27, జూన్ 2015, శనివారం

కాడెద్దులను అమ్ముకుని ..కాడిపట్టిన మహిళలు


            నాగ్‌పూర్‌ :
పాలకులు మారినా నేలతల్లిని నమ్ముకున్న వారి బతుకులు ఏ మాత్రం మారటంలేదు. పెట్టుబడి వర్గాలను ప్రసన్నం చేసుకోవటానికి పాలకులు చూపుతున్న శ్రద్ధ... రైతుల గురించి  అసలే పట్టించుకోవటంలేదనటానికి ఎన్నో ఉదాహరణలు.. మరెన్నో సజీవసాక్ష్యాలు. దేశంలో ఎక్కువమంది జీవనాధారం వ్యవసాయం.పెట్టుబడులకోసం ప్రైవేటు అప్పుల చుట్టూ తిరగలేక..పెట్టిన పెట్టుబడులు రాక ...రైతుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. గత్యంతరంలేక ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్నారు. అయినా పాలకులకు కనువిప్పు కలగటంలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చటానికి పాడి పశువులనూ అమ్మేసుకుంటున్నారు.. ఇంతగా విధి వారి జీవితాలతో ఆడుకున్నా..  కనీసం నాలుగు గింజలు పండిరచుకుందామన్న ఆరాటం రైతుల్లో కనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో  ఇద్దరు మహిళలు కాడిపడితే... మరో మహిళ విత్తనాలు వేస్తున్న దృశ్యం చూస్తే... రైతు బతుకు ఎంత దయనీయంగా మారిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయితే పొట్టకూటికి పుట్టెడు కష్టాలు మీవే అన్నట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారు.

20, జూన్ 2015, శనివారం

బతకడమే ముఖ్యం

   సీతారాం ఏచూరి                                     

              ఈ బిజెపి ప్రభుత్వం దూకుడుగా చేస్తున్న అంతర్జాతీయ ప్రచారాల నేపథ్యంలో, భారతదేశం అంతర్జాతీయ స్థాయిని సాధించాలని కోరుకుంటున్నట్లు కన్పిస్తోంది. అయితే ఇది భారత్‌కు ఉన్న అంతర్గత శక్తి సామర్థ్యాలు, ఆర్థికపరమైన అంశాలు లేదా ఇతరత్రా కారణాల రీత్యా మాత్రం కాదు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించిన దాని ప్రాతిపదికన సాధించాలనుకుంటోంది. ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా ఇది ఢల్లీిలోని రాజ్‌పథ్‌లో నిర్వహిస్తున్నారు. అయితే బాబ్రీ మసీదు విధ్వంసం ఘటన అనంతరం రాజ్‌పథ్‌లో ప్రజా సమావేశాలను నిషేధించారు. పైగా యోగా విన్యాసాల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్న సంఘటనగా ఇది గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాలనేది లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జీవితపు నాణ్యతను మెరుగుపరిచే యోగా భంగిమలను ఆచరించడంపై ఎలాంటి వివాదం ఉండాల్సిన అవసరం లేదు. హిందూత్వ ఎజెండాను పెంచి పోషించడంపై ఉన్న వివాదాలను పక్కన పెడితే, ఇటువంటి బృహత్తర మార్కెటింగ్‌ విన్యాసాలు కచ్చితంగా సుసంపన్నమైన భిన్నత్వమున్న మన ప్రజలను, సమాజాన్ని హిందూవాదం వైపునకు మళ్ళించేందుకు జరిగే గట్టి ప్రయత్నంగానే దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన మార్కెటింగ్‌ ప్రచారంలో కపట సూత్రం ఒక అంతర్వాహినిగా సాగుతోంది. ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ అయోధ్య (రామ్‌ జన్మస్థానం), మధుర(కృష్ణ జన్మస్థానం), బెనారస్‌ కాశీ విశ్వనాథ్‌ ఆలయాలకు విముక్తి చేస్తామనే మాటల్లో మన లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్‌ స్థానే అత్యంత అసహనంతో కూడిన ఫాసిస్ట్‌ హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలనే లక్ష్యం అంతర్గతంగా దాగి ఉంది. బాబ్రీ మసీదు విధ్వంసమైంది. మోడీ వారణాసి నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. మధురను తమ ప్రభుత్వ మొదటి పుట్టిన రోజు వేడుకను ప్రారంభించే వేదికగా ఎంపికచేసుకున్నారు. ఇదొక స్పష్టమైన అంతర్వాహినిగా ఉన్న నమూనా.
               యోగా అనేది ప్రాచీనమైన భారతీయ భంగిమల సమాహారం. ఇది వేద కాలంనాటి నాగరికతను బోధిస్తుంది. సింధులోయ నాగరికత ప్రాంతాల్లో కనుగొన్న పలు సీళ్ళపై ఉన్న అనేక భంగిమలు యోగా ధ్యాన ముద్రలను పోలి ఉంటాయి. రుగ్వేదం, ఇతర వివిధ ఉపనిషత్తులు ఈ పదాన్ని ప్రస్తావించాయి. క్రీపూ నాలుగు, మూడు శతాబ్దాలు మధ్య రచించబడినట్లు విశ్వసిస్తున్న కథా ఉపనిషత్‌ యోగాను మన మనోభావాలను నిలకడగా, నియంత్రణలో ఉంచగలిగేదిగా పేర్కొంది. ఇది ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళుతుందని పేర్కొంది. మన గ్రహణ శక్తిని విడుదల చేసేందుకు ఇటువంటి ధ్యాన భంగిమలను గురించి పాళీ భాషలోని బౌద్ధ గ్రంథాలు, అలాగే తొలినాటి జైన గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇంకా పతంజలి యోగ సూత్రాలు కూడా ఉన్నాయి. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల గురించి భగవద్గీత పేర్కొంటోంది. ప్రతి మానవుని శరీరంలోనూ అజ్ఞాతంగా ఒక శక్తి నిబిడీకృతమై ఉంటుందని విశ్వసించబడుతోంది. మానవ శరీరంలో వెన్నెముక కింద ఉన్న ఈ శక్తిని మెదడుకు చేరేలా పురిగొల్పడమే యోగా ఉద్దేశం.   ఇది ఆధ్యాత్మిక విముక్తికి దారి తీస్తుంది. ఈ స్థితిని సాధించేందుకు నిర్దేశించిన ఈ విన్యాసాలనే స్థూలంగా యోగా భంగిమలని అంటున్నాం.
         అయితే, ఇటువంటి ఉత్కృష్టమైన ఆథ్యాత్మిక అనుసరణల గురించి మోడీకి పట్టదు. జీవిత నాణ్యతను మెరుగుపరచుకునేందుకు యోగాను ఆచరించాల్సి ఉంది.  వాస్తవానికి, అనేకమంది ఈ యోగాను చాలా ఉపయుక్తమైనదిగా భావిస్తున్నారు. పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కూడా దీని ప్రభావం బాగా ఉంది. అక్కడ దీన్ని కార్డియో ఎక్సర్‌సైజ్‌ సప్లిమెంట్‌ (గుండెకు సంబంధించిన వ్యాయామ అనుబంధం)గా పేర్కొంటూ ఉంటారు. దేహంలోని కణజాలం మొత్తానికీ ఆక్సిజన్‌ బాగా సరఫరా జరిగేలా చూసేందుకు ప్రాణాయామం, వ్యాయామ విన్యాసాలు ఆచరించడం అనేది మానవుని ఉనికి నాటి నుంచే ఉన్న ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు. చురుగ్గా ఉండేందుకు లేవగానే ఒళ్ళు పూర్తిగా విరుచుకుని పరుగెత్తే కుక్కతో పోల్చి పేరు తెలియని ఒక యోగ గురువు చెప్పారు. ఈనాటి యోగా భంగిమలు మన పూర్వీకుల నుంచే వచ్చి ఉండవచ్చు. మన పూర్వీకులు వేటను ప్రారంభించేందుకు రోజూ శరీరాన్ని ఇలా సాగదీసి ఉంటారు. వీటి పర్యవసానాలు ఏవైనా కానీ, యోగా విన్యాసాలు లేదా భంగిమలు అనేవి సార్వజనీనంగా ఆరోగ్యపరమైన కార్యక్రమంగా గుర్తించబడ్డాయి. అయితే, ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రజలు ముందుగా బతకాలి, ఆ తర్వాతే వారు తమ జీవిత నాణ్యతను మెరుగుపరచుకోగలరు. మోడీ ప్రచారాలకు ఇటువంటి ఆందోళనలన్నీ ఐహికమైనవిగా కనిపిస్తూ ఉంటాయి.
                    భారతదేశ జిడిపి వృద్ధి రేటు మన పొరుగు దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థ కన్నా చాలా మెరుగ్గా ఉందని అధికార ప్రచారం సాగుతోంది. ఈ వృద్ధి రేటును లెక్కవేసే ప్రాతిపదికలను మార్చివేస్తూ ద్వంద్వ ప్రమాణాలను అనుసరించి గణించడం వల్ల ఇది సాధ్యపడుతోంది. అయితే ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఎఒ ‘ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా పరిస్థితులు`2015’ పేరిట రూపొందించిన నివేదికను పరిశీలిస్తే భారతదేశం క్షుద్బాధను తీవ్రంగా ఎదుర్కొనే దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల పతాక శీర్షికలకెక్కిన వార్తతో వెల్లడైంది. 19.46 కోట్ల మంది అన్నార్తులతో భారతదేశం ప్రపంచంలోకెల్లా అధిక సంఖ్యలో పోషకాహార లోపం కలిగిన ప్రజలతో ఉన్నదని ఆ నివేదిక పేర్కొంది. అంటే పోషకాహార లోపం ఎదుర్కొనే ప్రతి నలుగురిలో ఒకరు భారత్‌లోనే ఉన్నారు. నేపాల్‌, బంగ్లాదేశ్‌ల కన్నా భారత్‌ వెనుకబడి ఉంది. ప్రపంచ తల్లుల పరిస్థితిపై 2015 నివేదికను పరిశీలిస్తే భారత్‌ 140వ స్థానంలో ఉంది. జింబాబ్వే, బంగ్లాదేశ్‌, ఇరాక్‌ వంటి దేశాల కన్నా వెనుకబడి ఉంది. ప్రసూతి మరణాలు, ఐదేళ్ళలోపు పిల్లల్లో మరణాలు, పిల్లలు ఎన్నేళ్ళు స్కూల్‌కు హాజరవుతున్నారు, తలసరి జిఎన్‌పి, ప్రభుత్వంలో మహిళలు ఈ ఐదు అంశాలకు సంబంధించిన సూచీలో భారత్‌ 140వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్‌లో ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 52.7 మంది ఐదవ పుట్టిన రోజు జరుపుకోకుండానే మరణిస్తున్నారు. ప్రభుత్వ రంగ ఆరోగ్య వ్యవస్థలకు నిధుల కొరత చాలా ఉంది. అవసరంలో ఉన్నవారికి ఈ సేవలు ఏమాత్రం అందడం లేదు.
                162 దేశాలతో కూడిన ప్రపంచ బానిసల సూచీ 2013 ప్రకారం, ప్రపంచంలో ఆధునిక తరం బానిసల్లో సగానికి సగం మంది భారత్‌లోనే ఉన్నారని వెల్లడైంది. మొత్తంగా 2.96 కోట్ల మందిలో 1.33 నుంచి 1.47 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. ఆధునిక తరం బానిసల్లో సంప్రదాయ బానిసలు, కట్టు బానిసలు, బలవంతంగా పనిలోకి దింపబడినవారు, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించబడిన పిల్లలు వీరందరూ కూడా ఈ కోవలోకే వస్తారు.
              యోగా ద్వారా తమ జీవితాలను మరింత మెరుగ్గా, నాణ్యమైనవిగా మార్చుకోవాలంటే ముందుగా ప్రజలు బతకాల్సి ఉంటుంది. అవునంటారా? కాదంటారా? ఈనాడు మన దేశానికి కావాల్సింది హిందూత్వ ఎజెండాను పెంచి పోషించే ఇటువంటి ప్రదర్శనా కార్యకలాపాలను మార్కెటింగ్‌ చేయడం కాదు, మన ప్రజల స్థూల లేమిని తొలగించే దిశగా ప్రభుత్వం, ఈ ప్రధాని కూడా నిర్దిష్ట చర్యలు చేపట్టడం కావాలి. రోజు రోజుకు పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం ప్రస్తుతం దేశానికి అవసరం.  వ్యవసాయ సంక్షోభం కారణంగా ఈ ఏడాది రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. మన ప్రజలందరికీ అన్నం పెట్టగల సమర్థవంతమైన ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత అవసరం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం వంద రోజుల పాటు పనులు కల్పించే పరిస్థితి నుంచి ఈ ఏడాది దిగ్భ్రాంతి కలిగించే రీతిలో 60 శాతానికి పడిపోయింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత సొమ్ము ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈనాడు ప్రభుత్వం ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్నది జిడిపిలో ఒక శాతం కూడా ఉండడం లేదు. ఇవన్నీ చేసేందుకు వనరుల కొరతేమీ లేదు. దీనికి కావాల్సిందల్లా విధానాల దిశ మార్చడమే. సంపన్నులను మరింత సంపన్నులుగా, పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత మాత్రమే యోగాను పాటించగలుగుతాం.

9, జూన్ 2015, మంగళవారం

దళితుల సమస్యలపై దేశ వ్యాప్త ఉద్యమం

  -పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకై డిమాండ్‌
- ఆగస్టులో ఎంపీిలకు వినతిపత్రాలు...
 - సెప్టెంబర్‌లో ఢల్లీిలో వర్క్‌షాప్‌.
   -పూలే, అంబేద్కర్‌ వర్థంతుల సందర్భంగా కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు
  -డిఎంఎంఎస్‌ జాతీయ కన్వీనర్‌ వి శ్రీనివాసరావు వెల్లడి
        దళితుల సమస్యలపై దేశ వ్యాప్త ఉద్యమాన్ని చేపడుతున్నట్లు దళిత శోషన్‌ ముక్తి మంచ్‌(డిఎంఎంఎస్‌) జాతీయ కన్వీనర్‌ వి శ్రీనివాసరావు తెలిపారు. 2015 జూన్‌ 9న సోమవారం జాతీయ కన్వీనింగ్‌ కమిటీ సమావేశం న్యూడిల్లీ ఎకెజి భవన్‌లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో దళితులకు చేసిందేమీ లేదని ఈ సందర్భంగా శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాల నుంచి క్రమంగా వెనుకకు మళ్లుతోందని ఎద్దేవా చేశారు. దళిత మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అత్యచార చట్టం అసమగ్రంగా ఉందని...దాన్ని సవరిస్తూ గత ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొస్తే, ఈ ప్రభుత్వం దానిని మూలన పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌ కమిటీకి సరిగా నిధులు  కేటాయించలేదని, కేటాయించిన అరకొర నిధులు కూడా  ఖర్చు పెట్టలేదని,  ఈ కమిటీకి చట్ట బద్ధత కూడా లేదని గుర్తుచేశారు. దళితుల్లో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు పెరిగారని అన్నారు.ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం,  ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌లు లేకపోవడంతో దళిత యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఈ సమస్యలను చర్చించడానికి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరపాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు చివరల్లో అన్ని నియోజక వర్గాల్లో ప్రజల సంతకాలతో కూడి వినతి పత్రాలను ఎంపీలకు సమర్పించాలని, సెప్టెంబర్‌ రెండో వారంలో డిల్లీలో దళిత మేధావులతో వర్కుషాపు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించిందన్నారు. అలాగే నవంబర్‌ 27న జ్వోతిరావ్‌ పూలే, డిసెంబర్‌6న అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా దేశవాప్తంగా జిల్లా కలక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించమన్నారు. ఈ సమావేశంలో నాయకులు వరదరాజన్‌, రాధాకృష్ట, అసీంబాల, మమత, ఆంధ్రప్రదేశ్‌ నాయకులు మాల్యాద్రి, సుబ్రమణ్యం, తెలంగాణ నాయకులు జాన్‌వెస్లీ, నర్శింహా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

7, జూన్ 2015, ఆదివారం

బాబు బుక్కయ్యారా?

       
-స్టీఫెన్‌ సన్‌తో సంభాషణ బట్టబయలు
-ఆడియో రికార్డులు బహిర్గతం
-ఏక్షణమైనా నోటీసులు: టిసర్కారు వర్గాలు
-గవర్నర్‌తో కెసిఆర్‌ భేటీ
-ఉన్నతాధికారులతో బాబు అత్యవసర సమావేశం
-సిఎం గొంతు కాదు : పరకాల

ఒక వ్యక్తి: య్యా బ్రదర్‌  మన బాబుగారు మీతో మాట్లాడుతారు.లైన్‌లో ఉండండి.

కొన్ని సెకన్ల తరువాత
చంద్రబాబు : హలో!
స్టీఫెన్‌సన్‌ : సర్‌ గుడ్‌ ఈవినింగ్‌
బాబు : గుడ్‌ ఈవినింగ్‌  హౌ ఆర్‌యూ
స్టీఫెన్‌: ఫైన్‌ సర్‌ ధాంక్యూ
బాబు : మన వాళ్లు నాకంతా     వివరించారు. నేను మీకు అండగా ఉంటా.  కంగారు  వద్దు
స్టీఫెన్‌:  ఎస్‌  సర్‌.. రైట్‌ సర్‌
బాబు : అన్నింటికి  మీకు అండగా నేను ఉంటా. మా  వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం.
స్టీఫెన్‌:  ఎస్‌ సర్‌ ... ఒకే సర్‌
బాబు : అది మా హామీ .
 మనం కలిసి పనిచేద్దాం
స్టీఫెన్‌:  రైట్‌  థాంక్యూ సర్‌
బాబు : థాంక్యూ  
                      ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న రేవంత్‌రెడ్డి ఓటుకు  నోటు  వ్యవహారం కీలక  మలుపు తిరిగింది.  మరికొన్ని గంటల్లో ఏడాది పాలన సంబరాలను ఘనంగా జరిపేందుకు  సిద్దమవుతున్న టిడిపి వర్గాలకు  భారీ షాక్‌ తగిలింది.  తెలంగాణ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు  చేసిన టెలిఫోన్‌ సంభాషణ బట్టబయలైంది.  ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎసిబి సేకరించిన ఆడియో రికార్డులు బహిర్గతమైనాయి.  స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు సంభాషణ వెలుగులోకి వచ్చిన కొద్దిసేపటికే గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చంద్రబాబుకు ఏక్షణమైనా నోటీసులు జారీ చేసే అవకశం ఉందని టి. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  గవర్నర్‌తో కేసిఆర్‌ భేటీ జరుగుతుండగానే చంద్రబాబు ఉన్నతస్థాయి అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ డిజిపి రాముడుతో పాటు ఇతర ఉన్నతస్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం జరుగుతుండగానే మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఆడియో టేపుల్లో వినిపించిన గొంతు చంద్రబాబుది కాదని ప్రకటించారు. ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో సాగిన ఈ సంభాషణ రెండు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.  చంద్రబాబునాయుడిపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌ జోరందుకుంది.  ‘మన వాళ్లు నాకు వివరించారు. నేను మీకు అండగా ఉంటా. మా వాళ్లు మీతో మాట్లాడినవన్నీ మేం నెరవేరుస్తాం. మీరు స్వేఛ్చగా నిర్ణయం తీసుకోవచ్చు.’ అని  చంద్రబాబు  చెప్పడం ఈ  ఆడియో రికార్డుల్లో స్పష్టంగా వినపడిరది.   స్టీఫెన్‌సన్‌ను తమ  పార్టీ అభ్యర్థికి ఓటు వేయమనికాని,  బదులుగా ఇచ్చే ప్రయోజనాల గురించి కాని చంద్రబాబు నేరుగా ప్రస్తావించినప్పటికీ ‘ మా వాళ్లు మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం’ అంటూచెప్పడం  ఈ వ్యవహారంలో చంద్రబాబే సూత్రధారి అని చెప్పడానికి సరిపోతాయన్న అభిప్రాయాన్ని టి. ప్రభుత్వ వర్గాలు వ్యక్తం  చేస్తున్నాయి.  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌స్‌కు 50 లక్షల రూపాయలను లంచంగా ఇస్తూ టిడిపి నేత రేవంత్‌రెడ్డి  ఎసిబికి అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే.  ఆ సందర్భంగా ‘బాస్‌ చెప్పారు... చంద్రబాబుతో మాట్లాడండి’ అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా స్టీఫెన్‌సన్‌తో నేరుగా చంద్రబాబు మాట్లాడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు రేవంత్‌రెడ్డిని ఆదివారం నాడు కూడా ఎసిబి విచారించింది. కొన్ని గంటల పాటు సాగిన ఈ విచారణలో పలు ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు  కొద్దిరోజుల పాటు దాదాపు నాలుగు సార్లు గన్‌మెన్లు లేకుండా రేవంత్‌ ఎక్కడికో వెళ్లినట్లు తెలియడంతో  దానిపై ఆరా తీసింది. అదే విధంగా  దాదాపు 27 ఫోన్‌ కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా  రేవంత్‌నుండి సేకరించేందుకు ఎసిబి అధికారులు ప్రయత్నించారు. దాదాపు 50కిపైగా  ప్రశ్నలను ఆదివారం ఎసిబి అధికారులు  రేవంత్‌ను అడిగారు. విచారణ అనంతరం రేవంత్‌  అనారోగ్యంతో ఉన్నారని, .జ్వరంతో బాధపడుతున్నారని రేవంత్‌ తరపు న్యాయవాదులు మీడియాకు చెప్పారు.
                                                                       ట్యాపింగ్‌పై బాబు ఫిర్యాదు
                టెలిఫోన్‌ సంభాషణలు వెలుగులోకి రాకముందు ఆదివారం  సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. సోమవారం జరగనున్న ఏడాది ఉత్సవాలకు  ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగానే తెలంగాణ ప్రభుత్వం  ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతోందని, ఇది చట్టవిరుద్దమని ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
                                                                ఫోన్‌ ఎలా ట్యాప్‌ చేస్తారు  : యనమల
               కేంద్ర టెలిగ్రాఫ్‌ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం  ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్షుడు అన్నారు. టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారం ట్యాపింగ్‌కు ముందుగా అనుమతి తీసుకోవాలని దానికి భిన్నంగా  ముఖ్యమంత్రి ఫోన్‌ను ఎలా ట్యాప్‌ చేస్తారని ఆయన ప్రశ్పించారు.
                                                            ఎవరి ఫోన్‌ ట్యాప్‌ అయ్యింది ...?
                           తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్‌  చేసిందని ఎపి నేతలు ఆరోపిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, నేతల వాదన భిన్నంగా ఉంది. చంద్రబాబునాయుడి ఫోన్‌ను ట్యాప్‌ చేయలేదని వారు చెబుతున్నారు.  లంచం వ్యవహారంపై ఎసిబికి ఫిర్యాదు చేసిన స్టీఫెన్‌సన్‌ ఫోనును, ఆయన అనుమతితో   ఎసిబి అధికారులు నిఘా పెట్టారని వారు చెబుతున్నారు. స్టీఫెన్‌సన్‌ ఫోన్‌కు చేసి  చంద్రబాబు బుక్‌  అయ్యారని వారు అంటున్నారు.  నవనిర్మాణ దీక్షకు కొన్ని గంటల ముందు రేవంత్‌రెడ్డి  విడియో రిలీజ్‌కాగా, ఏడాది ఉత్సవాలకు ఒక్క రోజు ముందు బాబు  మాట్లాడిన టేపులు విడుదలయ్యాయి.
                                                                   అంతు చూస్తాం...!
               బూటకపు టేపుల వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకునేది లేదని,  చూస్తూ ఊరుకునేది లేదని,  అంతు చూస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ  కమ్యూనికేషన్స్‌ సలహాదారు పరకాల ప్రభాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సంప్రదిస్తుండగానే మీడియాతో మాట్లాడిన ఆయన  తెలంగాణ ప్రభుత్వానికి ఆ టేపులు ఎక్కడినుండి వచ్చాయో తెలపాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు  ఎక్కడెక్కడో మాట్లాడిన విషయాలను కలిపి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అని చెబుతూనే  టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతు కాదని, అది బాబు చేసిన సంభాషణ కాదని  ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేయడానికే ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు.  టిఆర్‌ఎస్‌ కార్యాలయంనుండి నడిచే టి.ఛానల్‌ ఈ టేపుల విషయాన్ని  మొదటిసారి వెలుగులోకి తీసుకువచ్చిందని చెప్పారు.  ప్రభుత్వ ఏడాది ఉత్సవాలకు సిద్దమవుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేశారని అన్నారు. నోటీసులు ఇచ్చే ధైర్యం టి. సర్కారుకు ఉండకపోవచ్చని  చెప్పారు.

6, జూన్ 2015, శనివారం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆకలికేకలు



 - రీసెర్చ్‌స్కాలర్స్‌కు రాత్రి అన్నమే టిఫిన్‌
-సరుకులు లేవు అన్నం పెట్టలేమన్న వార్డెన్లు
-మూడు హాస్టళ్ళలో ఇదే పరిస్థితి
-రూ.65 లక్షలకు చేరిన బకాయిలు
-ప్రభుత్వం బడ్జెట్‌ ఇవ్వక పోవడం వల్లే ఈ దుస్థితి


     ‘ఉస్మానియ క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా’ అని పాడుకున్న పాటను రాష్ట్ర ప్రజలు మరచి పోక ముందే పాలకులు మాత్రం ఉస్మానియా విద్యార్థులను మరచిపోయారు. తరగతులను బహిష్కరించి తమ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి రెండేళ్ళ పాటు లాఠీలను, తూటాలను లెక్కచేయకుండా పోరాడిన విద్యార్థులు ఇప్పుడు తాము సాధించిన రాష్ట్రంలోనే ఆకలితో అలమటిస్తున్నారు. తెలంగాణ నిర్మాణంలో తమ మేధాశక్తిని వినియోగించుకోవలసిన పరిశోధక విద్యార్థులు అర్థాకలితో కాలం గడుపుతున్నారు. ఒక వైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాల్లో పాలకులు మునిగి తేలుతుంటే  విద్యార్థులు మాత్రం కెసిఆర్‌ చెప్పే బంగారు తెలంగాణలో తాము లేమా అని ప్రశ్నిస్తున్నారు.
                    కేవలం కొద్దిపాటి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించక పోవడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మూడు ప్రధాన హాస్టళ్ళ మెస్‌లలో భోజనం పెట్టలేని పరిస్థితి ఏర్పడిరది. అంబేద్కర్‌ హాస్టల్‌గా పిలుచుకుంటున్న రీసెర్చ్‌ స్కాలర్స్‌ హాస్టల్‌లో (2015 జూన్‌ 6న) శనివారం ఉదయం టిఫిన్‌ కూడా పెట్టక పోవడంతో రీసెర్చ్‌ విద్యార్థులు శు క్రవారం రాత్రి వండిన అన్నంలో కొంత మిగిలితే అది తిని కడుపు నింపుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని డిగ్రీ, పిజి కళాశాలలకు శెలవులు కావడంతో కొంత మంది విద్యార్థులకు మెస్‌ సౌకర్యాన్ని అధికారికంగానే నిలిపి వేశారు. వివిధ విభాగాల్లో విద్యనభ్యసిస్తున్న పరిశోధన విద్యార్థులకు మాత్రం ఎండాకాలం శెలవులంటూ ఉండవు. వీరికి సంవత్సరం పొడవునా హాస్టల్‌ వసతి, మెస్‌ సౌకర్యం ఉంటుంది. దాదాపు 700 మంది పరిశోధన విద్యార్థులు యూనివర్సిటీలో ఉండగా వీరిలో ఎక్కువ మంది ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌, కొత్త పిజి, పాత పిజి హాస్టళ్ళలో ఉంటున్నారు. హాస్టల్‌ విద్యార్థులకు అవసరమైన మెస్‌ చార్జీలను గత కొద్దికాలంగా యూనివర్సిటీ అధికారులు ఇవ్వక పోవడంతో వార్డెన్లు అయోమయంలో పడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, గ్రాంట్‌లు రాక పోవడంతో మెస్‌ల నిర్వహణ కష్టతరమవుతోందని అధికారులం టున్నారు. మెస్‌లు మూసేస్తే విద్యార్థులు ఆందోళన చేస్తారని భావించిన కొందరు అధికారులు బియ్యం, కిరాణా సామాన్లను అరువు తెచ్చి కాలం గడుపుతూ వచ్చారు. ఈ బకాయిలు కూడా రూ. 65 లక్షలకు దాటి పోవడంతో వీటిని సరఫరా చేసే వర్తకులు కూడా సరఫరా నిలిపివేశారని వార్డెన్లు తెలిపారు. శుక్రవారం సరకుల నిల్వ అయిపోవడంతో శనివారం ఉదయం తమ హాస్టల్‌లో టిఫిన్‌ కూడా వండలేదని రీసెర్చ్‌ విద్యార్థులు తెలిపారు. కట్టెలు, పాలు సరఫరా చేసే వారికి కూడా బకాయిలు చెల్లించక పోవడంతో వారు కూడా సరఫరా నిలిపి వేశారని వారు వాపోయారు. రీసెర్చ్‌ విద్యార్థులు ఉంటున్న పాత పిజి హాస్టల్‌లో కూడా శనివారం సాయంత్రం వరకూ మాత్రమే సరుకులు సరిపోతాయని, కొత్త పిజి హాస్టల్‌లో మరో రెండు రోజుల వరకే సరుకులు ఉన్నాయని వార్డెన్‌ తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కోసం 15 హాస్టళ్ళు, వీటికి అనుబంధంగా మెస్‌లు పనిచేస్తున్నాయి. వీటిలో దాదాపు 8,000 మంది విద్యార్థులుంటున్నారు. వీరిలో 3,000 మంది కేవలం బాలికల హాస్టళ్ళలో ఉండి విద్యనభ్యసిస్తున్నారు. హాస్టళ్ళల్లో ఉండి విద్యనభ్యసించే విద్యార్థులో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా ఆర్థికంగా సాంఘికంగా వెనుకబడిన వారు కావడం విశేషం. విద్యాప్రమాణాల విషయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంచి పేరే ఉంది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే ఈ యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. ఇంజనీరింగ్‌లో అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఈ యూనివర్సిటీ ఆర్జించింది. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న ఈ యూనివర్సిటీ గత కొద్దికాలంగా నిధుల కొరను ఎదుర్కొంటోంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద యూనివర్సిటీకి సంవత్సరానికి రూ. 500 కోట్లు అవసరం కాగా ప్రస్తుతం కేవలం రూ. 260 కోట్లు మాత్రమే అందుతున్నాయని అధికారులంటున్నారు. కేవలం జీతాలకే ఈ నిధులు సరిపోతున్నాయని వారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయక పోవడంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేక పోతున్నామని, రీసెర్చ్‌ సౌకర్యాలను కూడా మెరుగు పరచ లేక పోతున్నామని వారంటున్నారు. హాస్టళ్ళు, మెస్‌ల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చే స్కాలర్‌షిప్‌లతో పాటు, ఐసిఎస్‌ఎస్‌ఆర్‌, ఆర్‌జిఎన్‌ఎఫ్‌ వంటి సంస్థలు ఇచ్చే ఫెలోషిప్‌లపై ఆధార పడుతున్నామని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన స్కాలర్‌షిప్‌ల బకాయిలు సకాలంలో అందక పోవడంతో మెస్‌ల నిర్వహణ కష్టసాధ్యమవుతోందని యూనివర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాలకు తెలిపారు. మెస్‌లు నిర్వహించడం కష్టతరం కావడంతో కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్ళన్నీ విద్యార్థులే నిర్వహించుకునే విధంగా మార్చి వేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోందని విద్యార్థులంటున్నారు.
                                                              రూ. ఏడు కోట్ల హామీ నెరవేర్చని కెసిఆర్‌
             2009 నుంచి పేరుకు పోయిన మెస్‌ బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన ఏడు కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆరు నెలల క్రితమే హామీ ఇచ్చినప్పటికీ అది అమలు కాలేదు. యూనివర్సిటీకి పూర్తి స్థాయి విసిని నియమించకుండా కేవలం ఐఎఎస్‌ అధికారిని తాత్కాలిక విసిగా నియమించడంతో పాలన పూర్తిగా కుంటుపడిరదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అడిగిన వారికి అడగని వారికి ఉదారంగా కోట్లాది రూపాయలిస్తున్న ముఖ్యమంత్రికి తెలంగాణలోని అతిపెద్ద యూనివర్సిటీకి నిధులివ్వలేరా అని వారు ప్రశ్నిస్తున్నారు. 
                                                                                                                               `కొండూరి రమేశ్‌బాబు

2, జూన్ 2015, మంగళవారం

బిజెపి పాలన సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదం

                                                       
     - ప్రత్యేక హోదాపై ద్వంద్వ వైఖరి
     - మీట్‌ది ప్రెస్‌లో సీతారం ఏచూరి
      - భూసేకరణ ఆర్డినెన్స్‌ దారుణం
                      ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హాదాపై బిజెపి పెద్దాయన ద్వంద్వ వైఖరిని  అనుసరిస్తున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి విమర్శించారు.2015 జూన్‌ 2న మంగళవారం ఉదయం మీట్‌ ది మీడియా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బిజెపి పాలన ఫెడరల్‌ స్ఫూర్తి కి, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు విఘాతంగా మారుతోందనీ, రాష్ట్రాలతో సంప్రదించకుండానే కీలక నిర్ణయాలను మోడీ సర్కారు  ఏకపక్షంగా తీసుకుంటోందనీ అన్నారు. రేవంత్‌ రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వచ్చినప్పుడు రాజకీయాల్లో విలువలు దిగజారుతుండటం పట్ల ఆయన విచారం  వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ ఫండిరగ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మీట్‌ ది మీడియా కార్యకమ్రానికి తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ కార్యదర్శి సోమయ్య అధ్యక్షత వహించారు. హిందూ మాజీ రెసిడెంట్‌ ఎడిటర్‌ నగేష్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జి. ఆంజనేయులు, బసవపున్నయ్య, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై సీతారాం ఇచ్చిన జవాబులు క్లుప్తంగా..
                                                             భూ సేకరణ బిల్లుపై
                 ‘లోక్‌సభ ఆమోదించిన భూసేకరణ బిల్లు రాజ్యసభలో వీగిపోవడంతో సెలక్ట్‌ కమిటీకి పంపాల్సి వచ్చింది.  అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఆర్డినెన్స్‌  జారీ చేసింది. ఇక  జాయింటు కమిటీ బిల్లును పరిశీలించేది ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ కమిటీలో ఉండాలా లేదా అన్న నిర్ణయాన్ని మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మోడీ ఏడాది పాలనలో దేశం మూడు ప్రధాన రంగాలలో ప్రమాదంలో పడిరది. మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను మోడీ ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు తీసుకుపోతోంది. అన్ని రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. 2013లో భూ సేకరణ బిల్లులో సవరణలను సమర్థించిన బిజెపి ఇప్పుడు వ్యతిరేకిస్తోంది.
                                                               బిజెపి పాలనపై
          కేంద్రం రాష్ట్రాల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోంది.   ఢల్లీి ప్రభుత్వానికి,  ఢల్లీి లెఫ్టెనెంట్‌ గవర్నరుకు మధ్య జరుగుతున్న ఘర్షణే దీనికి ఉదాహరణ. ప్లానింగ్‌ కమిషన్‌ ను రద్దుపరచడంల వల్ల అది  కేటాయించిన 10శాతం నిధులు  రాష్ట్రాలకు రాకుండా పోయాయి.  ఈ అంశంపై ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు రాసిన లేఖకు ప్రధానినుంచి జవాబు కూడా ఇవ్వలేదు.  బిజెపి పాలనలో ఫెడరలిజానికి , కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు ప్రమాదం ఏర్పడిరది. మోడీ ప్రభుత్వం ఏడాది కాలంలో 49 బిల్లులను పార్లమెంటు పరిశీలించకుండా  జారీ చేసింది. స్టాండిరగ్‌ కమిటీలనే రద్దు చేసింది. చట్ట తయారీ ప్రక్రియనే దెబ్బతీసింది. ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నప్పటికీ బ్రహ్మాండ మైన ప్రగతి సాధిస్తున్నట్లు ప్రచారంచేసుకుంటు న్నారు. ధరలు పెరుగుతున్నాయి. రైతులు పెద్దసంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు’. 
                                                                    మతఘర్షణలు
              మోడీ పాలనలో దెబ్బతింటున్న మూడోరంగం మతసామరస్యం.  బీహార్‌,  ఉత్తరభారతంలో మత ఘర్షణలు పెచ్చరిల్లుతున్నాయి.  చరిత్ర స్థానాన్ని పురాణాలు ఆక్రమిస్తున్నాయి. ద్వేషం ఆధారంగా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా సాగే ప్రజా ఉద్యమాలను బలపరచడం , ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే సిపిఎం కర్తవ్యంగా భావిస్తోంది. ఈ ప్రయత్నంలో కలసివచ్చే పార్టీలతో ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తాం.
                                                                     ప్రత్యేకహోదా
                ‘విభజనబిల్లుపై రాజ్యసభలో  గొంతు చించుకుని అరి చిన బిజెపి పెద్దాయన  తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు  ఇస్తామని చెప్పారు. ఇప్పు డేమో స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌ అనేదే లేదని, జాతీయ విపత్తు అంటూ ఏమీ ఉండదని  అంటున్నారు. ఇది ద్వంద్వ వైఖరి’
                                                                    రేవంత్‌రెడ్డి వ్యవహారం
                       ‘రాజకీయాలలో నైతికత నానాటికీ దిగజారిపోతోంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎంఎల్‌ఎ ఎన్నికలలో 3నుంచి 5కోట్లవరకు ఖర్చుపెడుతున్నారు. ఇటువంటి వ్యవహారాలలో తప్పిదాలకు పాల్పడిన వారిని ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటించాలి.  సిపిఎం ఎన్నికల సంస్కరణలను ఎంతో కాలంగా ప్రతిపాదిస్తోంది.  రాజకీయ పార్టీలకు కార్పొరెేట్‌ ఫండిరగ్‌ను నిషేధించాలి. జర్మనీ, స్కాండినేవియా దేశాలలో వలే కేంద్రం, ఎన్నికల సంఘంల ఖాతాలో నిధులు వుంచి ఎన్నికలకు ఫండిరగ్‌ ఇవ్వాలి. దీనిని మా  పార్టీ  ఎప్పుడో ప్రతిపాదించింది’.
                                                                        దళితుల సమస్యలపై
                   ‘దళితులకు పాలిట్‌ బ్యూరో లో స్థానం కల్పించక పోవడం పట్ల మేమూ  అసంతృప్తితో వున్నాం. సెంట్రల్‌ కమిటీలో దళితుల సంఖ్యపెరుగుతోంది. కేవలం పార్టీ కమిటీలలో దళితుల ప్రాతినిధ్యంతో సమస్యలు తొలగి పోవు. ఆర్థికసాధికారితతోనే వ్యవస్థలో మౌలికమార్పు వస్తోంది. వామపక్షాలకు సాధారణంగా దగ్గరగా వుండే మధ్యతరగతి మితవాద రాజకీయాలవైపు తాత్కాలికంగా  మొగ్గు చూపినా భ్రమలు తొలిగాక వాస్తవాలు తెలుసుకుంటారు.  లక్షలు అప్పు చేసి పైలట్‌ కోర్సు చదివించిన  పలువురు మధ్యతరగతి కుటుంబీకులు ఏవియేషన్‌ రంగంలో సంక్షోభం రావడంతో పిల్లలకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మహిళా బిల్లు మొదట రాజ్యసభ ఆమోదం పొందేందుకు సిపి ఎం  ఎంతగానో కృషి చేసింది. ఆ  కృషి వల్లే అది ఇంకా బతికివుందన్నారు.
                                                                         తెలంగాణపై
                  తెలంగాణ అనేక ఆశలు , ఆకాంక్షలతో ఏర్పడిరది.  ఈ రాష్ట్రంలో ఎస్‌ సి, ఎస్‌ టి లు జాతీయ సగుటుకన్నా ఎక్కువన్నారు. ఒక ఏడాదిలో వాగ్దానాలు పూర్తికావు, కాని కెసిఆర్‌ ప్రభుత్వం ఆ దారిలోవుందా లేదా అన్నది ముఖ్యం.  ఏడాది కాలంలో తెలంగాణలో ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదు. 970 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్వీసు, ఇండస్ట్రీలలోఅవకాశాలు పెరగలేదు. సామాజిక న్యాయం జరగడం లేదు.

1, జూన్ 2015, సోమవారం

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల

                                                  

                                                  ఐదుస్థానాల్లో టిఆర్‌ఎస్‌, ఒకస్థానంలో కాంగ్రెస్‌
              తెలంగాణ రాష్ట్ర్రంలో శాసన సభ్యుల కోటా కింద ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు 2015 జూన్‌ ఒకటిన నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు అదే రోజు సాయంత్రం  వెలువడ్డాయి. తెరాస తరుపున పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించారు. మరోస్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు.  తెలంగాణ అసెంబ్లీ నామినేటెడ్‌  సభ్యుడితో కలిసి 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా 118 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగుకు దూరంగా ఉన్నారు. పోలైన ఓట్లలో ఐదు ఓట్లు చెల్లుబాటు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓ ఎమ్మెల్యే నోటా వినియోగించుకున్నారని తెలిపారు. నామినేటెడ్‌ అభ్యర్థికి డబ్బులు ఎరచూపి ఎసిబికి  పట్టుపడి జైల్లో ూన్న టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
                                 విజయం సాధించిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు
కడియ శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావు, నేతి విద్యాసాగర్‌రావు, యాదవ రెడ్డి, బి వెంకటేశ్వర్లు.
గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి : ఆకుల లలిత