31, మే 2011, మంగళవారం

'' ఆనాటి ఆ స్నేహమానందగీతం - ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం''

వనపర్తి ' తెలుగువాడ' పూర్వ విద్యార్థుల సమ్మేళనం
                మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి తెలుగు వాడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. 1977 -1984 బ్యాచ్‌ 7వ తరగతి ఎ, బి సెక్షన్ల పూర్వ విద్యార్థులు మంగళవారం (31-05-2011) వనపర్తి భగీరథ పంక్షన్‌హాలులో సమావేశ మయ్యారు. ఈ సమావేశానికి అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. సమావేశానికి వసంత్‌, వై.వెంకటేష్‌, కె.చంద్రుడు, మల్లికార్జున్‌ అధ్యక్షత వహించారు. '' ఆనాటి ఆ స్నేహమానందగీతం- ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం '' అన్న విధంగా హాజరయిన వారందరూ తమ అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు చంద్రకళ, సరోజనమ్మ, వనజ, జగదీశ్వరమ్మ, నిరీక్షణమ్మ, శశికళ, ఆనందం, బాలస్వామి, బసవపని, యోగానందం, రాములుశెట్టి, అప్పటి అటెండర్‌ సయ్యజ్‌ జలాల్‌ తదితరులను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ ఈ సమ్మేళనం అపూర్వం, అద్భుతమని కొనియాడారు. మరుపురాని ఈ సన్నివేశాన్ని వర్ణించడానికి భాష సరిపోదేమో అని అన్నారు. తాము చెప్పిన చదువుతో మీరంతా వివిధ స్థాయిలో సేవలు అందిస్తున్నారని, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. 7వ తరగతి విద్యార్థుల సమ్మేళనం జరగడం వనపర్తి చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పానుగంటి చంద్రయ్య, కె.కృష్ణయ్య, శాంతయ్య, గఫూర్‌, రాజేష్‌, అరుణ్‌, కిరణ్‌, యాదగిరి, లతీఫ్‌, జయప్రకాష్‌, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రమేష్‌, తదితర 50 మంది దాకా హాజరయ్యారు.

28, మే 2011, శనివారం

డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు జీవిత ప్రస్థానం

'అక్షర' సాహితీ సమాలోచన
ఆధ్వర్యం
యువభారతి, సాధన సాహితీ స్రవంతి , తెలుగు రథం, మానస ఆర్ట్‌ థియేటర్స్‌
నా జీవిత ప్రస్థానం

(ఇటీవల ఆయన చేసిన ప్రసంగం ఆధారంగా )
ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని ప్రసంగాలు, రచనలు చేయాలని కోరుతూ ......
వక్త : డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు, పెనుకొండ -515110
cel: 9440488600
యశఃకండూతి:
                 కళాశాల ప్రవేశం చేసే దాకా సాహిత్యం అంటే ఏమిటో నాకు తెలియదు. రచయితలంటే అప్పటి సమాజం 1954-74 మధ్యకాలంలో చూపే గౌరవం చూసి ఆ కీర్తి ఏ కొంతమేరయైనా మూట కట్టుకోవాలని ఆశించాను.


కీరితి లేనిచో వనమృగీతతి తుల్యుడు మానవుండు సం
స్కారవచః ప్రపాకము విశాల మనస్సొనగూడు కాన ఆ
కీరితి కోసమే తనువు కీడ్పడ జేయగ దీక్ష బూనితిన్‌
కీరసమంబునౌ నుడుల కేల్గవ వీణియమీటు తల్లికై
                                         (అవధాన వసంతం)
            ఈ యశఃకండూతియే అనంతరకాలంలో సాహిత్యలోకంతోడి సాన్నిహిత్యాన్ని నాలో పెంచింది.
నా జీవితంలో సాహిత్యవికాసం ఒక క్రమగతిలో సాగలేదు. ఏవో ప్రేరణాంశాలు, అవకాశాలు నన్ను అటుగా ఈడ్చుకొని వెళ్లాయి. కలగాపులగంగా వివిధ సాహిత్యప్రక్రియల్లో తలదూర్చి పరిశ్రమిస్తూ వచ్చాను. పట్టు సాధించేకొద్దీ కొన్నింటిని మానుకుంటూ మరికొన్నింటిని బలమైన ఆలంబనగా చేసుకుంటూ నిలబడ్డాను.
బీజావాపం:
           నా ప్రాథమిక విద్య మా నాన్న దగ్గరే. ఆయన ఉపాధ్యాయుడుగా నాతో కృష్ణ, భాస్కర, సుమతి, వేమనశతక పద్యాలు ఓ వందదాకా ఐదవ తరగతి ముగిసేలోపుగా కంఠస్థం చేయించాడు. పెద్దబాలశిక్ష చదివించాడు.
               నాటి ఉన్నత పాఠశాలల్లో అక్షరజీవులుగా మమ్మల్ని మలచటానికి ఎన్నెన్నో పోటీలు నిర్వహించే వారు. పద్యధారణలో ఒకరి తరువాత ఒకరు, ఒకరు చెప్పిన పద్యం మరొక్కరు చెప్పకుండా నిలబడవలసి వచ్చేది. పద్యపఠనంలో పూర్వకవుల గ్రంథాల్లో ఏ పుట తెరిచి చూపిస్తే అక్కడి పద్య గద్యాలను చదువవలసి వచ్చేది.
ఒక పిరియడ్‌లో మొదటి 20 నిమిషాలు కొన్ని గద్య గ్రంథాలను మౌనంగా చదువుకొమ్మనే వారు. సాధారణంగా అవి కథలో, నాటకాలో, మహాత్ముల జీవితచరిత్రలో అయి ఉండేవి. చివరి 20 నిమిషాలల్లో చదివినదానిలో మాకు అర్థమైన, గుర్తున్న, నచ్చిన అంశాలను పేర్కొంటూ కొన్ని వాక్యాలను వ్రాయుమనే వారు.
              వ్యాసరచనలో శీర్షిక అప్పటికప్పుడే నిర్దేశించే వారు. ముందుగా ఆలోచించుకోవడానికో , తయారుచేసికొని కంఠస్థం పట్టి రావటానికో అవకాశం ఉండేది కాదు.
                 కళాశాలలో సారస్వతసంఘ ఆధ్వర్యంలో తరచు ప్రసిద్ధ కవిపండితుల ప్రసంగాలు ఉండేవి. ఊళ్లలో నాటకసమాజాల వాళ్లు మూడు నెలలకు ఒక్కమారైనా తప్పక పద్యనాటకాలు ప్రదర్శించే వాళ్లు. ఆసక్తిగా వీటికి హాజరయ్యే వాడిని. వీటిలోని ఆకర్షణాకోణాలు ఏ కొన్నైనా నాపై అజ్ఞాతముద్ర వేశాయనడంలో సందేహం లేదు.
తోడుగా అప్పటి బోధనా పద్ధతులు, పరీక్షా విధానాలు సృజనాత్మకతను పెంచేవిగా ఉండేవి. మా అధ్యాపకులు ఒక్కొక్క పాఠానికి అనేకమైన ఉపశీర్షికల క్రింద ఇస్తూ ఉండిన పుటల కొలది' నోట్స్‌' భాషపై పట్టు సాధించడానికి కారణమయ్యేది. పరీక్షల్లో పాఠ్యాంశాలలో లేని క్రొత్త పద్యాలకు తాత్పర్యం వ్రాయవలసి వచ్చేది. అట్లే ఇచ్చిన సుదీర్ఘగద్యం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం వ్రాసేవాళ్లం.
            పై నేపథ్యం పద్యంపై ప్రీతి పెంచుకోవడానికి, అవగాహనలో ఒదిగివచ్చిన వాటికి చక్కని వ్యాసరూపం ఇవ్వటానికి, ధైర్యంగా వేదికపై ప్రసంగించటానికి తగిన బీజాలు వేశాయి.
వ్యాసవికాసం:
             13వ ఏట నాలో రచయిత తయారైనాడు. నేను చదివే పాఠశాలలో, నివసించే వసతి గృహంలో, వ్యాసరచనల పోటీల్లో బహుమతులు నావే. 10వ తరగతిలో 'అస్పృశ్యతా నివారణ' ను గూర్చి ఒక వ్యాసం వ్రాసి మా పాఠశాల వార్షికసంచికకు ఇచ్చాను. దాని సంపాదకులు '' స్వాతంత్య్ర వచ్చి పదేళ్లు దాటింది. ఇంకా ఎక్కడుంది అస్పృశ్యత? బుద్ధి లేకుంటే సరి పట్టు పట్టు'' అంటూ కాగితాలను విసిరి కొట్టారు. అది నాలో పట్టుదలను పెంచింది. సహనంతో కార్యం సాధించుకోవలసిన దీక్షను గుర్తు చేసింది.
             పౌర గ్రంధాలయం వెళ్లి ఆసక్తి గల గ్రంధాన్ని తీసుకొనే వాడిని. దానిని ఆద్యంతం చదవకుండా పీఠిక తప్పనిసరి చదివేవాడిని. నాకంటే ముందే దాన్ని చూచిన పాఠకులు ఆ పుటల్లో ఎక్కడైనా క్రీగీటులు గుర్తులు ఉంచారా? స్పందనలు వ్రాశారా? అని చూచి వాటిపై దృష్టి నిలిపి దానికి కారణాలు అన్వేషించే వాడిని. దీనివల్ల తక్కువ కాలంలో విజ్ఞానం పెరిగేది. వ్రాతకు బలం చేకూర్చే అనేక విషయాలు తెలిసివచ్చేవి. ఈ విధంగా కూర్చుకొన్న రచనాసామర్థ్యం తరచూ చుట్టూజరిగే చాల అసంబద్ధతలపై కరపత్రాలు తయారు చేసి పంచేదాకా వెళ్లింది. నా ప్రయత్నాన్ని ప్రత్యర్థులు వమ్ముచేస్తూ రావటంతో ఆ విధానం మానుకున్నాను.
              మా కళాశాలలో మతసామరస్యంపై , పోతన భాగవతంపై విద్యార్థులకు ఏటేటా నిర్వహిస్తూ ఉండిన ధర్మనిధి పురస్కారాల వ్యాసరచన పోటీలలో గెలుపొందినాను. కళాశాల వార్షికసంచికకు 'అష్టావధానం' వ్యాసం ఇచ్చాను. అధ్యాపకులమధ్య, ఉపాధ్యాయులమధ్య, మంచి గుర్తింపు వచ్చింది.
                     తెలుగు పండితుడుగా, ఆంధ్రభాషోపన్యాసకుడుగా స్థిరపడిన దశలో నా జీవన మార్గదర్శి 'విద్యావిభూషణ' శ్రీ భోగిసెట్టి జూగప్పగారి జీవితచరిత్ర వ్రాశాను. పలువురి గ్రంథాలకు వ్రాసిన ముందుమాటలు 'సమీక్షా స్రవంతి' పేర వెలువడ్డాయి. చిత్రకవి శ్రీ రాప్తాటి ఓచిరెడ్డి, సాయిలీలాగుచ్ఛ కావ్యకర్త శ్రీ యన్‌. యం . సహాయాచారి, శతావధాని శ్రీ దోమావేంకటస్వామిగుప్తల సాహిత్య సృజనపై సుదీర్ఘ వ్యాసాలు వ్రాశాను. ఇవి 'సమారాధన'లో చేరాయి. నా ఆకాశవాణి ప్రసంగాలు 'ప్రసార కిరణాలు'గా , సూక్తి ముక్తావళులు, 'ప్రత్యూష పవనాలు'గా ముద్రణలో వచ్చాయి. పోతన భాగవతంపై ప్రత్యేక శ్రద్ధతో పరిశ్రమించిన కారణంగా ''భాగవత సౌరభం'' వెలువడింది. మాజీమంత్రి శ్రీ కొత్తపల్లి జయరాం సౌజన్యంతో ముద్రించి అమూల్య ప్రసాదంగా ముముక్షువులకు పంచుతున్నాను.
అనువాద వికాసం:
              తిరుమలతిరుపతి దేవస్థానంవారి పోతనభాగవతం ప్రాజెక్టునుండి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసికోదలచి తృతీయస్కంధానికి సరళగద్యానువాదం చేశాను. దీని ప్రధాన సంపాదకులు డాక్టర్‌ కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి మున్నుడిలో '' ఆశావాది ప్రకాశరావు అష్టావధాన కళలో ఆరితేరినవాడు. వినయభూషణుడు, మధురభాషణుడు. వీరి అనువాదం సరసంగా సాగింది'' . అన్నారు. ఆంగ్లంలో ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌, రచించిన 'సిటీ నైట్‌ పీస్‌' ను ' చీకటి కోణం' శీర్షికతో వచన కవితగా అనువాదించాను. పుట్టపర్తి సాయిబాబాగారి సూక్తులకు 'విభూతిగీత' పేర పద్యరూపం ఇచ్చాను.
పరిశోధనా వికాసం:
                       తాళ్లపాక అన్నమాచార్య పౌత్రుడు అన్నయ రచించిన 'చెల్లపిళ్లరాయచరిత్రము' అనే అముద్రిత యక్షగాన తాళపత్రప్రతి పరిశీలించి , క్రిమిదష్టభాగాలను పూరించి, కవి కాలాదులు నిర్ణయిస్తూ విపులమైన పీటికతో ప్రచురించాను. శ్రీ రాప్తాటి నిరోష్ఠ్య కృష్ణశతకానికి లఘుటీక వ్రాసే అవకాశం లభించింది.
పిహెచ్‌. డి., పట్టాకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పేరు నమోదు చేసికొని కొన్ని అవాచ్య సంఘనటలమధ్య విరమించాను. కొన్నేళ్ల విరామంతో శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలోనూ చేరి సరపడని సంగతులు తలెత్తటంతో దానిఆశావదులుకొన్నాను. 'అంతకంటె మించిన డిగ్రీ రాకుండా పోతుందా' అని యథాలాపంగా పలికిన నా మాటను దైవం నెగ్గించాడు. నా 56వ యేట పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ (డి.లిట్‌) లభించింది.
                       ఈ పరిశోధనా ప్రస్థానంలో సోదరతుల్యుడు శ్రీ గంగప్పగారి చెన్నయ్యను కలుపుకుని ఎఱ్ఱనపీఠం వారి ప్రకటనకు స్పందించి ''ప్రహ్లాద చరిత్ర-ఎఱ్ఱన, పోతన తులనాత్మక పరిశీలన'' అనే గ్రంథం వ్రాసి ఉత్తమ సిద్ధాంతగ్రంథ రచనాపురస్కారం పొందాము.
                  రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులకు సమర్పించిన కొన్ని పరిశోధనా పత్రాలు 'సువర్ణ గోపురం' గా పుస్తకాకృతి పొందినాయి.
కవన వికాసం:
           నా 15వ యేట అప్పటికి నాకు తెలిసిన ఛందోవిజ్ఞానంతో పద్యాలు వ్రాయాలన్న ఆలోచన కలిగింది. అంతలోనే మా నాన్న వ్రాసి ఎవరికీ చూపకుండా తన జేబులోనే భద్రపరుచుకొన్న కొన్ని పద్యాలను ఆకస్మికంగా చూచాను. ఆ తండ్రి కొడుకుగా పద్యరచనలో పేరు నిలుపుకోవాలన్న ఆశ తలెత్తింది.
ఒకవైపు సినిమాబాణిలో పాటలు వ్రాస్తూ, మరో వైపు చిటిపొటి పద్యాలు అల్లేవాడిని. మరికొన్ని తెలిసిన వాళ్ల పెళ్లిళ్లకు, పండుగలకు శుభాకాంక్ష రూపంగా అందించే వాడిని. ఇంకాకొన్ని పెద్దలను గౌరవించే సందర్భాలకు స్తుతిరూపంగా ఉండేవి.
             తెలుగు పండితునిగా విద్యార్థుల కోర్కె తీర్చడానికై తరచూ చెప్పుతూ వచ్చిన ఆటవెలది పద్యాలే వరదరాజు శతకం. ఇందులో చవర దశావతారస్తుతి ఉంది. ఈ శతకానికి '' చదివినాడ వరద శతకమ్ము సకలమ్ము, కరగినాడ నీదు కైత పసకు, కలదు నీకు ఆంధ్రకవికోటిలో పీట, వలదు జంకు వినయవత్‌ ప్రకాశ'' అని శ్రీ తుమ్మల సీతారామమూర్తిచౌదరి గారు దీవించారు. డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని, శ్రీ చర్లా గణపతిశాస్త్రి వగైరాల అభినందనలు అందుకొన్నాను. తర్వాతి కాలంలో ఆశతకమే మకుట విరహితంగా 'లోకలీలాసూక్తం' గా రూపు దిద్దుకొనింది.
               మూడు సంవత్సరాల పండితవృత్తి వదిలి ఎం.ఏ.,లో చేరాను. ఈ సమయంలో అవధాన గురుదేవులు డా|| సి.వి.సుబ్బన్న శతావధాని వెంట అవధానసభలకు వెళ్లుతూ వారి స్తుత్యాత్మకంగా చెప్పిన పద్యాలే ' పుష్పాంజలి ' పేర వెలుగు చూచింది. ఇది ఆకృతిలో లఘువైనా కవితా విషయికంగా , గురుభక్తి గుబాళించిన కారణంగా , అలఘుత్వాన్ని పొందిందనీ ప్రశంస నందింది. అలా నాకు శుభాశంస అందించిన సాహితీ మేరువులు డా|| మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, డా|| దాశరథి కృష్ణమాచార్యులు , డా|| సి.నారాయణరెడ్డి వగైరాలు.
ఎం.ఏ., ముగిసి డిగ్రీకళాశాలలో పనిచేస్తున్న సమయంలో '' మెరుపుతీగలు'' పద్య ఖండికల సంపుటి ముద్రితమైంది. దీనిని కవితా గురుదేవులు డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యుల వారికి అంకితమిచ్చాను.
                నేను ప్రధానంగా పద్యజీవినే. అయినా వచనకవితను ఏనాడు నిరసించలేదు. నినాదప్రాయంగా కాకుండ హృదయపూర్వకంగా వెల్వడే ఏ చిన్నమాటనైనా ఆదరించేవాడిని. అడపాదడపా నేనూ రసాత్మక వాక్యాలను వ్రాయడానికి ఆసక్తి చూపేవాడిని. కళాశాల వార్షికసంచికలో 'నీవు-నేను' అనే నా వచనకవిత అచ్చయింది. ఒక దశాబ్ది పిమ్మట ఆదే కవిత డా|| కమల్‌నాథ్‌పంకజ్‌ గారిచే హిందీభాషలోనికి అనూదితమై గుర్తింపు పొందింది.
               నేను సాహిత్యవిభాగ కార్యదర్శిగా అనంతపురంలో రాయలసీమ రచయితల మహాసభలు నిర్వహించాను. కొందరు నన్ను అనభ్యుదయవాదిగా , నేను చేపట్టే సాహిత్య కార్యక్రమాలన్నీ శవ సమాలోచనలుగా చిత్రించి కరపత్రాలు సభలో పంచారు. వెంటనే స్పందించి వారికి సమాధానంగా ఆశువుగా చెప్పిందే 'రొయ్య మీసాలు' వచనకవిత. అప్పటి నుండి విక్రమించి ఆకాశవాణి, తదితర సంస్థలు, శ్రోతల సమక్షంలో నిర్వహించే కవిసమ్మేళనాలకు ఒకమారు పద్యం, మరొకమారు వచనం కాన్క చేసేవాడిని. ఈ వచనకవితల సంపుటియే '' అంతరంగ తరంగాలు''. దీనిపై స్పందిస్తూ సుప్రసిద్ధసాహిత్య విమర్శకులు శ్రీ ఆర్‌.యస్‌. సుదర్శనంగారు '' తెలుగు మహాకావ్యాలను అధ్యయనం చేయడం, ఆధునికుల ప్రతిభకు అభివ్యక్తికి దోహదం చేస్తుందే తప్ప గతానికి బందీల్ని చేయదు-అన్న సత్యానికి ఆశావాది ప్రకాశరావు వ్రాసిన కవితలు మరో తార్కాణం'' అన్నారు. డాక్టర్‌ యన్‌.శాంతమ్మ గారు కూడా దీనిపై 'ఆశావాది కవితాతరంగం' పేరిట విశ్లేషణాత్మక వ్యాససంపుటి ప్రచురించి తన సౌమనస్యాన్ని చాటుకున్నారు.
          మిత్రులు శ్రీ దోర్నాదుల వరదరాజులు గారి షష్టిపూర్తి సందర్భంగా వారి అభిమతం మేరకు మూడుగంటల వ్యవధిలో 34 వృత్తాలతో ఆశువుగా చెప్పింది 'రామకథా కలశం'. శిష్యుడు జె. నీలకంఠరాయుడు తృప్త్యర్థమై వ్రాసింది 'పార్వతీశతకం'. శ్రీశ్రీశ్రీ రామకోటిరామకృష్ణానందస్వామి వారి భావాలకు పద్యరూపం ఇచ్చింది 'ఆత్మతత్వ ప్రబోధం'. జీవితంలో స్థిరపడే వధూవరులకు సందేశాత్మకంగా ఆశీర్వాదరూపంగా ఇచ్చిన చిరు కానుకయే 'దీవన సేనలు'.
అవధాన వికాసం
                 నేను మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉంగానే శ్రీ సి.వి. సుబ్బన్న శతావధాని గారి అష్టావధానం చూచాను. పేదరికం కారణంగా ఆ మార్గంలో పరిశ్రమిస్తే కీర్తితో పాటు నాలుగు డబ్బులూ వస్తాయనే ప్రలోభం తలెత్తింది. అప్పటికే పద్యరచనలో కొంతమేర పరిశ్రమించిన నేను, కొన్ని సందర్భాలలో నాకు నేనుగా, మరికొన్ని సందర్భాలలో స్నేహితుల ద్వారా, రకరకాల నిబంధనల్ని విధించుకొని వాటికి లొంగి పద్యం అల్లటమేకాక ధారణపట్టి అప్పజెప్పడం నేర్చుకొన్నాను.
                 ఈ లోగా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎండకాలం సెలవుల్లోవెళ్లి ఏలూరులోని ఫ్లడ్స్‌ కంట్రోల్‌ సర్కిల్‌లో గుమాస్తాగా చేరాను. అక్కడ శ్రీ బస్వా సింహాద్రి అప్పారావు గారి సాహచర్యంలో మూడు నెలలపాటు చేమకూర వేంకటకవి విజయవిలాసం అధ్యయనం చేశాను. అది నా పద్యాలకు మరింత వెలుగునిచ్చే అచ్చు తెనుగు ముచ్చట్లను పదబంధాలను సమకూర్చింది.
             ఉద్యోగం వదిలి 2వ యేడు కళాశాలలో అడుగు పెట్టాను. ఎన్నో సంఘటనలు మీద మీద తారసిల్లుతూ వచ్చాయి. రిటైర్డు కలెక్టర్‌ శ్రీ బి.జూగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారికి స్వాగతపద్యాలు సమర్పించి 'బాలకవి'గా అమృతాశీర్వాదాలు అందుకొన్నాను. తెలుగు శాఖ పక్షాన ఏర్పాటైన శ్రీ గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారి అష్టావధానంలో పృచ్ఛకస్థానం పొందాను. భువన విజయంలో నేపథ్య పద్యగాయకుడిని అయ్యాను.
             ఇవన్నీ ఒకరకమైన బలాన్ని తృప్తిని కలిగించడంతో ఆ యేడే కేశవవిద్యానికేతన్‌ (శివశంకరం హాస్టల్‌)లో స్నేహితుల మధ్య 02-10-1963న గాంధీజయంతి సందర్భంగా మొదటి అష్టావధానం జయప్రదంగా ముగించాను. ఈ వార్త మా తెలుగుశాఖ హెడ్‌ డాక్టర్‌ నండూరి వారి చెవిలో పడింది. వారు నన్ను 'డిపార్ట్‌మెంట్‌'కు పిలిపించి ఉపన్యాసకుల సన్నిధిలో సమస్యాపూరణ పరీక్ష నిర్వహించారు. వారిచ్చిన 'ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికిన్‌'. అనే సమస్యకు నా పూరణ. ప్రశ్నలపై వడి ప్రశ్నలు, ప్రశ్నించెడి తనదు భర్త భావం చేమో ప్రశ్నించును, తన యెదలో ''ప్రశ్నకు ప్రశ్నయె జవాబు'' భామిని పలికెన్‌'.
             నా పూరణతో సంతోషించి నీకు ధైర్యం ఉంది. ఎక్కడైనా నెట్టుకొస్తావు. నేటి నుంచి నీవు ఆసాదివి కావు. ఆశావాదివి అని ఆశ్వీరదించారు. అప్పటినుండి నేను ఆసాది ప్రకాశరావుగా కాకుండా ఆశావాది ప్రకాశరావును అయ్యాను. నిషేధాక్షరిలోని మెలకువలను నాకు నేర్పవలసిందిగా శ్రీ గాడేపల్లి వారిని కుదిర్చారు నండూరువారు. వారి అంతేవాసిత్వంలో ఒక్క సంవత్సరం కూడా గడవకుండానే ఆ ఇరువురు బదిలీ అయ్యారు. నేను నా వికాసానికి కొండంత అండను కోల్పోయాను.
             మూడవయేడు చదువు రకరకాల కష్టాలమధ్య ముగించుకొని శిక్షణలేని తెలుగు పండిత వృత్తిలో చేరి శ్రీ సి.వి. సుబ్బన్న శతావధానిగారి గురుత్వం సంపాదించాను. వారి అవధానసభలకు వీలు కలుగజేసికుని హాజరయ్యేవాడిని. వారి వెంట ప్రయాణిస్తూ కొన్ని, ఉత్తరాల ద్వారా మరెన్నో , సందేహాలు తీర్చుకొనేవాడిని. శ్రీ సి.వి.సుబ్బన్నగారి ద్వారా నా అవధాన సువిధానానికి బలమైన పునాదులు పడ్డాయి.
                నా 19వ యేట ప్రారంభించిన అవధానం 26 వసంతాల పాటు నిరాఘాటంగా విస్తరిల్లింది. రాష్ట్రమంతటా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలోనూ, న్యూఢిల్లీలోనూ 171 అవధానాలు చేశాను. అవధాన పద్యాలను జారిపోనివ్వకుండా భద్రపరిచి ఐదు సంపుటాలుగా ఆంధ్రసరస్వతికి కానుక చేశాను. నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానమే. అయినా పెరుగుతున్న వయస్సుతో పాటు తరుగుతున్న ధారణ, నిరంతర ప్రయాణాలతో అనుకున్న ఎన్నో రచనలు సకాలంలో ముగించలేకపోవటం, ఉద్యోగంలో రాజీధోరణి అవలంబించలేక అనారోగ్యాన్ని కోరి తెచ్చుకోవటం, ఉత్సాహంగా అవధాన రంగప్రవేశం చేస్తున్న ఆశావహులైన కొందరు యువకులకు అవకాశాలు కల్పించాలన్న ధ్యేయం-అన్నీ కలిసి 55వ యేట 1999 ఉగాది నాడు అవధానాలకు మంగళం పాడేటట్లు చేశాయి.
                ఈ సందర్భంలో ఒకమాట చెప్పాలి. మాది ఆసాది వృత్తి. మా పూర్వులు గ్రామదేవతా పూజారులు. ఆయా దేవతలపై, పెద్దలపై జాతర్లలో ఆశువుగా పాటలు కట్టేవారు. ఆ పాటయే సంప్రదాయసాహిత్యం అధ్యయనంచేసి, అందులో శ్రద్ధ కనుబరచిన నా దగ్గర ఆశుపద్యమైంది. ఆ ఆశువు మరొకొన్ని అదనపు జాగ్రత్తలతో అవధానానికి దారితీసింది. ఈ విషయాన్నే ఒక అవధాన సభలో ఇలా చెప్పాను.
గ్రామాలన్‌ గల దేవతా కథనముల్‌ గానంబునన్‌ దీర్చుచున్‌
రోమాంచంబును గూర్చి కాన్కలుగొనే ప్రోద్యత్కులాచారమే
ధీమంతుల్‌ కొనియాడ పద్యయయి సందీపించె నా వాక్కునన్‌
శ్రీమద్దివ్య వధాన ముఖ్యగురువౌ శ్రీ సీ వి సుబ్బన్నచేన్‌
                                       (అవధాన కళా తోరణం)
సాహిత్యసేవా వికాసం:
        నేను బదిలీపై ఎక్కడికి వెళ్లినా అక్కడి సాహితీకళాప్రియత్వంగల వారిని కూడగట్టుకొని, సాహితీ ప్రచార ప్రోత్సాహాలకు అనువైన సంస్థ స్థాపించి, అందులో క్రియాశీలక పాత్ర పోషించేవాడిని. పాఠశాల విద్యాభ్యాసంలో, వసతిగృహ సాంస్కృతికవిభాగ కార్యదర్శిగా, కళాశాలలో ఆంధ్ర సారస్వత సంఘ కార్యదర్శిగా, నా అనుభవాలు సంస్థల ఆశయాలను సఫలీకృతం చేయటానికి కొంత ఉపకరించాయి.
       1974లో అనంతపురంలో కొందరు సుహృత్తుల తోడ్పాటుతో స్థాపించింది రాయల కళాగోష్ఠి. ప్రధాన కార్యదర్శిగా 15 సంవత్సరాలు సంస్థకు సేవలందించాను. 'గోష్ఠి అంటే ఆశావాది' అనే ప్రచారం ఊపు అందుకొనింది. పుస్తక ప్రచురణ, గ్రంథావిష్కరణ, కవి సమ్మేళనాలు, కావ్య పరిచయాలు, సాహిత్య మూల్యాంకనాలు, వైతాళికుల సంస్కరణలు, అష్టావధానాలు, ముఖాముఖి చర్యలు- ఇవి మేము చేపట్టిన కార్యక్రమాలు. సామర్థ్యం గల యువకుల్ని వెదికి తెచ్చి ఆయా సాహిత్యకార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసేవాళ్లం. అలా తయారైన వాళ్లు నేడు మా జిల్లా సుప్రసిద్ధులుగా ఉన్నారు.
              ఆం.ప్ర. సాహిత్య అకాడమీ రజతోత్సవసంచికలో 'తెలుగులో సాహిత్యపరిశోధన-సంస్థల పాత్ర' అనే వ్యాసం వ్రాస్తూ డాక్టర్‌ కె గోపాలకృష్ణారావు 'అనంతపురంలో స్థాపించబడిన రాయల కళాగోష్ఠి తెలుగుభాషాసాహిత్యములకు సంబంధించిన అనేకాంశములపై చర్చలు, సమావేశములు నిర్వహించుచున్నది. ఈ వేదికనుండి ప్రముఖులొనర్చిన ఉపన్యాసములు గ్రంథరూపమున వెలువడునని సహృదయలోక మెదురుచూచుచున్నది' అన్నారు.
             గుంతకల్లులో భువనవిజయము శారదాపీఠము అధ్యక్షుడుగా అష్టదిగ్గజ కవుల సాహిత్య సృజనపై విశ్లేషణలే కాక. పద్యకవులకు పెద్దపీట వేసి కవితాశిక్షణ తరగతులు నిర్వహింపబడినాయి.
        పెనుగొండలో ఘనగిరి సాంస్కృతికమండలి ప్రధానకార్యదర్శిగా పట్టణం నడిబొడ్డులో శ్రీకృష్ణదేవరాయ విగ్రహప్రతిష్ఠాపనకై సఫలప్రయత్నం చేశాను. సుప్రసిద్ధ కళాకారుడు శ్రీ సి.యన్‌ . వెంకటరావుగారి తైలవర్ణ చిత్రాలప్రదర్శన, విద్యార్థుల నేత్రావధానాదులు, కళావిభావరులు నిర్వహింపజేశాను.
        ఆంధ్ర పద్యకవితాసదస్సు అధ్యక్షుడుగా, తిరుమల తిరుపతి దేవస్థాన గ్రంథనిపుణుల మండలి సభ్యుడుగా, అజ్ఞాతకవులకు గుర్తింపు నివ్వడంలో కృతకృత్యుడనయ్యాను. ఆం.ప్ర సాహిత్య అకాడెమీ కార్యవర్గసభ్యుడుగానూ సేవల్ని విస్తరించాను. ప్రతి సంస్థలోనూ ఇతరసభ్యులతో కలిసిపోయి, కార్య సాధనయే ధ్యేయంగా నడుచుకోవటం వల్ల ఎందరిలోనో చైతన్యం నింపటం సాధ్యమైంది.
               నేను ప్రధానంగా భాషాజీవిని. కవుల సాంగత్యంలో పండిత సేవలో వినమ్రంగా ఉంటాను. చూపోపని వారు తప్ప అందరూ నన్ను అభిమానించారు. వివిధ వేళల్లో నాపై కవితల సుగంధాలు జల్లారు. దానికి సాక్ష్యంగా శ్రీశాంతినారాయణ, కల్యాణవాణి, శ్రీ సి రామసుబ్బారెడ్డి, అక్షర కిరీటం, ఆశావాది, అనే సంకలన గ్రంథాలు నిలుస్తాయి. కృతిపోషక సామర్థ్యం నాలో లేకున్నా వారే ముద్రణాభారం వహించి శ్రీ బెళ్లూరి శ్రీనివాసమూర్తి, శ్రీ చెప్యాల రామకృష్ణారావు, శ్రీ ఎంపి జానుకవి వంటి ప్రసిద్ధులు తమ గ్రంథాలను నాకు అంకితమిచ్చారు. నాపై ప్రేమామృతం కురిపించారు. స్నేహశీలురు నా గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహాయం చేశారు.
       భువన విజయంలో పెద్దన పాత్రధారిగా కృత్రిమ గండపెండేరం పండిన నా వామ పాదానికి, అత్యాశ్చర్యకంగా 2008 ఆగస్టు 10న విజయనగర రాజుల రెండవ రాజధానియైన పెనుకొండలో శ్రీ కుంచం అశ్వత్థయ్య సౌహృద సాక్ష్యంగా స్వచ్ఛ స్వర్ణగండ పెండేర ప్రదానం జరిగింది.
           నిత్య సాహిత్య వ్యవసాయినై ప్రొద్దు గడిపే వాడిని కావటంతో నాపై విశ్లేషణాత్మక సాహిత్య వ్యాసాలు అనేకం వెలువడినాయి. సాహితీ లోకం అనేక పురస్కారాలతో బిరుదాలతో నన్ను మన్నించింది. శ్రీమంకాల రామచంద్రుడు నా సాహిత్యాన్ని అనుశీలనం చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందాడు. సిద్ధాంత గ్రంథాన్ని కూడా ముద్రించాడు. శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా, విశ్వవిద్యాలయాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. నన్ను అనుసరిస్తున్న అవధానులు ఆముదాల మురళీ, లోకా జగన్నాథశాస్త్రి, నా కీర్తిని పెంచుతున్నారు. ఉత్తమ బోధకులు, పాలకులు కవులు, పత్రికల నిర్వాహకులు అయిన శిష్యులు గణనీయంగానే ఉన్నారు.
       నిర్ద్వంద్వంగా నాది బహుముఖీనమైన కృషి, అన్నింటానేనున్నానని చాటుకోగలిగానే తప్ప, ఎందులోరే నా ప్రత్యేకతనో, ప్రగాఢతనో చాటుకున్నానని అనలేను. నేను సాహిత్యానికి చేసిన దానికంటే సాహితీలోకం నాకు చేసిందే ఎక్కువ. నేను నిబద్ధత కలవాడిని కాను. ఆయా సందర్భాలు ఎటు ఈడిస్తే అటుగా వెళ్లుతూ అక్కడ నన్ను ప్రతిష్టించుకొనే ప్రయత్నం చేశాను. సాహిత్యానికి దూరంగా బ్రతుకలేని బలహీనత నా నరనరాల్లో జీర్ణించుకొనిపోయింది.
చిరు సందేశం
      బాధాకరమైన విషయమేమిటంటే రచయితలు ఎందరో ఉన్నారు. 'సామాజిక స్పృహ' పేరిట తామరతంపరగా రచనలు చేస్తున్నారు. తాము ఏ సందేశాన్ని ఎదుటివారికి ఇస్తున్నారో అందులో వాడు జీవించడం లేదు. కవి మాటకు చేతనకు పొంతన లేకపోతే అతనికి రాజకీయ నాయకుడికి భేదమేముంది. కుడిగా బ్రతకాలనే కక్కుర్తితో సాహిత్య రాజకీయాలు చేయటం బాగులేదు. ఈ సోదరులు ఘోషించే మహిళావాదం, లంచగొండితనం, కులమత సామరస్యం, తల్లిదండ్రుల సేవ, సాటి రచయితల పట్ల సదవగాహన వగైరాలు, వారి నిజ జీవితాల్లో అపహాస్యానికి గురి అవుతున్నాయి. వాగ్రూపంలో అందంగా ఆవిష్కరిచుకోవటం దగ్గర ఆగిపోవటం కాకుండా ఆ చరణాల అనువదించ వలసినదిగా రచయితను ఆభ్యర్థిస్తున్నాను. నా సాహిత్య జీవిత ప్రస్థానంలో వ్యక్తవ్యక్తంగా తారసిల్లిన జ్ఞాతాజ్ఞాత శక్తులకు ఈ కింది పద్యంలో నిల్పి కొంతమేర నాలో పవిత్ర సంతృప్తి మిగిలించుకుంటాను.

ఏ దేవి కల్మియో ఈ నను దీవించి
పెద్దల మధ్యన పేర్మినిల్పె
ఏ గురు కరుణమో ఈ వాక్య బంధాల
మతితోడజతగూండి మ్మలయజేసె
ఏ గుప్త రూపమో ఎలయించి నన్నెప్డు
ఏ నీడకానీడ నెలమి గాచె
ఏనాటి బంధమో ఈ నాటి కొనకూడి
సాహిత్య వీధుల శక్తిబెంచె
అది పురాతసుకృతంబు, అదిపునీత
మద్ది భాగ్యోన్నతంబు, అయ్యదియలేక
ఈ ప్రకాంశ మాశావాదియెన్నడగును
ఈ మధుర మధుస్మృతి సంకెట్లగలుగు.
                                            (అవధాన కౌముది)

13, మే 2011, శుక్రవారం

ఈ ఫలితాలు ఏమార్పుకు దారి తీస్తాయి?








ప్రజలను కష్టాలనుంచి గట్టెక్కిస్తాయా?
ప్రజలపై భారాలు తగ్గుతాయా?
ప్రజల పక్షాన చట్టసభల్లో పోరాడేదెవరు?
వామపక్షాలకు ఎదురు గాలి ఎందుకు వీచింది?
దేశంలో వామపక్షాల ప్రాధాన్యత తగ్గిందా?
2011 లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వామపక్షపార్టీలకు ప్రధానంగా సిపిఎంకు ఎదురుగాలి వీచింది. ప్రజలు మార్పును కోరుకున్నారు. అంతేకాకుండా దేశంలో పెట్టుబడిదారులు కమ్యూనిస్టులను బలహీన పరచాలనే ప్రయత్నం కొంత ఫలించింది. ఈ ఫలితంగా దేశంలో వున్న ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులకు మరో ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు తోడయ్యారు. ఢిల్లీనుంచి శీలాదీక్షిత్‌, ఉత్తర ప్రదేశ్‌నుంచి మాయావతి, తమిళనాడు నుంచి జయలలిత, కొత్తగా పశ్చిమబెంగాల్‌నుంచి మమతాబెనర్జి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇదొక కోణం. మరోకోణం పరిశీలిస్తే.... ప్రజలను కష్టాలనుంచి గట్టెక్కిస్తాయా? ప్రజలపై భారాలు తగ్గుతాయా? ....ప్రజల పక్షాన చట్టసభల్లో పోరాడేదెవరు?......వామపక్షాలకు ఎదురు గాలి ఎందుకు వీచింది?..వీటన్నింటికీ సమాధానాలు వెతకాలి.... పశ్చిమబెంగాల్‌, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశంలో వామపక్ష రాజకీయాల ప్రాధాన్యత తగ్గలేదని గుర్తించాలి. రానున్న రోజుల్లో ప్రజల హక్కులపై జరిగే దాడిని ఎదుర్కొనే క్రమంలో వామపక్షాల ప్రాధాన్యత మరింత పెరుగనుంది. దేశ రాజకీయాల్లో వామపక్షాల స్థానాన్ని ఏ పార్టీ, శక్తి పూడ్చలేదనే చెప్పక తప్పదు. బెంగాల్‌, కేరళ ఫలితాలు దేశవ్యాప్తంగా వామపక్ష అభిమానులను నిరుత్సాహానికి గురిచేసింది. కేరళలో ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సారి ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ విజయం అంచుల దాకా వెళ్లి ఓడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి లేదనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం.
ఈ పరిణామాలకు కారణాలెన్నో...!?
బెంగాల్లో వామపక్ష కూటమి అపజయానికి పలు అంతర్గత, బాహ్య కారణాలున్నాయి. 34 సంవత్సరాల తర్వాత బెంగాల్లో వామపక్షాలకు ప్రతికూల ఫలితాలు రావడంపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి... వస్తున్నాయి. ఎరుపు తెల్లబోయిందని...కమ్యూనిస్టుల కంచుకోటకు బీటలు బారాయని.... 34 ఏళ్లపాలనకు తెరపడిందని... కాని ప్రజల పక్షాన పోరాడేదెవరు? ఈ ఫలితాలు ఎందుకలా వచ్చాయి. చట్టసభలో దేశ, రాష్ట్ర ప్రయోజనాలకోసం గట్టిగా పోరాడే వారు లేకపోయిరని మాత్రం విశ్లేసించలేక పోతున్నారు. అయ్యో ప్రజల కష్టాలను అర్థం చేసుకునే కమ్యూనిస్టులు ఓడి పోయారే...అని మాత్రం విశ్లేసించరెందుకు? అంటే పెట్టుబడి దారులకు మీడియా కొమ్ముకాస్తుందనేగా అర్థం. ... ఈ ఓటమిని సిపిఐ(ఎం) వినమ్రంగా అంగీకరించింది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల పూర్వరంగంలో రాజకీయ వ్యవస్థపైనా దాని ప్రభావం తీవ్రంగా పడింది. కార్పొరేట్‌ తరహా రాజకీయ విలువలు ప్రవేశించాయి. గత పదేళ్లుగా దేశ ఆర్థిక రంగంలో జరిగిన పెనుమార్పులు సంపదను పెద్ద ఎత్తున కేంద్రీకరింపజేశాయి. పెట్టుబడి దారులు ప్రభుత్వాలను నడుపుతున్నచోట ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడేందుకు ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తోడ్పడ్డాయి. బెంగాల్లో భూ సంస్కరణలు, కౌలు సంస్కరణలు, పంచాయతీలకు అధికార బదలాయింపు జయప్రదంగా అమలైన కారణంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేదలకు ఎంతో ఉపశమనం లభించింది. అదే సందర్భంలో ఈ క్రమంలో కొత్త వైరుధ్యాలూ పుట్టుకొచ్చాయి. భూస్వామ్య వ్యవస్థ బలహీన పడింది. భూములు పొందిన చిన్న రైతుల సంఖ్యా పెరిగింది. భూమి ఉన్న రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు మధ్య వైరుధ్యం అభివృద్ధి అయ్యింది. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించేందుకే వామపక్ష ప్రభుత్వం పారిశ్రామికీకరణపై దృష్టి సారించింది. పరిశ్రమలకూ భూములు అవసరమే. ఈ భూ సేకరణలో ప్రభుత్వం కొత్త సమస్యలు ఎదుర్కొంది. వీటి విశ్వరూపం నందిగ్రామ్‌, సింగూర్‌లో వెల్లడైంది. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా వచ్చిన కొత్త సమస్యలూ దీనికి తోడయ్యాయి. బ్యూరోక్రటిక్‌ ధోరణులు ప్రజలకు, పార్టీకి మధ్య గండిని సృష్టించాయి. 2009 ఎన్నికలకు ముందు నుంచే ప్రభుత్వంపై అసంతృప్తి ప్రారంభమైంది. నందిగ్రామ్‌, సింగూర్‌ ఉద్యమాల అనంతరం స్థానిక అసంతృప్తికి రాజకీయ రూపం వచ్చింది. పలు దిద్దుబాటు చర్యలూ చేపట్టింది. సమయం తగినంతగా లేకపోవడంతో ప్రజలు ఈ మార్పును గుర్తించలేక పోయారు. దీనికి తోడు ఈ కాలంలో పలు రూపాల్లో పార్టీపై తీవ్ర నిర్బంధం మొదలైంది. అంతర్జాతీయ స్థాయిలోనూ వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు తోడయ్యాయి. ఈ ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటూ, పార్టీ ఐక్యతను కాపాడుకుంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు పార్టీ చేసిన ప్రయత్నంలో విజయం సాధించలేక పోయిందని వామపక్ష వాదులు విశ్లేషించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మమతా బెనర్జీ నేతృత్వం లోని కూటమికి పెద్ద ఎత్తున ఓట్లేశారు. మమతా బెనర్జీ వద్ద ఇప్పటి వరకూ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు. మార్పు అన్న ఏకైక నినాదంతో ఆమె విజయం సాధించారు. ఈ మార్పు ప్రగతిపథం వైపా, అభివృద్ధి నిరోధకత వైపా అన్నది భవిష్యత్తే తేల్చాలి. దాన్ని బట్టే ఈ ప్రభుత్వ సుస్థిరత ఆధారపడి ఉంటుంది. సీట్లపరంగా దెబ్బతిన్నప్పటికీ ఓట్లపరంగా ఇప్పటికీ బెంగాల్లో వామపక్షాలు ప్రబల శక్తిగానే ఉన్నాయన్నారు. 'ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వామ పక్షాలు 41 శాతం ఓట్లను సాధించాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వామపక్ష రాజకీయాలకు మరింత ప్రాధాన్యత పెరిగిందనేది మాత్రం గుర్తించాలి. వామపక్షాల ఓటమి ప్రభావం జాతీయ స్థాయిలోనూ ఉంటుంది.ఈ ఎన్నికల్లో వామపక్షాలు తాత్కాలికంగా నష్టపోయాయి. కానీ వామపక్షాల ఓటమితో శ్రామికవర్గం ఇంకా ఎక్కువ నష్టపోయింది. వారి తరపున మాట్లాడే గొంతుక తగ్గుతుంది. ఇప్పటికే అవినీతి, అధిక ధరలు ఒకవైపు ప్రజలను పీడిస్తుండగా, మరోవైపు కార్మికవర్గంపై పెద్దఎత్తున దాడి జరుగుతోంది. రానున్న కాలంలో ప్రపంచబ్యాంకు, అమెరికా ఒత్తిళ్లు మరింతగా పెరుగు తాయి. పాలకులు మరింతగా పేట్రేగిపోయి ప్రజల హక్కులను కాలరాచే ప్రమాదముంది. వీటన్నింటినీ తట్టుకొని దేశం ముందుకు సాగాలంటే వామపక్ష రాజకీయాలు మరింత అవసరాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ సొంతపార్టీ పెట్టాడు. కోట్లు ఖర్చుచేసి ఎన్నికల్లో దిగారు. తల్లీకొడుకు ఇద్దరూ ఎమ్మెల్యే, ఎంపీలే రాజీనామా చేశారు. మంచిదే మళ్లీ ఎందుకు పోటీచేశారు. అత్యధిక మెజార్టీతో గెలిచారు. కాని తండ్రి సంపాదించిన డబ్బు, హోదాను అడ్డుపెట్టుకుని గెలిచారు.సానుభూతిని సొమ్ముచేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో దేశంలో ఎలాంటి మార్పురాదని గుర్తించాలి. నేను గెలిచానహో...అని చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఒక మార్పు మాత్రం జరిగింది. సాంప్రదాయ కాంగ్రెస్‌ ఓటును మాత్రం బద్దలు కొట్టారని మాత్రం చెప్పవచ్చు.

10, మే 2011, మంగళవారం

బాలికా విద్యపై చిన్నచూపు

-పని చేసే చోట మహిళాటీచర్లకు మౌలిక సదుపాయాలు కరువు
-లైంగిక వేధింపుల అదుపునకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి
- యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి
'' ఆర్థిక అసమానతలు , ప్రభుత్వ వైఫల్యం కారణంగా బాలికలు విద్యలో వెనుకబడుతున్నారు. మహిళా ఉపాధ్యాయులకు 63 శాతం ప్రభత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 600 నుంచి 800 మంది బాలికలు ఉండే ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు , విద్యార్థినులకు సరయిన సౌకర్యాలు లేక పోవడం విడ్గూరం. మొత్తం టీచర్లలో 44 శాతం మహిళా టీచర్లు మాత్రమే ఉన్నారు. పని చేసే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయక పోవడం వల్ల మహిళా ఉపాధ్యాయులపై లైంగికవేధింపులను అదుపు చేయలేక పోతున్నారు. బాలికల విద్యాభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలపై అదేవిధంగా మహిళా టీచర్లపై లైంగిక వేధింపులు, మౌలిక సదుపాయాలపై మహాసభల్లో తీర్మానాలు ప్రవేశ పెడుతాం ''అని కర్నూలులో జరుగుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర మహాసభలకు హాజరయిన రాష్ట్ర కార్యదర్శి కె విజయగౌరి ప్రజాశక్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
బాలికలు విద్యలో వెనుక బడటానికి గల కారణాలేమిటి?
విజయ గౌరి: ప్రభత్వం విద్యను ప్రయివేటు పరం చేయాలనుకోవడం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం. బాలికల్లో అక్షరాస్యత పెరగపోవడానికి పేదరిక కూడా ఒక కారణం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల బాలికలు చదువులకు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. 2011 లెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత 59 శాతం మాత్రమే ఉంది. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న బాలికల్లో కేవలం 68 శాతం మాత్రమే ఉంది. అన్నింటికీ మించి ఆర్థిక అసమానతలు కూడా బాలికలు చదువుకోక పోవడానికి కారణమవుతున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. 600 నుంచి 800 మంది బాలికలు ఉండే ఉన్నత పాఠశాలల్లో మహిళా టీచర్లకు మరుగుదొడ్లు లేకపోవడం విచారకరం. కిలో మీటరు దూరంలో ఉండే పాఠశాలలను మూసేయడం వల్ల దూరం వెళ్లి చదవలేక ట్రాపవుట్లు అవుతున్న వారిలో ఎక్కువగా బాలికలు ఉంటున్నారు.
పని చేసే చోట మహిళా టీచర్లకు సదుపాయాలు ఎలా ఉన్నాయి?
విజయ గౌరి: పని చేసే చోట మహిళా టీచర్లకు మౌలిక సదుపాయాలు లేవు. మరుగుదొడ్లు, 60 శాతం ఉన్నత పాఠశాలల్లో విశ్రాంతి గదులు లేవు. మొత్తం టీచర్లలో మహిళలు 44 శాతం మాత్రమే ఉన్నారు. వారు స్వేచ్చగా పని చేసే పరిస్థితులులేవు లైంగిక వేదింపులకు గురవుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదు. వేధింపులను అరికట్టడానికి రాష్ట్ర, జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు వేయాలని ప్రభుత్వానికి సూచించి ఏడు సంవత్సరాలు దాటినా అతిగతీ లేదు. ఈ మధ్య కాలంలో అదిలాబాద్‌, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, జిల్లాలోడ్యూటీలో ముగ్గురు మహిళా టీచర్లను వికృత రూపంలో హత్య చేశారు. అకృత్యాలకు పాల్పడే వారి విచ్చల విడి తనానికి ఈ మూడు హత్యలే నిదర్శనం. విశాలమైన విద్యారంగంలో ఉద్యోగ భద్రత, రక్షణ కల్పించడంలో ప్రభుత్వం గోరంగా విఫలమైంది.
బాలికల విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు అవసరం?
విజయ గౌరి: ఆర్థిక అసమానతలు తొలగించాలి. పేదలకు 360 రోజులు పని కల్పించాలి. పని చేసే హక్కును గ్యారంటీ చేయాలి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలి. బాలికల విద్యకోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నబ్జల్‌ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. బాలికల కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలి. చదువుకు అవసరమైన యూనిఫాం, పుస్తకాలు, అల్పాహారం వంటి సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసుకు ఒక టీచర్‌ ఉండేలా చూడాలి. రేషనలైజేషన్‌ ద్వారా ఉపాధ్యాయులను తగ్గించే పద్దతికి స్వస్తి పలకాలి.
బాలికల విద్య, మహిళా టీచర్ల సమస్యలపై యుటిఎఫ్‌ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది?.
విజయ గౌరి: బాలికల విద్యను పెంపొందించడానికి ,మహిళా టీచర్లరక్షణ కోసం ఆందోళన ఉధృతం చేస్తాం. కర్నూలు మహాసభల్లో ప్రత్యేక తీర్మానాలు చేయనున్నాం. ఈ సభల ముగింపుకు హాజరయ్యే కేంద్ర మంత్రి పురంధేశ్వరి దృష్టికి అన్ని సమస్యలను తెస్తాం. సుప్రీం కోర్టు తీర్పు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. అంతే కాకుండా సామాజిక చైతన్యం లేక పోవడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందరిలో సామాజిక చైతన్యాన్ని కల్పించేలా యుటిఎఫ్‌ తరుపున ప్రయత్నిస్తాం.

9, మే 2011, సోమవారం

కర్నూలులో కదం తొక్కిన ఉపాధ్యాయులు

ఉద్యమస్ఫూర్తితో ఉత్సాహభరిత వాతావరణంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కర్నూలులో కదం తొక్కారు. యుటిఎఫ్‌ 12వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని సోమవారం కర్నూలు ఎస్‌టిబిసి కళాశాల నుంచి ఉపాధ్యాయులు మహాప్రదర్శన నిర్వహించారు. 42 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో ఉన్న సూర్యతాపం ఉపాధ్యాయుల ఉద్యమ స్ఫూర్తి, ఉత్సాహంతో పోటీ పడలేదు. ప్రదర్శనలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ చైర్మన్‌ చుక్క రామయ్య, ఎమ్మెల్సీలు గేయానంద్‌, ఎంవిఎస్‌ శర్మ, వి బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు రామిరెడ్డి, అధ్యక్షప్రధానకార్యదర్శులు నారాయణ, ఐ వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు సుభాష్‌చంద్రబోస్‌, సహాధ్యక్షులు బాబిరెడ్డి, రాష్ట్ర నాయకులు అగ్రభాగాన నడిచారు. వివిధ జిల్లాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులను కేటాయించాలని, ఉపాధ్యాయుల అప్రెంటీస్‌ విధానం రద్దు చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కూడా పెంచాలని ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, విద్యారంగాన్ని పటిష్టం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. భగత్‌సింగ్‌, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు, లెనిన్‌ వేషాధారణలు అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ జెండాలను పట్టుకొని ఒక్కసారిగా వేలాది మంది తరలివెళ్తుండటంతో కర్నూలు నగరం ఎర్రకావురు వేసింది. గురువయ్యల డ్రమ్ములు, ప్రజానాట్య మండలి కళాకారుల డప్పుల ప్రదర్శన కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రదర్శన ఎస్‌టిబిసి నుంచి ఆర్‌ఎస్‌ రోడ్డు, మౌర్యాయిన్‌, రాజ్‌విహార్‌ సెంటర్‌ మీదుగా పెద్దాసుపత్రి, కలెక్టరేట్‌ నుంచి మాంటిస్సోరీ పాఠశాల ప్రాంగణం వరకూ సాగింది. ప్రదర్శనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డప్పులు వాయిస్తున్నప్పుడు ఉపాధ్యాయులు, నాయకులు నాట్యం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన యుటిఎఫ్‌ నాయకులు బ్యానర్లు కట్టుకొని ప్రదర్శన చేశారు.

2, మే 2011, సోమవారం

బిన్‌లాడెన్‌ మృతితో ఉగ్రవాదం అంతమవుతుందా?



ఒసామాబిన్‌లాడెన్‌ను హతమార్చినంత మాత్రాన ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసినట్లు కాదు. ఆయనను చంపేసి జలసమాధి చేశారట. అల్‌ఖైదాకు ఎంత సైన్యం ఉంది. ఎక్కడెక్కడ విస్తరించి ఉంది. దానికి అమెరికా ఎంత సహకరించింది. ఇవన్ని చూడాల్సి ఉంది. అయితే లాడెన్‌ గతంలోనే చనిపోయాడని వార్తలొచ్చాయి. కాని ఆయన తిరిగి దర్శనమిచ్చారు. ఇప్పుడు చంపేశామని అనేక ఆధారాలు చూపుతుంది. అయితే పాకిస్తాన్‌లో చంపేయడం చర్చనీయాంశమైంది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి చేసినప్పుడు జరిగిన నష్టానికి ప్రస్తుతం లాడెన్‌ను చంపేశారని తెలియగానే అమెరికాలో సంబరాలు జరుపుకున్నారు. తీవ్రవాదాన్ని ప్రస్తుతం ఎవరు పోషిస్తున్నారో చూడాలి. అంతే కాదు ప్రపంచ పోలీసుగా పేరుపొందిన అమెరికా అనేక దేశాలలో వివిధ కారణాలు చూపి విధ్వంసాలకు పాల్పడింది. అక్కడి పాలకులను మార్చేసింది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెబుతూనే అమెరికానే ఉగ్రవాదిలా మారింది. కాబట్టే మత ఛాందస ఉగ్రవాదులు అమెరికాపై కుట్రపన్నుతున్నారు.
ఇరవైఒకటవ శతాబ్దంలో ఉగ్రవాదంతో అగ్రరాజ్యాన్ని వణికించిన అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ ప్రపంచంలో అందరికన్నా 'మోస్ట్‌ వాంటెడ్‌' వ్యక్తి. ఆదివారం పాకిస్తాన్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన లాడెన్‌ ఒక సౌదీ ప్రముఖుని కుమారుడు. 2001, సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, పెంటగాన్‌పై జరిపిన దాడులతో లాడెన్‌ గురించి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడతను హిట్లర్‌ కన్నా భయంకరమైన వ్యక్తి. దేశానికి సరికొత్త శత్రువు. మోస్ట్‌ వాంటెడ్‌ పోస్టర్లపై కన్పించే అతడి ముఖం అమెరికన్లను, పశ్చిమదేశాలనూ నిద్రలో కూడా వెంటాడుతోందంటే అతిశయోక్తి కాదు. అటువంటి లాడెన్‌ను అంతం చేసేందుకు అమెరికాకు దశాబ్ద కాలం పట్టింది. అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన లాడెన్‌ చివరికి ఆ దేశ సేనల చేతుల్లోనే కన్ను మూయడం విచిత్రం. ఇస్లామిక్‌ ప్రపంచానికి హీరోగా మారక ముందు లాడెన్‌ను సిఐఎ ప్రపంచ ఉగ్రవాద 'ధృవతార' అని పొగిడింది. ఈజిప్టు నుంచి చెచెన్యా వరకూ, ఎమెన్‌ నుంచి ఫిలిప్పైన్స్‌ వరకూ ఉన్న ఉగ్రవాద గ్రూపులను తన అల్‌ఖైదా పతాకచ్ఛాయలో ఏకం చేసి తన ఇస్లామిక్‌ తీవ్రవాద సిద్ధాంతానికి ఎల్లలు లేవని చాటాడు. లాడెన్‌కు ముందు ఉగ్రవాదమంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రాయోజితమే. అయితే లాడెన్‌ మాత్రం ఒక ప్రభుత్వాన్నే శాసించిన ఉగ్రవాది. 1996 నుంచి 2001 వరకూ అప్పటి ఆఫ్ఘన్‌ పాలకులు తాలిబాన్ల రక్షకుడిగా వ్యవహరించాడు. అల్‌ఖైదాను అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్ది ఉగ్రావాదాన్ని ప్రపంచమంతటా విస్తరించాడు. సెప్టెంబర్‌ 11 దాడుల తరువాత అల్‌ఖైదా, బిన్‌లాడెన్‌ 'ప్రతిష్ట' 21వ శతాబ్ది రాజకీయ 'ప్లేగు'లా విస్తరించింది. ఉగ్రవాద గ్రూపులు తమకు తామే అల్‌ఖైదా అని చెప్పుకుంటూ ఇరాక్‌లో అమెరికా సేనలపై దాడులు, బాలీలో పర్యాటక కేంద్రాలపై బాంబులు, స్పెయిన్‌లో ప్రయాణీకుల రైళ్లను పేల్చివేయడం వంటి ఘటనలకు పాల్పడ్డాయి.
టర్నింగ్‌ పాయింట్‌
1989లో ఆఫ్ఘన్‌లో సోవియట్‌ ఓటమి అటు అమెరికాకు, ఇటు లాడెన్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా తాను బలోపేతం చేసిన లాడెన్‌కు అమెరికా వందల కోట్ల డాలర్లతో భారీ ఆయుధాలను, ఆయుధ సామగ్రిని సమకూర్చింది. ఆఫ్ఘన్‌లో సోవియట్‌ ఓటమి నాటి ప్రచ్ఛన్న యుద్ధానికి తెరదించినా అప్పటి నుంచీ ప్రపంచంలో సరికొత్త ఉగ్రవాదానికి తెరలేచింది. ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యన్లకు ఎదురైన ప్రతిఘటనకు ఆర్థికంగా, నైతికంగా అండదండలు సమకూర్చిన లాడెన్‌ ఆ సమయాన్ని ఇస్లామిక్‌ రాజకీయ శక్తి పునఃస్థాపనకు, వివిధ దేశాల ప్రభుత్వాలను జిహాద్‌ (పవిత్ర యుద్ధం) ద్వారా కూలదోసేందుకు అవకాశంగా తీసుకున్నాడు. అమెరికా ప్రపంచాధిపత్యాన్ని అంతం చేయగల శక్తి ముస్లింలకే ఉందని అతడు ఒక ఇంటర్వ్యూలో ఉద్ఘాటించాడు. అప్పటి నుండే అమెరికా స్థానంలో తనదైన సామ్రాజ్య నిర్మాణానికి అతడు రంగం సిద్ధం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మొదలు ప్రపంచ దేశాలన్నింటినీటినీ ఏకం చేసి ఖలీఫియా పేరిట ఇస్లామిక్‌ సామ్రాజ్యాన్ని స్థాపించి దానికి తను యువరాజు కావాలని కలలు కన్నాడు. ప్రపంచ దేశాలన్నీ ఇస్లామ్‌కు సంబంధించినవే తప్ప పాలకులకు సంబంధించినవి కావని అతడు ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. తన కలను సాకారం చేసుకోవడానికి అల్‌ఖైదాను ఒక సాధనంగా మార్చుకున్నాడు. 90వ దశకం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఉగ్రవాద గ్రూపులను అక్కున చేర్చుకొని తన నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నాడు. సెప్టెంబర్‌ 11 దాడులకు ముందే అతడు సోమాలియా, సౌదీ అరేబియాలలో అమెరికా సైనికులను హతమార్చాడని అధికారులు చెబుతున్నారు.
జీవిత విశేషాలు
 రియాద్‌కు చెందిన శతకోటీశ్వరుడు మహ్మద్‌ బిన్‌ లాడెన్‌కు జన్మించిన 50 మంది సంతానంలో ఒసామా 17వ వాడు. ఒసామా బిన్‌ లాడెన్‌ పుట్టిన తేదీ రికార్డుల ప్రకారం 1957 అయినప్పటికీ అతడి వయస్సుపై ముసురుకుంటున్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. 1976లో జెడ్డా యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. 1979, డిసెంబర్‌ 26న సోవియట్‌ సేనలు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించాయి. 1984 నుంచే లాడెన్‌ పెషావర్‌కు చెందిన ఒక సేవల సంస్థలో పనిచేస్తూ విమానాలలో వచ్చిపోయే సోవియట్‌ సేనలకు సహాయం చేసే అరబ్‌ వాలంటీర్లకు మద్దతుగా పని చేశాడు. 1986లో లాడెన్‌ పెషావర్‌కు మారి అక్కడ ఆయుధాలను సమీకరించుకొని సొంతంగా ఒక ఫైటర్ల బ్రిగేడ్‌ను నిర్మించుకున్నాడు. 1988లో అల్‌ఖైదా తన ఛాందసవాద భావాలతో తీవ్రవాద ముస్లింలను సూదంటు రాయిలా ఆకర్షించింది. వీరంతా తమ స్వదేశాలలో ముస్లిం ప్రభుత్వాల ఏర్పాటుకు కృషిచేయడంతో పాటు అమెరికా, ఇజ్రాయిల్‌, అమెరికా మిత్ర దేశాలకు వ్యతిరేకంగా చేతులు కలిపారు. 1991లో ఇరాక్‌పై అమెరికా దాష్టీకాన్ని వ్యతిరేకిస్తూ లాడెన్‌ సౌదీ అరేబియాలో ప్రవాస జీవితంలోకి వెళ్లిపోయాడు. 1993, జూన్‌లో బిన్‌ లాడెన్‌ను అతడి కుటుంబ సభ్యులు కుటుంబం నుంచి, వ్యాపారం నుంచి వెలివేశారు. తమ పాలకులకు వ్యతిరేకంగా ప్రచారంచేస్తున్న లాడెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సౌదీ అరేబియా 1999, ఏప్రిల్‌ 9న అతడి పౌరసత్వాన్ని రద్దుచేసింది. దానితో లాడెన్‌ 1996, మేలో సూడాన్‌కు తరలి వెళ్లాడు. అక్కడ అమెరికా ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్నాడు. అమెరికా సైనికుల్ని హతమార్చాలంటూ 1996, ఆగస్టులో బిన్‌ లాడెన్‌ ఫత్వా (మతపరమైన డిక్రీ)ను జారీ చేశాడు. 1996, అక్టోబర్‌లో సౌదీలో జరిగిన రెండు బాంబు పేలుడు ఘటనల్లో లాడెన్‌ను ప్రధాన నిందితుడిగా అమెరికా ప్రకటించింది. 1998లో నైరోబీ, దారస్సలాంలోని అమెరికా రాయబార కార్యాలయాల వద్ద పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కు పేలి 12 మంది అమెరికన్లతో సహా 224 మంది మరణించారు. ఈ ఘటనల సూత్రధారిగా లాడెన్‌ను ప్రకటించిన అమెరికా అతడిపై క్రూయిజ్‌ క్షిపణుల దాడికి ఆదేశాలు జారీ చేసింది. 2000, అక్టోబర్‌ 12న ఎమెన్‌ ఓడరేవులో నిలిచి ఉన్న అమెరికా యుద్ధనౌకపై అల్‌ఖైదా దాడి చేసింది. ఆ దాడిలో 17 మంది నావికులు మరణించారు. 2001, సెప్టెంబర్‌ 11న అల్‌ఖైదా మూడు హైజాక్‌ చేసిన విమానాలతో అమెరికాలోని న్యూయార్క్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కట్టడాలుగా ఉన్న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి చేసి వాటిని కుప్పకూల్చింది. ఒక విమానం పెంటగాన్‌లోకి కూడా దూసుకెళ్లింది. హైజాక్‌ చేసిన నాలుగో విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఈ దాడిలో దాదాపు మూడు వేల మంది మరణించారు. అల్‌ఖైదా అంచనాలకు మించి విజయవంతమైనట్లు లాడెన్‌ ఆ దాడిపై సంతృప్తి వ్యక్తం చేశాడు. లాడెన్‌ను 'సజీవంగా లేదా నిర్జీవంగా' పట్టుకోవాలని 2001, సెప్టెంబర్‌ 17న అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ ఆదేశాలు జారీ చేశారు. 2001, అక్టోబర్‌ 7న లాడెన్‌కు, అల్‌ఖైదాకు ఆశ్రయమిచ్చారన్న సాకుతో ఆఫ్ఘన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వంపై అమెరికా దాడులు ప్రారంభించింది. 2001, అక్టోబర్‌ 26న విడుదల చేసిన ఒక వీడియోలో ఇజ్రాయిల్‌ను సమర్థించడం ఆపకపోతే మరోసారి ఆత్మాహుతి దాడులు చేస్తామని లాడెన్‌ అమెరికాను హెచ్చరించాడు. 2010, జనవరి 26న అమెరికా సైనిక చర్యతో అల్‌ఖైదా బలహీనపడినట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. సెప్టెంబర్‌ 11 దాడుల సూత్రధారులను అమెరికా జైల్లో పెడితే తాను అమెరికన్లనెవరినైనా చంపుతానని 2010, మార్చి 25న లాడెన్‌ అమెరికాను హెచ్చరించాడు.2011, మే 1న లాడెన్‌ను పాకిస్తాన్‌లోనే హతమార్చినట్లు ప్రకటించిన అమెరికా అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
లాడెన్‌ను పెంచి పోషించిన అమెరికా
గతంలో ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సోవియట్‌ యూనియన్‌ సైన్యాన్ని తప్పించేందుకు అక్కడి తిరుగుబాటుదారులకు, యుద్ధ ప్రభువులకు ఆయుధ సహాయం అందించిన అమెరికా వారికి నాయకత్వం వహించిన లాడెన్‌ను కూడా పెంచి పోషించింది. పాకిస్తాన్‌ కూడా అమెరికా తమకు అందచేసిన ఆయుధాలు, ఎకె-47 తుపాకులను తన మదర్సాల ద్వారా ఒసామా నేతృత్వంలోని తాలిబాన్లకు అందచేసేది. లాడెన్‌ నేతృత్వంలోని ఆఫ్ఘన్లు సోవియట్‌ సైన్యాలను వెనక్కి పంపేందుకు పోరాడుతుండగా అమెరికా మాత్రం సోవియట్‌పై తన ఆధిపత్య స్థాపన కోసం వీరికి సాయం చేసింది. సోవియట్‌ సేనలు ఉపసంహరించుకున్న తరువాత అమెరికా ఆఫ్ఘన్‌ యుద్ధంలో మిగిలిన తన ఆయుధాలను ఇక్కడి యుద్ధప్రభువులను అప్పగించి వెళ్లిపోయింది. ఆ తరువాతి క్రమంలో తాలిబాన్లు క్రమంగా బలంపుంజుకొని తమ ఆధిపత్యం కోసం పోరాటం చేయగా వారికి లాడెన్‌ సాయపడ్డాడు. నిన్నటి వరకూ ఉగ్రవాదానికి ప్రతీకగా నిలిచిన లాడెన్‌ బతికున్న సమయంలో ఈ ప్రాంతంలో అమెరికాకు కంటిలో నలుసుగా మారాడు. ఇప్పుడు లాడెన్‌ అనంతరం అమెరికా ఇక్కడ మళ్లీ రెక్కలు విప్పుతుందా? అన్నది ప్రధాన ప్రశ్న. బిన్‌లాడెన్‌ను అమెరికా కాల్చి చంపినంత మాత్రాన అల్‌ఖైదా పనితీరు మారబోదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ప్రపంచ రాజకీయాలను ఇది ప్రభావితం చేస్తుందనడంలో సందేహం అవసరం లేదు. లాడెన్‌ వారసుడిగా పగ్గాలు చేపట్టే వ్యక్తికి బరాక్‌ ఒబామా ఆగర్భ శత్రువుగా మారడం ఖాయం. అయితే గత అధ్యక్షులెవరూ సాధించలేని విజయం సాధించిన ఒబామాకు స్వదేశంలో ఇది కొంత ఊరటనిచ్చే మాట కూడా నిజమే.

1, మే 2011, ఆదివారం

ఉత్సాహంగా మేడే ప్రదర్శనలు

రాష్ట్రవ్యాపితంగా మేడేను కార్మికులు ఉత్సాహంగా.. ఓ దీక్షా దినంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాడవాడలా ప్రదర్శనలూ, బహిరంగ సభలూ జరిగాయి. కర్నూలు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.అంతకు ముందు కర్నూలు సుందరయ్య భవన్‌ ఎదుట ఎర్రజెండాను సీనియర్‌ నాయకులు టి.నర్సింహాయ్య ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో సిిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రజాశక్తి కార్యాలయం వద్ద సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల పరిరక్షణకు ఉద్యోగ, కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కార్మికవర్గంపై దాడి మరింత పెరుగోతందనీ, ఐక్య పోరాటాలతో కార్మికులు ప్రతిఘటించాలనీ కోరారు. హైదరాబాద్‌లో జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలే ఏకైక మార్గమన్నారు. సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇందిరాపార్కు వద్ద జరిగిన బహిరంగ సభలో వీరయ్య మాట్లాడుతూ సోషలిజంతోనే కార్మిక హక్కులు సాధ్యమన్నారు. అయితే సోషలిజం పని అయిపోయిందని పెట్టుబడిదారీ విధానంలోనే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని అమెరికా సామ్రాజ్యవాదం దుష్ప్రచారం చేస్తోందన్నారు. గ్రీసులో 14 మార్లు దేశవ్యాపిత సమ్మెలు, ఫ్రెంచిలో వారం రోజులపాటు జరిగిన సమ్మెను గుర్తు చేశారు. కార్మికుల ఆందోళనతో పోర్చుగల్‌ అట్టుడుకుతోందన్నారు. అరబ్‌ దేశాల్లో రాజరిక వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. ఈ పోరాటాలన్నింటిలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతూ పెట్టుబడిదారుల దుర్మార్గాన్ని ఎదుర్కోవాలంటే కార్మికులంతా ఏకమై ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసి బస్టాండు వద్ద జరిగిన బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.సుధాభాస్కర్‌ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు వాటిని కాలరాసేందుకే ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం పన్నుతున్న కుట్రను ఎదుర్కోవాలని కోరారు. సాయంత్రం షార్‌ బస్టాండు నుండి సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.