31, అక్టోబర్ 2010, ఆదివారం

ఆబిడ్డలు ఆనాథలయ్యారు

సూక్ష్మరుణాల సమిధలు
రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న సూక్ష్మ రుణాల దారుణాలు ఎన్నో తెర పైకి వస్తున్నాయి. తెర వెనుక ఆ దారుణాల వల్ల బలైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం సూక్ష్మరుణ వ్యవస్థను పాలకులు ప్రోత్సహించారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. సూక్ష్మరుణాల బారిన పడి ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుని.. తమ పచ్చటి సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్న అభాగ్యులను ఆదుకునే సాహసం ప్రభుత్వం చేయకపోవడం విచారకరమే.
'' పెట్టుబడి దారి విధానానికి లాభం అనేది ప్రేరణాశక్తినిస్తుంది. 20 శాతం లాభం వస్తే ఎక్కిడికైనా వెళ్తుంది. 50 శాతం లాభం వస్తే పరుగులు తీస్తుంది. 100 శాతం లాభం వస్తే ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది. 300 శాతం లాభం ఉంటే ఉరి శిక్షపడినా ముందుకు పోతుంది'' అని మార్క్స్‌ ఎప్పుడో చెప్పాడు.
పాలకులు ఇప్పటికైనా కళ్ళుతెరువకపోతే మానవతా విలువలకు పాలకులు సమాధి కట్టినట్లవుతుంది. సూక్ష్మరుణాల వలలో చిక్కి చేజేతులా తమ ప్రాణాలను కోల్పోయిన రెండు కుటుంబాల వ్యథ ఇది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడ్‌ గ్రామంలో రెండు కుటుంబాలు ఈ దారుణాలకు బలయ్యాయి. ఫలితంగా ఈ రెండు కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అనాథలయ్యారు. పసిప్రాయంలో అనుభవించనంత నరకాన్ని చిన్న వయస్సులో వారు చవిచూస్తున్నారు. హృదయ విదారకమైన ఈ ఇరు కుటుంబాల గోస వర్ణనాతీతం.
ఏం జరిగిందంటే.. ?
మహబూబ్‌నగర్‌ జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడ్‌ గ్రామంలో మహిళా పొదుపు సంఘాలు చాలా చైతన్యంతో ముందడుగు వేస్తున్న తరుణంలో ' స్పందన, స్పూర్తి ' సూక్ష్మ రుణాల పేరిట ఆ గ్రామంలోని ప్రవేశించాయి. మహిళలకు రుణాలు ఇస్తామని అనతికాలంలోనే వాటిని చెల్లించారు. బ్యాంకుకు వెళ్లకుండా డబ్బు ఇంటికే వస్తుంటే వారు సంబరపడ్డారు. గ్రామానికి చెందిన జహంగీర్‌భీ (30) ఏడువేల రూపాయలను రుణంగా పొందింది. ఆ మొత్తాన్ని తన స్నేహితురాలు అదే గ్రామానికి చెందిన కోటవెంకి సత్యమ్మ (33)కు ఇచ్చింది. వారానికి 230 రూపాయలు స్పందన స్పూర్తికి చెల్లించాల్సి ఉండగా అది సాధ్యపడలేదు. సత్యమ్మ తీసుకున్న డబ్బులను అదే గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి శ్రీహరిగౌడ్‌కు అప్పుగా ఇచ్చింది. అతను ముఖం చాటేయడంతో డబ్బులు కట్టాల్సిన బాధ్యత సత్యమ్మ పై పడింది. కాయకష్టం చేసుకుంటే తప్పా పొట్ట గడవని సత్యమ్మ కుటుంబంలో అప్పుల గోల మొదలైంది. జహంగీర్‌భీ నుండి ఒత్తిడి పెరిగింది. వీరి ఇరువురి పై స్పందన స్పూర్తి సంస్థ వారు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ వ్యవహారంలో సత్యమ్మకు, జహంగీర్‌బీకి మధ్య మనస్పర్థలు వచ్చి డబ్బుల కోసం తగాదా పడడంతో గొడవ ప్రారంభమైంది. డబ్బులు కట్టలేని దీనస్థితిలో జహంగీర్‌భీ గత ఫిబ్రవరి 23న తీవ్ర అవమానానికి గురై ఇంట్లో కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం హైద్రాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా మరునాడు మరణించింది. జహంగీర్‌భీ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సత్యమ్మ ఇంటి ముందు వేసి రుణం చెల్లించనందుకే చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మృతికి కారణమైన సత్యమ్మను గ్రామస్తులు నిలదీశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేని సత్యమ్మ భర్త కోటవెంకి అనంతయ్య (38).. భార్యను చితకబాది వ్యవసాయ పొలంలో ఉరివేసి చంపాడు. అనంతరం అనంతయ్య కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో ఒకే రోజు వ్యవధిలో తీవ్ర విషాదం ఆలుముకుంది.
సూక్ష్మరుణాల సమిధలు వీరు...
పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయనే నానుడి వీరి పట్ల నిజమైంది. సూక్ష్మరుణాలను చేపట్టి వాటిని కట్టలేని ధీనస్థితిలో కుటుంబ కలహాలకు దారితీసి చనిపోయిన జహంగీర్‌భీ, అనంతయ్య, సత్యమ్మ రెండు కుటుంబాల్లో వారి పిల్లలు తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలిపోయారు. సూక్ష్మరుణాల దారుణాలకు సమిథలుగా వారు సజీవసాక్ష్యాలుగా నిలిచారు. నిరుపేద కుటుంబమైన జహంగీర్‌భీకి ముగ్గురు కుమార్తెలు మహమూదాబేగం (10), షబానాబేగం (8), నాజియాబేగం (6) అనాథలుగా మారారు. భార్యభర్తలు కూలీ నాలి చేసుకుంటేనే పొట్టగడిచే ఈ కుటుంబంలో ఉన్న ఆధారం తల్లి కోల్పోయాక తండ్రి మైమూద్‌ ఒంటరి వాడయ్యాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు బాలికలు నానమ్మ మాలన్‌భీ వద్ద తలదాచుకున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని మాలన్‌భీ (70) వృద్ధాప్యంలో పిల్లల బాగోగులను చూసుకుంటుంది. అదే విధంగా మృతులు అనంతయ్య, సత్యమ్మ లకు శివకుమార్‌ (14), సుస్మిత (6) చిన్నారులు ఉన్నారు. పెద్దమ్మ, పెదనాన్న పద్మమ్మ, కృష్ణయ్యల వద్ద వీరు జీవనం సాగిస్తున్నారు. కష్టం చేస్తే తప్పా పూట గడవని కృష్ణయ్య కుటుంబానికి ఈ అనాథలు అధికభారమయ్యారు. అయినా వీరిని తల్లిదండ్రులలాగే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. జహంగీర్‌భీని కోల్పోయిన ఆమె తల్లి మహబూబ్‌భీ నేటికి దుఖసాగరంలోనే మునిగిపోయింది.
పాపం జైలుకు వెళ్ళారు
సూక్ష్మరుణాల పుణ్యమా అని మరో ఇద్దరు మహిళలు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. మరణించిన జహంగీర్‌భీ మరణవాంగ్మూలంలో తన పై డబ్బుల కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చిన తోటి సభ్యులు గ్రామానికి చెందిన నీలమ్మ, పండగ సత్యమ్మ పేర్లను వెల్లడించడంతో పోలీసులు వీరి పై కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఇరువురు మహిళలు తమకు తెలియకుండానే సూక్ష్మరుణాల దారుణాలకు జైలుకు వెళ్ళాల్సిన ఆగత్యం ఏర్పడింది. అదే విధంగా గ్రామంలో మరో బాధితురాలు ఖాజాభీ పేరు పై 10 వేల రూపాయలు ఆమెకు తెలియకుండా రుణం ఇతరులు పొందడంతో ఖాజాభీ తల్లి జహంగీర్‌భీ ఆత్మహత్యయత్నానికి పాల్పడగా ఆమెను గ్రామస్తులు రక్షించారు. ఇలా ఎన్నో దారుణాలు కంటికి కనిపించకుండా ఆ గ్రామాన్ని కబళిస్తున్నాయి.

29, అక్టోబర్ 2010, శుక్రవారం

చూడచక్కని విగ్రహం

ఈ విగ్రహం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిళం లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఎంట్రన్స్‌లో ఉంది. అక్టోబరు 28న మా కార్యాలయ సిబ్బంది సమావేశం అక్కడ జరిగింది. నాకు ఫొటోలు తీయడం హాబీ కాబట్టి కంటికి నచ్చిన ఈ విగ్రహం నాతో ఉన్న చిన్నకెమెరాకు బాగా వస్తుందో లేదో అనుకున్నా. పరవా లేదు కదా. ఇక్కడ ఈ దేవాలయంతో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సి నుంచి వచ్చే చిన్నపాటి కోన కూడా ఉంది. చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. ఏదెమయినా ఇక్కడ సమావేశం పెట్టటం వల్ల ఈ ప్రదేశాన్ని చూడగలిగాను. అవును ఈ విగ్రహాన్ని చూస్తే భాగవతంలోని దశావతార కథ గుర్తుకు వస్తుంది. ఈ విగ్రహాన్నిశిల్పి కళ్లకు కట్టినట్లుగా తయారు చేశాడు. ఆయనకు నాజోహార్లు.
ఈ కథగురించి కొంత ..........
హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై పగదీర్చుకునే ధ్యేయంతో హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేస్తాడు. చతుర్ముకుడు ప్రసన్నుడై వరాలు కోరుకోమన్నాడు. నరుల చేత , దేవత చేత, జంతువుల చేత ఆయుధాల చేత పగలు గాని , రాత్రి గాని భూమి మీదగాని, ఆకాశంలో గాని నీటిలో గాని తనకు చావులేకుండా వరాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. తదాస్తు అన్నాడు పరమపిత. వరబల గర్వంతో దురహంకారియై అకృత్యాలు ప్రారంభించాడు హిరణ్య కశిపుడు. ఇతని పుత్రుడు ప్రహ్లాదుడు బాల్యంనుండే హరిభక్తితె నిరంతరం హరినామ చింతనతో కాలం గడిపేవాడు ప్రహ్లాదుని చేత హరినామ స్మరణం మాన్పించాలని ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తాడు. అనేక విధాలుగా హింసించి విఫలుడైన హిరణ్యకశిపుడు తనకు హరిని చూపమని కొడుకును బాధిస్తాడు. ప్రహ్లాదుడు...

ఇందుగల డందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదికి చూచిన
నందందు గలడు దానవాగ్రణి! వింటే.

అంటూ సమాధానమిస్తాడు. శ్రీహరి లేని చోటు లేదన్నాడు ప్రహ్లాదుడు. అయితే స్థంభములో హరిని చూప మంటూ భవన స్థంభాన్ని క్రోదంతో పగులగొట్టాడు హిరణ్య కశిపుడు. అందులోనుంచి శ్రీహరి నృసింహ రూపంలో ప్రత్యక్షపై హిరణ్యకశిపుని ఉదయ సంధ్యల కాలంలో కాకుండా అసుర సంధ్యాకాలంలో, నేలమీదా ఆకాశంలో కాకుండా తన తొడలపైన , ఆయుధం కానటువంటి తన చేతి వేళ్ల గోళ్లతో చీల్చి సంహరించాడట. ఇది భాగవతంలోని నాలుగో అవతార కథలోని సారాంశం.

సన్నాయి నొక్కులే గానీ.. సంగీతం లేదన్నట్లు

రోడ్డు ప్రమాదాలకు చెక్‌ ?
ఐజి స్థాయి అధికారి చేతికి పగ్గాలు- వాహనాదారులకు డిఎస్పీ క్లాసులు
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎట్టకేలకు పోలీసు యంత్రాంగం నడుం బిగించిందట. ఇది ఎన్ని సార్లు బిగించినా ప్రమాదాలు ఎక్కడా నివారించిన దాఖలాలు లేవు.. ఈ వ్యవహారం ఎలా ఉందంటే '' సన్నాయి నొక్కులే గాని సంగీతం లేదన్నట్లు.''  కొత్తతరహాలో రోడ్డు ప్రమాదాలను అరికట్లాలనుకున్నామని పోలీసు శాఖ ప్రకటనలు చేస్తూనే ఉంది. కాని నివారించింది మాత్రం నామమాత్రమే. దేశంలో మనరాష్ట్రం రోడ్డు ప్రమాదాల్లో అగ్రగామిలో ఉంది. కేంద్రం మందలించిందనో..కోర్టు మొట్టికాయలు వేసిందనో ఇలాంటి కదలికలు పోలీసు శాఖలో రావడం మామూలే. మనుషుల్లో మనకు తరుచూ ఆరంభశూరులు కనిపిస్తూ ఉంటారు. అలాగే పోలీసులు శాఖ కూడా...తారసిల్లే మనుషుల తత్వాలను విశ్లేషించడానికి తెలుగునాట సామెతలు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గుమస్తాలకు అప్పగించిన పనిలో రోజుకు రెండులైన్లో మూడు లైన్లో రాసి కాలయాపన చేస్తుంటారు. నోట్‌ఫైల్‌ పుటప్‌ చేసి పై అధికారికి పంపడంలో జాప్యం చేస్తుంటాడు. ఈ లోపు పని చేయాల్సిన అధికారి బదిలీ కావడమో. రిటైర్డ్‌ కావడమో.. ప్రమోషన్‌ మీద వెళ్లడమో జరుగుతుంది. ఫైల్‌ మాత్రంకదలదు. ఇలాంటి అలసత్వాన్ని దుయ్యబట్టేందుకు సున్నితంగా హెచ్చరించడానికి ఈ సామెత ఉపయోగ పడుతుందని మా తెలుగు మాష్టారు చిన్నప్పుడు చెప్పేవాడు. సంగీత కచ్చేరిలో పూర్తి సంగీత జ్ఞానం లేని వాడయినా లేదా తానెందుకు కచ్చేరికి సహకరించాలనుకునే వాడయినా సన్నాయి నొక్కులు అంటే శృతి చేస్తూ కూర్చుంటాడే తప్ప అస్సలు పూర్తి పాటను పాడే స్థాయికి రాడు. ఇలాంటి వారు ఏ కొద్దిపాటు పని చేసి కాలయాపన చేసే వాళ్లతో పోల్చడానికి ఈ సామెత ఉపయోగపడుతుంది. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటనే మన పోలీసుల శాఖ వ్యవహారం అలా ఉంది మరి...
రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్ర స్థానంలో నిలించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మొట్టికాయలు వేసింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇతర రాష్ట్రాలు అనేక చర్యలు తీసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడంలేదని మండిపడింది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాల్సిందిగా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా ఏ ఏ జిల్లాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో అధ్యయనం చేసేందుకు ఐజి స్థాయి అధికారి పర్యవేక్షణలో 'డిస్ట్రిక్ట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌' అనే కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఈ తరహా ప్రణాళికను అమలు చేయడంవల్ల నూటికి 80 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఆ కోణంలో ప్రయత్నాలు ప్రారంభిస్తే మన రాష్ట్రంలో కూడా ఫలితాలు సాధించుకోవచ్చని అధికారులు ఆలోచిస్తున్నారట. సీనియర్‌ ఐపిఎస్‌ అధికారుల్లో ఐజి స్థాయి అధికారిని ఎంపిక చేసి ఆయన పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని యోచిస్తున్నారట. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే రోడ్డు సేఫ్టీ అథార్టీ పనిచేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ తరహా ప్రయోగాన్ని చేస్తున్నారు. కేవలం డిస్ట్రిక్ట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినంత మాత్రాన రోడ్డు ప్రమాదాలు నివారించలేమని, గ్రామ స్థాయిలో కూడా వాహనాదారుల్లో చైతన్యం తీసుకురావాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు సాదించవచ్చనే ఉద్దేశంతో త్వరలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించనున్నాట. జిల్లాల్లో ఉన్న రోడ్లపై ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా ఓ డిఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించారు. ఈ డిఎస్పీ ప్రతి రోజూ ఓ నియోజక వర్గ కేంద్రాన్ని (గ్రామాలు) ఎంపిక చేసుకొని ఆయా గ్రామాల్లో రచ్చబండ వద్ద అవగాహనా సదస్సులు ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జాతీయ రహదారులతో పాటు ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు ఒకటి చొప్పున 'బ్రీత్‌ అనలైజర్‌' (మద్యం సేవించిన వ్యక్తిని పసిగట్టే మిషిన్‌)ను అందివ్వనున్నారు. ఆయా పోలీస్టేషన్లకు చెందిన సిబ్బంది ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఆర్‌అండ్‌బి రోడ్లు, జాతీయ రహదారుల్లో చెకింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాదారుల (డ్రైవర్ల)ను బ్రీత్‌ అనలైజర్‌ మిషిన్‌తో తనిఖీలు చేయనున్నారు. వాహనదారుడు మద్యం సేవించి ఉంటే వాహనాన్ని అక్కడే నిలిపి, చలానుతోపాటు అతనికి కౌన్సిలింగ్‌ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. నెల రోజుల్లో ఇలా నాలుగైదు సార్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే అతని డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేయడం, అవసరమైతే వారు నడిపే భారీ వాహనాలను సైతం సీజ్‌ చేసేందుకు చట్టం తీసుకువచ్చే విధంగా పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఒక పక్క పద్యం అమ్మకాలతో లాభాలు గడించేందుకు చర్యలు ... మరో పక్క తాగి వాహనం నడిపితే చర్యలు తీసుకుంటారట.
ఇదిలావుండగా జాతీయ రహదారుల్లో తిరిగే వాహనాల వేగాన్ని గుర్తించే 'రాడార్‌ వెకౌంటెడ్‌ వెహికిల్‌' మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వెహికిల్‌ 7, 9 వ నెంబర్‌ జాతీయ రహదారుల్లో అప్పుడప్పుడూ తిప్పుతున్నారు. దీంతో కొంత వరకు ఫలితాలు వస్తున్నప్పటికీ ఆశించిన మేర రోడ్డు ప్రమాదాలను నియంత్రించలేకపోతున్నారు. ఒక్క వెహికిల్‌తో వేగంగా వెళ్లే వాహనాలకు కళ్ళెం వేయడం కష్టంగా మారడంతో మరికొన్నిటిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి పోలీసు ఉన్నతాధికారులు లేఖ రాయనున్నారు. జాతీయ రహదారుల్లో స్లోమోషన్‌ వెహికల్స్‌ (ఎద్దుల బండ్లు, తోపుడు బండ్లు, రిక్షాలు)లను నిషేధించడంతో పాటు, మూడు చక్రాల వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణీకులను ఎక్కించకుండా, ప్రతి వాహనానికి హెడ్‌లైట్లు ఖచ్చితంగా పనిచేసే విధంగా, వీటిని స్థానిక పోలీసులు, ఆర్టీఏ అధికారులు పర్యవేక్షించే విధంగా కూడా చర్యలు తీసుకుంటారట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 37 వేల పోలీసు నియామకాల్లో చురుకైన కొంత మంది సిబ్బందిని ట్రాఫిక్‌ విభాగంలో నియమించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి తోడు ప్రత్యేకంగా హోంగార్డులను కూడా నియమించాలని అధికారుల ఆలోచన. ఆర్‌అండ్‌బి, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులు యోచిస్తున్నారు. భారీలోడుతో వెళుతున్న వాహనాలు వేగంగా వెళ్లకుండా రాడార్‌ వెకౌంటెడ్‌ వెహికిల్స్‌ ద్వారా కళ్ళెం వేయాలని, దీంతో కొంత మేరకు రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని అధికారుల యోచన. పోలీసు యంత్రాంగం రూపొందించిన ఈ ప్రతిపాదనను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏం చేస్తారో .... ఏమి నివారిస్తారో వేచి చూద్దాం...

మహబూబ్‌నగర్‌ జిల్లా సంక్షిప్త సమాచారం

హబూబ్‌నగర్‌ జిల్లా పాలమూరు పేరుతోనూ ప్రసిద్ధి. నిజాం నవాబ్‌ నీరుమహబూబ్‌అలీఖాన్‌ పేరిట మహబూబ్‌నగర్‌ జిల్లాగా ఆవిర్భవించింది. మొదట జిల్లా కేంద్రంగా నాగర్‌కర్నూల్‌ ఉండేది. తర్వాతి కాలంలో మహబూబ్‌నగర్‌ కేంద్రంగా పరిపాలన సాగుతోంది. ఉత్తరాన రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు, తూర్పున నల్గొండ, గుంటూరు జిల్లాలు, దక్షిణాన కృష్ణా, తుంగభద్ర నదులూ, పడమరన రాయచూరు, గుల్భర్గ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 18 వేల 432 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద జిల్లా. మైదాన ప్రాంతంతో పాటు కొండలూ, అడవులూ, నదులూ, వాగులూ, వంకలూ, ప్రసిద్ధి గాంచిన దర్శనీయ క్షేత్రాలూ జిల్లా అందాలను ఇనుమడింపజేస్తున్నాయి. నల్లమల అడవులు జిల్లాకు అదనపు ఆకర్షణ. కృష్ణా, తుంభద్ర నదులు ఈ జిల్లా నుండి ప్రవహిస్తున్నాయి. మక్తల్‌ నియోజకవర్గం తంగిడి గ్రామం వద్ద కృష్ణానది జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మక్తల్‌, గద్వాల, ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్‌, అలంపూర్‌, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలో ప్రవహిస్తోంది. దాదాపు 300 కిలో మీటర్ల మేర ఈ నది పారుతోంది. తుంగభద్ర నది గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల పరిధిలో ప్రవహిస్తోంది. కృష్ణానది ఉప నది అయిన డిండి కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో ప్రవహిస్తూ తిరిగి కృష్ణానదిలో కలుస్తోంది. పెద్దవాగు, చిన్నవాగులూ కృష్ణానదికి ఉప నదులుగా ఉన్నాయి. జిల్లాలో వరి, జొన్న, సజ్జ, రాగులు ప్రధాన ఆహార ధాన్యాలుగా ఉన్నాయి. వేరుశనగ, ఆముదం, మిరప, పొగాకు వాణిజ్య పంటలుగా ఉన్నాయి. అనేక ఖనిజ సంపదలు జిల్లాలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఖనిజ సంపదలో దేశంలో రెండో స్థానంలో ఉంది. అదే ప్రాధాన్యత క్రమంలో మహబూబ్‌నగర్‌లోనూ రాష్ట్రంలో ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నాయి. పారిశ్రామిక ఖనిజ సంపదకూ కొదవ లేదు. వజ్రాలు, బంగారం, ఆస్‌బెస్టాస్‌, బంకమట్టి, క్వాడ్జ్‌, పల్డ్స్‌పర్‌, లయన్‌స్టోన్స్‌ తదితరాలు లభిస్తాయి. పూర్తి స్థాయిలో ఈ ఖనిజ సంపదను వినియోగించుకునే శాస్త్ర విజ్ఞానం జిల్లా పరిధిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. జిల్లాలో 1,544 నివాస ప్రాంతాలు ఉండగా 1.475 నివాస ప్రాంతాలు విద్యుత్‌ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. ఏడో నంబర్‌ జాతీయ రహదారి ప్రధాన రవాణా మార్గం. నాగాపూర్‌, బెంగుళూరు వంటి ముఖ్య పట్టణాలను ఈ రహదారి కలుపుతోంది. హైదరాబాద్‌, గుంతకల్‌, హుగ్లీ, తిరుపతి లాంటి ముఖ్య పట్టణాలను కలిపే బ్రాడ్‌గేజ్‌ రైల్వే సౌకర్యం ఉంది. నారాయణపేట, కొత్తకోట, గద్వాల పట్టణాలు చేనేత వస్త్రాలకు పుట్టినిల్లుగా ప్రసిద్ధిగాంచాయి. జిల్లా ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతోంది. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, కొత్తూరు పట్టణాల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 126 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. 25 వేల మంది కార్మికులు పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. జడ్చర్ల మండలం పోలెపల్లి ప్రత్యేక ఆర్థిక మండలితో పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
జిల్లా సంఖ్యా వివరాలు
భౌగోళిక విస్తీర్ణం - 18,432 చ.కి.
రెవెన్యూ మండలాలు - 64
గ్రామాలు - 1,544
గ్రామ పంచాయతీలు - 1,346
జనాభా - 35,09,182
పురుషులు - 17,81,667
స్త్రీలు - 17,27,515
అక్షరాస్యులు - 13,57,063
పురుషులు - 8,75,077
స్త్రీలు - 4,81,986
సాధారణ సగట వర్షపాతం-942.60మి.మీ
సాగు భూమి - 22,53,142 ఎకరాలు
పశువులు - 7,36,996
గేదెలు - 3,69,849
గొర్రెలు - 33,67,635
మేకలు - 5,07,856
కోళ్లు - 42,63,569
భూమి కలిగిన వారు - 6,56,062
దళితులు - లక్షా 5,791
గిరిజనులు - 52 వేలా 63
అటవీ విస్తీర్ణం - 6,58,265 ఎకరాలు
ప్రధాన ఆస్పత్రులు - 1
తాలుకా ఆస్పత్రులు - 18
కుష్టువ్యాధి నివారణా కేంద్రాలు - 6
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - 84
ఆరోగ్య ఉప కేంద్రాలు - 539
క్షయ నివారణా కేంద్రాల - 7
వైద్యులు - 150
సంచార వైద్య వాహనాలు - 1
ఆయుర్వేద వైద్యశాలలు - 43
యునానీ వైద్యశాలలు - 20
హోమియోపతి వైద్యశాలలు - 9
వాణిజ్య బ్యాంకులు - 130
సహకార బ్యాంకులు - 19
గ్రామీణ బ్యాంకులు - 72
భారీ, మధ్య తరహా పరిశ్రమలు - 60
చిన్నతరహా పరిశ్రమలు - 3,308
పోలీస్‌ స్టేషన్లు - 75
ఆర్టీసీ డిపోలు - 8
సాగునీటి ప్రాజెక్టులు - 2
ఎత్తిపోతల ప్రాజెక్టులు - 4
మేజర్‌ చెరువులు - 674
మైనర్‌ చెరువులు - 5,376
చిన్నతరహా ఎత్తిపోతలు - 40
హైడల్‌ ప్రాజెక్టులు - 1
మండలాలు
1. కోడంగల్‌, 2. బొంరాస్‌పేట 3. కోస్గీ 4. దౌల్తాబాద్‌ 5. దామరగిద్ద 6. మద్దూరు 7. కోయిల్‌కండ 8. ధన్వాడ 9. నవాబ్‌పేట 10. బాలానగర్‌ 11. కొందుర్గు 12. ఫరుఖ్‌నగర్‌ 13. కొత్తూరు 14. కేశంపేట 15. తలకొండపల్లి 16. ఆమనగల్‌ 17. మాడ్గుల 18. వంగూరు 19. వెల్దండ 20. కల్వకుర్తి 21. మిడ్జిల్‌ 22. తిమ్మాజిపేట 23. జడ్చర్ల 24. భూత్పూర్‌ 25. మహబూబ్‌నగర్‌ 26. అడ్డాకుల 27. దేవరకద్ర 28. ధన్వాడ
29. నారాయణపేట 30. ఊట్కూర్‌ 31. మాగనూరు 32. మక్తల్‌ 33. నర్వ 34. చిన్నచింతకుంట 35. ఆత్మకూరు 36. కొత్తకోట 37. పెద్దమందడి 38. ఖిల్లఘనపూర్‌ 39. బిజినేపల్లి 40. నాగర్‌కర్నూల్‌ 41. తాడూరు 42. తెలకపల్లి 43. ఉప్పునుంతల 44. అచ్చంపేట 45. అమ్రాబాద్‌ 46. బల్మూరు 47. లింగాల 48. పెద్దకొత్తపల్లి 49. కోడేరు 50. గోపాల్‌పేట 51. వనపర్తి 52. పాన్‌గల్‌ 53. పెబ్బేరు 54. గద్వాల్‌
55. ధరూర్‌ 56. మల్దకల్‌ 57. గట్టు 58. అయిజ 59. వడ్డెపల్లి 60. ఇటిక్యాల 61. మానవపాడు 62. అలంపూర్‌ 63. వీపనగండ్ల 64. కొల్లాపూర్‌
అసెంబ్లీ నియోజకవర్గాలు
1. కొడంగల్‌ 2. షాద్‌నగర్‌ 3. కల్వకుర్తి 4. జడ్చర్ల 5. మహబూబ్‌నగర్‌ 6. దేవకరద్ర 7. నారాయణపేట 8. నాగర్‌కర్నూల్‌ 9. అచ్చంపేట
10. వనపర్తి 11. గద్వాల 12. అలంపూర్‌ 13. కొల్లాపూర్‌ 14. మక్తల్‌
రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు
1. మహబూబ్‌నగర్‌ 2. నారాయణపేట 3. గద్వాల 4. నాగర్‌కర్నూల్‌ 5. వనపర్తి
మున్సిపాల్టీలు
1. మహబూబ్‌నగర్‌ 2. వనపర్తి 3. గద్వాల 4. నారాయణపేట

28, అక్టోబర్ 2010, గురువారం

అపరమేథావి గ్రామం అథోగతి



మాడ్గుల పంచాయతీలో ఎక్కడి సమస్యలక్కడే
30 ఏళ్లుగా జైపాల్‌రెడ్డి కుటుంబీకులదే పాలన
''ఆయన అపరమేథావి... ఆయన పార్లమెంటులో ఆంగ్లంలో ప్రశ్నలడిగితే సభ్యులు నిఘంటువులు వెతకాలి. సమస్యలను, సవాళ్లను చాకచక్యంగా చర్చించగల సమర్థునిగా గుర్తింపు పొందారు. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు కీలకమైన పదవులే లభించాయి. ఆయన స్వగ్రామం మాత్రం సమ్యలకు నిలయమైంది. పరిష్కారానికి నోచుకోలేదు. అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్నచందంగా ఉంది. స్వగ్రామంపై ప్రేమలేకనా?.... నిధులు లేకనా? ఆసమస్యలను పరిష్కరించేందుకు సాధ్యంకాకనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయనెవరోకాదు.... కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి. ఆయన సొంత గ్రామం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా మాడ్గుల. ఆ గ్రామాన్ని 30 ఏళ్ల పాటు ఆయన కుటుంబీకులే పాలించారు. ఇప్పటికీ గ్రామంలో అనేక సమస్యలు తిష్టవేశాయి''.
ప్రధానంగా గ్రామంలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు అనేక రోగాల బారిన పడ్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పాడుబడిన ఇండ్లు, గుంతలమయమైన రోడ్లే కనిపిస్తాయి. గ్రామపంచాయతీలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు 30ఏళ్ల పాటు జైపాల్‌రెడ్డి కుటుంబం పాలించినప్పటికీ గ్రామం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. తమ గ్రామం నుండి కేంద్ర స్థాయిలో పలుకుబడి ఉన్న వ్యక్తి తమ గ్రామస్తుడైనా తమకెలాంటి ప్రయోజనం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికీ తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలు ఏర్పడినప్పుడు తొలి సర్పంచిగా సూదిని రామలింగారెడ్డి ఎన్నికయ్యారు. 1967వరకు ఆయన కొనసాగారు. ఆ తర్వాత సంవత్సరంపాటు వెంకటయ్య, మరోసంవత్సరం పాటు సూదిని నర్సింహారెడ్డి, మరో సంవత్సరం పాటు రసూలు, సూదిని క్రిష్ణారెడ్డి 11సంవత్సరాల పాటు గ్రామ సర్పంచిగా కొనసాగారు. అనంతరం 1981నుండి 94వరకు జైపాల్‌రెడ్డి సోదరుడు సూదిని రామిరెడ్డి కొనసాగారు. 1994 తర్వాత గ్రామ సర్పంచి స్థానం బిసిలకురిజర్వు కావడంతో అప్పటి నుండి 2001వరకు గౌని రాములు కొనసాగారు. 2001నుండి కంబాలపల్లి లక్ష్మమ్మ కొనసాగుతున్నారు. గ్రామపంచాయతీ మొదటి సారి ఏర్పడినప్పుడు మొత్తం జనాభా రెండువేలు ఉండేది. గ్రామంలో వార్డు సభ్యుల సంఖ్య ఆరు ఉండగా ప్రస్తుతం 14కు చేరింది. మొత్తం ఓటర్ల సంఖ్య 4,700కు చేరింది. ఒక్కో వార్డులో 333ఓట్లుగా నిర్ణయించారు. మాడ్గుల గ్రామపంచాయతీ పరిధిలో పెద్దమాడ్గుల, మాడ్గుల తండా, నర్సాయపల్లి, ఖమ్మవారిపాలెం అంబ్లెట్‌ గ్రామాలుగా కొనసాగుతున్నాయి. మాడ్గుల మండల కేంద్రమైనప్పటికీ ఆ రూపు రేఖలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం సర్పంచి లక్ష్మమ్మ హయాంలో గ్రామంలో అక్కడక్కడ సిసి రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ దళితవాడ, హామ్లెట్‌ గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టలేదు. గ్రామానికి నేటికీ సరైన రవాణా సౌకర్యం లేదు. రోడ్లు పూర్తిగా గుంతల మయం కావడంతో ప్రయివేటు వాహనాలు వచ్చేందుకు భయపడుతున్నాయి.
ప్రస్తుత సర్పంచి కూడా జైపాల్‌రెడ్డి అనుచరుడే
ప్రస్తుత సర్పంచి కూడా జైపాల్‌రెడ్డి అనుచరుడే. ఈ సారి గ్రామాన్ని బిసిలకు రిజర్వు చేశారు. కాంగ్రెస్‌ నుండి కాట్లయాదయ్య పోటీ చేసి గెలుపొందాడు. ఎవరున్నా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో జైపాల్‌రెడ్డి చేసింది మాత్రం నామమాత్రమే.
తాగునీటికోసం తంటాలెన్నో ....
తాగునీటికోసం మాడ్గులతో ప్రజలు తంటాలు పడుతుంటారు. 300-350 అడుగుల లోతుకు తవ్వినా మంచినీళ్ళ దొరకవు. ఒకవేళ దొరికినా ఉప్పునీరే! తాగడానికి పనికిరావు. ప్లోరైడ్‌ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఈనీటిని తాగిన వారికి కాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు, అరికాళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు, నడుంనొప్పులు, పళ్లగారపట్టడం, ఒంటినొప్పులు, కాళ్లు వంకరపోవడం తప్పవు. ఫ్లోరోసీస్‌నుండి తమను తాము రక్షించుకునెందుకు తాటి కల్లును తాగాల్సివస్తుందని మండల ప్రజలు చెప్తున్నారు. ఇటీవల ఈ సమస్య పరిష్కారమైంది.
తాగునీటి హామీ నెరవేరింది
మాడ్గుల మండలంలోని ప్లోరైడ్‌ పీడిత గ్రామాలన్నీటికి కృష్ణాజలాలు అందిస్తామని జైపాల్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. ఆహామీ ఇటీవల నెరవేరింది. 11కోట్ల 25లక్షల రూపాయలతో ఒక పథకానికి రూపకల్పన చేయించారు. నాగార్జునసాగర్‌ ద్వారా కృష్ణాజలాలను ఈ పథకం ద్వారా మాడ్గులకు అందిస్తున్నారు. మాడ్గుల మండలానికి జైపాల్‌రెడ్డి జీవితంలో నెరవేరిన పెద్ద హామీ ఇదొక్కటే. తమ జిల్లాలోని వందలాది ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు ఇవ్వకుండా మాడ్గులకు ఇవ్వడం సరికాదని నల్గొండ జిల్లా వాసులు అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది.
జైపాల్‌రెడ్డి స్వగ్రమానికి చేసింది శూన్యం
కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తన స్వంత గ్రామమైన మాడ్గులకు, ఆమండలానికి చేసిందేమి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 1970వ దశకంలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. కల్వకుర్తి నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా పని చేశారు. కేంద్రంలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీగాను, గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఎపిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. సుదీర్ఘమైన తన రాజకీయ జీవితంలో మంత్రి జైపాల్‌రెడ్డి ఆయన స్వగ్రామం సమస్యలను సైతం పరిష్కరించలేక పోతున్నారనే విమర్శలున్నాయి.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరుకే పరిమితం
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరుకే పరిమితమైంది. కల్వకుర్తికి చుక్కనీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రాజకీయ పలుగుపడిని ఉపయోగించి ఎత్తిపోతల పథకం డిజైన్‌ మార్చేశారు. దీంతో కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కరువు , వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు జైపాల్‌రెడ్డి చేసిందేమి లేదు.

25, అక్టోబర్ 2010, సోమవారం

కూటికి లేకున్నా కాటుక మాననట్లు

వెనుకటికి ఒకావిడ కూటికి లేకపోయినా కళ్లకు కాటుక పెట్టడం మానలేదట. తిండి లేక లొట్టలయిన కళ్లకు కాటుక పెడితే ఎంత పెట్టక పోతే ఎంత ... మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చట్టబద్దతకే నోచుకోలేదంటే బడుగులకు రిజర్వేషన్లు అనటం కూడా అలాంటిదే....
ఆమె అప్పుడే మహిళా రాజ్యంకు మాజీ అధ్యక్షులయ్యారు. మహిళా రాజ్యమంటే అదేనండి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మహిళా విభాగాన్ని మహిళా రాజ్యం అంటారు. మాజీ అధ్యక్ష్యురాలు ఎవరో కాదండీ ఆవిడే శోభారాణి . మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కోసం పార్లమెంటులో పెట్టిన బిల్లుకు అనేక అడ్డంకులు వచ్చిన సంగతి తెలువంది కాదు. ఈ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం పెడితే బాగుంటుందని చిరంజీవికి సలహా ఇచ్చిందటావిడ. అందుకు ఆయన గ్రేటర్‌ హైదరాబాద్‌ మహిళారాజ్యం అధ్యక్షురాలు షేక్‌ షహిదాబేగంకు బాధ్యత అప్పగించారట. ఆమె మహిళా రాజ్యం ఆధ్వర్యంలో అక్టోబరు 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీల మహిళా విభాగం నాయకుల ను పిలిచి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా బిల్లు అమలుకు నోచుకోకముందే కొన్ని రాజకీయ పార్టీలు రకరకాల ఆటంకాలు కల్గిస్తున్నాయి. ఆడాళ్ల పెత్తనం పెరిగితే మగాళ్ల పదవులు పోతాయనుకునే వారు. మహిళలకు రిజర్వేషన్లు చట్టబద్దత చేయడానికి ఇష్టం లేని వాళ్లుబిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతున్నారు. ఇంకేవో కారణాలు చెప్పి చేతగాని కాంగ్రెస్‌ పార్టీ కాళ్లకు బందం పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో రౌండు టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ ఏదోలా ముందు రిజర్వేషన్‌ రావాలని కోరకుండా బిసిలకు , ఎస్సీలకు రిజర్వేషన్లు కావాలని కోరిన మహిళా రాజ్యం మాజీ అధ్యక్షులు శోభారాణి పరిస్థితి ఎలా ఉందంటే ' కూటికి లేకపోయినా కాటుక మాననట్లుంది' కదూ. అదే పరిస్థితిలో బడుగుబలహీన వర్గాల మహిళలంటే గిట్టని మాజీ మంత్రి త్రిపురాన వెంకటరట్నం తక్కువ తిన్నదా శోభారాణికి అడ్డుతగిలింది. అందరినీ ఉసికొల్పింది. దీంతో అగ్రవర్ణ మహిళలందరూ ఏకమయ్యారని ఫీలయిన శోభారాణి సమావేశాన్ని బైకాట్‌ చేసి వెళ్లిపోయింది. ఈ పరిస్థితి అర్థం కాని టిడిపి స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సినీనటి కవిత మాట్లాడుతూ మహిళా రాజ్యంకు సమావేశం నిర్వహించడం చేతగాలేదని నొక్కి వొక్కానించింది. ఈ పరిస్థితినంతా గమనించిన టివి9 చర్చ పెట్టింది. ఆచర్చకు త్రిపురాణ వెంకటరత్నంను పిలిచారు. ఆమె జరిగినదంతా చెప్పాక కవితను ఫోన్‌ఇన్‌లో సంప్రదించారు. త్రిపురాణ కవిత మధ్య గొడవ పెట్టారు. కవిత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెకు తెలువదులే అంది త్రిపురాణ. అందకు స్పందించిన కవిత ఆమెను తప్పు పట్టింది. రిజర్వేషన్లు వస్తాయో లేదో గాని మహిళా నాయకుల మధ్య గొడవమాత్రం మానుతుందోలేదో తెలువదు.
రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగిన తీరు పరిశీలిద్దామా.....అణగారిన సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు 33 శాతం మహిళా రిజర్వేషన్‌లో ఉప కోటా ముందే ఖరారు చేయాలనే అంశాన్ని మహిళా రాజ్యం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు శోభారాణి లేవనెత్తారు. ఆ వాఖ్యలను మాజీ మంత్రి త్రిపురాణ వెంకటరత్నం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి అందరూ మహిళా నాయకురాళ్లు మద్దతు తెలిపారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిలో అగ్రకులాలకు చెందిన మహిళలే పెత్తనం చెలాయిస్తున్నారని భావించి తీవ్ర మనస్థాపానికి గురైన శోభారాణి బారుకాట్‌ చేస్తునట్లు ప్రకటించారు. దీంతో సభ్యులందరూ ఆమెను సమూదాయించినా వినకుండా వెళ్లిపోయారు. టిడిపి స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సినీనటి కవిత మాట్లాడుతూ సభానిర్వహణ సక్రమంగా లేదని అన్నారు. అందరు కలిపితే 20 మంది కూడా లేని మహిళల్ని ఐక్యం చేయని వారు నాలుగు కోట్ల మంది మహిళల కోసం ఏం చేస్తారన్నారు. మహిళారాజ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ నాయకుల మధ్యనే సఖ్యత లేకపోవడం విడ్డూరంగ ఉందన్నారు. ఇదంతా ఆదివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజారాజ్యం గ్రేటర్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ జరిగిన వ్యవహారం...ఈ సమావేశంలో ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు మల్లు స్వరాజ్యం, ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ కృష్ణకుమారి, మాజీ మంత్రులు త్రిపురాణ వెంకటరత్నం, పుష్పలీల, పిఆర్పీ గ్రేటర్‌ మహిళా అధ్యక్షురాలు షేక్‌ షహిదాబేగం, కాంగ్రెస్‌ మహిళా సంఘం నాయకురాలు ఉప్పుల శారద, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.ఝాన్సీ, న్యాయవాది పి.వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

23, అక్టోబర్ 2010, శనివారం

ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగుర గలదా!!?

సోనియాను ఒప్పిస్తాం.. తెలంగాణ తెస్తాం...
నివాళి సభలో కాంగ్రెస్‌ నేతల స్పష్టీకరణ
12 కుటుంబాలకు చెక్కులు పంపిణీ
రసాభాసగా సమావేశం
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు శనివారం మహబూబ్‌నగర్‌లో సమావేశమయ్యారు. మేమున్నామని చెప్పుకోవడానికి తప్ప ఏం చేద్దామని... ..సోనియాగాంధీని ఒప్పిస్తాం... తెలంగాణా తెస్తాం... అని ప్రకటించారు. సరే మీ వెంట ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలనే ఒప్పించే శక్తి లేదే....సోనియాగాంధీని ఎలా ఒప్పిస్తారు. ''ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగుర గలదా!!? '' అన్న చందంగా ఉంది. వీరి వ్యవహారం. మీరు తెలంగాణా తెస్తామంటే మీ కార్యకర్తలు మీ పైకి కుర్చీలెత్తుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి అడ్డుకున్నారు అప్పుడే తెలంగాణా వచ్చేదని మీరంటారు. ఆయన లేడు కదా ఆయన గురించి చెప్పడ మెందుకు ..మీకార్యకర్తలను మీరే రెచ్చగొట్టి డౌన్‌డౌన్‌ అనిపించుకోవడ మెందుకు. ఎఐసిసి అధ్యక్షురాలిని ఒప్పించే శక్తి ఉంటే పిసిసి అధ్యక్షులు కరీంనగర్‌ ఉప ఎన్నికల్లో ఓడిపోయేవారేనా...మీరు తెలంగాణా తెస్తారో లేదో తెలువదు కాని ప్రజల సమస్యల పరిష్కారం గురించి ఆలోచించక పోతే వచ్చే ఎన్నికల్లో మీగురించి సమస్యల్లో ఉన్న తెలంగాణా ప్రజలు బాగా ఆలోచిస్తారు. రాజకీయాల్లో కనబడకుండా పోతారు. పైగా మీది జాతీయ పార్టీ రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన ప్రాంతాలగురించి కూడా ఆలోచించండి.
మహబూబ్‌నగర్‌ సమావేశం గురించి కొంత తెలుసుకుందామా....ఎఐసిసి అధినేత సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంత నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 12 మంది కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ తెలంగాణ కార్యాచరణ కమిటీ నేతృత్వంలో జిల్లాలోని కొత్తూరు, షాద్‌నగర్‌, బాలానగర్‌, మహబూబ్‌నగర్‌ మండలాల పరిధిలో సభలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జరిగిన సభకు డిసిసి అధ్యక్షులు ముత్యాల ప్రకాష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎఐసిసి నేతలు కె.కేశవరావు, వి.హనుమంతరావు ముఖ్యోపన్యాసం చేశారు. కేశవరావు మాట్లాడుతూ తెలంగాణను రాష్ట్రాన్ని సాధించే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. సోనియాగాంధీని ఒప్పించి రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రజలపైనా, విద్యార్థులపైనా ఎంతో బాధ్యత ఉందని చెప్పారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో కేశవరావు మాట్లాడుతున్న సందర్భంగా వైఎస్‌ అభిమానులు లేచి ఒక్కసారిగా కుర్చీలు ఎత్తేశారు. నిరసన తెలిపారు. కెకె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనల మధ్యే కెకె తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్సే తెలంగాణకు పెద్ద అడ్డంకి అని అన్నారు. ఆయన అడ్డుతగలకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఏర్పడి ఉండేదన్నారు. దీంతో వైఎస్‌ అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్‌ జిందాబాద్‌, వైఎస్‌ జగన్‌ జిందాబాద్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ విహెచ్‌ తన ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఒక దశలో కార్యకర్తలు కుర్చీలను ఆయనపైకి విసిరేందుకు యత్నించారు. దీంతో ఆయన వేదిక మీద నుండి కిందకు దిగి 'ఏం కొడతారా? కొట్టండి చూద్దాం'అంటూ వారి మధ్యకు వెళ్లారు. ఆయన్ను సముదాయించడం వేదికపై ఉన్న ఎవరి వల్లా కాలేదు. చివరకు మాజీ మంత్రి జానారెడ్డి, కేశవరావు, జూపల్లి కృష్ణారావు, డికె అరుణ నచ్చజెప్పారు. వేదికపైకి రావాలని కోరారు. కార్యకర్తల నిరసనల మధ్యనే ప్రసంగాన్ని ముగించారు.
బాబు ఇంటి ముందు ధర్నా చేయండి
టిడిపి నేతలు సోనియా గాంధీ ఇంటి ముందు కన్నా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తే బాగుంటుందని నాగర్‌కర్నూల్‌ ఎంపి మంద జగన్నాథం, మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపి విఠల్‌రావు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఇప్పటికీ తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదన్నారు. శ్రీ కృష్ణ కమిటీకి మూడు ప్రాంతాల నుండి నివేదికలు ఇప్పించడం సరికాదన్నారు. సభలో మాట్లాడిన అత్యధిక మంది టిడిపి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో 12 మంది తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడినా ఆయన స్పందించలేదని విమర్శించారు. ఒక్క కుటుంబానైనా పరామర్శించారా? అంటూ ప్రశ్నించారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలకు ఘన స్వాగతం పలికారు. అక్కడ కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించారు. షాద్‌నగర్‌ బస్టాండ్‌ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. బాలానగర్‌లోనూ సభ నిర్వహించారు.

22, అక్టోబర్ 2010, శుక్రవారం

బుడమ కాయల దొంగంటే బుజాలు తడుముకున్నట్లు!!!...

రక్తచరిత్ర చిత్రంపై బాబు ఆగ్రహం -రాష్ట్రవ్యాప్తంగా తమ్ముళ్ల నిరసనలు
ఓ ప్యాక్షనిస్టుకు టిడిపి సభ్యత్వం ఇచ్చింది. ఎమ్మెల్యేనూ చేసింది. మంత్రి పదవీ ఇచ్చింది. ఆయన గొప్ప నేత అయ్యాడు. ఆ నేత చరిత్రను, అనంతపురం ఫ్యాక్షన్‌ రాజకీయాలను ఇతివృత్తంగా ఎంచుకుని రాంగోపాల్‌ వర్మ సినిమా తీశాడు. ఆనేతను ఆపార్టీ అధినేత ప్రోత్సహించినట్లు సన్నివేశాలుంటే ఎందుకంత ఆగ్రహం. ప్యాక్షన్‌ నేతను ఎమ్మెల్యేను చేసినప్పుడు ఎవ్వరూ నిరసన తెలుపలేదే. మంత్రిని చేసినప్పుడూ నిరసన తెలుపలేదే. ఉన్నది ఉన్నట్లు చెబితే ఉలుకెక్కువ అన్నట్లు ' బుడమకాయల దొంగలంటే బుజాలు తడుముకున్నట్లు' లేదూ...ఎంత కాకపోతే రాంగోపాల్‌ వర్మను క్షమాపణ చెప్పాలని కోరుతారు. మరి ఈసంఘటటనలను పరిశీలిద్దాం......
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావును రక్తచరిత్ర చిత్రంలో కించపర్చే విధంగా చిత్రీకరించిన సన్నివేశాలు, వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో లేకరులతో మాట్లాడుతూ తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహానాయకుడిని అవమానపరిచి నందుకు వెంటనే ఎన్టీఆర్‌ అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ను తప్పుబట్టిన వారెవరూ లేరన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన హయాంలో జరగని వాటిని జరిగినట్లు చిత్రీకరించారని, ఇది ఎన్టీఆర్‌ను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లకుపైగా ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ దేశ రాజకీయాలను మార్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అలాంటి నేతను 'రక్తచరిత్ర' నిర్మాతలు, దర్శకులు ఈ విధంగా చిత్రీకరించడం మంచి పద్థతి కాదన్నారు. ఒక చిత్రాన్ని నిర్మించినప్పుడు వాస్తవాలతో కూడుకున్నదై ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ చరిత్ర కలిగిన వ్యక్తిని అవమానపరిచేలా ఉండకూడదని పేర్కొన్నారు. నమ్మిన సిద్దాంతాల కోసం పని చేసిన ప్రజల మనిషి ఎన్టీఆర్‌ అని అన్నారు. చరిత్రను వక్రీకరించి చూపించడానికి ప్రయత్నించినా ప్రజలు నమ్మరని చెప్పారు. సెన్సార్‌ బోర్డుకు తెలియకుండా చిత్రం విడుదలయిందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ సెన్సార్‌బోర్డుకు అన్ని విషయాలూ తెలుసు, ఎవరి ఒత్తిడి వల్ల తీశారో కూడా వారికే తెలుసన్నారు.
నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం
అనంతపురం జిల్లా ఫ్యాక్షన్‌ రాజకీయాలను ఇతివృత్తంగా ఎంచుకుని విడుదలైన 'రక్త చరిత్ర' సినిమాలోని సన్నివేశాలపై టిడిపి కార్యకర్తలు, ఎన్‌టిఆర్‌ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ధర్నాలు చేశారు. రాంగోపాల్‌వర్మ క్షమాపణ చెప్పాలని ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సినిమాలో శివాజీ రావు పాత్ర ఎన్‌టి.రామారావులా ఉందని, పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్‌ రాజకీయాన్ని ప్రోత్సహించేలా ఉందని, రామారావు హత్యారాజకీ యాలను ప్రోత్సహించలేదని ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం నగరంలో తెలుగుయువత నాయ కులు కొందరూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అదుపు లోకి తీసుకున్నారు. నగరంలో తొలి ప్రదర్శనను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులు చూశారు. పరిటాల రవీంద్ర, ఎన్టీరామారావు అటువంటి వారు కాదని, రవీంద్ర ఎటువంటి హత్యలు చేయలేదని వారి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. దీన్ని కేవలం సినిమాగానే చూశామని పరిటాల శైలజ, మహేందర్‌ తెలపడం బాగుంది. చంద్రబాబాబు , టిడిపి నేతలు మాట్లాడితన తీరు మాత్రం బాగలేదు.
ఆ సన్నివేశాలు తొలగించాలి : తమ్మినేని, గుండ
ఎన్‌టిఆర్‌పై చెడుగా చిత్రించిన సన్నివేశాలను తొలగించాలని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు తమ్మినేని సీతారాం, గుండ అప్పల సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడుతూ ఆ సన్నివేశాలను తొలగించకుంటే, సినిమాను ప్రదర్శించనీయబో మని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ధియేటర్ల వద్ద టిడిపి కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు జరిపారు.

18, అక్టోబర్ 2010, సోమవారం

తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్లు

ఆర్డ్‌ నెన్స్‌పై కోర్టుకు
మైక్రో సంస్థల స్టే పిటిషన్‌కు సిద్ధం
మైక్రో రుణసంస్థలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ మైక్రో సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాయి. దీని ప్రమాదాన్ని గుర్తించక పోవడం ప్రభుత్వం పొరపాటు చేసింది. దీంతో తొండముదిరి ఊసరవెళ్లి అయిన చందంగా మైక్రో సంస్థల నిర్వాహకులు బాగా సంపాదనకు అలవాటు పడ్డారు. ఆ దోపిడినీటి అరికట్టాలనుకున్న వారిపై ఎలాంటి చర్యలకైనా ముందుకు వెళ్తుంది. లాభాలొస్తాయనుకుంటే పెట్టుబడి దారుడు దేనికీ వెనుకాడడని కారల్‌ మార్క్స్‌ చెప్పాడు. అధికంగా లాభాలొస్తాయంటే ప్రాణాలనైనా ఫణంగా పెడుతారు. కాబట్టి పెట్టుబడి దారుడు దేనికైనా సిద్ధమే. ప్రభుత్వం చిత్తశుద్ధితో లేకుంటే ఏదయినా సాధ్యపడవచ్చు. ఎస్‌కెఎస్‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలియచేసింది. ఆర్డినెన్స్‌ అమలు కాకుండా నిరోధించేందుకు కోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేయాలని మైక్రోఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌ (ఎంఎఫ్‌ఐఎన్‌) యోచిస్తున్నట్లు ఎస్‌కెఎస్‌ మైక్రో ఫైనాన్స్‌ తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌ తమ సంస్థకు వర్తిస్తుందా లేదా అనే విషయమై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటామని ఎస్‌కెఎస్‌ చెప్పింది. తమది నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కాదని ఆ ప్రకటనలో పేర్కొంది.

16, అక్టోబర్ 2010, శనివారం

విజయదశిమి శుభాకాంక్షలు

దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదో రోజు విజయదశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి తరువాతి మూడు రోజులు సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభాస్యంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితి. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదోరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మిచెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకుంటారు. తెలుగువారు దసరాని పదిరోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రుల్లో దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమవాస్యకి స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టు పై తమ ఆయుధాలను తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది. దసరా ఉత్సవాలను దేశమంతటా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. మైసూరు, కోల్‌కతా, ఒరిస్సా, తెలంగాణా, విజయవాడలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఒంగోలులో కళాకారుల రూపంలో అమ్మవారిని ఆదాదిస్తారు. విజయవాడలో బేతాళ నృత్యం, విజయనగరం సిరిమాను. వీపనగండ్లలో రాళ్ల యుద్ధం, బందర్‌లో శక్తి పటాలు, వీరవాసనంలో ఏనుగు సమరంభం తదితర రూపాల్లో ఈ పండుగను జరుపుకుంటారు.
కోల్‌కతాలో దసరాను దుర్గా పూజ పర్వంగా బెంగాళీలు జరుపుకుంటారు. సప్తమి, అస్టమి, నవమి తిథులలో దుర్గా మాతకు పూజ చేసి తొమ్మిదో రోజున పూజిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలాది మంది దర్శించడం విశేషం. తొమ్మిది రోజులు రాష్ట్ర మంతా హరి కథలు, పూరాన స్రవనం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు దుర్గా మాతను హుగ్లీ నదిలో నిమజ్ఞనం చేస్తారు. నదీ తీరంలో కూమారీ పూజలు చేయడం బెంగాళీల ప్రత్యేకత. ఒరిస్సాలో కటక్‌ కళాకారులు రూపొందిచిన దుర్గా మాత రూపాలను వీధి వీధిల్లో ప్రతిష్టిస్తారు. మహిళలు మాణికలో వడ్లు నింపి లకిëదేవిగా భావించి పూజలు చేస్తారు. దీనిని వారు మాన బాన అంటారు. ఒరిస్సా ప్రజలు విజయ దశమినాడు విజయ దుర్గాను ఆరాదిస్తే అన్నింటా విజయం సిద్ధిస్తుందని అక్కడి ప్రజలు విశ్వాసం. చివరి రోజున పదిహేను అడుగుల రావణ విగ్రహాన్ని బాణ సంచాతో తచారు చేసి మైదానంలో కాల్చుతారు. ఈ రావణ కాష్టం చూడటాడనికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. మైసూరు మహారాజు పాలన కాలం నుంచి వైభవంగా దసరా ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీ.

14, అక్టోబర్ 2010, గురువారం

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ఆగడాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన అక్టోబర్‌ 14న భేటి అయిన రాష్ట్ర మంత్రిమండలి చర్యలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది. ఈ పరిస్థితి రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంతమంది చచ్చే వారు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగడాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సంస్థలను నియంత్రించేందుకు 'మైక్రో ఫైనాన్స్‌ సంస్థల నియంత్రణ ఆర్డినెన్స్‌'ను మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఆర్డినెన్స్‌ అమల్లోకి రానుంది. మైక్రో సంస్థలు రుణం తీసుకున్న సభ్యులను వేధింపులకు గురిచేస్తే మూడేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానాను విధించే అవకాశముంది. మైక్రో వేధింపుల కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తారు. వేధింపుల నివారణ చట్టాన్ని పటిష్టపర్చేందుకు చర్యలు చేపడుతారు. వడ్డీ గురించి చివరి నిమిషంలో ఆర్డినెన్స్‌ నుంచి తొలగించినట్లు తెలిసింది. దీనిపై కొంతమంది మంత్రులు సూచించినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయం కానందున తొలగించింది. మైక్రో సంస్థలు ఎంత వడ్డీ వసూలు చేసినా ఆర్డినెన్స్‌ పట్టించుకోదు. వడ్డీల నియంత్రణపై ఆర్డినెన్స్‌కు అధికారం లేదంటున్నారు. వసూళ్ల సమయంలో సంస్థలు పెట్టే ఇబ్బందులపై బాధితులు ఫిర్యాదు చేసిన పక్షంలో అధికారులు చర్యలు తీసుకోవడానికి ఈ ఆర్డినెన్స్‌ ఉపయోగపడుతుంది. మైక్రోఫైనాన్స్‌ సంస్థలు జిల్లా స్థాయిలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్‌ దగ్గర రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నిబంధన విధించారు. అంతేకాకుండా అయా సంస్థలు రిజిస్ట్రేషన్‌ పొందాయా లేదా అనే అంశాన్ని డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్లు పరిశీలించాలని సూచించింది. సంఘాలకు రుణాలు ఇచ్చేముందు ఎంత వడ్డీని నిర్ణయిస్తారో సభ్యులకు సమాచారమివ్వాలని నిర్ణయించింది. అధిక వడ్డీని నియంత్రించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేయాల్సిన అవసరం ఉంది. మంత్రి మండలిలో చర్చించిన అంశాలను గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ విలేకరులకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రోసంస్థల ఆగడాల గురించి గత కొంత కాలంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వస్తోన్నాయని చెప్పారు. ఈఅంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, మహిళాసంఘాలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించామని చెప్పారు. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పరిధిలోనే సంస్థలు వడ్డీ వ్యాపారం చేస్తోన్నాయి, కానీ అధిక వడ్డీతో
మహిళాసంఘాలను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. అప్పుల నియంత్రణ చట్టం సత్వరం అమలు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మైక్రోఫైనాన్స్‌ సంస్థల నుంచి అధిక వడ్డీతో రుణాలు తీసుకున్న సభ్యుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. అధిక వడ్డీని సబ్సిడి పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అధిక వడ్డీ బాధల నుంచి బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాని ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల అమలు తీరును చూస్తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో అరికట్టే అవకాశం తక్కువగానే ఉంది. అయినా చూద్దాం తొందరెందుకు.

13, అక్టోబర్ 2010, బుధవారం

ఫలిస్తున్న ప్రజాసంఘాల పోరాటాలు

స్థానిక సమస్యలపై ప్రజాసంఘాలు నిర్వహిస్తున్న నిరవధిక, రిలే దీక్షలకు మద్దతుగా ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. దీక్షలకు సంఘీభావంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అదే తరుణంలో ప్రభుత్వం నుంచి కూడా ఆలస్యంగా నైనా మంచి ఫలితాలే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అధికారులు దిగిరాక తప్పడం లేదు. ఇళ్లస్థలాల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. స్థలాలు ఇచ్చిన చోట పట్టాలు ఇవ్వక పోవడం, పట్టాలు ఇచ్చిన చోట స్థలాలు చూపక పోవడం వంటివి రాష్ట్రంలో పలు చోట్ల బయట పడుతున్నాయి. పెండింగు పడిన ఇందిరమ్మ బిల్లులు ఇవ్వడానికి అధికారులు ముందుకు వస్తున్నారు. అదే విధంగా ఇళ్లస్థలాలు చూపుతున్నారు. పించన్లు, రేషన్‌కార్డుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రోడ్లు, డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి కూడా అధికారులు హామీ ఇస్తున్నారు. సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షల మాదిరిగానే ఇతర పార్టీలు, వాటి ప్రజాసంఘాలు కలిసొస్తే పేదల సమస్యలు ఎక్కువగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సిపిఎం దాని అనుబంధ సంఘాలు మాత్రమే ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎట్లాగు అధికార పార్టీ కాబట్టి ప్రజల తరుపున పోరాటాలు చేయడానికి ముందుకు రాలేదంటే అర్థం ఉంది. కాని ప్రధాన ప్రతిపక్షం టిడిపి , బిజెపి , ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్‌, ఇతర రాజకీయ పార్టీలన్నీ ముందుకు వచ్చి ప్రజల సమస్యల పట్ల పోరాటాలు చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కార మయ్యే అవకాశం ఉంది. కాని వాటికి చిత్తశుద్ధి లేదనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేస్తామని ముందుకొస్తాయి. కాని నిజాయితీగా ప్రజల తరుపున పని చేయడానికి వెనుకాడుతున్నాయి. రాజకీయ ప్రజయోజనం ఉందనుకున్నచోట మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ధోరణి నుంచి బయట పడాలి.

12, అక్టోబర్ 2010, మంగళవారం

అపరమేథావి గ్రామం అథోగతి



మాడ్గుల పంచాయతీలో ఎక్కడి సమస్యలక్కడే
30 ఏళ్లుగా జైపాల్‌రెడ్డి కుటుంబీకులదే పాలన
''ఆయన అపరమేథావి... ఆయన పార్లమెంటులో ఆంగ్లంలో ప్రశ్నలడిగితే సభ్యులు నిఘంటువులు వెతకాలి. సమస్యలను, సవాళ్లను చాకచక్యంగా చర్చించగల సమర్థునిగా గుర్తింపు పొందారు. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు కీలకమైన పదవులే లభించాయి. ఆయన స్వగ్రామం మాత్రం సమ్యలకు నిలయమైంది. పరిష్కారానికి నోచుకోలేదు. అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్నచందంగా ఉంది. స్వగ్రామంపై ప్రేమలేకనా?.... నిధులు లేకనా? ఆసమస్యలను పరిష్కరించేందుకు సాధ్యంకాకనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయనెవరోకాదు.... కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి. ఆయన సొంత గ్రామం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా మాడ్గుల. ఆ గ్రామాన్ని 30 ఏళ్ల పాటు ఆయన కుటుంబీకులే పాలించారు. ఇప్పటికీ గ్రామంలో అనేక సమస్యలు తిష్టవేశాయి''.
ప్రధానంగా గ్రామంలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు అనేక రోగాల బారిన పడ్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పాడుబడిన ఇండ్లు, గుంతలమయమైన రోడ్లే కనిపిస్తాయి. గ్రామపంచాయతీలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు 30ఏళ్ల పాటు జైపాల్‌రెడ్డి కుటుంబం పాలించినప్పటికీ గ్రామం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. తమ గ్రామం నుండి కేంద్ర స్థాయిలో పలుకుబడి ఉన్న వ్యక్తి తమ గ్రామస్తుడైనా తమకెలాంటి ప్రయోజనం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికీ తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలు ఏర్పడినప్పుడు తొలి సర్పంచిగా సూదిని రామలింగారెడ్డి ఎన్నికయ్యారు. 1967వరకు ఆయన కొనసాగారు. ఆ తర్వాత సంవత్సరంపాటు వెంకటయ్య, మరోసంవత్సరం పాటు సూదిని నర్సింహారెడ్డి, మరో సంవత్సరం పాటు రసూలు, సూదిని క్రిష్ణారెడ్డి 11సంవత్సరాల పాటు గ్రామ సర్పంచిగా కొనసాగారు. అనంతరం 1981నుండి 94వరకు జైపాల్‌రెడ్డి సోదరుడు సూదిని రామిరెడ్డి కొనసాగారు. 1994 తర్వాత గ్రామ సర్పంచి స్థానం బిసిలకురిజర్వు కావడంతో అప్పటి నుండి 2001వరకు గౌని రాములు కొనసాగారు. 2001నుండి కంబాలపల్లి లక్ష్మమ్మ కొనసాగుతున్నారు. గ్రామపంచాయతీ మొదటి సారి ఏర్పడినప్పుడు మొత్తం జనాభా రెండువేలు ఉండేది. గ్రామంలో వార్డు సభ్యుల సంఖ్య ఆరు ఉండగా ప్రస్తుతం 14కు చేరింది. మొత్తం ఓటర్ల సంఖ్య 4,700కు చేరింది. ఒక్కో వార్డులో 333ఓట్లుగా నిర్ణయించారు. మాడ్గుల గ్రామపంచాయతీ పరిధిలో పెద్దమాడ్గుల, మాడ్గుల తండా, నర్సాయపల్లి, ఖమ్మవారిపాలెం అంబ్లెట్‌ గ్రామాలుగా కొనసాగుతున్నాయి. మాడ్గుల మండల కేంద్రమైనప్పటికీ ఆ రూపు రేఖలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం సర్పంచి లక్ష్మమ్మ హయాంలో గ్రామంలో అక్కడక్కడ సిసి రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ దళితవాడ, హామ్లెట్‌ గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టలేదు. గ్రామానికి నేటికీ సరైన రవాణా సౌకర్యం లేదు. రోడ్లు పూర్తిగా గుంతల మయం కావడంతో ప్రయివేటు వాహనాలు వచ్చేందుకు భయపడుతున్నాయి.
ప్రస్తుత సర్పంచి కూడా జైపాల్‌రెడ్డి అనుచరుడే
ప్రస్తుత సర్పంచి కూడా జైపాల్‌రెడ్డి అనుచరుడే. ఈ సారి గ్రామాన్ని బిసిలకు రిజర్వు చేశారు. కాంగ్రెస్‌ నుండి కాట్లయాదయ్య పోటీ చేసి గెలుపొందాడు. ఎవరున్నా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో జైపాల్‌రెడ్డి చేసింది మాత్రం నామమాత్రమే.
తాగునీటికోసం తంటాలెన్నో ....
తాగునీటికోసం మాడ్గులతో ప్రజలు తంటాలు పడుతుంటారు. 300-350 అడుగుల లోతుకు తవ్వినా మంచినీళ్ళ దొరకవు. ఒకవేళ దొరికినా ఉప్పునీరే! తాగడానికి పనికిరావు. ప్లోరైడ్‌ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఈనీటిని తాగిన వారికి కాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు, అరికాళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు, నడుంనొప్పులు, పళ్లగారపట్టడం, ఒంటినొప్పులు, కాళ్లు వంకరపోవడం తప్పవు. ఫ్లోరోసీస్‌నుండి తమను తాము రక్షించుకునెందుకు తాటి కల్లును తాగాల్సివస్తుందని మండల ప్రజలు చెప్తున్నారు. ఇటీవల ఈ సమస్య పరిష్కారమైంది.
తాగునీటి హామీ నెరవేరింది
మాడ్గుల మండలంలోని ప్లోరైడ్‌ పీడిత గ్రామాలన్నీటికి కృష్ణాజలాలు అందిస్తామని జైపాల్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. ఆహామీ ఇటీవల నెరవేరింది. 11కోట్ల 25లక్షల రూపాయలతో ఒక పథకానికి రూపకల్పన చేయించారు. నాగార్జునసాగర్‌ ద్వారా కృష్ణాజలాలను ఈ పథకం ద్వారా మాడ్గులకు అందిస్తున్నారు. మాడ్గుల మండలానికి జైపాల్‌రెడ్డి జీవితంలో నెరవేరిన పెద్ద హామీ ఇదొక్కటే. తమ జిల్లాలోని వందలాది ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు ఇవ్వకుండా మాడ్గులకు ఇవ్వడం సరికాదని నల్గొండ జిల్లా వాసులు అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది.
జైపాల్‌రెడ్డి స్వగ్రమానికి చేసింది శూన్యం
కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తన స్వంత గ్రామమైన మాడ్గులకు, ఆమండలానికి చేసిందేమి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 1970వ దశకంలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. కల్వకుర్తి నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా పని చేశారు. కేంద్రంలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీగాను, గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఎపిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. సుదీర్ఘమైన తన రాజకీయ జీవితంలో మంత్రి జైపాల్‌రెడ్డి ఆయన స్వగ్రామం సమస్యలను సైతం పరిష్కరించలేక పోతున్నారనే విమర్శలున్నాయి.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరుకే పరిమితం
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరుకే పరిమితమైంది. కల్వకుర్తికి చుక్కనీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రాజకీయ పలుగుపడిని ఉపయోగించి ఎత్తిపోతల పథకం డిజైన్‌ మార్చేశారు. దీంతో కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కరువు , వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు జైపాల్‌రెడ్డి చేసిందేమి లేదు.

11, అక్టోబర్ 2010, సోమవారం

కర్ణాటక రాష్ట్ర పతి పాలనకు గవర్నర్‌ సిపార్సు


ఇప్పటికైనా లౌకిక వాదులు మేల్కొనాలి
దక్షణాదిలో బిజెపికి తగిన శాస్తి జరగాలి
కర్ణాటక అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్ష ఓ 'ఫార్సు' అని తేల్చిన గవర్నర్‌ రాష్ట్రపతి పాలన కోసం కేంద్రానికి సిఫార్సు పంపినట్లు సమాచారం. అయితే ఇప్పటికైనా లౌకిక వాదులు మేల్కొని మేల్కొని బిజెపికి ముకుదాడు వేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. మతోన్మాదంతో పాటు బడా వ్యాపారుల చేతిలోకి వెళ్లిన పాలనపై ప్రక్షాలన జరగాల్సిఉంది. రాష్ట్ర పాలనపై కేంద్రం ఏ క్షణాన్నైనా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన విధించటం జరిగితే మూడేళ్ల వ్యవధిలో ఇది రెండోసారి అవుతుంది. శాసనసభలో జరిగిన పరిణామాలన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవని గవర్నర్‌ తన లేఖలో పేర్కొన్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. సోమవారంనాటి బలపరీక్షకు ముందే స్పీకర్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసారు. ఎడ్యూరప్ప సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, జెడి(ఎస్‌) సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్‌ ముందున్న వెల్‌లో గుమిగూడిన సమయంలోనే ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన ముందు గుమిగూడి నినాదాలు చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను పట్టించుకోకుండానే స్పీకర్‌ 106 మంది బిజెపి సభ్యులతో విశ్వాస తీర్మానం నెగ్గినట్లు ప్రకటిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. కేవలం 15 నిముషాల్లోనే బలపరీక్షను పూర్తి చేసిన స్పీకర్‌, ఎడ్యూరప్ప సర్కారు నెగ్గినట్లు ప్రకటించారు.
వందలాది పోలీసుల మోహరింపు
ఇదిలా ఉండగా శాసన మండలికి చెందిన ముగ్గురు సభ్యులు బలపరీక్ష సమయంలో సభలో ప్రత్యక్షమయ్యారు. అనర్హులుగా ప్రకటించిన శాసన సభ్యులను సభలోకి రానివ్వకుండా తలుపులు మూసివేసిన ఘటన కర్నాటక అసెంబ్లీ చరిత్రలో సోమవారం తొలిసారిగా జరిగింది. అసెంబ్లీ మార్షల్స్‌, వందలాదిమంది పోలీసులు అసెంబ్లీ చుట్టుపక్కల మోహరించారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎడ్యూరప్ప సర్కారును గెలిపించిన స్పీకర్‌ను 'బిజెపి ఏజెంట్‌' అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. స్పీకర్‌ ప్రకటనపై ఆగ్రహించిన ప్రతిపక్షాలు గవర్నర్‌ను ఆశ్రయించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బిజెపి సర్కారు దుర్వినియోగం చేయటంపై కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యేనూ వదల్లేదు
సర్కారు తన అధికారాన్ని కాపాడుకునే క్రమంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేను సైతం వదిలిపెట్టలేదు. ఎళబాగురి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈశన్న గులగన్నవార్‌ సోమవారం అంబులెన్స్‌లో శాసనసభకు హాజరై విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు. ఆయన గత కొద్ది వారాలుగా గుండెనొప్పితో నగరంలోని ఒక ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేను వీల్‌ ఛైర్‌లో శాసనసభలోకి తీసుకువచ్చిన అంబులెన్స్‌ సిబ్బంది తరువాత అదే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
హైకోర్టుకెళ్లిన రెబల్స్‌
తమను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ కెజి బొప్పయ్య తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అసమ్మతి శాసనసభ్యులు సోమవారం కర్నాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి కేసును మంగళవారానికి వాయిదా వేసింది.
గవర్నర్‌ చర్యను సమర్ధించిన మొయిలీ
కర్నాటకలో ఎడ్యూరప్ప సర్కారు బలపరీక్ష నెగ్గిన కొద్దిసేపటికే గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయటాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ గట్టిగా సమర్ధించారు. స్పీకర్‌ కెజి బొప్పయ్య రాజ్యాంగ విరుద్ధంగా అసమ్మతి ఎమ్మెల్యేలను
సస్పెండ్‌ చేయటం వల్లే గవర్నర్‌ ఈ చర్య తీసుకున్నారని ఆయన ముంబయిలో ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సోమవారం నాటి బలపరీక్ష సందర్భంగా శాసనసభలో భయానక వాతావరణం నెలకొందన్నారు.
సర్కారు బర్తరఫ్‌కు ప్రతిపక్షం డిమాండ్‌
శాసనసభలో బలపరీక్ష ముగిసిన అనంతరం ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్‌, జెడి(ఎస్‌) శాసనసభ్యులు గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బలపరీక్ష నిర్వహణకు స్పీకర్‌ అనుసరించిన విధానంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు.
ఓట్ల లెక్కింపును ఎవరూ కోరలేదు: స్పీకర్‌
అసెంబ్లీలో బలపరీక్షకు తాను అనుసరించిన విధానాన్ని స్పీకర్‌ కెజి బొప్పయ్య గట్టిగా సమర్ధించుకున్నారు. ఈ బలపరీక్షలో ఓట్ల లెక్కింపును ఏ పార్టీ కోరలేదని, అందువల్లే తాను మూజువాణి ఓటింగ్‌ను అనుమతించానని ఆయన చెప్పారు. అసెంబ్లీలోకి పోలీసుల ప్రవేశాన్ని కూడా ఆయన గట్టిగా సమర్ధించారు.
ధనబలంతో సర్కారును కూల్చే కుట్ర
విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం ధనబలంతో తన సర్కారును కూల్చేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. ఈ కుట్రలో ప్రతిపక్షం వెదజల్లిన నోట్ల కట్టల గుట్టును తాను త్వరలోనే రట్టు చేస్తానన్నారు.
గవర్నర్‌ రీకాల్‌కు బిజెపి డిమాండ్‌
రాజ్యాంగ ప్రతినిధిగా కాక రాజకీయ నేతల తరహాలో వ్యవహరిస్తున్న గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌ను రీకాల్‌ చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బదులుగా ఆయన అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌, జెడి(ఎస్‌)లను ఎగదోస్తున్నారని కర్నాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎఎస్‌ ఈశ్వరప్ప విమర్శించారు.

10, అక్టోబర్ 2010, ఆదివారం

ఆకట్టుకున్న తెలుగు తొలి జంట కవయిత్రుల అష్టావధానం

ఆకట్టుకున్న తెలుగు తొలి జంట కవయిత్రుల అష్టావధానం


తెలుగు తొలి జంట కవయిత్రులు టి. ఉదయచంద్రిక , బి.అపర్ణల అష్టావధానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రముఖ సాహితీవేత్త తోపుదుర్తి వెంకట్రామయ్య ప్రోత్సాహంతో ఆదివారం తెలుగు లలితకళాసమితీలో డాక్టర్‌ ఆశావాది అధ్యక్షతన ఈ అష్టావధానం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే 24 సార్లు అవధానం చేసిన ఈ జంట కవయిత్రులు ధూలిపాల మహదేవమణితో శిక్షణ పొందారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఉదయచంద్రిక, రాజమండ్రికి చెందిన అపర్ణ అవధాన కళను సాహితీలోకానికి తెలపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవధాన ప్రక్రియ ఒక్క తెలుగు భాషలోనే ఉన్నప్పటికీ దానికి అంత ఆదరణ లేదని, తెలుగు ప్రజలకు అవగాహన కల్పించి ఆదరణ పెంచుతామని తెలిపారు. ఫృశ్చకులు ఇచ్చిన సమస్యలను పూరించి చక్కటి ధారనా పటిమతో అవధానాన్ని రక్తి కట్టించారు. ఫృచ్చకులతోపాటు , సభకు హాజరయిన కవి పండితులు ప్రశంసించారు.
ఈ అవధానంలో ఫృశ్చకులుగా నిశిద్ధాక్షరి -డాక్టర్‌ మహ్మద్‌హుస్సేన్‌, సమస్య -నారాయణ స్వామి , దత్తపది -వైద్యం వెంకటేశ్వర్లు, వర్ణన -పద్మావతమ్మ, న్వస్తాక్షరి-పార్వతీదేవి, వారగణనం -తోపుదుర్తి వెంకట్రామయ్య, అప్రస్తుత ప్రసంగం -రామచంద్ర , గంటానాధం తెలకపల్లి పాండురంగశర్మ పాల్గొన్నారు.
పద్యకవితలో శిక్షణ అవసరం : ఆశావాది
తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవడానికి ప్రధానంగా పద్యకవితలో ఔత్సాహికులకు శిక్షణ అవసరమని ప్రముఖ అష్టావధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు సూచించారు. కర్నూలు జిల్లాలో అనేక సాహితీ సంస్థలున్నాయని వారు పుస్తకావిష్కరణ సభలు, కవిసమ్మేళనాలకే పరిమితం కాకుండా పద్యకవితమై శిక్షణా తరగతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చక్కటి అవధానం చేసిన ఉదయచంద్రిక, అపర్ణలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అభినందించారు. చిన్నపాటి లోపాలను సరిచేసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. అవధానంలో పూరించిన చక్కటి పద్యాలివి
నిశిద్ధాక్షరి పద్యం : -
శ్రీకిన్‌ ధీకిన్‌ నీవే
వాకున్‌ జేతుల్‌ సతంభు వాణీ నీవే
గాకర్త వింక దయతో
మాకై తలనిండియుండి మాతా గనుమా!
సమస్యాపూరణ పద్యం: -
నీవా ఇంటికి దేవతై వెలుగుచున్‌ నీరాజనంబందుచున్‌
జీవంబౌచు ప్రజాంతరంగములకున్‌ జేజేలనేబొందుచున్‌
కావేనీవు జనాలహార్టుబీటువు గదా కల్లోలమున్‌ చేసే ఓ
'' టీవీ ఎంతటి జానవైతివిగదే టీనేజి కుర్రోళ్లకున్‌ ''
దత్తపది :'' చెప్పు, చేట, పేడ, గాడిద '' పదాలతో ( అల్లసాని పెద్దనను శ్రీకృష్ణదేవరాయల సత్కారం తో పద్యం)
కైతల రేడు చెప్పు ఘన కావ్యసుధన్‌గని కృష్ణరాయలే
ఏతరి సల్పెనన్నమును పేడను చూడని రీతిలో భువిలో
నూతనమైనగాడిదను నోటబల్కగ రాజ్యమంతయున్‌
మ్రోతల చేటపాసులన్‌ ముచ్చటజేసె పెద్దనార్యుకున్‌
వర్ణన:-
ఇంతికి నర్థభాగమిడి ఈశ్వరుడొందెన్‌ లోకమాన్యతన్‌
ఎంతనిజెప్ప బూనినను ఏరికిసాధ్యముమాన్యతో శంకరుడహో
వింతగు లీలల న్నిటిని వేవుపాడగ భక్తకోటిమీ
చెంతను చేరి మ్రొక్కినను చింతలు చేరవుమానసంబునన్‌

న్యస్తాక్షరి : నవరాత్రి వచ్చేట్లుగా వృత్త పద్యం
నావరణీయ భావమున నర్తనమాడగ తల్లిరో సదా
సేవలు చేయు భాగ్యమిక తెన్నుగ భక్తుల కీయ వేడెదన్‌
కావగమమ్ము రాదె కామ్యములీయగ శంకరాకృపన్‌
ప్రోవగ కృష్టజాలమిది బ్రోచుతో మమ్ముసుగాత్రీ వేడెదన్‌.

పై పద్యాలన్నింటినీ చక్కటి ధారణతో సభికులకు వినిపించారు.

8, అక్టోబర్ 2010, శుక్రవారం

కాటికాపరులకు కష్టకాలం


  • కాంట్రాక్ట్‌ పేరుతో పొట్టగొట్టే యత్నాలు
  • చిత్తశుద్ధి లేని జిహెచ్‌ఎంసి పాలకులు
కాలే కాష్టాల మధ్య బొందలు తీస్తూ, కాడులు పేరుస్తూ ఒంటరిగా శ్మశాన వాటికకు రక్షణగా వుండే కాటి కాపరులకు కష్టకాలం వచ్చింది. శ్మశాన వాటికలను కాంట్రాక్టుకు ఇవ్వాలన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) నిర్ణయం కాటికాపరుల పొట్టగొట్టేలా ఉంది. తరతరాలుగా శ్మశాన వాటికల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్న బ్యాగరీ బతుకులు రోడ్డున పడబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో నాలుగు విద్యుత్‌ శ్మశాన వాటికలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది తమ వృత్తిని బొందపెట్టేలా ఉందని కాటికాపరులు ఆందోళన చెందుతున్నారు. ఇదే తరుణంలో ఉన్న శ్మశాన వాటికలను కాంట్రాక్టుకు ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ వృత్తిపై ఆధారపడి బతుకుతోన్న కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఎంతో కష్టనష్టాలను భరిస్తూ, ఎండనక, వాననక, రాంత్రింబవళ్లు శ్మశాన వాటికల్లో కాటికాపరులు సేవలందిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు ఐదేళ్లకు కాంట్రాక్టుకు ఇవ్వాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఆ తర్వాత మరో ఐదేళ్లు కాంట్రాక్టును పొడింగచవచ్చు.
గ్రేటర్‌లో రెవెన్యూ రికార్డుల ప్రకారం వివిధ మతాలకు చెందిన 682 శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌ జిల్లాలో 391, రంగారెడ్డి జిల్లా పరిధిలో 291 శ్మశానాలు ఉన్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌ పరిధిలో దాదాపు వెయ్యి శ్మశాన వాటికలు ఉన్నట్లు అంచనా. ఒక్కో శ్మశాన వాటికలో కాటికాపరులుగా కనీసం ముగ్గురు పనిచేస్తున్నారు. పిల్లలు పెద్దవారై కుటుంబాలుగా విడిపోయి వంతుల వారీగా ఈ కుల వృత్తిని చేసుకుంటున్నారు. 2008 వరకు ఇవి రెవెన్యూ పరిధిలో ఉండగా ఆ తర్వాత వీటిని జిహెచ్‌ఎంసికి బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్మశాన వాటికలను మున్సిపాలిటీలకు, గ్రామపంచాయతీలకు అప్పజెప్పారు. అప్పటి నుండి శ్మశాన వాటికల గురించి పట్టించుకోని జిహెచ్‌ఎంసి తాజాగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కాటికాపరులుగా పనిచేసే వందలాది బ్యాగరి కుటుంబాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తోంది. కాంట్రాక్టర్లకు దహన సంస్కారాలు, పూడ్చడానికి సంబంధించి రేట్లను కూడా జిహెచ్‌ఎంసి నిర్ణయించనుంది. దీంతో వంశపారంపర్యంగా పనిచేస్తున్న వందలాది మంది కాటికాపరులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది.
కాంట్రాక్టర్ల చేతిలో శ్మశానాలకు రక్షణ ఉంటుందా...!
శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఏ మేరకు రక్షణ ఉంటుందనేది అనుమానమే. ఇప్పటికే నగరంలో అనేక శ్మశాన వాటికలు కబ్జాలకు గురయ్యాయి. ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉన్నవి కూడా మిగిలే పరిస్థితి ఉండదు.
కాటికాపరులుగా 25శాతం మహిళలే
నగరంలో మహిళలు కూడా కాటికాపరులుగా సేవలందిస్తున్నారు. వీరి సేవలకు గుర్తింపు లేదు. భర్తలు చనిపోయిన మహిళలు ఆ వృత్తిని చేసి కుటుంబాలను పోషిస్తున్న వారు నగరంలో దాదాపు 25 శాతం మంది వరకు ఉన్నారు. సైదాబాద్‌, సీతాఫల్‌మండీ, అడ్డగుట్ట, కొత్తపేట తదితర శ్మశాన వాటికల్లో మహిళలు కాటికాపరులుగా సేవలందిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాంట్రాక్టీకరణతో వీరు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతారు. ఇప్పటికే కాచిగూడ, పురానాపూల్‌, బన్సిలాల్‌పేట, మారెడ్‌పల్లి, సంజీవరావునగర్‌ శ్మశాన వాటికలు అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అక్కడ కాటికాపరులు ఎప్పుడో వృత్తిని కోల్పోయారు. అయితే కొన్ని చోట్ల బ్యాగరులనే కూలీలుగా తీసుకుంటున్నారు.
ప్రమాదకర నిర్ణయం : సిపిఎం
శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం ప్రమాదకర నిర్ణయమని సిపిఎం హైదరాబాద్‌ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌ అన్నారు. శ్మశాన వాటికలను రక్షించి అభివృద్ధి పరచాల్సింది పోయి ఏదైనా ప్రైవేటుపరం చేయడమే జిహెచ్‌ఎంసి పనిగా పెట్టుకున్నట్లుందని అన్నారు. దీనివల్ల శ్మశాన వాటికలకు రక్షణ లేకుండా పోతుందని, మరో వైపు కాటికాపరులు జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ధరలు పెరిగాక శ్మశాన వాటికలకు ప్రమాదం ఏర్పడిందని, ఇప్పటికే అనేక శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయని, ఇప్పుడు ఉన్న శ్మశాన వాటికలు కాటికాపరుల కారణంగానే మిగిలాయని అన్నారు. ప్రైవేటుపరం చేయకుండా శ్మశాన వాటికలను పరిరక్షించేందుకు చర్యలు జిహెచ్‌ఎంసి తీసుకోవాలని, వాటిని అభివృద్ధి పరచాలని ఆయన కోరారు.
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి : కాటికాపరుల సంఘం
అభివృద్ధి పేరుతో శ్మశానాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కాటికాపరుల బ్యాగరీ సంఘం డిమాండ్‌ చేసింది. కాటికాపరి వృత్తిని నమ్ముకొని బతుకుతున్న బ్యాగరీ కుటుంబాల పొట్టగొట్టే విధానాలు మానుకోవాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.కిష్టయ్య, ఎం.శ్రీధర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వృత్తిని నమ్ముకొని బతుకుతున్న వారిని ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకున్నది లేదని, ఉన్న వృత్తిని కూడా దూరం చేసి దళితుల పొట్టకొట్టాలనుకుంటే సహించేది లేదని వారు హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం వల్ల కాటికాపరులు రోడ్డున పడితే శ్మశాన వాటికలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనా కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యుత్‌ దహన వాటికల ఏర్పాటును విరమించుకోవాలని, కాటికాపరుల, బ్యాగరుల వృత్తికి రక్షణ కల్పించాలని, కాటికాపరులకు గుర్తింపు కార్డులివ్వాలని డిమాండ్‌ చేశారు. శ్మశాన వాటికల అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని, శ్మశానాలను కాటికాపరులకే అప్పగించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కాటికాపరులకు, బ్యాగరులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కాటికాపరులుగా పనిచేస్తున్న వారందరికీ గౌరవవేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శవాల మీద వ్యాపారం చేయడమే : ఆర్‌.కిష్టయ్య
అభివృద్ధి పేర శ్మశాన వాటికలకు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం శవాల మీద వ్యాపారం చేసుకునే విధంగా ఉందని చంద్రాయణగుట్టకు చెందిన ఆర్‌.కిష్టయ్య అన్నారు. కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంతో జిహెచ్‌ఎంసికి ఆదాయం సమకూరుతుంది. కానీ దీనిపై ఆధారపడి బతుకుతోన్న కాటికాపరులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. ఇక కాంట్రాక్టర్లు శవాలను పూడ్చడానికి, దహనం చేయడానికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వసూలు చేస్తారని. శ్మశాన వాటికల అభివృద్ధి ఏమో కానీ ఆక్రమణలు, పెరిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు చనిపోతే వారి దహన సంస్కారాలు పూర్తి చేయడం గగనమైపోతుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే వసూలు చేస్తారనే నమ్మకం లేదు. డబ్బు చెల్లించలేని పేదలు చనిపోతే పరిస్థితి ఆందోళనకరం.
ప్రభుత్వ సహకారం లేకున్నా సేవలు... : ఎం.శ్రీదర్‌
కాటికాపరులకు సమాజంలో తగిన గుర్తింపు లేకపోయినా, ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందకపోయినా తాము అన్ని వర్గాల ప్రజలకు రాత్రనక, పగలనక సేవలు అందిస్తున్నామని సైదాబాద్‌కు చెందిన వృత్తిదారుడు ఎం.శ్రీదర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బొందలు తీయడం, కాడులు పేర్చడం, శవాన్ని తగులబెట్టడం, బూడిదను పోగు చేయడం, లాంటి పనులన్నీ చేస్తున్నామన్నారు. అనాథ శవాలకు ఉచితంగా దహన సంస్కారాలు చేస్తున్నామని తెలిపారు. పేదలు ఇచ్చింది తీసుకొని తమ పనిచేసుకుపోతున్నామని, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా రోజు కూలి కంటె ఎక్కువ గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్నామన్నారు. పిల్లలను చదివించుకోలేని దయనీయ స్థితిలో ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. శ్మశాన వాటికల్లోనే జీవనం సాగిస్తూ ప్రమాదాలను ఎదుర్కొంటూ సేవలం దిస్తున్న తమ తరహా సేవలు కాంట్రాక్టర్లు అందించడం అనుమాన మేనన్నారు.

6, అక్టోబర్ 2010, బుధవారం

కనువిందు చేస్తున్న నల్లమల అందాలు

  • పెరుగుతున్న సందర్శకుల తాకిడి
ఎత్తైన కొండలు, పచ్చనిచెట్లతో భూమికే తలమానికంగా ఉన్న నల్లమల అందాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. వాటిని చూస్తేనే తప్ప తనివితీరదు. పక్షుల కిలకిలారావాలు, ఎత్తైన కొండల మీదనుండి పారే జలపాతాలు, సెలయేర్లు చూపరులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. నల్లమలలో మల్లెలతీర్థం, సలేశ్వరం, లొద్ది తదితర ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో ఈ సుందర ప్రదేశాలు కనిపిస్తాయి.
శ్రీశైలం రహదారిలో..
నాగర్‌కర్నూల్‌ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో రంగాపూరం గ్రామం దాటగానే అడవి ప్రారంభమౌతుంది. ముందుగా ఉమామహేశ్వర దేవాలయం వస్తుంది. ప్రధాన రహదారి నుండి ఐదు కిలోమీటర్లు వెళ్తే ఈ దేవాలయం ఉంది. ఇది ఎత్తైన కొండల మధ్య ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి జలపాతాలు వేసవిలో సైతం పారుతుంటాయి. దీంతో ఇక్కడి నీటిని తాగి సాధువులు, వన్యమృగాలు, భక్తులు దాహం తీర్చుకుంటుంటారు. ఇదేదారిలో మన్ననూర్‌ తర్వాత 30 కిలోమీటర్ల దూరంలో లొద్దికి డొంక దారి ఉంటుంది. ఇది ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది. అక్కడ కిలోమీటరు వరకు కాలినడకన లోయలోకి దిగాల్సి ఉంటుంది. అడవి ప్రాంతం నుండి వచ్చే నీరు ఈ లోయలో పడుతుంది. అన్ని కాలాల్లోనూ పారే ఈ నీరే చెంచులు, వన్యమృగాలకు ఆధారం. ఇదే దారిలో మరో 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే సలేశ్వరం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. నడవడానికి ఏలాంటి పట్టూ ఉండదు. అంతా రాళ్లు, చెట్లు, నీటి ధారలు పడుతుండడం వల్ల జారుతూ ఉంటుంది కనుక జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ 200 అడుగుల ఎత్తు నుండి నీరు ఉధృతంగా కిందకు దూకుతూ చూడడానికి మనోహరంగా ఉంటుంది. ఇక్కడి నుండి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే మరో జలపాతం కనిపిస్తుంది. అదే మల్లెలతీర్థం. ఇది వటవర్లపల్లి నుండి తొమ్మిది కిలోమీటర్లు అడవిలోకి వెళ్తే వస్తుంది. ఎండాకాలంలో అంతగా నీరు లేకపోయినా వర్షాకాలంలో జలఉధృతి తీవ్రంగా ఉంటుంది. ఈ జలపాతాలు అడవి మధ్యన ఉండడం వల్ల ఇక్కడ ఏలాంటి సదుపాయాలూ ఉండవు. సందర్శకులు ఆహార పదార్థాలు వారి వెంటే తెచ్చుకుని తినాల్సి ఉంటుంది. వటవర్లపల్లి నుండి మరో 40 కిలోమీటర్లు వెళ్తే శ్రీశైలం ప్రాజెక్టు, 60 కిలోమీటర్ల వేళ్తే శ్రీశైల దేవస్థానం వస్తాయి.
యాత్రికుల తాకిడి
శ్రీశైల దేవస్థానానికి వచ్చే యాత్రికుల తాకిడికి ప్రధాన కారణం ప్రకృతి అందాలు. వీటిని ఆస్వాదించడానికి కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా సందర్శకులు వస్తుంటారు. అడవి సంపద, జలపాతాలు, వన్యమృగాలను చూసిన తర్వాతనే సందర్శకులు శ్రీశైలం వెళ్తారు. శ్రీశైలం ప్రాజెక్టు, నీటి ప్రవాహం, పవర్‌హౌజ్‌ చూడడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన టన్నెల్‌ పవర్‌హౌజ్‌ ప్రపంచంలోనే రెండవది. దీన్ని చూడడానికి విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
ప్రకృతిపై కన్ను
ప్రకృతి సిద్ధంగా ఏర్పడే జలపాతాలను చూడడానికి కూడా డబ్బులు చెల్లించాల్సిందే. ఏపి టూరిజం వారు ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రతి మనిషికీ ఐదు రూపాయలు, వెహికిల్‌కు 25 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. డబ్బులైతే వసూలు చేస్తున్నారు కాని వసతులు కల్పించడంలో టూరిజం శాఖ అధికారులు విఫలమయ్యారని సందర్శికులు విమర్శలు చేస్తున్నారు.
కనీస వసతులు లేవు
ఏపి టూరిజం వారు డబ్బులు వసూలు చేస్తున్నారు కాని ఏలాంటి వసతులూ కల్పించలేదు. స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు లేవు. ఒక క్యాంటిన్‌ లేదు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఇక్కడికి రావడానికి బస్సులు లేకపోతే నడిచి రావాల్సిందే. వాహనాలు కూడా ఏర్పాటు చేయలేదు. రహదారి అంతా ఎర్రటి దుమ్ము. బీటీ రోడ్డు లేదు. ఇవన్నీ లేకుండానే టోల్‌ఫీజు వసూలు చేయడం యాత్రికులను మోసం చేయడమే.
- మంగమ్మ, శ్రీశైలం యాత్రికురాలు.

ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్‌

 

  • యువకుని ఆత్మహత్య
  • అనాథలైన భార్యాబిడ్డలు
వారం వారం చెల్లించాల్సిన మైక్రో ఫైనాన్స్‌ అప్పు ఓ యువకుడి ప్రాణం తీసింది. అప్పుతీర్చే మార్గం లేక, తోటి వారి సూటిపోటి మాటలతో తీవ్ర మానసిక వేదనకు గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌ పంచాయతీ పరిధిలోని సంగాయిపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో నర్సాగౌడ్‌ (30) బలవంతంగా ప్రాణం తీసుకునానడు. భార్య లకీë నర్సమ్మ కథనం ప్రకారం... ఏడాది క్రితం వరకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండ లానికి వలసెళ్లి జీవనం సాగించారు. ఈ మధ్యే గ్రామానికి వచ్చాక కుటుంబ పోషణ కోసం వారం వారంచెల్లించే విధంగా మైక్రో ఫైనాన్స్‌ ద్వారా అప్పులు చేశారు. వీరు వలసెళ్లడంతో అధికారులు వీరికి రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్‌కార్డు లేక చిరునామా తెలిపేందుకు ఎలాంటి ఆధారం లేక గ్రామంలోని ఇతరుల పేరు మీద మైక్రోఫైనాన్స్‌ ద్వారా అప్పులు చేశారు. దీంతో పాటు ఇతర ప్రైవేటు అప్పులు కూడా ఉన్నాయి. మొత్తంగా లక్ష వరకు అప్పులున్నాయి. వాటిని తీర్చే మార్గంలేక ఇటు కుటుంబం పూటగడవక, మైక్రో ఫైనాన్స్‌ వారి ఒత్తిడి ఎక్కువవ్వడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కూలీ పని చేసి తెచ్చిన డబ్బులు కుటుంబ పోషణకే సరిపోయేవి కావు.

ఇక వారం వారం చెల్లించాల్సిన అప్పులు ఎలా చెల్లించాలిని పలు మార్లు తన భర్త నర్సాగౌడ్‌ చెబుతూ ఏడ్చేవాడని ఆమె రోదిస్తూ తెలిపారు. రెండు రోజుల క్రితం పిల్లలతో పాటు తాను పుట్టింటికి వెళ్లానని ఈలోగా ఇంత దారుణం జరిగిపోయిందని ఆమె భోరున విలపించారు. తల్లి నిద్రలో ఉండగా నర్సాగౌడ్‌ ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మరణంతో భార్యాబిడ్డలు అనాథలయ్యారు.