14, నవంబర్ 2011, సోమవారం

ఆకలితో ప్రాణాలొదులుతున్నారు

దయనీయస్థితిలో గిరిజనులు
అంత్యోదయ కార్డులున్నా హక్కులపై అవగాహన లేదు
మధ్యప్రదేశ్‌లో వేలాది చిన్నారుల మృతి
ఆకలితో చిన్నారులు
మరణిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని గుర్తించడం లేదు. 2010లో రాష్ట్రంలో లక్షా 8 వేల మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య సర్వేలో తేలింది.
మధ్యప్రదేశ్‌లో ఆకలితో అలమటిస్తున్న గిరిజనుల బిడ్దలు ప్రాణాలొదుతున్నారు. పోషకాహార లోపంతో వేల సంఖ్యలో పిల్లలు మృత్యువాతపడుతున్నా వారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. కేవలం అంత్యోదయ కార్డులు మంజూరు చేసి చేతులు దులుపుకోవడంతో నిరక్షరాసులైన గిరిజనులు తమ హక్కుల గురించి కనీస అవగాహన కూడా లేకపోవడంతో, వారు బతుకులు మరింత దయనీయంగా మారాయి. ఈ రాష్ట్రంలోని శివ్‌పూర్‌ జిల్లాలో పర్యటించిన సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ వార్తా సంస్థ అక్కడి గిరిజనుల దైన్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నాలుగేళ్ల బాలిక దీపు గత నాలుగు నెలలుగా తీవ్ర పోషకాహార సమస్యతో బాధపడుతోంది. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చడానికి తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేది లేక దీపు మరణం కోసం ఎదురుచూస్తున్నామని ఆమె తల్లిదండ్రులు కన్నీరు ము న్నీరయ్యారు.
'ఏం చేయాలో తెలియకపోవడమే అసలు సమస్య. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందో మాకు తెలియడం లేదు. నేనొక కార్మికుడ్ని... నేనెలా తెలుసుకోవాలి?' అని దీపు తండ్రి జాబ్రూ ప్రశ్నించారు. ఈ సహారియా తెగ గిరిజనులకు ప్రభుత్వం అంత్యోదయకార్డులిచ్చినా, హక్కుల పట్ల వారికి సరైన అవగాహన కల్పించలేదు. పోషకాహార లోపంతో బాధపడుతూ తక్షణమే ప్రభుత్వ చర్యల కోసం ఎదురుచూస్తున్న దీపు లాంటి వారు ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నారు. పోషకాహార లోపంతో ఈ ప్రాంతంలో వందలాది మంది మరణిస్తున్నారు. యునిసెఫ్‌ సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యూట్రిషనల్‌ రిహాబ్‌ సెంటర్‌ ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అది దాదాపుగా సగం ఖాళీ అయింది. దీపును తీసుకుని మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లినా అధికారులు ఏమీ చేయలేక అసహాయం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ముఖ్యంగా సహారియా తెగ గిరిజనులు తీవ్రంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.