29, నవంబర్ 2010, సోమవారం

'గోవత్సం' కాడు గొప్పోడవుతాడా?

గోవత్సం అనే సంస్కృత పదానికి తెలుగులో ఆవుదూడ అని అర్థం. పశుసంపదను విక్రయించేటప్పుడు కొన్ని సర్వసాధారణ ప్రమాణాలుంటాయి. దూడ ఉన్న ఆవును అమ్మాల్సి వచ్చినప్పుడు ఆవుకు మాత్రమే ధరను నిర్ణయిస్తారు. దానితోపాటుగా ఉన్న దూడకు అప్పటికేమి విలువ ఉండదు. కొనుక్కునే వారికి ఉచితంగానే చేరుతుంటుంది. సమాజంలో కొంత మంది పరిస్థితి అలా ఉంటుంది. అమ్మకం విషయంలో ఆవుపక్కనున్న దూడకు విలువ లేనట్లుగానే పెద్దల పక్కనుంటూ సొంత వ్యక్తిత్వం లేకుండా ఆపెద్దలననుసరించే వారికి ఎవరూ తగినంత విలువనివ్వరు. ఆవాడొట్టి గోవత్సంగాడు వాడేంచేయలేడు. అనేలాంటి ప్రయోగాలున్నాయి.
మరి రాజకీయంగా కాంగ్రెస్‌పార్టీలో ఉన్న వైఎస్‌ జగన్‌కు ఇప్పటివరకు అదేపరిస్థితి. తండ్రి పుణ్యమాని ఆస్తి వచ్చింది. ఎంపీ పదవి వచ్చింది. తండ్రిపోయాక ఆస్తిని పెంచుకున్నాడు. కాని పదవిని పెంచుకోలేక పోయాడు. ముఖ్యమంత్రి కావాలని విఫలమయ్యాడు. తరువాత కాంగ్రెస్‌ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు. తల్లిలాంటి పార్టీకి దూరమయ్యాడు. పదవికీ దూరమయ్యాడు. ధనమయితే ఉంది. పార్టీని వదిలాక ప్రస్తుతం గోవత్సం కాడు కదా భవిష్యత్తులో ఎంతగొప్పోడవుతాడో చూడాలి.
వైఎస్‌ తనయుడు, కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. లేఖలో అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆమోదించారు. తనయుడి బాటలోనే వైఎస్‌ సతీమణి విజయలక్ష్మమ్మ నడిచారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ఆమె కూడా రాజీనామా చేశారు. స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంవల్ల డిప్యూటి స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు విజయమ్మ లేఖ పంపారు. సంప్రదాయాలకనుగుణంగా రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని నాదెండ్ల చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి మండలి బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో దానికి రెండు రోజుల ముందు జగన్‌ రాజీనామా చేయడం కాంగ్రెస్‌ వర్గాలను ఒక్క కుదుపు కుదిపింది. జగన్‌ రాజీనామా వల్ల ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్‌ కూడా ఎమ్మెల్యేలనెవర్నీ రాజీనామా చేయవద్దన్నట్లు ఆయన మద్దతుదార్లు చెబుతున్నారు. ఒక వేళ జగన్‌ వెంట కొంత మంది ఎమ్మెల్యేలు నడిచినప్పటికీ ఆ లోటును పిఆర్‌పితో భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఆందుకు కొన్ని రోజులుగా పావులు కదుపుతూనే ఉంది. రెండో విడత, మూడో విడత జరిపిన ఓదార్పు యాత్రలోనే జగన్‌ తన రాజకీయ భవిష్యత్తుపై పరోక్షంగా సంకేతాలిచ్చారు. 'ఈ సహనం ఎన్నాళ్లుంటుందో తెలీదు' అని అన్నప్పుడే ఏదోక రోజు పార్టీ నుండి బయటికొస్తారని రాజకీయ విశ్లేషణలొచ్చాయి. కొత్త పార్టీ పెడుతున్నారన్న ఊహాగానాలూ కొంత కాలంగా వినపడుతున్నాయి.
కాంగ్రెస్‌పార్టీలో బీహార్‌ ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ముసలం పుట్టింది. రోశయ్య రాజీనామా అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతుండగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమాడు కడప ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భార్య విజయలక్ష్మి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జగన్‌రాజీనామాను వెంకటనే ఆమోదించారు. విజయమ్మ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. జగన్‌రాజీనామా అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల నిరసనతు వ్యక్త మయ్యాయి. కడపలో డిసిసి కార్యాలయానికి వైఎస్‌ కార్యాలయంగా మార్చేశారు. అనంతపురంలో డిసిసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కర్నూలులో ఇటలీగాంధీ డౌన్‌డౌన్‌ అంటూ ఆమె ప్లెక్సీనీ తగులబెట్టారు. ఆమె పోస్టర్‌ను చెప్పులతో కొట్టారు.

26, నవంబర్ 2010, శుక్రవారం

ఆయనను ఇప్పుడెందుకు ముఖ్యమంత్రిని చేశారు?

వైఎస్‌ జగన్‌ శిబిరాన్ని దెబ్బతీయడానికా....బీహార్‌ ఎన్నికల ఫలితాలను చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై, కాంగ్రెస్‌ కార్యకర్తలపై పార్టీ ఓటమి ప్రభావం పడకూడదనా?. లేక బీహార్‌ ఎన్నికల్లో తెగతిరిగినా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీల చరిస్మా లేదని తేలిపోతుందనా? కాంగ్రెస్‌ పార్టీ ముఠా తగాదాల నుంచి బయట పడటానికా ఎందుకు రోశయ్యను రాజీనామా చేయించారు. రోశయ్య చెప్పిన వయోభారం నిజమా?. ఏది నిజమని అనుకుంటున్నారు. పైవన్నీ కూడా నిజమేనా? ఇన్ని సమస్యల మధ్య ఉన్న కాంగ్రెస్‌పార్టీని కిరణ్‌కుమార్‌ రెడ్డి గట్టెక్కించగలడా? అన్నింటినీ మించి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని 2014 వరకూ ఆపగలగుతారా?. ప్రజలు వివిధ సమస్యల్లో ఉన్నారు. అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. వాటినెలా దారిలో పెడుతారు. ముఖ్యమంత్రి మారినా కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం సమసిపోలేదు. ఆ మంట రగులుతూనే ఉంది. అది చల్లారే ఆనవాళ్లు ఇప్పట్లో కనిపించడంలేదు. సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసినా ఆయనకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు చెప్పలేదు. బెంగుళూరు నుండి హైదరాబాద్‌ వచ్చినా మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు అభినందించినా ఆయన మాటమాత్రంగానైనా స్పందించలేదు. రాష్ట్రాభివృద్ధికి అందరినీ కలుపుకుపోతానని మీడియా ద్వారా ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా జగన్‌ విషయంలో దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రులను మార్చినా తన ఎజెండాలో మార్పులేదని, ఓదార్పుయాత్ర కొనసాగిస్తానని అధిష్టానానికి, ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్లు తెలిసింది. అధిష్టానం బాటలోనే నడవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించుకున్నారని, దీంతో రానున్నకాలంలో ఇద్దరి మధ్యా వైరం మొదలవుతుందని తెలుస్తోంది. అటు అధిష్టానంతోనూ, ముఖ్యమంత్రితోనూ సమరానికే జగన్‌ సిద్ధమైనట్లు శుక్రవారం నాటి సమావేశం కూడా అదే చెబుతుంది. బాలినేని, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, కొండా సురేఖ. వైఎస్‌ వివేకాంనదారెడ్డిలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని, జేసీ దివాకర్‌రెడ్డి, డిఎల్‌ రవీంద్రారెడ్డిలను దూరంగా ఉంచాలని అధిష్టానాన్ని కోరినా తిరస్కరించినట్లు తెలిసింది. 'ప్రభుత్వంలోనూ, మంత్రివర్గం ఏర్పాటులోనూ నేను జోక్యం చేసుకోబోను. ఎవరైనా మంత్రివర్గంలో చేరాలనుకుంటే చేరవచ్చు. సొంతంగా లాబీయింగ్‌లు చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అని జగన్‌ చెప్పారని అనుకుంటున్నారు. అదే తరహాలో వైఎస్‌ వివేకానందరెడ్డి మంత్రి పదవికోసం ఢిల్లీలో పైరవీలు మొదలు పెట్టారు. ఒక వేల వివేకానందరెడ్డికి మంత్రి పదవి వస్తే జగన్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది.. క్రమంగా అప్పుడు జగన్‌ ఒంటరి కావచ్చేమో. అదేవిధంగా రాయలసీమలో చిత్తూరు చిల్లాలో ముఖ్యమంత్రి ఆయన అనుచరులు జగన్‌ వ్యవహారాలకు అడ్డం తగులుతారు. కడపలో డిఎల్‌ రవీంధ్రారెడ్డి మరికొందరు వ్యతిరేకులున్నారు. అనంతపురంలో జెసిదివాకర్‌రెడ్డి ముఠా అడ్డుతగులుతుంది. రఘువీరారెడ్డికి మంత్రి పదవి ఇస్తే జనగ్‌వైపు చూసే అవకాశం లేదు. కర్నూలులో కోట్ల ముఠా మరి కొందరు సీనియర్లు జగన్‌ను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. తెలంగాణలో పెద్దగా జనాధరణ ఉన్న వారెవరూ జగన్‌వెంటరారు. ఆంధ్రలో కొందరున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి మేనేజ్‌ చేస్తారు. మొత్తంగా జగన్‌కు పెద్దగా మద్దతు ఇచ్చే ప్రాంతం లేదని చెప్పవచ్చు. ఏదేమైనా తండ్రికి ఉన్న పలుకుబడితో కాంగ్రెస్‌కు కొంత దెబ్బతీసే ప్రయత్నం చేయవచ్చేమో అని కొంత చర్చ జరుగుతుంది. కిరణ్‌మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాక ముఠాతగాదాలు ఏమయినా సమిసిపోయే అవకాశం ఉందా...చూద్ధాం..ఏం జరుగుతుందో?!.......

25, నవంబర్ 2010, గురువారం

అగ్రరాజ్యంలో ఆకలి కేకలు

ప్రతి ఆరుగురిలో ఒకరు అన్నార్తులే- బాలల్లో నాలుగో వంతు మంది బాధితులు
ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా ప్రజలకు కూడా ఆకలి బాధ తప్పడం లేదు. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఏదో ఒక సాకుతో యుద్ధాలకు దిగుతున్న అమెరికాలో అన్నార్తుల సంఖ్య పెరుగుతోందనేది నగ సత్యం. యుద్ధాల కోసం వేల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్న అమెరికా తన ప్రజల ఆకలిని తీర్చడంలో విఫలం కావడం సిగ్గుచేటు. అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు. దేశంలోని పిల్లల్లో నాలుగింట ఒక వంతు మంది ఆకలి బాధను చవిచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 92.5 కోట్ల మంది లేదా మొత్తం ప్రజల్లో 15 శాతానికి కొంచెం తక్కువగా పౌష్టికాహార లోపంతో ఉన్నారు. దేశం వెలుపల ఆకలిని తొలగించే అమెరికా చర్యలు దేశంలో కంటే ఎక్కువగా విజయవంతం కావడం హాస్యాస్పదమని విశ్లేషకులు చెప్పారు. 2009లో 1.7 కోట్ల మంది బాలలు సహా 4.9 కోట్ల మందికి పైగా అమెరికా ప్రజలు ఏదో ఒక సమయంలో తగినంత ఆహార లేని స్థితిలో ఉన్నట్లు గత వారం అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 2008లో ఆర్థిక సంక్షోభం మూలంగా అమెరికాలో ఆహార అభద్రత ఉన్న కుటుంబాల సంఖ్య పెరిగింది. కానీ అది 2009లో కూడా తగ్గలేదు. ఈ నిరంతర సమస్యను ఎదుర్కొనేందుకు అమెరికా ప్రభుత్వం పోషకాహార సహాయ కార్యక్రమాలు చేపట్టింది. వాటిని సహజంగానే ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో విస్తరించింది. 2008-2009 మధ్య కాలంలో నిరుద్యోగుల సంఖ్య 90 లక్షల నుంచి 1.4 కోట్లకు పెరిగినప్పటికీ ఆహార అభద్రత అంత స్థాయిలో పెరగలేదని ఆహారం, పోషకాహారం, వినియోగదారుల సేవల ఉప మంత్రి కెవిన్‌ కోన్‌కన్నన్‌ చెప్పారు. అయితే ప్రభుత్వం తన దృష్టిని ఫెడరల్‌ రుణాలను తగ్గించడంపై పెట్టడంతో ఈ కార్యక్రమాలు కొంత వెనకపట్టు పట్టాయి. గతంలో ఫుడ్‌ స్టాంప్‌ కార్యక్రమంగా వ్యవహరించిన దాని స్థానంలో అనుబంధ పోషకాహార సహాయ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక ఉద్దీపన నిధుల ద్వారా దాన్ని కొంతమేర విస్తరించింది. అయితే అది ఇప్పుడు కోతలను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు మధ్యతరగతిగా ఉన్నవారు ఇప్పుడు పేదరికం, ఆకలి అంచుకు చేరినట్లు న్యూయార్క్‌ సిటీ ఆకలి వ్యతిరేక సంకీర్ణ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జోయెల్‌ బెర్గ్‌ చెప్పారు. కాగా పాఠశాల భోజన కార్యక్రమాలకు నిధులు సమకూర్చే పిల్లల పోషకాహార చట్టం కాంగ్రెస్‌ పునరామోదం కోసం వేచి ఉంది. సంప్రదాయికంగా పేదలు నివసించే ఆహార ఎడారులుగా పిలవబడే ప్రాంతాల్లో తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు 40 కోట్ల డాలర్లు అవసరమని అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలిపారు. అనేక దశాబ్దాలుగా తగినంతగా ఆహారం లేకుండా జీవిస్తున్న అల్పాదాయ సమూహాలు నేటికీ అక్కడున్నాయి.
అమెరికాలోనే ఆకలిని గురించి అంచనా వేయలేకపోతే ఇక విదేశాల్లోని పరిస్థితిని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 92.5 కోట్ల మంది ప్రజలు ఈ సంవత్సరం నిరంతర ఆకలితో ఉన్నట్లు ఐరాస తెలిపింది. అనేక దశాబ్దాలుగా వ్యవసాయ ఆధారిత అభివృద్ధిని విస్మరించిన ఫలితమే ఈ పరిస్థితి అని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యుఎస్‌ఎఐడి) అడ్మినిస్ట్రేటర్‌ రాజీవ్‌ షా చెప్పారు. 'ఆహార ధరల సంక్షోభం ఒక మేలుకొలుపు. ఇది ఆకలి, పోషకాహార లోపం, ఆహార భద్రతకు సంబంధించి ఒక నూతన ప్రపంచ చర్చను ప్రారంభించింది' అని బ్రెడ్‌ ఫర్‌ ది వరల్డ్‌ సంస్థ డైరెక్టర్‌ అస్మా లతీఫ్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నార్తుల్లో మూడింట రెండు వంతుల మంది కేవలం ఏడు దేశాల్లోనే ఉన్నట్లు ఐరాస తెలిపింది. అయితే పౌష్టికాహార లోపమున్న ప్రాంతాలు అమెరికా సహా అన్ని చోట్లా ఉన్నట్లు పేర్కొంది.

24, నవంబర్ 2010, బుధవారం

కుల, ధనబలం ముందు ఓడిన రోశయ్య

కులబలం, ధనబలం, పెచ్చుమీరిన అవినీతి ముందు రోశయ్య నిజాయితీ ఓడి పోయింది. ప్రజలకు సేవచేయడానికి రాజకీయాలను ఎంచుకుంటారని ఒకప్పటి మాట. కాని డబ్బు సంపాధించుకోవడమే పరమావదిగా మారింది. ఈ క్రమంలో కొద్దోగొప్పో విలువలకు కట్టుబడి ఉన్న రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి ముళ్లకిరీటమయింది. రాష్ట్రంలో రెడ్డి, ఖమ్మ కులస్తులే కీలక పదవులు చేజిక్కించుకుని కోట్లకు పడగలెత్తారు. కోట్ల రూపాయలను , వారి వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాలను అడ్డంపెట్టుకున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈక్రమంలో రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఊహించని రీతిలో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. రోశయ్య రాజకీయాల్లో వివాదాస్పదుడుగా , అనుభయం ఉన్న రాజకీయ నేతగా ఎదుగుతూ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతిసారి రోశయ్యకు మంత్రిపదవులు దక్కాయి. ఆయన రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని డబ్బును కూడా పోగేశారని చర్చజరిగింది. ఏదేమయినా అధికారంలో ఉన్న రెడ్డి , ఖమ్మ సామాజిక వర్గం సంపాధించినంతగా లేదని చెప్పవచ్చు. సామాజిక పరంగా చూస్తే జనాభా ఎక్కువగా ఉన్న బలహీన వర్గాల వారికి అధికారం దక్కాలి. కాని డబ్బు, ధర్పం, అగ్రకులం ఈ రెండు మాత్రమే కొలమానంగా మన రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ వస్తున్నాయి. ఆక్రమంలో రోశయ్య సామాజిక వర్గం చేతిలో డబ్బు ఉన్నప్పటికీ గుడిని, గుడిలోని లింగాన్ని మింగేంత సామర్థ్యం లేదేమో అనిపించింది. ప్రస్తుత పరిస్థితిలో రోశయ్య నిజాయితీ ఓడిపోయిందనే చెప్పాలి. జగన్‌ను దెబ్బతీయడానికి రోశయ్యను మార్చారని, తెలంగాణా గొడవనుంచి సెట్‌రైట్‌ చేయడానికి అని ఏవేవో చర్చలు జరిగినా. దోపిడీని సమర్థవంతంగా కొనసాగించే నాయకుని కోసం వయోభారం పేరుతో రోశయ్యను రాజీనామా చేయించారనేది నిజమని పిస్తోంది. '' క్రీడాకారులను మార్చినంత మాత్రాన ఏమి ప్రయోజముండదు. రాజకీయ మనే ఈక్రీడలో ఆడే విధానం మారితేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమని నా అభిప్రాయం.''

23, నవంబర్ 2010, మంగళవారం

పర్యాటకులను అబ్బుర పరిచే బెలుం గుహలు

పర్యాటకులను అబ్బుర పరిచే బెలుం గుహలకు చూసేందుకు రోజుకు 400 నుండి 500 మంది దాకా వస్తుంటారు. సెలవురోజుల్లో ఎక్కువగా వస్తుంటారు. ఇటీవల మాకార్యాలయం సిబ్బందితో విహార యాత్రకు వెళ్లాం. అందులో మాకుటుంబసభ్యులు కూడా ఉన్నారు. భూమి పై భాగంలో గుహల దగ్గరకు రాగానే ద్యానంలో ఉన్న 50 అడుగుల బుద్దుని విగ్రహం కనబడింది. బుక్కింకు ఆఫీసు క్యాంటీన్‌ వగైరాలున్నాయి. గుహలోకి వెళ్లగానే మొదట సింహద్వారం, ద్యాన మందిరం దాటిన తరువాత ఒక మహిళను ఎత్తుకుని మాకు ఎదురుగా వస్తున్నారు. ఆమెకు దాదాపు 30 ఏడ్లుంటాయి. ఏంటని అడిగితే ఉదయం టిఫిన్‌ చేయలేదు. ఆమెకు కొంత నీరసంగా ఉందని చెప్పారు. ఆపరిస్థితి చూడగానే కొందరు గుహలలోకి రాకుండా వెనుదిరిగారు. నాక్కూడా వెనక్కి వెళ్లాలనిపించింది. అప్పటికీ మాతో వచ్చిన గైడ్‌ చెబుతూనే ఉన్నాడు. ఏమి కాదు చివరిదాకా ఎలాంటి బ్రీతింగు సమస్య రాదు నేనున్నానుగా నాతో రండని...అయినా కొందరు భయపడ్డారు. మాసిబ్బందిలో కూడా కొందరు వెనుదిరిగారు. లోపలికి వెళ్లేకొద్దీ చెమటలు పడుతున్నాయి. మధ్యమధ్యలో వెంటిలేటర్ల ద్వారా గాలి వస్తుంది. అక్కడ అందరూ గుమిగూడుతారు. గైడ్‌ చెప్పేవి సక్రమంగా వినడం లేదు. వేయిపడగలు...మండపం.. .మర్రిఊడలు... .దాటాం... అక్కడ మాపెద్దబ్బాయి గౌతమ్‌ డాడి మర్రి ఊడలు ఉన్న దారిలో లోపలికి వెళ్ధాం అంటాడు. అక్కడ ఎవ్వరూ వెళ్లడం లేదురా అందరూ వెళ్లే దారిలో వెళ్ధామని చెప్పాను. మా మూడో అబ్బాయి చంటి ఏడుస్తున్నాడు. చెమటలు పడుతుంటే కొంత భయపడి నట్లున్నాడు. నేను భుజానికొత్తకుని ఏమి కాదని సమాదాన పరిచాను.. కొందరు చంటి బిడ్డలను కూడా వెంటతెచ్చుకున్నారు. హాప్పీగా ఫాలో అవుతున్నారు. ఇలా ఒక్కోటి దాటుకుంటూ లోపలికి వెళ్తున్నాం. మాయా మందిరం...కోటి లింగాలు...చివరగా పాతాళ గంగ....కొన్నిచోట్ల ఒక్కో మనిషి మాత్రమే నడిచే దారుంది. అక్కడ కొంచెం భయమనిపిస్తోంది. గుహలలో రాతి పొరలు కనబడుతాయి. దీనిని చూస్తుంటే భూగర్భ జలం ఎంత అడుగంటి పోయిందో అర్థమవుతుంది. పాతాళ గంగ దాకా వెళ్లాక మా చంటి మరింత భయపడుతున్నాడు.. దీంతో తొందరగా బయటికి వెళ్లాలని పించింది. గైడును అడిగాను షార్టుకట్‌ రూటేదయినా ఉందాని లేదని చెప్పాడు. వచ్చిన దారినే వెళ్లాలని చెప్పాడు. అక్కడ దాహమేసింది. పాతాళగంగలో నీళ్లు తాగవచ్చా అని గైడ్‌ను అడిగాం... అవి బ్యాక్టీరీయా ఎక్కువగా ఉండే నీరు ఏమైనా అవుతుంది. గొంతు పట్టేయడం లేదా మోషన్స్‌ కావచ్చు తప్పదంటే తాగండని చెప్పారు. అక్కడే ఒక అమ్మాయి చేతిలో వాటర్‌ బాటిల్‌ కనిపించింది. అడగ్గానే ఇచ్చింది నేను మాచంటి తాగాం. డాడీ మాకు నీళ్లంటాడు..మా రెండో వాడు ఆదిత్య వాడికి కూడా తాపాను. తిరిగి బయటకు వచ్చే వారందరికీ చెమటలు పట్టాయి. మరోపక్క ఎదురుగా వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. ఆరోజు ఆదివారం కావడం వల్ల ఎక్కువగానే ఉన్నారు. సంహద్వారం దాకా వచ్చాక కూర్చున్నాం. గైడ్‌ను అప్పుడు మరిన్ని వివరాలడిగాను. మనం 120 ఫీట్లు లోతుకు వెళ్లి బయటకు వచ్చాం. అంటే దాదాపు పదంస్తుల భవనం అంత అని ఊహించుకున్నాను. 140 ఫీట్ల లోతుకు ఆక్సిజన్‌ పుష్కలంగా ఉంటుంది. వృద్ధులు కూడా లోపలికి వెళ్లి రావచ్చని గైడ్‌ చెప్పారు. లోబిపి లేదా ఆస్తమా ఉన్న వారు వెళ్లితే కొంత సమస్య అవుతుంది. వారు మాకు ముందే చెబితే ఆక్సీ కేర్‌ పెడుతాం. వారికిఊపిరి తీసుకునే సమస్య రాదన్నాడు. లోపల ఏమైనా అవుతుందేమో అనే ఫీలింగు మనుసులో ఉన్నవాళ్లు భయపడుతారు తప్ప ఎవ్వరికీ ఏమి కాదని చెప్పాడు. సింహద్వారం నుండి పాతాళగంగ వరకు పెట్టిన పేర్లు పర్యాటక శాఖ ఆధీనంలోకి వచ్చాక పెట్టినవే..... మూడు కిలో మీటర్ల భూగర్భ జలం తగ్గిపోయాక సహజంగా గుహలు ఏర్పడ్డాయి. ...అయితే కిలో మీటరున్నర మాత్రమే వెళ్లగలుగుతున్నాం... ఇంకా లోపలికి వెళ్లడానికి దారి బాగలేదు. ఆతరువాత కొంత లోపలికి వెళ్లడానికి దారిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎక్కువగా మనుషుల ద్వారా తయారు చేసినవే ఉన్నాయి. యంత్రాల వినియోగం చాలా తక్కువ. ఇటీవల బెంగుళూరు, జమ్ముకాశ్మీర్‌ , స్విట్జర్‌ లాండు వాళ్లు దీనిపై కొంత పరిశోధన చేస్తున్నారు. ఆక్సిజన్‌ లోపలికి ఎలా వెళ్లేది....టెంపరేచర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని పరికరాలను అమర్చారు.
ప్రంపంచలోనే రెండోది బెలుం గుహలు
అండర్‌ గ్రౌండ్‌ కేవ్స్‌ ప్రంపంచంలోనే బెలుం గుహలు రెండోది. స్పెయిన్‌దేశంలో 10 కిమీటర్ల పొడవునా గుహలు ఉన్నాయి. ఆతరువాత ఇక్కడే ఉన్నాయి. మేఘాలయలో కేవ్స్‌ ఉన్నాయి. కాని అవి కొండకు ఉన్నాయి. వైజాగ్‌లో బొర్రాకేవ్స్‌ ఉన్నాయి. అవికూడా కొండకే ఉన్నాయి. భూగర్భంలో సహజంగా ఏర్పడిన మొదటి గుహలు మాత్రం బెలుంలోనే ఉన్నాయి.
భారతీయ సంస్కృతిలో గుహలు దేవతలకు దేవుళ్లకు నివాసమనే నమ్మకం వల్ల అవి పవిత్ర స్థలాలుగా గుర్తించబడ్డాయి. గుహలు కొండ చెరియలలోనూ అడవులలోనూ ఎక్కువగా కన్పిస్తూ ప్రకృతి నిలయాలై విరాజిల్లుతుంటాయి. పురాతన కాలంలో ఈ గుహల్ని ప్రాచీన మానవుడు నివాసాలుగా ఉపయోగించుకున్నాడు. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ గుహల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవల్సిన అవసరం ఎంతయినా ఉంది కదా.......
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం, బెలుం గుహల కథా, కమామి షు ............
ఈ గుహలలో క్రీ.పూ.4500 నాటి మట్టి పాత్రలు వీటిలో దొరకటం విశేషం. జైనమునులు వుండెవారని శంకరాచార్యులు చెప్పారు. 1884లో హె.బి. పూటె అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా వీటి ఉనికిని చాటి, కొంత వరకు కొలిచాడు. 1982-83, 83-84 శీతాకాలాల్లో జర్మనీకి చెందిన గుహాన్వేషకుడు, హెచ్‌.డి.గేబర్‌ ఆయన సహచరులతో ఈ గుహ సొరంగాలను మూడు కిలోమీటర్ల 225 మీటర్లు పరిశోధించి పటాన్ని తయారు చేశారు. 1988 ఆంధ్రప్రదేశ్‌ పురాతత్వ శాఖవారు వీటిని రక్షిత స్థలంగా ప్రకటించి కొన్నేండ్లు కాపలాదారుని కూడా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి వాటి పోషణ భారాన్ని తమ పరిధిలోకి తీసుకొన్నారు. సారంగ మార్గాల గుండా మట్టి దిబ్బలు తొలగించి నాపరాళ్లు పరిచి ఒకటిన్నర (1 1/2) కిలో మీటర్‌ పొడవునా నడక దారి తయారు చేశారు. విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. సొరంగాల చివరి ప్రదేశాలలో గాలిని లోపలకు పంపే పంకాలు ఏర్పాటు చేశారు. ఉపరి తలం నుంచి 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల వరకు ఉన్న ఈ సొరంగాలు (120 ఫీట్లలోతున) కొన్ని చోట్ల విశాలంగానూ కొన్నిచోట్ల యిరుకుగానూ వివిధ ఆకృతులు కలిగిన స్ఫటికాకారం స్టాలెగ్‌ మైట్లు, నీటి మడుగులు, గిజిబిజిగా ఉన్న ప్రక్క సొరంగాలు చూచుటకెంతో యింపై పర్యాటకులనెంతో అకట్టుకొంటున్నాయి. ఈ గుహాన్వేషణలో పాల్గొన్న డానియల్‌ గేబర్‌, ఆయన సహచరులు, వారికి సహకరించిన స్థానికులు రిటైర్డ్‌ ఎస్‌.పి బి.చలపతిరెడ్డి, ఆయన అల్లుడు కీర్తి శేషులు పి.రామసుబ్బారెడ్డి, రిటైర్డ్‌ హైస్కూలు హెడ్‌ మాస్టర్‌, రామస్వామిరెడ్డి, వెంకటరమణ, పద్మనాభయ్య సహకరించారు. ఈ గుహలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలోకి రావడానికి కృషి చేసిన రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్‌.పి ఎం.నారాయణరెడ్డి చిరస్మరణీయులు కృషిచేశారు. నల్లరేగడి నేలలో పంట పొలాల నడుమ సేద్యానికి అనువుగాని 90 సెంట్ల రాతి ప్రదేశంలో చేదురు బావిలాంట మూడు రంధ్రాలు 10 మీటర్ల లోతున ఉన్నాయి. ఒకటి అడుగు పూడి పోయింది. నడుమనున్న దాని గుండా దిగటానికి మెట్లు కట్టారు. అడుగు నుండి నేలకు సమాంతరంగా పొడవైన విశాలమైన సొరంగ మార్గం ఉంది. లోపల కొంత దూరం పోయిన తర్వాత ఇది మూడు భాగాలుగా చీలి పోయింది. ఒకటి ఒకే చిన్న గదికి, ఒకటి మండపం అనే చోటికి, ఒకటి పాతాళ గంగ అనే నీటి మడుగు, కోటి లింగాలు అనే వ్రేలాడేస్ఫటికాకాృతులు గల గదికి దారి తీస్తాయి. విద్యుద్దీప కాంతిలో ఈ సొరంగాల సోయగాలను తిలకిస్తూ పయనిస్తూ ఉంటే వేరే ప్రపంచంలో ఉన్నట్లనిపిస్తుంది. భూగర్భంలో దాగి ఉన్న ఊహాతీతమైన ప్రకృతి ప్రసాదమైన పై చిత్రాలు పోయినంత దూరం కనిపిస్తూ సందర్శకులను మైమరిపిస్తూ ఉంటాయి.
బెలుం గ్రామంలోని చారిత్రాత్మిక బావి
ఊరు చివర, శివాలయం పక్కన, నిటారుదారులు కలిగిన రాతి బావి దర్శనమిస్తుంది. అది దిగుడు బావి ఒకవైపు మెట్లున్నాయి. నిజానికది బావి కాదు. ఒక నిటారు గుహ వర్షాకాలంలో నీరు నిండి ప్రవహిస్తుంది. వేసవిలో నీరు యింకిపోతుంది. కరువు కాలంలో అడుగున పక్కకు గల సొరంగంలో నీరు నిలుస్తుంది. ఇదే గ్రామస్తులందరికీ నీటి వనరు 1946 మొదటిసారి గ్రామ మునసబు బి.మల్లారెడ్డి బావి పటం గీశారు. బెలుం గుహలలో చేరే నీటిని బట్టి చాలా తక్కువ ఎత్తులో గల ఈ బావి నీటి మట్టం ఉంటుంది. 30 కిలో మీటర్లలో ఉన్న పెన్నానది నీటి మట్టం కూడా దీనిపై ప్రభావం చూపుతుందంటారు. ఇది నిండినప్పుడు శివాలయంలోని శివలింగం కింది నుంచి నీరు ఉబికి పారుతుంది. బెలుం గుహలు భూగర్భంలో ఏర్పాటు కావటం ఈ గుహల యొక్క విశిష్టత.
బెలుం గుహలు ఉనికి
బెలుం గ్రామానికి 1 1/2 కి.మీ నైరుతి దిశలో ఉంటుంది. దీనికి 1 1/2 కిలోమీటర్ల దూరంలో తూర్పున బస్సు రోడ్డు ఉంది. ఈ రోడ్డు కర్నూలు-తాడిపత్రి, విజయవాడ-బెంగుళూరు, నంద్యాల, అవుకు (బనగానపల్లె మీదుగా) తాడిపత్రి మార్గాలకు
సందర్శనార్థం సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం గం.5-30 నిమిషముల వరకు
ఛార్జీలు: పెద్దలకు రూ.30/- పిల్లలకు రూ.20/-
బెలుం గుహలు : హరిత అతిథి గృహము డార్మిటరీ బెడ్‌-రూ.40/-
బెలుం గుహలకు గల దూరం:
- తాడిపత్రి నుంచి 30 కి.మీ
- అనంతపూర్‌ నుంచి 80 కి.మీ
- తిరుపతి నుంచి 275 కి.మీ
- హైదరాబాదు నుంచి 320 కి.మీ
- బెంగుళూరు నుంచి 280 కి.మీ
- చెన్నై నుంచి 420 కి.మీ

22, నవంబర్ 2010, సోమవారం

ప్రయివేటు పరం కానున్న జాతీయ ప్రసార సాధనాలు

భారతీయ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, జానపదాన్ని, కళలను, రైతులకు వ్యవసాయ రంగంపై సూచనలను, ఆరోగ్య సూత్రాలను సామాన్య ప్రజలకు ఏలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ప్రసారం చేస్తూ ప్రసార విప్లవానికి ప్రతీకలైన ప్రభుత్వ ఆకాశవాణి, దూరదర్శన్‌ ఛానల్స్‌ నేడు ఆపదలో చిక్కుకున్నాయి. నష్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఛానల్స్‌ను ప్రైవేటుపరం చేయనుంది. ఈ నెల 25 న రెండు ఛానల్స్‌ ఆస్తులను అతి తక్కువ ధరకు కార్పొరేట్‌ మాఫియాకు అప్పగించేందుకు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు అమలైతే భారతమాత ముద్దుబిడ్డ ప్రసార కేంద్రం దూరదర్శన్‌, ఆకాశవాణి స్వరం, రాగం మారిపోనున్నాయి. దూరదర్శన్‌ ఏర్పడినప్పటి నుండి దాదాపు 25 ఏళ్లుగా ఉచిత ప్రసారాలు చేస్తూ పేద ప్రజల హృదయంలో చెరగని స్థానం సంపాదించింది. ఢిల్లీ, హైద్రాబాద్‌ నుండి విడుదలైన ప్రసారాలను శాటిలైట్‌ ద్వారా తీసుకుని రిలే కేంద్రం నుండి 100 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. కార్పొరేట్‌ మాఫియా కన్ను ఇక జాతీయ ప్రసార సాధనాలైన ఆకాశవాణి, దూరదర్శన్‌లపై పడింది. ఈ నెల 25న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న ప్రసార భారతి సవరణ బిల్లును మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా రిలే కేంద్రం ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 14 నుండి 25 వరకు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, వెల్దండ, కోస్గి, గద్వాల, జడ్చర్ల, మాడ్గుల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తిలలో పది దూరదర్శన్‌ రిలే కేంద్రాలు నడుస్తున్నాయి. ఒక్కో రిలే కేంద్రంలో 12 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హైద్రాబాద్‌ నుండి విడుదలైన ప్రసారాలను శాటిలైట్‌ ద్వారా తీసుకుని ఆయా కేంద్రం పరిసర గ్రామాలకు ఉచితంగా ప్రసారాలను అందిస్తారు. ప్రైవేటు ఛానల్స్‌ సంచలనం కోసం పాకులాడుతూ విలువలను మరచిపోయి ప్రవర్తిస్తున్నాయి. కుటుంబ సమేతంగా చూడలేని ప్రసారాలను ప్రైవేటు ఛానల్స్‌ ప్రసారం చేస్తున్నాయి. ఈ దిశలో మళ్లీ నెలనెలా వందల రూపాయలు ఫీజుల రూపంలో ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. కానీ దూరదర్శన్‌ ఛానల్‌లో ప్రసారాలను కుటుంబ సమేతంగా వినోదాన్ని తిలకించవచ్చు. అలాంటిది ప్రైవేటు పరమైతే జర్నలిజం విలువలు, సామాజిక చైతన్యం మంటగలిసిపోతాయి. నిరుపేదలు వీక్షించే దూరదర్శన్‌ ఛానల్‌ ప్రసారాలు వింతపోకడల రూపంలో వస్తాయి. ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆదరించిన ఆకాశవాణి, దూరదర్శన్‌లను చీదరించుకునేలా పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో ఏలాంటి సందేహం లేదు. కేవలం మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కొన్ని లక్షల కోట్ల విలువ గల ఆకాశవాణి, దూరద్శన్‌ ఆస్తులను అతి తక్కువ ధరలకు అమ్మకానికి కేంద్రం అంగటి సరుకుగా మారుస్తోంది. దక్కించుకునేందుకు కేంద్ర మంత్రులతో పలువురు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. దీన్ని బతికించడానికి ఆకాశవాణి, దూరదర్శన్‌ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంతో పోటీ పడుతున్నారు. రెండు ఛానల్స్‌ను ఆదరించిన ప్రేక్షకులు ప్రైవేటు పరాన్ని వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో పల్లెలు, చెంచు పెంటలు, ఏజెన్సీ గ్రామాలు అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో ప్రసారాలు, సమాచారం, వినోదం అందకపోయేది. ప్రసార శాఖా మాత్యులు ఎస్‌.జైపాల్‌రెడ్డి దూరదర్శన్‌ రిలే కేంద్రం(లోవర్‌ టీవి ట్రాన్స్‌మీటర్‌)ను ప్రారంభించారు. 1990 నుండి ఎలక్ట్రానిక్‌ ఛానల్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మొదటగా టీవీలో ప్రసారాలు విడుదల చేసి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించింది మాత్రం దూరదర్శన్‌ ఛానలే. ప్రస్తుతం ప్రైవేటు ఛానల్స్‌ పోటీపడుతున్న తరుణంలో దూరదర్శన్‌ను ఆదరిస్తున్నారు. ఒక్కొక్క రిలే కేంద్రంలో అసిస్టెంట్‌ ఇంజనీయర్‌(ఎఇ) ఎస్‌సిఎ, ఈఎ, సీనియర్‌ టెక్నీషియన్‌, ఇద్దరు టెక్నీషియన్లు, హెల్పరు ఉంటారు.
నష్టం పేరుతో ప్రైవేటుపరం అన్యాయం
కేవలం మూడువేల కోట్లు ఖర్చు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. అలాంటిది నష్టం పేరిట దూరదర్శన్‌ను కార్పొరేట్‌కు అప్పగించడం అన్యాయం. దేశ సంస్కృతిని, పవిత్రతను, జానపదాలను ప్రచారం చేస్తూ జాతి భద్రతను ప్రజలకు తెలియజేస్తూ జీవం పోసేది దూరదర్శన్‌ ఛానల్‌. ప్రభుత్వం ఖర్చు భరిస్తూ ఆదుకోవాల్సి ఉంది.
- కర్నాకర్‌, టెక్నీషియన్‌, అచ్చంపేట
జర్నలిజం విలువలు పడిపోతాయి
ప్రస్తుతం మీడియా విపరీతంగా విస్తరించింది. ప్రైవేటు ఛానల్స్‌ ప్రసారాలను కుటుంబమంతా కలిసి చూడలేకపోతున్నారు. కానీ దూరదర్శన్‌ ఛానల్‌ ఎన్నో ఏళ్లుగా అశ్లీలచిత్రాలు లేకుండా, భారతీయ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఉండేది. ప్రైవేటుపరమైతే జర్నలిజం విలువలు మరింతగా దిగజారుతాయి.

19, నవంబర్ 2010, శుక్రవారం

ఈ పొడుపు కథను తెలుసుకుందాం

'' గుండ్రంగా ఉంటాను భూమిని కాను.
నల్లగా ఉంటాను బొగ్గును కాను,
మాట్లాడుతాను కాని మనిషిని కాను.''
పొడుపు కథలు, సామెతలు దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఆవిర్భవిస్తాయి. సమాజంలో కనిపించే మార్పులన్నీ వీటిలో తొంగిచూస్తుంటాయి. ఈ పొడుపుకథ కూడా సమాజంలో ఒకప్పుడు సాంకేతిక విప్లవం అనుకున్నదాన్ని ప్రతిబింబిస్తూ ఆవిర్భవించింది. భూమిలాగా గుండ్రంగా ఉన్నాడట, బొగ్గులాగా నల్లగాను ఉన్నాడట, ఇంకా ముందుకెళితే మాటలు కూడా మాట్లాడుతాడట. ఎవరావ్యక్తి అని బుర్రకు పదునుపెడితే గ్రామ్‌ఫోన్‌ రికార్డ్‌ కళ్లెదుట ప్రత్యక్షమై నేను విడుపుని అంటుంది. గ్రామ్‌ఫోన్‌ రికార్డ్‌ ప్లేట్‌ '' గుండ్రంగా ఉంటుంది. అయినా అది భూమి కాదు. నల్లగానూ ఉంటుంది అయినా అది బొగ్గూకాదు. దాన్నుంచి మాటలు వినిపిస్తాయి అయినా అది మనిషి కాదు.'' ఈ సమాధానాలన్ని కలిసి ఈ పొడుపుకథకు విడిపు గ్రామ్‌ఫోన్‌ రాకార్డ్‌ అని సూచిస్తున్నాయి.
పొడుపు కథ అలా ఉంటే దానిని మొదట థామస్‌ అల్వా ఎడిసన్‌ 1877లో కనుగొన్నారట. ఆతరువాత 1887లో మరో అమెరికన్‌ శాస్త్రవేత్త ఎమైల్‌ బెర్లినర్‌ పూర్తిస్థాయిలో గ్రామ్‌ఫోన్‌ రికార్డన్‌ను తయారు చేశారట. ఆతరువాత చాలా మార్పులు చెందింది. గ్రామ్‌ఫోన్‌ రికార్డర్‌ ఇప్పుడు కనబడదు.

18, నవంబర్ 2010, గురువారం

'తండ్రి తవ్విన నుయ్యిని దూకుతామా'


ఎదుటి వ్యక్తుల మీద ఎంత ప్రేమాభిమానాలున్నా ఎంతవరకు ప్రకటించాలో అంతవరకే ప్రకటించాలని మితిమీరితే ప్రమాదమని చెప్పడానికి తెలుగులో ఈ జాతీయం వచ్చింది. ఒక వ్యక్తికి అతడి తండ్రంటే ఎంతో ఇష్టమట. ఆ తండ్రి ఓ నుయ్యిని (బావి) తవ్వించాడట. అది నిండుగా నీటితో ఉండేదట. కొంత కాలానికి తండ్రి పోయాడట. తరువాత తనతండ్రి తవ్వించిన నుయ్యిమీద పుత్రుడికి మమకారం పెంచుకున్నాడట. దాంతో ఆబావిలోకి దూకి దాన్నంతా తన సొంతమని అందరికీ తెలియచెబుదామనుకున్నాడట. అయితే నిజంగా అలాగే జరిగితే అదెంత ప్రాణాంతకమో ఎవరైనా ఊహించవచ్చు. ఆ పుత్రుడిలాగా ఎవరైనా మితిమీరిన ప్రేమతో ప్రవర్తిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకునే సందర్భాలలో ఈప్రయోగం కనిపిస్తుంది. అలాంటి పుత్రులు ఈ కాలంలో వివిధ రంగాలలో కనిపిస్తున్నారు. రాజకీయాల్లో ఎక్కువగా కనిస్తున్నారు.

17, నవంబర్ 2010, బుధవారం

హంసను మీరు చూశారా?

హంస ఒక అందమైన పక్షి అంటారు. హిందూమతంలో హంసకొక ప్రత్యేకస్థానం ఉందట. హంస సరస్వతీదేవి వాహనమట. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని పరమహంస అని ప్రస్తుతించేవారుట. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్థ్యం ఉందంటారు. కాని అది పాలు, నీరు కలిసిన మిశ్రమంలో నుండి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుందట. ఇది వేదాలలో చెప్పబడిన హంస. ప్రస్తుతం ఇవి లేవు అంటారు. అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రవాణాశాఖ వారి సరికొత్త బస్సుసర్వీసుకు రాజహంసని పేరు పెట్టారు. ఆదిలోనే హంసపాదు అనే పదాన్ని ఆటంకాలు ఏర్పడిన సందర్భాలలో పత్రికల్లో రాసేస్తున్నారు. వయ్యారి భామ నీహంసనడక అని రచయితలు పాటను కూడా రాశారు. ఇలా హంస ప్రయోగం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు. అబ్బో తెగ రాసేస్తున్నారు. ఇంతకూ హంసను చూశారా? చూస్తే ఎలా ఉంటుంది. పాలను, నీళ్లను వేరు చేసిన సందర్భాలున్నాయా? హంసపాదు అని ఎందుకు ప్రయోగించారు. హంస నడక చూశారా? చూసిన వారేవరయినా వివరణ ఇస్తారని ఆసిస్తున్నాను.

16, నవంబర్ 2010, మంగళవారం

చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి


మనిషికి క్రమశిక్షణ ఎంత అవసరమో వివరించే సామెత ఇది. విచ్చల విడిగా తిరగడం, హద్దూపద్దూ లేకుండా వ్వవహరించడం , మంచితనం అనిపించుకోదు. ఈ విషయాన్నే ఈసామేత వివరిస్తోంది. ఎవరిదైనా ఒక చేను ఉన్నదంటే దానికి హద్దులను సూచించే విధంగా గట్టు ఉండటం ఎంత అవసరమో మనుషులంతా కలిసి మానవత్వంతో బతకాలనుకున్నపుడు వారు నివసిస్తున్న ఊరికి కొన్న కట్టుబాట్లు ఉండితీరాలి. ఆకట్టుబాట్లను ఆ ఊరిలోని వారంతా సమానంగా ఆచరించాలి. అప్పుడే అన్ని విధాలా సుఖశాంతులు వర్థిల్లుతాయి. చేనుకు వేసిన గట్టు ఆచేను హద్దును సూచించినట్లుగానే ఒక ఊరి ప్రజలు ఏర్పరుచుకున్న కట్టుబాట్లు వారి జీవనశైలిని , మంచితనం వంటి లక్షణాలను ఇతరులు సులభంగా చూసి తెలుసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ఒక దేశం కూడా మనుషులు ఎలా ఉండాలనేదానికోసం కొన్ని కట్టుబాట్లను రాజ్యంగ యంత్రం ద్వారా రూపొందించుకున్నాం. అవి పాటించడంలో లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయాయి. దేశంలో రాజకీయాలు అంటే అసహించుకునేలా మారింది. మనకున్న కట్టుబాట్లు, క్రమశిక్షణ ఎందుకని పాటించడం లేదు. ఎవరు బాధ్యత వహించాలి. గవర్నర్‌ అంటున్నారు. కాగ్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని అందుకు ఎమ్మెల్యేలు మంత్రులు సిద్దంగా ఉన్నారా? ఉంటే ఏ స్థాయిలో చర్చజరుగుతుందో వేచి చూడాలి.

14, నవంబర్ 2010, ఆదివారం

కిరణ్ బేడి జీవిత విశేషాలు


కిరణ్ బేడీ (Kiran Bedi) భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగ్సేసే అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో ఆప్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది. 
బాల్యం, విధ్యాభాసం
కిరణ్ బేడీ జూన్ 9, 1949 నాడు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లో జన్మించింది. తల్లిదండ్రులకు 4 కూతూర్లలో ఈమె రెండవది. డిగ్రీ వరకు స్థానికంగా అమృత్‌సర్ లోనే విధ్యాభాసం కొనసాగించింది. 1968-70 లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి ఎం.ఏ.పట్టా పొందినది. ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందినది. 1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి. పట్టాను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందినది. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను మరియు ఆల్_ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొందింది. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిన్‌ను గెలుపొందినది. 
ఉద్యోగ జీవితం
కిరణ్ బేడీ అమృత్‌సర్ లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా (లెక్చరర్) జీవితం ప్రారంభించినది (1970-72. 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపైకైంది. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చంఢీగర్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోను పనిచేసింది. ఢిల్లీ ట్రాపిక్ పోలీస్ కమీషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై త్రాపిక్ నియమాలను ఉల్లంఘించిన ఉన్న కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధి చెందినది. తీహారు జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్నలను పొందింది. వాటి పలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగ్సేసే అవార్డు పొందినది.

అన్నిట్లో ముందుంటూ.. ఆకలితో అల్లాడుతూ...

నిరాదరణకు గురవుతున్న కావలికారులు
రోజంతా పని చేస్తే కూలి 56 రూపాయలే..
కనీసం ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించలేని స్థితి
ప్రజలను దోపిడీ చేస్తూ అన్యాయానికి పాల్పడే వారిని నియంత్రించి.. బాధితులకు న్యాయం చేసేది ప్రభుత్వం. కానీ ప్రభుత్వమే శ్రమదోపిడీ చేస్తూ.. శ్రమకు తగ్గ ఫలితం ఎగ్గొడుతున్న తీరు విస్మయం కల్గించకమానదు. కనీస వేతనాలు అమలు చేయాల్సిన ప్రభుత్వమే.. కావలికారులతో వెట్టిచాకిరీ చేయిస్తోంది. ఊరంతా నిద్రపోయినా తను మాత్రం గ్రామ క్షేమం కోరి మేల్కొని ఉండే కావలికారు.. దోపిడీలు, గొడవలు అరికట్టడంలో ముందుంటున్నాడు. మూడు రంగుల చేతికర్రతో ఊరంతా గస్తీ తిరుగుతూ... ఎవరికి ఏ ఆపద వచ్చినా తన సొంత ఆపదలా వణికిపోతాడు. గ్రామానికి ఏ అధికారి వచ్చినా 'జీ సలాం' అంటూ సహాయకారిగా ఉంటాడు. గ్రామానికి వచ్చిన ఏ అభివృద్ధి పథకమైనా కావలికారులు లేనిదే ప్రజలకు చేరదు. ఇంతటి ప్రాధాన్యత గల వారి జీవితంలోకి తొంగి చూస్తే... ప్రభుత్వం ఇచ్చే అరకొర జీతభత్యాలు సరిపోక అర్ధాకలితో అలమటించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ రెవెన్యూ డివిజన్‌లోని 13 మండలాల్లో 534 మంది గ్రామసేవకులు ఉన్నారు. ఇందులో బంట్రోతు, సోడు, గ్రామ కావలికారులు ఉన్నారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరు 3,562 మంది వీరిపై ఆధారపడి ఉన్నారు. వంతులవారీగా చేస్తున్న గ్రామసేవకులు మరో 5 వేలకు పైగానే ఉంటారు. మొత్తం 8,562 మంది గ్రామసేవకులు ప్రభుత్వం ఇచ్చే అరకొర జీతభత్యాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఎలాంటి ఇతర ఆస్తులూ ఉండవు. భూములు, మాన్యాలు గతంలో ఉన్నా క్రమంగా పటిక, పట్వార్వీలు వీటిని అన్యక్రాంతం చేసుకున్నారు.
నిరాదరణలో గ్రామసేవకులు
ప్రభుత్వ నిరాదరణతో గ్రామసేవకులు తల్లడిల్లుతున్నారు. 24 గంటలూ పనిచేసే వీరికి నెల జీతం 1,700 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంటే రోజుకు 56 రూపాయలు అన్నమాట. ఉపాధి కూలికి 100 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం.. గ్రామసేవకులకు మాత్రం 56 రూపాయలు చెల్లించడమేమిటని ప్రజాసంఘాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండల కార్యాలయానికి డ్యూటీలో వెళితే రాత్రి ఉండాలి. వీటికి గానూ అలవెన్సుల కింద రోజుకు పది రూపాయలను అధికారులే మెక్కుతున్నారు. మండల కార్యాలయానికి వెళ్లడానికి ప్రతి ఒక్కరికీ ఒక సైకిల్‌ ఇవ్వాల్సి ఉండగా.. దీన్ని ఎక్కడా అమలు చేయడం లేదు. వీరిని నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కొంతకాలంగా కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వీరిలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ పదోన్నతి కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వచ్ఛంద పదవీ విరమణ వర్తింపజేసి అర్హులైన వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కూడా వీరంతా కోరుతున్నారు. అధికారుల వేధింపులను, గ్రామ పెద్దల బెదిరింపులను అరికట్టాలని కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ వెట్టి పనులే..
గ్రామంలో వీరు చేస్తున్న పనులన్నీ వెట్టిపనులే. సర్పంచి ఇంట్లో పెళ్లి జరిగినా, పేరంటాలు అయినా గ్రామసేవకులు అన్నీ అయి చూసుకోవాలి. కట్టెలు కొట్టాలి. వంటలు చేయాలి. వడ్డించాలి. సాగనంపాలి. ఇలా ప్రతి పనీ గ్రామసేవకులే చేయాలి. సర్పంచికే కాదు గ్రామ భూస్వాములందరికీ ఈ వెట్టిచాకిరి చేయాల్సిందే. ఊర్లో ఎవరైనా చనిపోతే, ఆక్సిడెంట్‌ అయితే, మందుతాగి చనిపోతే ఆ శవం దగ్గర జాగారాలు చేయాల్సిందే. కేసు అయితే పోలీసులు వచ్చి పోస్టుమార్టం చేసి తిరిగి సమాధి పెట్టేవరకు అంతా వీరే చేయాలి. గొడవలు జరిగినా, ఇళ్లు కూలినా అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వీరిదే. ఇంకా జనాభా లెక్కింపు, ఓటింగు సమయంలో వెటర్నరీ సేవలు, హౌసింగ్‌ బిల్లులు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ పనికీ కావలికారులే ముందుండి అధికారులకు సహాయం అందివ్వాలి.
సమ్మె చేసినా లేని ఫలితం శూన్యం
జీతభత్యాల పెంపు కోసం ట్రేడ్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో గతంలో 45 రోజుల పాటు సమ్మె చేశారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేత ఒప్పందం కూడా చేసుకున్నారు. అయినా ఈ కోరికలు నెరవేరకపోవడంతో మళ్లీ గ్రామసేవకులు సమ్మెబాట పట్టనున్నారని గ్రామసేవకుల సంఘం జిల్లా అధ్యక్షులు నిరంజన్‌ హెచ్చరిస్తున్నారు.
తినేది కూడా నమ్మకం లేదు
ఏ అధికారి ఎప్పుడు వస్తాడో తెలియదు. అన్నం తింటుంటే అధికారి వచ్చినా, పోలీస్‌ వచ్చినా మధ్యలోనే పోవాలి. పూర్తిగా తింటామో, లేదో తెలియదు. అన్ని సౌకర్యాలు అధికారులకు చేయాలి. మేము ఉపవాసం ఉండాలి.
- లక్ష్మయ్య, గ్రామ సేవకుడు, నడిగడ్డ
ఉపాధి పనే నయం
ఉపాధి పనికి పోతే రోజు కూలి రూ.100 ఇస్తారు. మాకు మాత్రం 56 రూపాయలే. పెరిగిన ధరలకు ఈ మొత్తం దేనికీ సరిపోదు. దీంతో ఒక్కోరోజు పస్తులుండాల్సి వస్తోంది. పోలీసోల్ల లాగా ఎప్పుడూ టెన్షన్‌గా ఉండాల్సి వస్తోంది.
- కాశన్న, తాడూరు
కనీస వేతన చట్టం
అమలు చేయాలి
గ్రామసేవకులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. వీరిని నాలగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ పిఎఫ్‌, డిఎలు వర్తింపజేయాలి. ప్రతి గ్రామసేవకునికి సైకిల్‌ ఇవ్వాలి. పింఛన్‌, కారుణ్య నియామకాలు, పదోన్నతి తదితర సదుపాయాలు కల్పించాలి. వీటి అమలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే తీవ్ర ఉద్యమాలు చేపడతాం.- పొదిల రామయ్య,
సిఐటియు నాయకులు

13, నవంబర్ 2010, శనివారం

కర్నూలు జిల్లాలో వ్యవసాయం

కర్నూలు జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. రబీ పంటలూ వర్షం ఆధారంగా సాగుచేస్తారు. జిల్లా సగటు వర్షపాతం 670 మిల్లీ మీటర్లు. 44.15 లక్షల ఎకరాల భౌగోళిక విస్తీర్ణం ఉంది. అందులో 23.475 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. సాగునీటి వనరుల కింద ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది. ప్రధానంగా వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు, పత్తి, శనగ, జొన్న పంటలు పండిస్తారు. రెండేళ్లుగా ఖరీఫ్‌ సీజన్‌లో ఆముదం, కంది పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 13.5 లక్షల ఎకరాలు. ఈ సీజన్‌లో వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు, కంది, పత్తి, ఉల్లి పంటలు సాగు చేస్తారు. గిట్టుబాటు ధరలు లభించడం లేదని గత ఏడాది నుండి వేరుశనగ, పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు ఆముదం, కంది పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది కందులు లక్షా 25 వేల ఎకరాల్లో, ఆముదం 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. రబీలో బావుల, సాగునీటి వనరుల కింద 14 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. గతంలో రెండున్నర లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసేవారు. 4,5 సంవత్సరాలుగా పత్తికి ధరలు లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రబీలో 4.3 లక్షల హెక్టార్లలో శనగ, జొన్న, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేశారు. ధనియాలు 20 వేల హెక్టార్లలో, వేరుశనగ 18 వేల హెక్టార్లలో, వరి 12 వేల హెక్టార్లలో, మినుములు 10 వేల హెక్టార్లలో సాగు చేస్తారు. వీటితో పాటు టమోట, వంకాయ, బెండకాయ, ఉల్లి పంటలు విస్తృతంగా సాగు చేస్తారు. జిల్లాలో కెసి కెనాల్‌, తుంగభద్ర దిగువ కాల్వ, ఎగువ కాల్వ, తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బిసి, గాజులదిన్నె ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడం వల్ల కెసి కెనాల్‌లో 150 కిలోమీటర్ల వరకు ఆయకట్టు సాగు కష్టంగా మారింది. ఎల్‌ఎల్‌సి కింద కర్నాటక రాష్ట్రంలో నాన్‌ ఆయకట్టు విపరీతంగా ఉండటంతో జిల్లాలో ఎల్‌ఎల్‌సి ఆయకట్టు క్రమేణా తగ్గిపోతోంది. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు కొంత వరకు నీరు అందుతున్నా కోడుమూరు ప్రాంత రైతులకు అందడం లేదు. ఓ పక్క వర్షాభావ పరిస్థితులు, మరోపక్క సాగు నీటి విధానంలో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో జిల్లా రైతులు ఏటా కరువు బారిన పడుతున్నారు. ఏటా సరైన దిగుబడులు రాక... ఒకవేళ వచ్చిన మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జిల్లాలో కెసి కెనాల్‌, ఎల్‌ఎల్‌సి, హెచ్‌ఎల్‌సి, తెలుగుగంగ, గాజులదిన్నె, గురురాఘవేంద్ర ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉంది. కరువు ప్రాంతాలపై డోన్‌, పత్తికొండ, ఆలూరు, నియోజక వర్గాల్లో సాగునీరు అందించేందుకు చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హంద్రీనీవాకు ఆగస్టు 15 నాటికి నీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ వాగ్ధానాన్ని నిలుపుకోలేకపోయింది. దీంతో అసలు హంద్రీనీవాకు నీళ్లు ఇస్తారా? ఇవ్వరా? అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవాకు నీరిస్తే కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. జిల్లా నుండి ఉల్లి, టమోట పంటలను ఇక్కడి నుండి హైదరాబాద్‌, కలకత్తా, చెన్నై వంటి నగరాలకు ఎగుమతి చేస్తారు. ఉల్లి మార్కెట్‌లోకి ఎక్కువగా వచ్చినప్పుడు కొనుగోలు చేసి, నిల్వ చేసేందుకు గోడౌన్ల వసతి లేక రైతులు నష్ట పోతున్నారు. టమోట రైతుదీ అదే పరిస్థితి. టమోటాను చెన్నై, తాడేపల్లిగూడెం, విజయవాడ, హైదరాబాద్‌, గుంటూరు, వరంగల్‌ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. టమోట దిగుబడులు అధికంగా ఉన్నప్పుడు మార్కెట్‌లోకి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ఆదుకునేందుకు ఆస్పరిలో జ్యూస్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తామని పాలకులు ఎన్నికల సందర్భంగా వాగ్ధానం చేస్తున్నా అమలుకు నోచడం లేదు. జిల్లాలో కెసి కెనాల్‌ కింద పండించే సోనామసూరి రకం బియ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది.

10, నవంబర్ 2010, బుధవారం

ఈయన ఆయన కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు

మహారాష్ట్ర రాజకీయాలు ఈ మధ్య అగమ్యగోచరంగా మారాయని చెప్పవచ్చు. అవినీతికి అంతేలేదు. మనరాష్ట్రంతో పోల్చితే తక్కువే కావచ్చు. ఈ క్రమంలో ఆదర్శ్‌ అపార్టుమెంట్ల కుంభకోణంలో ఇరుకున్న అశోక్‌చౌవాన్‌ రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాను ఆలస్యంగా నయినా ఆమోదించిన అధిష్టానం కేంద్రమంత్రి పృధ్విరాజ్‌ చవాన్‌ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈనెల11న ప్రమాణం చేస్తారట. ఈయనపై ఎలాంటి ఆరోపణలు లేవని.చాలా బుద్ధిమంతుడని అందరూ కొనియాడుతున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇటీవల అంటే 2000 సంవ్సతరం నుంచి ముఖ్య మంత్రిగా ఉన్న విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుంభ కోణాల్లో ఇరుక్కుని ఏమయ్యాడో చూశాం. అదేవిధంగా అశోక్‌ చవాన్‌ మంచోడని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన కూడా కుంభకోణాల్లో ఇరుక్కుని రాజీనామా చేశారు. పృధ్విరాజ్‌ కూడా కుంభకోణాల్లో ఇరుక్కోవడానికి ఎక్కువకాలం పట్టకపోవచ్చని అనిపిస్తుంది. ఇరుక్కో పోవచ్చేమో చెప్పలేం. ముందుముందు చూద్దాం.........
మహారాష్ట్ర గురించి
మహారాష్ట్ర భారత దేశంలో వైశాల్య పరంగా మూడో పెద్దరాష్ట్రం. జనాభా పరంగా రెండో పెద్దరాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ తరువాత స్థానం దీనికి ఉంది. ఈ రాష్ట్రానికి గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గోవా రాష్ట్రాలలోనూ కేంద్రా పాలిత ప్రాంతాలైన దాద్రా-నగర్‌ హవేలీ తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉన్నది. అతి పెద్దనగరం ముంబయి రాజధానిగా ఉంది. ఈప్రాంతం రుగ్వేదంలో రాష్ట్ర అని, అశోకుని శాసనాలలో రాష్ట్రీకమని తరువాత హువాన్‌త్సాంగ్‌ వంటి యాత్రికుల రచనల్లో మహారాష్ట్ర అని ప్రస్తావించారు. మహారాష్ట్ర అనే ప్రాకృత పదం నుంచి ఈ పేరు రూపాంతంరం చెందిందని భావి స్తున్నారు. మహా కాంతార అంటే పెద్ద అడవులు అన్న పదం నుంచి మహారాష్ట్ర పదం ఉట్టిందని అంటారు. దీనంతటికి బలమైన ఆధారాలు మాత్రం లేవని చరిత్ర చెబుతోంది. ఇక్కడ అధికార భాష మరాఠీ. అయితే హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషలను విస్తారంగా మాట్లాడుతారు.
రాజకీయం
ఇక్కడ 35 జిల్లాలు, ఆరు రెవెన్యూ డివిజన్లున్నాయి. 288 శాసన సభ , 48 పార్లమెంటు, 19 రాజ్యసభలో స్థానాలున్నాయి. 1995 వరకు కాంగ్రెస్‌కు తిరుగులేదు. ఆతరువాత శివసేన, బిజెపి కూటమి అధికారం లోకి వచ్చింది. 2004 కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆతరువాత తిరిగి కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.
ప్రస్తుతం శాసన సభలో కాంగ్రెస్‌ 82, ఎన్‌సిపి 62, బిజెపి 46, శివసేన 45, ఎంఎన్‌ఎస్‌ (మహారాష్ట్ర నవనీత్‌ నిర్మాణ్‌ సేన) 13, ఎస్‌పి 03, పిడబ్ల్యుపిఐ 04, బివిపి 02, సిపిఐ(ఎం) 01, ఇతరులు 30 మంది శాసన సభ్యులున్నారు.

9, నవంబర్ 2010, మంగళవారం

ఇండియన్స్‌ నాడి ఒబామా తెలుసుకున్నాడా?

ఇండియా నాడి ఒబామా తెలుసుకున్నాడని ఆయన ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన ఇండియాకు రాగానే పెద్ద మార్కెట్‌గా అభివర్ణించాడు. తరువాత ఇండియాలోని స్వాతంత్య్ర సమరయోధులు శాంతి కాముకుడు జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ పిత డాక్టర్‌ బిఆర్‌ ఆందేద్కర్‌ , సమాజ నీతిని బోధించిన వేమనల గొప్పతనాన్ని కొనియాడారు. అదేవిధంగా పంచతంత్ర కథల సారాంశాన్ని గుర్తు చేశారు. ఇండియన్స్‌ సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పకనే చెప్పారు. అదేవిధంగా ఆయన ప్రసంగాలతో ఎదుటి వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆయన నల్లజాతీయుడు కావడం వల్ల ఇండియాను బాగా అర్థంచేసుకున్నారు. దేశానికి కొంతయినా ప్రయోజనం ఉంటుందని కొందరు విశ్లేశిస్తున్నారు. మరో పక్క ఇదంతా కపట ప్రేమ, దేశాన్ని కొల్లగొట్టడానికి , మన సంపదను దోచుకోవడానికి ఎంతో తాపత్రయ పడుతున్నాడు ఒబామా అని అభ్యుదయ వాదులు, మేథావులు , వామపక్ష పార్టీల నేతలు అంటున్నారు. ఒక దేశ అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి గౌరవిద్దాం ఒకే కాని మనకు నష్టం కలిగిస్తే వ్యతిరేకించాలా లేదా? ఒబామా పర్యటనను ఎలా చూడాలి.?

6, నవంబర్ 2010, శనివారం

దేశాన్ని కొల్లగొట్టడానికే ఒబామా పర్యటన



వ్యాపారంతో భారత దేశాన్ని ఎలా కొల్లగొట్లాలో పూర్తిపథకంతో వచ్చినట్లు ఒబామా ముంబరులో చేసిన తొలిరోజు ప్రసంగం అర్థమవుతుంది. గతంలో ఈస్టిండియా కంపెనీ పేరుతో మొదట వ్యాపారం పేరుతోనే ఇండియాకు వచ్చి 200 ఏళ్లు దేశాన్ని పట్టిపీడించిన ఆంగ్లేయుల మోసాన్ని మనపాలకులు మరిచిపోయారా? లేక అమెరికా మోసపూరిత ఒప్పందాలను అర్థం చేసుకోవడం లేదా? లేక మాట ఇచ్చాం కాబట్టి ప్రజలేమయినా పరవాలేదు. అనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. భారత్‌ తమకు భవిష్యత్‌ మార్కెట్‌ అని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అంటున్నారు. ఇక్కడ సుంకాలు, ఇతర అడ్డంకులను తొలగిస్తే పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ దేశంలో 50 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు వీలుగా భారత్‌ను 44 వేల కోట్ల డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాలలో ఇరికించారు. ఈ మేరకు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఒబామా ప్రకటించారు. శనివారం ముంబరులో జరిగిన భారత్‌ -అమెరికా వాణిజ్య మండలి (యుఎస్‌ఐబిసి) ఏర్పాటు చేసిన కార్పొరేట్‌ దిగ్గజాల సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ దేశంతో వాణిజ్యంలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న భారత్‌ను అగ్రస్థానానికి చేర్చడమే తన ప్రస్తుత పర్యటన లక్ష్యమన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం 21వ శతాబ్దంలో భాగస్వామ్యాన్ని నిర్వచించే ఒప్పందాలలో ఒకటిగా మిగిలిపోతుందని తాను భావిస్తున్నానన్నారు. తన పర్యటనలో పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు, బోయింగ్‌ సంస్థ కొన్ని డజన్ల విమానాలను, జనరల్‌ ఎలక్ట్రిక్‌ (జిఇ) సంస్థ వందల కొద్ది విద్యుత్‌ ఇంజన్లను భారత్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భారత్‌తో తాము కుదుర్చుకోబోయే మొత్తం 44 వేల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాల ద్వారా తమ దేశంలో 50 వేల ఉద్యోగావకాశాలు కల్పించగలమన్నారు. వాణిజ్య మండలి భేటీలో ఒబామా ప్రసంగానికి ముందు రిలయన్స్‌ పవర్‌ సంస్థ తాము జిఇ సంస్థ నుంచి 2,400 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లను, స్పైస్‌ జెట్‌ సంస్థ తాము బోయింగ్‌ సంస్థ నుంచి 33 కొత్త తరం 737 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రకటనలను అభినందించిన ఒబామా ఎగుమతి నిబంధనలను సడలించడం ద్వారా డిఆర్‌డిఒ, ఇస్రో వంటి భారత సంస్థలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తామన్నారు. ఇందులో ఎంత మోసముందో అర్థం చేసుకోకపోతే దేశం మరింత అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు బారాక్‌ ఒబామా పర్యటనతో మన దేశానికి తీరని నష్టం కలుగనుంది. ప్రపంచ పోలీసుగా పెత్తనం సాగిస్తున్న అమెరికా భారత్‌ పర్యటన ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనే లక్ష్యంతో ఆ దేశ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చారు. ఒబామా మూడున్నర రోజుల పర్యటించనున్నారు. ఒబామా పర్యటన ఆంతర్యాన్ని తెలుసుకున్న వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాకు అన్ని విధాలుగా మేలు చేసే ఒప్పందాలను చేసుకునే ఎత్తుగడతో ఒబామా పర్యటన సాగుతోంది. రాజకీయ రాజధాని ఢిల్లీకి కాకుండా వాణిజ్య రాజధాని ముంబయిలో అడుగు పెట్టడంతోనే ఆయన పర్యటనలోని అసలు ఉద్దేశ్యం అర్థం చేసుకోవచ్చు.. రక్షణ, విద్య, వ్యవసాయ, ఆర్థిక తదితర రంగాల్లో పలు ఒప్పందాలను చేసుకునే ముఖ్య ఉద్దేశ్యంతో పర్యటనకు వచ్చారు. 120 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయిస్తున్నారు. ఆయన వెంట దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన రెండొందల మంది సీఈఓలు సైతం ఉన్నారు. ఇటీవల పాకిస్థాన్‌కు ఆర్థికసాయం చేసిన అమెరికా ఆ వెంటనే భారత్‌లో పర్యటించడంలో ఆంతర్యం ఏమిటి.. మన దేశ పాలకులు కూడా అమెరికాకు మోకరిల్లే విధానాలను అనుసరించడం శోచనీయం. అమెరికా మొదటి నుండీ ' మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్‌ ? మా ఇంటికొస్తే ఏం తెస్తావ్‌ ? ' అనే పద్ధతిని అనుసరిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ పచ్చగుంటే అక్కడికి వెళ్లి వారి సంపదను కొల్లగొట్టే విధానాలను అమెరికా అనుసరిస్తోంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ లాంటి వారు అమెరికా విధానాలకు వత్తాసు పలకడం దురదృష్టకరం.

3, నవంబర్ 2010, బుధవారం

'బుడబుడ కావడం'


ఏదైనా రహస్యం మెల్లగా బహిర్గతం కావటం అనేఅర్థంలో 'బుడబుడ కావడం' జాతీయ ప్రయోగంలో ఉంది. నీటి నుంచి గాలిబుడగలు కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి. రబ్బరు గొట్టాలాంటివి చిల్లులు పడిన సందర్భాల్లో వాటిమీద నీరు ప్రవహిస్తున్నప్పుడు బుడబుడమంటూ బుడగలు పైకొస్తూ ఉంటాయి. దీన్నిబట్టి ఆగాలిబుడగలు వచ్చే ప్రాంతంలో రబ్బరు గొట్టానికి రంధ్రం పడిందన్న విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ రంధ్రం అనేది రహస్యం. ఆరహస్యాన్ని బహిర్గతం చేసేవి నీటి బుడగలు. ఈ భావనతోనే బుడబుడ కావటం అనే జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. నవంబర్‌ 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇక్కడి రహాస్యాలు మంత్రుల ద్వారా బయటకు వెళ్తున్నాయని ముఖ్యమంత్రి రోశయ్య ఆగ్రహం చెందారట..... పై జాతీయానికి ఆయన ఆందోళన సరిపోయిందని నాభావన... ఈ సందర్భంగా మరో సామెత కూడా గుర్తుకొస్తుంది. '' గుణం మార్చుకోవే గూటాల మల్లీ అంటే అవసరమైతే నామొగున్నయినా మార్చుకుంట గాని గుణం మార్చుకోనన్నదట'' మంత్రుల వ్యహార మాత్రం ఈ సామెతలా ఉంది.
ఈ సమావేశం తీరును పరిశీలిద్దామా...ముఖ్యమంత్రి రోశయ్య మంత్రులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మీడియాకు లీకు చేయకూడదని ఎన్నిసార్లు నిర్ణయించుకున్నా విషయాలు బయటకు పొక్కుతూనే ఉన్నాయని, మనమేమన్నా చిన్నపిల్లలమా అని సిఎం రోశయ్య ప్రశ్నించారట. దీంతో మంత్రివర్గ సమావేశం వాడివేడిగా సాగిందట. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తెలంగాణాపై ఎలాంటి నిర్ణయం వచ్చినా కట్టుబడతామని, అప్పటివరకు మంత్రులందరూ కలిసిమెలిసి ఉండాలని, ప్రభుత్వంలో భాగస్వామ్యంగానే ఉంటారని చెప్పినట్లు తెలిసింది. పేదలకు రెగ్యులరైజ్‌ చేస్తున్న భూమి అంశంపై దానం నాగేందర్‌, బొత్స సత్యనారాయణ మధ్య వాదన జరిగిందట. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పేదలకు 80 గజాల వరకు భూమిని రెగ్యులరైజ్‌ చేస్తున్నామని, దానిని 120 గజాలకు పెంచాలని దానం సూచించగా రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక్క హైదరాబాద్‌కు పరిమితం ఎలా కుదురుతుందని బొత్స వాదించినట్లు తెలిసింది. రెగ్యులరైజ్‌ కోసం జీవో 166ను కూడా ప్రభుత్వ పరంగా విడుదల చేశామని, ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని, హైదరాబాద్‌కు ఎలా పరిమితం చేస్తారని బొత్స అడిగినట్లు సమాచారం. 120 గజాలకు రెగ్యులరైజ్‌ చేయాలనుకుంటే నామినల్‌ ఛార్జీ వసూలు చేస్తే బాగుంటుందని సూచించినట్లు తెలిసింది. దానికి దానం ఏదో చెప్పబోతుండగా సిఎం వారించినట్లు తెలిసింది. 'మంత్రులు ఒకరి నొకరు ఇలా వాదించుకుంటారు. ఈ విషయాలు కేబినెట్‌ వరకే పరిమితం కావడం లేదు. మీడియాకు కూడా ఎక్కుతున్నాయి. దీనివల్ల మంత్రుల మధ్య సఖ్యత లేదని పెద్దపెద్ద హెడ్డింగ్‌లు వస్తున్నాయి. వాదించుకోవడం ఎందుకు మీడియాకు చెప్పుకోవడం ఎందుకు' అని రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేబినెట్‌లో చర్చించుకున్న అంశాలను బయట చెప్పకూడదని ఎన్నోసార్లు చెప్పుకొన్నా అమలు కావడం లేదని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పితే ఎలా అని మందలించినట్లు తెలిసింది. 'ఇలా ఎన్నిసార్లు చెప్పుకుంటాం. మనం చిన్నపిల్లలం కాదు కదా' అని సిఎం అన్నట్లు తెలిసింది.