17, అక్టోబర్ 2011, సోమవారం

యాతమేసి తోడినా చేను తడవదు

30 ఏళ్లు వెనక్కి పోయిన సాగు
మిగిలింది కష్టాలు... కన్నీళ్లు
మహబూబ్‌నగర్‌ రైతుల వలసబాట
         ''యాతమేసి తోడినా... ఏరు ఎండదు. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు...'' అని ఓ కవి అన్నాడు. కానీ కరువు ప్రాంత రైతులను కదిపితే 'యాతమేసి తోడినా చేను తడవదు.. మోటరేసి తోడాలంటే కరెంటు వుండదు' అని కంటతడి పెడుతున్నారు. నేడు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులెన్నో. కానీ పాలకులు అమలు చేస్తున్న విధానాల ఫలితంగా రైతన్నలు కష్టాల కడలిలోకి నెట్టబడుతున్నారు. యాతం (గూడ)తో నీళ్ళుతోడి సాగుచేసిన 30ఏళ్ళనాటి వ్యవసాయ పద్ధతులనే పాటించాల్సిన దుస్థితి దాపురించింది. మామూలుగానే మహబూబ్‌నగర్‌ జిల్లాలో వర్షాభావం అధికం. నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు చిటికెలో పూర్తి చేస్తాం... ఇక అంతా పచ్చదనమే... పాడిపంటలకు కొదువలేదు అని చెప్పిన మహానుభావులెందరో... కానీ ఆచరణలో రైతులను పట్టించుకునే ప్రజాప్రతినిధి ఒక్కరంటే ఒక్కరూ లేక వరుస కష్టాలతో చితికిన రైతు పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు. పంట పొలానికి నీరు పెట్టలేకపోతున్నానని కుమిలిపోతున్నాడు. కరువు పరిస్థితి పరిశీలన నిమిత్తం వెళ్ళిన 'ప్రజాశక్తి' ప్ర్రతినిధి ముందు కన్నీటి పర్యంతమయ్యాడు.
          అది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొందుర్గు మండలం చేగిరెడ్డిగనపురం గ్రామం. వెయ్యి ఎకరాలకు పైగా సాగుభూమి వుంది. బావులు, బోర్ల కింద 200 ఎకరాల్లో వరి సాగు చేశారు. 50శాతం పైగా వరిపైర్లు ఎండిపోయాయి. వేరుశనగ, మొక్కజొన్న తదితర మెట్టపంటలు 90శాతం ఎండిపోయాయి. ఏ రైతును కదిలించినా వ్యవసాయం దండగ... గ్రామంలో పనుల్లేవు... ఎటయినా వలసలు పోతామని అంటున్నారు. చెగిరెడ్డి గనపురం గ్రామంలోని నాలుగు గిరిజనతండాల్లో చాలా ఇళ్లకు తాళాలు వేసి వున్నారు... అటుగా వెళుతున్న వారిని 'వీరంతా ఎటువెళ్ళారు?' అని అడిగితే... 'వలసలు పోయిన్రన్నా...' అని బదులు చెప్పారు. ఈ తండాల్లో 100కు పైగా గిరిజన కుటుంబాలుంటే ప్రస్తుతం 40 కుటుంబాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో 'ప్రజాశక్తి' ప్రతినిధి బృందం ఇదే గ్రామాన్ని పూర్తిగా సందర్శించి రైతులను పరామర్శించింది. 'భూమికి నీరు పారించని బతుకెందుకు?' అని రైతు కావాలి చంద్రయ్య కన్నీరు మున్నీరయ్యాడు. ఎకరాకు 12 వేల రూపాయల దాకా ఖర్చుచేసి ఆరు ఎకరాల్లో వరి నాట్లేశాం. మూడురూపాయల వడ్డీకి సావుకారి వద్ద అప్పుతెచ్చినం. పాత అప్పులే తీరలేదు. మళ్లీ అప్పుఅయ్యింది. బాగా పంట చేతికొచ్చి... ఎకరాకు 30 బస్తాలు పండితే, రూ.15 వేలైనా చేతికొచ్చేవి. ఇంతకష్టపడితే ఐదుబస్తాలైనా వస్తుందో లేదో నమ్మకం లేదు. పైభాగాన కుంటలో నీళ్లుండయి... అందుకే బావిలో నీళ్లున్నరు...ఈ నీళ్లు ఎన్నిరోజులు వస్తయో తెల్వదు. కుంటెండితే బాయిలో నీళ్లు తగ్గి కిందికి పోతరు... ఐదుగురం అన్నదమ్ములం భాగాలు పంచుకున్నం. ఒకొక్కరికి ఎకరం పైగా భూమిలో వరిసాగు చేశాం. వేరే మార్గం లేక మానాయిన సెప్పిండని ఇట్ల గూడేసి నీళ్లుతోడుతుండం. ఇట్లా గూడతో నీళ్లు ఎత్తిపోసేది మాతండ్రి వయస్సులో ఉన్నప్పుడు ఉండేదంట. మాకు కొత్తేకాని ఏంజేయాలె. రెండ్రోజులు గూడేసి నీళ్లుతోడితే కాళ్లుచేతులు నొప్పులయినరు. నిన్న చిన్న వానవడింది. కొంతమేలు. లేకుంటే చేను గీమాత్రం కనిపించేదా..? మాకష్టాలు ఎన్నడు తీరుతయో. మాకు ఎనిమిది మంది ఆడబిడ్డలు... కొడుకు కోసం చూస్తే అందరూ ఆడొళ్లే పుట్టిండ్రు. ఇద్దరి పెండ్లి చేసినం... ఇంకా ఇద్దరు పెండ్లికున్నరు. నలుగురు సదువుతున్నరు. కాపుదానం అప్పులు, పిల్లల ఖర్చులు.. మోయ లేకుండయినరు.... ఎవరికి జెప్తే మాకష్టాలు తీరుతరు... పట్టించుకునెటొల్లే లేరు.... బ్యాంకుల్లో అప్పులు పుడ్తల్లేవ్‌.... పాతరు కడితే ఇచ్చెటొల్లేమో... పంటసరిగ్గా పండవ్‌ అప్పుల్తీరవ్‌...' అని వాపోయాడు. చంద్రయ్య తన భార్యతో కలిసి రోజంతా గూడతో నీటిని తోడితే ఒక మడి పారుతుంది. ఆగకుండా వేస్తే మరో సగం మడికి నీరు పారే అవకాశం ఉంది. అన్నదమ్ములు రోజుకొకరు చొప్పున గూడవేసి ఒక్కో మడి ఎండిపోకుండా నీరందిస్తున్నారు. ఇలా కష్టపడి తమ శ్రమశక్తిమీద పంటను కొంతయినా కాపాడుకోవాలనుకుంటున్నారు. కావలి చంద్రయ్యను చూసిన బావుల కింద సాగుచేసే మరో ఇద్దరు గూడ పద్దతిన సాగునీరందిస్తున్నారు. మరి కొందరు రైతులు కూడా ఈ పద్దతికి సిద్దమవుతున్నారు. నీరు పుష్కలంగా ఉంటేనే ఈ పద్దతి సాధ్యమవుతుంది.
            చంద్రయ్య కష్టాలు తెలుసుకునేలోపే 20 మందిదాకా రైతులు వచ్చారు. 'సారు మాగురించి రాసుకోండి. మా చేలన్ని ఎండిపోతున్నరు చంద్రయ్య బాయిలో నీళ్లు పైన ఉన్నరు... ఆయన గూడేసుకుని కొంతయినా తడుపుకుంటున్నడు. మా బాయిలో నీళ్ళు చాలా లోతున్నరు. కరెంటు వస్తేనే మోటర్‌ నడవాలి' అని అదే ఊరికి చెందిన రైతులు ఊరడి కృష్ణయ్య, భీమయ్య, గుండని భీమయ్య, కుక్కల చెన్నయ్య, మాదారపు రాజు, యాదయ్య, వెంకటయ్య, నర్సింహా తదితరులు వారి బాధలు వినిపించారు. ఎవరిని కదిలించినా 'మా వరిచేను ఎండిపోయింది. పశువులకు మేతకూడా కష్టమే. వేరుశనగ, మొక్కజొన్న వందలాది ఎకరాల్లో చేలన్నీ చేతికి రాకుండా పోయాయ'ని వాపోతున్నారు. అప్పులు పెరిగిపోతున్నాయని దిగులు పడుతున్నారు. రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే వలసలు మొదలయ్యాయి.
             కరువు పరిస్థితికి కరెంటు సమస్య తోడైంది. రాత్రి పగలు నిద్ర లేకుండా పొలం వద్ద కాచుకుని ఉన్నా గంటకు మించి మోటార్లు నడవడం లేదు. దీంతో వరిపొలం ఒక మడి తడిస్తే మళ్లీ కరెంటు వచ్చే వరకు తడారి పోతుంది. తిరిగి అదే మడి పారుతుంది. వరుస కష్టాలతో చితికి పోయిన రైతుకు డీజిల్‌ ఇంజన్లు కొనే స్థోమత లేకుండా పోయింది. కొందరితో డీజిల్‌ ఇంజన్లు ఉన్నా పెరిగిన డీజిల్‌ ధరలను భరించలేకున్నారు. కష్టపడి సాగు చేసిన వరిఫైరు ఎండిపోతుంటే రైతు ఏదో విధంగా సాగునీరందించాలనుకున్నాడు. పాతపద్ధతిని ఎంపిక చేసుకున్నారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా వ్యవసాయంలో మూడు దశాబ్దాల నాటి సాగునీటి పద్దతిని రైతులు ఎంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక యంత్రాలు అనేక కొత్త పద్ధతులకు రైతు స్వస్తిపలికే పరిస్థితి వచ్చింది. 1990 తరువాత రాష్ట్రంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు గ్రామీణ వ్యవస్థను ఛిద్రం చేస్తోంది. ఎండిన పంట పొలాలు కళ్లముందు కదలాడుతుంటే... పంటను కాపాడుకునేందుకు నడుంకట్టాడు. మూడు దశాబ్ధాల క్రితం ఉపయోగించిన 'యాతం లేదా గూడ' పద్దతి ద్వారా పొలాలకు రైతులు సాగునీరందిస్తున్నారు. యంత్రాలతో అయ్యే ఖర్చులు భరించలేకున్నామని శ్రమశక్తితో సాగునీరందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు మరిన్ని పాతపద్దతులను అనుసరించే అవకాశాలు కనిపిస్తోంది.

5, అక్టోబర్ 2011, బుధవారం

పండుగలు- ఉత్సవాలు- ప్రజాసంస్కృతి

              మనం నిత్యం జరుపుకునే పండుగలు , ఉత్సవాలు, జాతరలు, కొలుపులు, మొదలయిన వన్నీ మన సంస్కృతిలో భాగం. పండుగలు ,ఉత్స వాలు అన్ని మతపరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించి-అంటే వ్యవ సాయం, పశుపోషణ, వంటి వాటికి సంబంధించి ఉంటాయి. కొన్ని ప్రకృతిపై మానవుడు విజయం సాధించిన సందర్భాన్ని పురష్కరించు కుని జరుగుతుంటాయి. కొన్ని పండు గలు పూర్తిగా మతనమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అయితే వీటన్నింటినీ ఇలా పూర్తిగా విడదీసి చూడటం కూడా కష్టం. మానవుని ఉత్పత్తికి, ప్రకృతిపై విజయాలకు సంబంధించిన పండుగల్లో కూడా మతపరమైన నమ్మకాలు, ఆచారాలు ఉంటాయి. అదేసమయంలో పూర్తిగా మతమపరమైన కథలపై ఆధారపడిన పండుగల్లో కూడా వెతికి చూస్తే మానవ సమూహాల అభివృద్ధికి సంబంధించిన అనేక చారిత్రక విషయాలు కనిపిస్తుంటాయి. అందువల్ల మనం పండుగలు ఉత్సవాలు జాతరలు వంటి వాటిని ఏవిధంగా చూడాలి. ఏ విధంగా ఈసందర్భాల్లో పాత్రవహించాలి అన్న ప్రశ్న ముందుకు వస్తుంది. దీనికి సమాధానం ఒక్కటే-పండుగలు ఉత్సవాలను మూఢనమ్మకాల పేరుతో మొత్తంగా కొట్టి పారేయకూడదు. అదే సమయంలో వాటిలోని అన్ని అంశాలను అంటే మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు ఆధ్యాత్మిక విష యాలను కూడా భుజాన వేసుకుని మోయకూడదు.
           మానవుడు మనుగడ కోసం ప్రకృతితో సాధించిన పోరాటంలో ఒక్కో విజయం సాధించడం ద్వారానే అభివృద్ధి పథంలో ముందుకు పోతూ వచ్చాడు. అయితే ప్రకృతితో మనిషి ఒంటరిగా పోరాడలేదు. సామూ హికంగా, సమిష్టిగా పోరాడాడు. అందువల్ల ప్రకృతిపై విజయం సాధించి నప్పుడు మానవులు సమిష్టిగానే సంతోషం పంచు కున్నారు. అవే సంబరాలు ఉత్సవాలు అయ్యాయి. ఆది మానవునికి అగ్గి అప్పట్లో కొరకరాని కొయ్య. అగ్గితో చాలా పనులు చేయవచ్చు. ఎముకలు కొరికే చలినుంచి అది కాపాడుతుంది. అడవుల్లో క్రూరమృగాలను భయపెట్టి దూరంగా ఉంచుతుంది. మాంసం, దుంపలు , కూరగాయలు, గింజలు కాల్చుకు తినడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. కాని మానవునికి దాన్ని స్వాధీనం చేసుకోవడం-అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అగ్గిని సృష్టించు కోవడం అంతతొందరగా అలవడ లేదు. దావానలాల్లో దొరికిన నిప్పును కాపాడు కుంటూ చాలా కాలం గడిపాడు. కాని దాన్ని కాపాడుకోవడం , వర్షం, వరదల నుంచి పొడిగా ఉంచుకోవడం చాలా శ్రమతోనూ ప్రయాసతోనూ కూడిన పని. తరువాత చెక్కలను రాపాడించడం ద్వారా , చెకుముకి రాళ్లను కొట్టడం ద్వారా నిప్పు చేయడం నేర్చుకున్నాడు. దాంతో మనిషి నిప్పుపై ఆధిపత్యం సాధించాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ నిప్పు తయారు చేయడం నేర్చు కోవడమే కాదు, నిప్పును అనేక రకాలుగా ఉపయోగించడం ప్రారంభించాడు. చివరికి నిప్పు మనిషి జీవితంలోనూ, అభివృద్ధిలోనూ అత్యంత కీలకాంశంగా మారింది. ఇటువంటి నిప్పుపై సాధించిన విజయం మానవాళికి చిన్నవిషయ మేమి కాదుకదా! అందుకే నిప్పుపై విజయం ప్రపంచంలోని అన్ని మానవ సమూహాలకు పండుగే అయింది. మనకు దీపావళి మాధిరిగానే ప్రపంచంలోని అన్ని మానవ సమా జాల్లోనూ దీపాల పండుగలు ఉంటాయి. వాటి చుట్టూ అనేక రకాల కథలు ఉండవచ్చు గాక. ఒక్కో సమాజం అగ్గి గురించిన ఒక్కో రకం కథను సృష్టించుకోవచ్చు గాక. కాని అన్నిట్లోనూ ఉన్న ఉమ్మడి అంశం అగ్గిపై మానవుని విజయమే , చీకటి నుంచి వెలుగులోకి మనిషి ప్రయాణమే. ఇదే విధంగా వ్యవసాయ సమాజాల్లో పంటలు వేసే తరుణం, పంటచేతికొచ్చే తరుణం సంబరాలుగా మారాయి. పశుపోషణ ప్రధానంగా ఉన్న సమాజాల్లో పశువులపై విజయమే అంటే పశువులను మచ్చిక చేసుకోవడమే పండుగలుగాను , ఉత్సవాలుగాను మారాయి.
              అయితే మన పండుగలన్నీ ప్రకృతిపై విజయాలకు సంబంధించి నవే కావు. ప్రకృతి శక్తులను స్వాధీనం చేసుకునే క్రమంలో మనిషి ప్రకృతికి సంబంధించిన ఒక్కో దృగ్విషయాన్నే కనుగొంటూ వచ్చాడు. అయినా అతనికి ఎల్లప్పుడూ తెలియని విషయం ఉంటూనే వస్తుంది. తెలియని విషయాల చుట్టూ తన స్వాధీనంలో లేని శక్తుల చుట్టూ మనిషి అనేకనేక నమ్మకాలు ఏర్పరుచు కున్నాడు. అనేక కథలు అల్లుకున్నాడు. తాను గెలువలేని శక్తులను ప్రసన్నం చేసు కోవడం ద్వారా , వాటిని అనుక రించడం ద్వారా తనకు అవిలోబడి ఉండేట్లు లేక తన ఇచ్చకు అను కూలంగా మెలిగేట్లు చేయవచ్చు ననుకున్నాడు. అందులో నుంచి పుట్టినవే ప్రకృతి ఆరాధన, క్రతువులు, మత నమ్మకాలు వగైరా. ఆదిమానవుడు చెట్టునూ పుట్టనూ ప్రసన్నం చేసుకోవడానికి క్రతువులు ఆచరించాడు. వ్యవసాయ సమాజంలో రుతుచక్రాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పూజలు చేశాడు. ధాన్యం జీవనాధారం కనుక ధాన్యలక్ష్మిని ఆరాధించాడు. ఆధునిక సమాజంలో ధనం, డబ్బు పోగుపడ్డాక అది ఏవిధంగా తన వద్దకు వస్తుందో, వచ్చింది తననుంచి ఎందుకు పోతుందో అర్ధం గాక అయోమయం నుంచి బయటపడటానికి భగవంతున్ని ప్రార్థిస్తున్నాడు. ఈసమాజంలో డబ్బే సర్వస్యం కనుకు ధనలక్ష్మిని తన ఆధీనం చేసుకోవడానికి వ్రతాలు, యాగాలు చేస్తున్నాడు. దీక్షలు పడుతున్నాడు.
              ప్రకృతితో మానవుడు సమిష్టిగా పోరాడాడని చెప్పుకున్నాం కదా! ఈసమిష్టిపోరాటంలో మానవుల మధ్య కూడా అనేక రకాల సంబంధా లేర్పడ్డాయి. ఒక జాతిని మరొక జాతి పీడించడం జరిగింది. ఈ పీడననుంచి విముక్తి కోసం పోరాటాలు జరిగాయి. ఈపోరాటాల్లో జయాప జయాలు కూడా పండుగలు, పర్వదినాలు, దుర్దినాలుగా మారి మన సంస్కృతిలో భాగమైనాయి. ప్రాచీన గణ వ్యవస్థలో గణనాథులే తరువాత దేవుళ్లు, దేవతలు అయ్యారు. వారి కొలుపులు పండుగలు ఉత్సవాలుగా మారాయి. పరాయిపీడన నుండి విముక్తి కోసం జరిగిన పోరాటంలో నేలకొరిగిన వీరుల జన్మదినాలు పర్వదినాలుగా మారాయి. పాలననుంచి విముక్తి జరిగిన దినాలు ముఖ్యమైన జాతీయ పర్వదినాలుగా మారాయి.
          ఈ విధంగా ఆదిమానవుడు నిప్పు, నీరుపై విజయం సాధించినప్పటి నుంచి నిన్నమొన్న పరాయి పాలననుంచి విముక్తి వరకు మానవజాతి ప్రయాణంలోని ప్రతి విజయం, అపజయం పండుగగానో, పర్వదినంగానో, మరో ముఖ్యమైన దీక్షా దినంగానో మారుతూ వచ్చాయి. వాటి చుట్టూ అనేక కథలు, నమ్మకాలు ఏర్పడుతూ వచ్చాయి. అందువల్ల పండుగలు, ఉత్సవాలు మన సుదీర్గ సంస్కృతిలో ఒక భాగమే మినహా వేరు కాదు.
     మన సాంస్కృతిక వారసత్వమంతా అంటే మానవుడు అప్పటివరకు నేర్చుకున్న విజ్ఞానం, కళలు, సాహిత్యం , నృత్యం , సంగీతం వగైరాలన్నీ పండుగల్లో ప్రదర్శితమవుతాయి. మానవుడు వ్యక్తిగతంగా గాని , సమిష్టిగాని సంపాధించిన భౌతిక సంపద ప్రదర్శించ డానికి పండుగలు వేదికలవుతాయి. ఒక మానవ సమూహం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవాలంటే వారి పండుగలు, ఉత్సవాలు, జాతరలను పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు సంక్రాంతి పండుగనే చూడండి. అది పంట చేతికొచ్చిన తరుణంలో జరిగే పండుగ కనుకు వ్యవసాయ సమాజాలపై ఆధారపడి బతికే కళాకారులు హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు, బుడబుక్కల వాళ్లు, జంగమ దేవర్లు, వగైరా ఈపండుగ రోజుల్లో తమ కళలను ప్రదర్శిస్తారు. అలాగే పండుగ సందర్భంలో ప్రజలు ఇల్లు అలకడం , రంగులు, ముగ్గులు వేయడం ద్వారా తమ కళా కౌశలాన్ని ప్రదర్శిస్తారు. పండుగ పాటలు , పద్యాలు, నాటకాలు, కోడిపందాలు, గొర్రెపొటేళ్ల పందాలు, ఎడ్ల పందాలు వగైరాలన్నీ ప్రజల సాంస్కృతిక ప్రదర్శనలే. సంక్రాంతి మాదిరిగానే దసరా పండుగ సందర్భంలో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలయిన సాంస్కృతిక రూపాలు ప్రదర్శిస్తారు. అలాగే వృత్తులను బట్టి , కులాలను బట్టికూడా రకరకాల సంబరాలు జరుపుకుంటారు. వారివారి సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శిస్తారు. అందువల్ల ప్రజాసంస్కృతిని రక్షించాలను కునేవారికి , ప్రోత్సహించాలను కునే వారికి పండుగలు, ఉత్సవాలు, జాతర్లు కూడా సందర్భాలన్న దాంట్లో సందేహం లేదు.
పండుగలో రకాలు
           మనసమాజంలో మనం చేసుకునే పండుగలు , ఉత్సవాలు, జాతరలు , పర్వదినాలలో అనేక రకాలున్నాయి. అన్ని పండుగలు మతంతో ముడిపడి ఉన్నప్పటికీ వీటిలో కొన్ని మానవుని ఉత్పత్తితో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సంబంధం కలిగి ఉన్నాయి. ఉత్పత్తి అంటే ఆహార ఉత్పత్తి మాత్రమే కాదు. పునరుత్పత్తి కూడా. పంటలు, రుతువులను బట్టి ఈపండుగలు జరుపుకుంటారు. కొన్ని పూర్తిగా ఆధ్యాత్మిక పండుగలున్నాయి. మానవజాతి చరిత్రలో ఈ పండుగలు సాపేక్షంగా తరువాత ఉద్భవించినవై ఉంటాయి. ఇక ఇటీవలి కాలంలో జరిగిన రాజకీయ విముక్తి , ఉద్యమాలు , పోరాటాల్లో త్యాగాలు చేసిన వారి జయంతులు , వర్ధంతులు , రాజకీయ విజదినాలు కూడా పండుగలు, పర్వదినాల్లో చేరిపోయి. ఒక్క మనసమాజంలోనే కాదు. ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ , అన్ని దేశాల్లోనూ తరతమ తేడాలతో ఇటువంటి విభజన కనిపిస్తుంది. మనకు సంబంధించి నంతవరకు పండుగలను ఆరు రకాలుగా విభజించ వచ్చును.
1. ఉత్పత్తితో ముడిపడిన పండుగలు, 2. ఆధ్యాత్మికమైన పండుగలు, 3. ఉత్సవాలు-జాతరలు, 4. వ్రతాలు- క్రతువులు, 5. రాజకీయపరమైన ఉత్సవాలు, 6. నాయకుల వర్ధంతులు - జయంతులు
      ఉత్పత్తితో సంబంధమైన పండుగలలో దసరాకూడా ఒకటి. దసరాగురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
దసరా: దసరా ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ప్రకృతిపై మానవుని విజయోత్సవానికి సంబంధించిన పండుగ ముఖ్యంగా వ్యవసాయంలో మానవుడు సాధించిన విజయాలతో ఇది ముడిపడి ఉంది. ఉత్తరాదిలో దసరా సందర్భంగా రామలీలా ఉత్సవాలు చేస్తే , దక్షిణాదిలోనూ , బెంగాల్‌లోనూ దేవి నవరాత్రులు జరుపుతారు. ప్రధానంగా విజయదశమి విజయానికి సంబం ధించిన పండుగ. ఆరోజు అన్ని ప్రాంతాల్లో ఆయుధ పూజలు చేయడం ఆనవాయితీ. మనరాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అమ్మవార్ల జాతరలు జరుగుతాయి. దసరాసందర్భంగా విచిత్ర వేశాలు వేయడం పెద్ద సాంస్కృతిక కార్యక్రమం. దసరావేశాలు తెలుగు వారికి సుపరిచితాలే.
బతుకమ్మ: బతుకమ్మ పండుగను తెలంగాణాలో , దసరారోజుల్లో జరుపుకుంటారు. బతుకమ్మ పేరిట తంగేడు, గుమ్మడి పూలతో అలంక రించిన పసుపు 'గౌరి' ని పల్లెంలో పెట్టి , పాటలు పాడుతూ , ఆపల్లెంచుట్టూ తిరుగుతూ పూజ చేస్తారు. తొమ్మిది రోజులు ఇలా చేసి చివరి రోజున మేళతాళాలతో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. కొన్ని చోట్ల బొమ్మల కొలెవు తీరుస్తారు. కొన్ని చోట్ల విజయదశమి రోజును విద్యారంభ దినంగా పరిగణించి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. పూర్వం బడిపిల్లలు '' అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పుబెళ్లాలు'' అంటూ పాటలు , పద్యాలు పాడుతూ ఇంటింటికి తిరిగే వారు.
రాయలసీమలో ప్రధానంగా కర్నూలు జిల్లాలో బన్నీ ఉత్సవాలు (కర్రల సమరం) జరుపుకుంటారు. ఎక్కువ ప్రాంతాల్లో శమి వృక్షానికి పూజలు చేసి ఆకును తెచ్చి పెద్దలకు ఇచ్చి ఆశ్వారం తీసుకుంటారు. ఒక్కో ప్రాంతానికి జిల్లాకు ఒక్కో ప్రత్యేకతతో ఈ పండుగను జరుపుకుంటారు.