ళలో 100 సినిమాలు...
             కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే వంద  సినిమాల్లో నటించాను. ఇదొక రికార్డుగా చెప్పుకోవచ్చు. కేవలం సినిమాలపై ఉన్న ప్యాషన్‌తోనే ఎండనక, వాననక ఇష్టపడి నటించాను. రోజుకు మూడు షిప్టుల్లో మూడు సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఎప్పుడైతే వంద సినిమాలు పూర్తయ్యాయో తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను. యాభై సంవత్సరాల సినీ కెరీర్‌లో 350కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాను. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, పద్మాలయ స్టూడియో అధిపతిగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా.. పలు బాధ్యతల్ని నిర్వహించినందుకు గర్వంగా ఉంది.  
                                                               ఆరు నెలలు ఖాళీగా ఉన్నా..
          ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ముళ్లపూడి వెంకటరమణ రాసిన కథతో  ‘తేనె మనసులు’ చిత్రంతో రంగ ప్రవేశం చేశాను. నేటితో ఈ చిత్రం విడుదలై, నాకెరీర్‌ ప్రారంభమై యాభైఏళ్లు పూర్తయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఎన్నో విజయాలు చూశాను. అపజయాలు చూశాను. విజయాలకు పొంగి పోలేదు, అపజయాలకు కుంగి పోలేదు. ‘తేనె మనసులు’ తర్వాత ఆరు నెలలు ఖాళీగా ఉన్నాను. ఆ తర్వాతే ఆదుర్తిగారు పిలిచి ‘కన్నె మనసులు’ సినిమాలో నటించమని అడిగారు. అలా ఆయనతో కలిసి రెండవసారి కలిసి పనిచేశాను.
                                                   ఆ సినిమాలు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి..
              ఆదుర్తి సుబ్బారావు ‘కన్నె మనసులు’ చిత్రంలో నటిస్తున్నప్పుడు ‘గూఢాచారి 116’లో అవకాశం వచ్చింది. తెలుగులో తొలి డిటెక్టివ్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా అది. ఆ చిత్రం కోసం అప్పట్లో ఫైట్స్‌, డ్యాన్సులు బాగా ప్రాక్టీస్‌ చేసేవాడిని. ఆ పనితనం, సినిమా ఫలితాలు నాకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.        ఈ నేపథ్యంలోనే యాక్షన్‌ కథలు చేస్తూనే ‘మరుపురాని కథ’, ‘అత్తగారు కొత్తకోడలు’, ‘ఉండమ్మా బొట్టు పెడతా’ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించాను. అవి నా స్థాయిని పెంచాయి.. కెరీర్‌ ఆరంభంలోనే టాలీవుడ్‌ అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి నటించే అవకాశం కల్గింది. వారితో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ‘స్త్రీజన్మ’, ‘నిలువుదోపిడి’, ‘విచిత్ర కుటుంబం’ వంటి చిత్రాలకు వారితో పనిచేశాను. నటుడిగా నా స్థాయిని పెంచిన చిత్రాలవి. అప్పట్లో కొన్ని నా యాక్షన్‌ సినిమాలు తమిళ, హిందీ భాషల్లో కూడా అనువాదమయ్యాయి. 
                                             కౌబాయ్‌ చిత్రాల ట్రెండ్‌ అప్పటి నుంచే ప్రారంభం..
    పద్మాలయ స్టూడియో స్థాపించి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాను. అప్పట్లో భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించాను. ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు, ‘అల్లూరి సీతారామరాజు’, ‘అగ్ని పరీక్ష’ వంటి చిత్రాలు ఈ బ్యానర్‌లోనే వచ్చాయి. విజయ నిర్మలతో కలిసి ‘విజయకృష్ణా మూవీస్‌’ స్థాపించి ‘మీనా’, ‘దేవదాసు’ వంటి విజయవంతమైన చిత్రాలు చేశాను. 1970 దశకంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’తో కౌబాయ్‌ సినిమాలను తెలుగులోకి తీసుకువచ్చాను. ఈ చిత్రం ఇంగ్లీష్‌, తమిళ్‌, హిందీ భాషలో అనువాదమైంది. అప్పటి నుంచి కౌబాయ్‌ సినిమాల ట్రెండ్‌ మొదలైందని అందరూ అంటుంటారు.
                                                    నన్ను బాగా ప్రభావితం చేసిన చిత్రమిది...
           ‘అల్లూరి సీతారామరాజు’ నా కెరీర్‌లో ఉత్తమ చిత్రం. 1974 మే 1న ఈ సినిమా విడుదలైంది. స్వాతంత్ర సమరయోధుడు సీతారామరాజు జీవితంపై రూపొందిం చడంతో ఆ సినిమాకు ఎనలేని ప్రశంసలు లభించాయి. అయితే నాకిది 100వ సినిమా కావడం విశేషం. పైగా నా కెరీర్‌లో చేసిన అన్ని చిత్రాలకంటే నన్నెంతో ప్రభా వితం చేసిన చిత్రం ఇదే. అలాగే నా స్వీయ దర్శకత్వంలో ‘సింహాసనం’ తొలి సినిమా. ఇందులో ద్విపాత్రాభినయం చేశాను. తెలుగు, హిందీలో రూపొందించాను. తెలుగులో తొలి 70ఎంఎం సినిమా, స్టీరియోస్కోపిక్‌ సౌండ్‌ చిత్రమిది.
                                                         వాళ్ళిద్దరికీ నేను వీరాభిమానిని
      ఎన్టీర్‌, ఏఎన్నార్‌లు నాకు నచ్చిన హీరోలు. వారితో కలిసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాను. శోభన్‌బాబు, కృష్ణంరాజు మంచి స్నేహితులు. వీరిద్దరికీ నేను అభిమానిని. కృష్ణంరాజు విలన్‌గా, నేను హీరోగా 50కిపైగా సినిమాలు చేశాం. వాళ్ళందరితో పనిచేయడం నా అదృష్టం. ఇకపోతే, నా వారసుడిగా మహేష్‌బాబు వంద శాతం నాపేరు నిలబెట్టాడు. అతను ఇప్పుడీ స్థాయిలో ఉండటం నాకెంతో గర్వకారణంగా ఉంది. నేటి తరం హీరోల్లో నా అభిమాన నటుడు మహేష్‌. ఆ తర్వాత ప్రభాస్‌ నటనంటే కూడా బాగా ఇష్టం. మహేష్‌ను జేమ్స్‌బాండ్‌గా చూడాలనుకుంటున్నా.
                                                               నిర్మాణ వ్యయం తగ్గాలి
                      ప్రస్తుతం తెలుగు సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. అందువల్ల సినిమాలు విజయం సాధించినా నిర్మాత నష్టపోతున్నారు. ఇటీవల మహేష్‌బాబు నటించిన ‘వన్‌’, ‘ఆగడు’ వంటి సినిమాలకు 70కోట్లకు పైగా ఖర్చు చేశారు. అంత ఖర్చు అనవసరం. సినిమాకు నలభై, యాభైకోట్ల మించకుండా చూసుకోవాలి. ఈ పరిధిలో నిర్మాణం జరిగితే నిర్మాతకు పెద్దగా నష్టాలుండవు, మహేష్‌కు కూడా ఆ విషయమే చెప్పాను. ప్రస్తుతం మహేష్‌ పారితోషికం కూడా తగ్గించుకున్నాడు. అలాగే నిర్మాణ పరంగా చాలా కాలం నుంచి పద్మాలయలో సినిమాలు నిర్మించలేదు. మారుతి డైరెక్ట్‌ చేసిన ‘ప్రేమకథా చిత్రమ్‌’ సినిమాని హిందీలో అక్కడ హీరోలతో మారుతితోనే రీమేక్‌ చేయాలనుకుంటున్నా. అలాగే ఇకపై నా నటన గురించి చెప్పాలంటే..పెద్ద బ్యానర్‌ సినిమాలైతే కొనసాగుతాను.  లేదంటే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పిల్లలంతా స్థిరపడ్డారు కదా!.
........................................................................................నవతెలంగాణా సౌజన్యంతో.

23, మార్చి 2015, సోమవారం

మా భూమి సినిమాకు 35 ఏళ్లు


          సూర్యుడు నడినెత్తిమీదికొచ్చాడు. మగాళ్లు ఎడ్లకు నాగళ్లు కట్టి దున్నుతున్నారు. ఆడాళ్లు నాట్లు వేస్తున్నారు. పెత్తందారు చూస్తున్నాడు. ఇంతలో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. గుడ్డ ఉయ్యాలలో పడుకోబెట్టిన బిడ్డ గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. తల్లడిల్లిన కన్నతల్లి పని ఆపి పరుగున వచ్చింది. ‘అయ్యా! బిడ్డ ఆకలికి ఏడుస్తున్నడు. జరంత పాలిచ్చి వస్తా’ చేతులు కట్టుకుని దీనంగా అడిగింది. ‘నోర్మూయవే దొంగముండా! పని ఎగ్గొట్టడానికి ఇదోటా..ఏదీ నీకు పాలొస్తున్నాయా.. చూపించు’ అన్నాడు దుర్మార్గుడు. అక్కడున్న వాళ్లంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఆ తల్లి తన బిడ్డ కోసం అభిమానాన్ని చంపుకుంది..సిగ్గును వదిలేసింది. తన స్తన్యాన్ని పిండి పాలు చూపించింది. ఆ దొర మనిషి తుపుక్కున ఉమ్మాడు. ‘సరే పో, ఆ ఉమ్మి ఆరేలోపు రావాలా’ అన్నాడు.
               ఈ ఒక్క సన్నివేశం చాలు.. తెలంగాణలో దొరల దాష్టీకం ఎంత దారుణంగా ఉండేదో తెలుసుకోవడానికి. వెట్టిచాకిరీ ఎంత దయనీయమో అర్ధం కావడానికి. ఈ ఒక్క ఉదంతం చాలు ఆవేశంతో నరాలు ఉప్పొంగడానికి, పిడికిళ్లు బిగించడానికి. ఈ చరిత్రను ప్రపంచానికి తెలియచేసింది ‘మా భూమి’ చిత్రం. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 35 ఏళ్లయింది. తెలంగాణలో వెట్టిబతుకులు, దొరల దుర్మార్గం, నిజాం పైశాచికత్వం గురించి ఆ కాలంలో జీవించినవారికి తెలిసినా, తర్వాతి తరానికి తెలియచేసింది మా భూమి చిత్రమే. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో వస్తవ్‌ కొడకో నైజాము సర్కరోడా’ అంటూ బండి యాదగిరి రాసిన పాటను నేటి తెలంగాణ బిడ్డలు పాడుకునేలా చేసిందీ మా భూమి సినిమా. వెట్టిచాకిరీ చేసే ఓ జీతగాని పిల్లగాడు కూడా జీతగాడిగానే బతకాల అంటూ ప్రధాన పాత్ర రామయ్యకు తండ్రి చెప్పే మాటలు నాటి వెట్టి బతుకుల దౌర్భాగ్యాన్ని తెలియచేస్తాయి.
             దొరలు, నిజాం నియమించిన తహశీల్దార్లు ప్రజల రక్తాన్ని పన్నుల పేరుతో పీల్చేసేవారు. అప్పులున్నట్లు దొంగ కాగితాలు రాయించి భూములు లాక్కునే దొరలు.. వడ్డీ కింద వెట్టిచాకిరీ చేయించుకునేవారు. తరతరాలుగా వారి కుటుంబాల్లోనివారు జీతగాళ్లుగా మగ్గిపోయేవారు. ఇవన్నీ చాలక దొర విందు విలాసాలకు కూడా బలిపశువులయ్యేవారు. నచ్చిన ఏ ఆడది అయినా పిలిస్తే దొర గడీకి పోవాల్సిందే. అలాంటి ఓ ఘటన ఈ సినిమాలో ఉంది. వారి బాధ, ఆవేదన మన హృదయాలను జ్వలింపచేస్తాయి.
          ఓ జీతగాడి కొడుకుగా రామయ్య తన బాల్యాన్ని దొర పశువుల కొట్టంలో గడుపుతాడు. వయసు పెరిగాక అతని ప్రియురాలిని దొర గడీకి రప్పించుకుని బలాత్కరిస్తాడు. అక్కడే ఉంటే తన జీవితం కూడా దొర కాళ్ల కాడే ఉంటుందని.. ఊరే వదిలి పోతాడు రామయ్య. సూర్యాపేట, ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకుంటాడు. ఓ ఫ్యాక్టరీలో పనికి చేరటం.. అక్కడ యూనియన్‌లో చేరటం..దోపిడీ అంటే ఏంటో తెలుసుకోవడం..చదువు కూడా నేర్చుకోవడంతో పాటు.. సమాజాన్ని కూడా అర్ధం చేసుకునే స్ధితికి చేరతాడు. తన కర్తవ్యమేంటో తెలుసుకుంటాడు. ఊరికి తిరిగెళ్లి అదే దొరను తరిమి తరిమి కొడతాడు. ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు పోయినా..లెక్కచేయరు. ఒక్కో వీరుడు నేలకొరుగుతుంటే..రక్తం మరిగి మరింత తెగించి దొరలపై దాడులు చేస్తారు.  మహిళలు సైతం తుపాకులు పడతారు. సినిమాలో దర్శకుడు తెలంగాణ  పోరును.. అది పుట్టిన తీరును చూపించాడు. కూలి బతుకులు, రైతు బాధలతో పాటు ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలను తెలియచేశాడు. బలమైన దొరను ఎదుర్కోవడానికి కుల,మతాల  అంతరాలను జనం పక్కన పెట్టారని, అన్ని సామాజిక వర్గాలవారు ఏకమై నిజాంను ఎదిరించిన తీరును కళ్లకు కట్టాడు. ప్రేక్షకులకు మాత్రం ఒకటి అర్ధమైంది. తెలంగాణలో వెట్టిచాకిరీ పేరుతో ప్రజలను దొరలు, నిజాం కలిసి దోచుకున్నారని.. పశువుల కంటే హీనంగా చూశారని.. అందుకే వారంతా తిరగబడి తుపాకీ పట్టారని. దొరను తరిమికొట్టారని. అదే మా భూమి చిత్రం సాధించిన అపూర్వ విజయం.

22, మార్చి 2015, ఆదివారం

జనరంజక కవిత్వం అవసరం


                                                సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి
         నేటి సమాజంలో కవిత్వాన్ని జనరంజకంగా మార్చేందుకు కవులు, రచయితలు మరింత కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్‌ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. ఏప్రిల్‌లో విశాఖపట్నంలో జరిగే సిపిఎం అఖిల భారత 21వ మహాసభల సందర్భంగా సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో నిర్వహించిన ‘జనకవనం’లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాక్‌ యుద్ధం తరువాత ప్రజా కవిత్వం బలోపేతమైందన్నారు. నేడు దేశంలో హక్కుల్ని ఊడ్చేసే స్వచ్ఛభారత్‌ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఆయా పార్టీల కార్యాలయల్లో జరిగిన మన్మథనామ ఉగాది పంచాంగ శ్రవణం చూస్తే ఆ పార్టీలకు అనుకూలంగా సిద్ధాంతులు వ్యవహించారని స్పష్టమవుతోందన్నారు. ఎవరు ఎలా చెప్పినా ఈ సంవత్సరానికి నాయకుడు శని అని మాత్రం  అందరూ స్పష్టంగా చెప్పారన్నారు. పాలకులు చంద్రులైనా, ఇంద్రులైనా ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేయటంలో ఒకే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శాసనసభల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధికి సంబంధించి చర్చించడం, ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించటం, ప్రభుత్వ విధానాలను వివరించటం అనేవి జరగటం లేదన్నారు. ఇలాంటి సందర్భాల్లో కవుల బాధ్యత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆధునిక ప్రపంచంలో కవిత్వానికి ప్రాధాన్యత ఉందా అని కూడా చర్చించాల్సిన అవసరం ఏర్పడిరదన్నారు. పెరుమాళ్లు కవిత్వమైనా, పికె సినిమా అయినా సాహసంతో కూడుకున్నవేనన్నారు. కవిత్వం, కవితా రీతులు ప్రజలు తమవిగా భావించే విధంగా ఉండాలని సూచించారు. అనంతరం ‘సింగపూర్‌ అనేది సిటీ స్టేట్‌ అని, అది మన ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వర్తిస్తుందని, ఢల్లీి దిక్సూచి న్యూయార్కని’ పేర్కొంటూ కవితను చదివి వినించారు. ప్రజాసాహితి సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ ‘పొయెట్స్‌ ఎగనెస్ట్‌ ఫండమెంటల్స్‌’ అనే సంస్థను ప్రారంభించాలని సూచించారు. పాత్రికేయులు వడ్లమూడి పద్మ మాట్లాడుతూ కవి నిబద్ధతతో అవిశ్రాంతంగా పనిచేయాలన్నారు. ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రగతిశీల, అభ్యుదయ భావాలు కలిగిన కవులు వాటిని బయటకు తీసుకెళ్లాలనే ఆలోచన చేయాలన్నారు. దాని కోసం మళ్లీ ఉద్యమానికి నాంది కావాలని చెప్పారు. ఈ సందర్భంగా 22 మంది కవులు పాల్గొని పలు అంశాలపై కవితలు చదివారు. నూతన రాజధాని, పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు, మాతృభాష, యువత పెడదోవపట్టం వంటి అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రముఖ కవి బండ్ల మాధవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలను నిర్వహించిన అనంతవరం గ్రామ చిత్రాన్ని అద్దంపట్టేలా సుదీర్ఘమైన కవితను వినిపించారు. ప్రముఖ కవయిత్రి మందరపు హైమవతి మాట్లాడుతూ నేటి యువత చెడుపోకడలను వివరించారు. అరసం నగర కార్యదర్శి కొండపల్లి మాధవరావు పడిపోతున్న విలువలకు సంబంధించిన పద్యం ఆలపించారు.  సభకు సాహితీ స్రవంతి నగర అధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, జిల్లా అధ్యక్షులు కె.సత్యరంజన్‌ వందన సమర్పణ చేశారు.