18, ఏప్రిల్ 2011, సోమవారం

శక్తి పీఠాల చరిత్ర

' శక్తి ' సినిమాలో 18 శక్తి పీఠాలు ఉన్నట్లు తెలిపారు. ఆ 18 ఎలా ఏర్పడ్డాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటి? ఆపేరెలా వచ్చిందని పలురువు మిత్రులు అడిగారు. అందరికీ తెలియజెప్పడం కోసం ఈ పోస్టును పెడుతున్నాను. పరిశీలించి తెలుసుకుంటారని ఆశిస్తూ...
ఈ మధ్య ఐదో శక్తి పీఠం జోగులాంబదేవాలయం (అలంపూరు)కు వెళ్లాను. అక్కడ శక్తిపీఠాల పూర్వాపరాలున్నాయి. వాటి ఆధారంగా ఈ పోస్టు పెడుతున్నాను. పార్వతీదేవిని హిందువులు ఆరాధించే దేవాలయాల్లో పురాణగాథలు, ఆధారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఎన్ని? ఏవి? అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అని, 51 అని, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. దీనికి ఒక పురాణగాథ ఉంది. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసేటప్పుడు అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ కూతురు, అల్లుడిని పిలువడు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయని) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడుతుంది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలువాలేమిటి?అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రథమ గణాలను వెంట బెట్టుకుని యాగానికి వెళ్తుంది. అక్కడ అవమానానికి గురవుతుంది. అవమాన్ని సహించలేక ఆమె యాగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేస్తాడు. కానీ సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మాని వేస్తాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ మృతదేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర పాదకులకు ఆరాధనా స్థలాలయ్యాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయని మాత భైరవుని (శివుని)కి తోడుగా దర్శనమిస్తుంది.
1. శాంకరీదేవి-శ్రీలంక:- ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పు ట్రిన్‌కోమలిలో ఉండొచ్చని నమ్మకం. 17వ శతాబ్ధంలో పోర్చుగీసు వారు ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో త్రికోణ శహపరస్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం పక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ కాళీ మందిరం ప్రసిద్ధమైనది.
2. కామాక్షిదేవి-కాంచీపురం, తమిళనాడు :- మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. శృంఖలాదేవి-ప్రద్యుమ్ననగరం, పశ్చిమబెంగాల్‌: ఇది కోల్‌కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులు లేవు. అయితే కోల్‌కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్‌ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణించబడుతోంది.
4. చాముండేశ్వరీదేవి-కొంచపట్టణం మైసూరు, కర్ణాటకలో ఉంది.
5. జోగులాంబదేవి - అలంపూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో తుంగ, భద్ర నదులు తుంగభద్రానదిగా కలిసే స్థలంలో ఉంది.
6. భ్రమరాంబికాదేవి-శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్‌:- కృష్ణానది తీరాన అమ్మవారు మళ్లికార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.
7. మహాలక్ష్మీదేవి-కొల్హాపూర్‌, మహారాష్ట్ర :- ఆలయంలో ప్రధాన దేవతా విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేశారు. అమ్మవారి తలమైన ఐదు తలల శేషుని చత్రం ఉంది. ప్రతి సంవ్సతరం మూడుసార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మిపడుతుంది.
8. ఏకవీరిక (ఏకరూపాదేవి), మాహుర్యం లేదా మహార్‌, నాందేడ్‌ జిల్లా మహారాష్ట్ర : - ఇక్కడ అమ్మవారిని రేణుకామాతగా కొలుస్తారు. షిరిడీ నుంచి ఈ మాతను దర్శించుకోవచ్చును.
9. మహాకాళి-ఉజ్చయిని , మధ్యప్రదేశ్‌:- ఇది ఒకప్పుడు అవంతినగరం అనబడే క్షిప్రానది తీరానుంది.
10. పురుహూతిక-పీఠిక లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్‌:- కుకుటేశ్వరస్వామి సమేతమై ఉన్న అమ్మవారు
11. గిరిజాదేవి-ఓడ్య, ఒరిస్సా:- జాజ్‌పూర్‌ నుంచి 20 కిలోమీటర్లు ఒరిస్సా వైతరణి నది తీరాన ఉంది.
12. మాణిక్యాంబ దేవి-దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్‌:- కాకినాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
13. కామరూపాదేవి- హరిక్షేత్రం, అస్సోం:- గౌహతి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రహ్మపుత్రనది తీరంలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
14. మాధవేశ్వరిదేవి- ప్రయాగ, అలహాబాదు, ఉత్తరప్రదేశ్‌:- త్రివేణి సంగమం సమీపంలో ఉంది. అమ్మవారిని అలోపిదేవి అని కూడా అంటారు.
15. వైష్ణవిదేవి-జ్వాలాక్షేత్రం-హిమాచల్‌ ప్రదేశ్‌:- కాంగ్రా వద్ద అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలం నుంచి వెలుగుతున్నాయి.
16. మంగళగౌరిదేవి-గయా, బీహారు:- పాట్నా నుంచి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది.
17. విశాలాక్షిదేవి-వారణాసి, ఉత్తర ప్రదేశ్‌లో ఉంది.
18. సరస్వతి దేవి- జమ్మూకాశ్మీర్‌:- అమ్మవారిని కీర్‌భవానీ అని కూడా అంటారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరహాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3 కామెంట్‌లు:

Indian Minerva చెప్పారు...

"ఆమె యోగాగ్నిలో భస్మమైంది"
"మృతశరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి"

ఈ రెండూ అంత సరిగ్గా పొసగట్లేదండీ. కొంచెం వివరించగలరా.

శివునిభార్య పార్వతికదా మరి ఈ సతీదేవి ఎవరు? ఆవిడే తరువాతిజన్మలో పార్వతీదేవా?

అక్షరదోషాలు సరిచేయగలరు.

karthik చెప్పారు...

thanks for the info.. that was very useful..

panuganti చెప్పారు...

ఇండియన్‌ మినర్వ గారికి ధన్వవాదాలు నేను కరెక్షన్స్‌ చూసుకోకుండా పోస్టు చేశాను. ప్రస్తుతం పోస్టును ఎడిట్‌ చేశాను. యోగాగ్ని కాదు యాగాగ్ని, పార్వతీదేవి అన్నా సతీదేవి అన్నా శివుని భార్యఅనే అర్థం వుంది. మీ నిశిత పరిశీలనకు వందనాలు. పోస్టులో ఉన్న లోపాలను సరి చేశాను. నాకోరిక మన్నించి మరోసారి చదవగలరు. అదేవిధంగా కార్తీక్‌ గారికి ధన్యవాదాలు.