24, ఏప్రిల్ 2013, బుధవారం

ఆకలిచావుల నియంత్రణకు పోరాటం

ఆహారం, పని, భూమి నినాదంతో ఉద్యమం
ఆర్థిక నిపుణులు డాక్టర్‌ సునీత్‌ చోప్రా
                     గోదాముల్లో నిల్వ ఉంచిన గోధుమలను అమెరికా, యూరప్‌ దేశాల్లో పందులు, పశువులకు దిగుమతి చేసుకునేందుకు అంగీకరిస్తున్న కేంద్ర సర్కార్‌ దేశంలోని పేద ప్రజలకు చౌకగా ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడడంలేదని అర్థశాస్త్ర నిపుణులు, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి డాక్టర్‌ సునీత్‌ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య శతజయంతి, వ్యకాస రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన 2013 ఏప్రిల్‌ 23న ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకులో ప్రజాశక్తి ప్రతినిధితో మాట్లాడారు.
                     గోదాముల్లో ముక్కిపోతున్న బియ్యం, గోధుమలను పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాలన్న సుప్రీం కోర్టు సూచనను స్వాగతిస్తున్నామన్నారు. సుప్రీం సూచనపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ ఉచితంగా ఇచ్చేందుకు చట్టం, రాజ్యాంగం ఒప్పుకోదన్న ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌, బొగ్గు, 2జి స్పెక్ట్రం లాంటి వేల కోట్ల కుంభకోణాలు చేయమని రాజ్యాంగంలో ఎక్కడ సూచించారని ప్రశ్నించారు. ఎన్నో అక్రమాలకు పాల్పడే నేతలు, పేదల ఆకలి తీర్చే విషయంపై రాజ్యాంగం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇక్కడి ప్రజలకంటే అమెరికాలోని పశువులకే విలువిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుభూములు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి, కరెంటు కోతలు, డీజిల్‌ ధరల పెరుగుదలతో దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ నష్టంతో దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పుల భారంతో ఏటా 33 లక్షల మంది సాగుభూములను విక్ర యించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో 50 శాతం మందికి సాగుభూమి లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని (రోటి, జమీన్‌, కామ్‌) తిండి, భూమి, పని కల్పించండి అన్న నినాదంతో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. కనీస అవసరాల సాధన కోసం సిపిఎం తరపున ప్రజలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పని దినాలను 250 రోజులకు పెంచి, రోజుకూలి రూ. 300 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా తొలుత 60 రోజులు పని కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం 32 పని దినాలకే పరిమితం చేయడం అన్యాయమన్నారు.పేదలకు బియ్యం, గోధుమలను కిలో రూ. 2 చొప్పున నెలకు 35 కిలోలివ్వాలని కోరారు. ఆహార కొరత తీర్చి పేదలకు సాగుభూములిస్తే దిగుబడులు ఆశించిన మేరకు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్‌లో భూసంస్కరణల కారణంగా అక్కడి రైతులు ఆసక్తిగా భూములను సాగు చేయడంవల్ల వరి ఉత్పత్తిలో హర్యానాను మించి పోయారని గుర్తు చేశారు. దేశంలో పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం రూ.5.83 లక్షల కోట్లను మాఫీ చేయడం గర్హనీయమన్నారు. పరిశ్రమలకు ఎన్ని రాయితీలిచ్చినా కార్మికులకు పని కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీల పేరిట కోట్లు గుంజే పారిశ్రామికవేత్తలు పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులను పెట్టుకోవడం సమంజసం కాదన్నారు. జెంషెడ్‌పూర్‌లో టాటా పరిశ్రమలు వందేళ్లుగా నడుస్తున్నాయన్నారు. పరిశ్రమలున్న సింగ్‌బుమ్‌ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. టాటా గ్రూపు ఇక్కడి వ్యాపారాలతో లాభాలు గడించి ఇంగ్లాండ్‌లో పెట్టిన కార్ల కంపెనీతో దేశంలో 84 మెడికల్‌ సంస్థలను స్థాపించవచ్చన్నారు. ప్రపంచంలో ఉన్న నల్లధనంలో అధిక శాతం భారతీయులదేనన్నారు. నల్లధనం పెరిగిపోవడం వల్లే దేశంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కేరళ తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్‌లోనే బలీయంగా ఉందని, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏప్రిల్‌ 28, 29, 30 తేదీల్లో జరిగే మహాసభలు దోహదపడతాయన్నారు.