27, మే 2012, ఆదివారం

వైఎస్‌ జగన్‌ అరెస్టు

             ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కడప ఎంపీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు యెడుగూరి సందింటి జగన్మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి అరెస్టయ్యారు. తండ్రి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమంగా పెద్దయెత్తున ఆస్తులు పోగేసుకున్నారన్న కేసులో మూడు రోజులుగా జగన్‌ను విచారించిన సిబిఐ 2012 మే 26న రాత్రి అరెస్టు చేసింది. ఆయన్ను 27(సోమవారం) సిబిఐ కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. జగన్‌పౖౖె ఐపిసి సెక్షన్లు 120బి (రెడ్‌విత్‌ 420), 409, 420, 477ఎ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద సిబిఐ కేసులు నమోదు చేసింది. అరెస్టుకు నిరసనగా వైకాపా సోమవారం నాడు రాష్ట్రవ్యాపిత బంద్‌కు పిలుపునిచ్చింది. జగన్‌ చేసిన తప్పేమిటంటూ వైకాపా గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, జగన్‌ భార్య భారతి, సోదరి శర్మిలా దిల్‌కుశ అతిథిగృహం ఎదుట ధర్నాకి దిగారు. వారిని అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్‌పాండ్‌ వారి నివాసానికి తరలించారు. హైదరాబాద్‌ నగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. కేసు దర్యాప్తులో ఉన్నందున దీనిపై మాట్లాడేదేమీ లేదంటూ కాంగ్రెస్‌ ప్రతినిధి మనీష్‌ తివారీ దాటవేశారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం కుమ్మక్కైన ఫలితమే జగన్‌ అరెస్టని వైకాపా ఆరోపించింది. అరెస్టు చేస్తే చాలదు ఆయన అక్రమంగా ఆర్జించిన మొత్తం సొత్తును స్వాధీన పరచుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. జగన్‌ను అరెస్టు చేసిన సిబిఐ వివాదాస్పద జీవోల జారీకి బాధ్యులైన మంత్రులను కూడా విచారించి అరెస్టు చేయాలని, తద్వారా సిబిఐ తన నిష్పాక్షికతను నిరూపించు కోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు వ్యాఖ్యా నించారు. ఇదీ హర్షించదగిన పరిణామమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
           వైఎస్‌ జగన్‌పై నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం (క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌), ఖాతాలను తప్పుగా నిర్వహించడం, నేరపూరిత ప్రవర్తన తదితర సెక్షన్ల కింద సిబిఐ కేసులు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. వీటి ప్రకారం నేరాలు రుజువైతే గరిష్టంగా పది సంవత్సరాల నుంచి యావజ్జీవం వరకూ జైలు శిక్షపడే అవకాశం ఉంది.
                                                               సెక్షన్‌ దేనికోసం శిక్ష
ఐపిసి 120 (బి) నేరపూరిత కుట్ర
420 మోసం ఏడేళ్లు
409 విశ్వాస ఘాతుకం యావజ్జీవం
(క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌) లేదా పదేళ్లు
477 (ఎ) ఖాతాలను తప్పుగా నిర్వహించడం ఏడేళ్లు
(ఫాల్సిఫికేషన్‌ ఆఫ్‌ అక్కౌంట్స్‌)
                        అవినీతి నిరోధకచట్టం
13(1) ప్రజాప్రతినిధి నేరపూరిత స్వభావంతో వ్యవహరించడం
13(1సి) ప్రజాప్రతినిధిగా సంక్రమించిన కార్యాలయాన్ని,
ఆస్తులను దుర్వినియోగపరచడం
13(డి) (1) తనకు గాని ఇతరులకు గాని చట్టవ్యతిరేక
పద్ధతులు లేదా అవినీతికి పాల్పడి ఆర్థిక లాభాలను,
విలువైన వస్తువులు పొందడం.
(2) తన పదవిని దుర్వినియోగపరిచి ఆర్థిక లాభాలు పొందడం
(3) పదవిలో ఉండగానే ఎటువంటి ప్రజాప్రయోజనం
లేకుండా ఆర్థిక లాభాలు పొందడం
13(2) కనిష్టంగా ఒక ఏడాది నుండి గరిష్టంగా ఏడేళ్ల వరకు

ఆశావాది ప్రతిభకు అరుదైన గౌరవం

                                      కళారత్నకు కర్నూలు తెలుగు రచయితల సంఘం సన్మానం
                  అవధాన ప్రక్రియలో అత్యంత ప్రతిభావంతుడు డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావుకు కళారత్న అవార్డు రావడం అరుదైన గౌరవమని ఆయన సన్మాన సభలో వక్తలు కొనియాడారు. ఆదివారం కళారత్న డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావుకు కర్నూలు తెలుగు రచయితల సంఘం ఆధ్వర్వంలో సిటీ కేంద్ర గ్రంధాలయంలో ఘనంగా సన్మానించారు. కర్నూలు తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు హీరాలాల్‌ అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. ఈసందర్భంగా ప్రముఖ కవి , విమర్శకుడు గొట్టిముక్కుల సుబ్రమణ్యశాస్త్రి మాట్లాడుతూ సంస్కారవంతంగా జీవించిన ప్రముఖుల మాదిరిగా జాషువా, దువ్వూరి రామిరెడ్డి లాంటి కవికోకిల డాక్టర్‌ ఆశావాది అని అన్నారు. 171 అష్టావధానాలు చేసి సభికులను మెప్పించారని చెప్పారు. ఆయనకు కళారత్న, పద్మభూషణ లాంటి అవార్డులు ఎప్పుడో రావల్సిందని అన్నారు. ఇప్పటికైనా ఆశావాదికి కళారత్న అవార్డు రావడం ప్రభుత్వానికే గౌరవమని అన్నారు. డాక్టర్‌ ఎన్‌.శాంతమ్మ మాట్లాడుతూ ప్రతిభ, విత్పత్తి, పరుగుతీసే కైత డాక్టర్‌ ఆశావాది సొంతమని అన్నారు. ధార, ధోరణి, ధైర్యం నిర్భయంతో ఆశావాది అవధానం చేశారని కొనియాడారు. శతావదాని సివి సుబ్బన్న, బోగిసెట్టి జూగప్ప, నండూరి రామకృష్ణమాచార్య శిష్యరికంలో ఆయన పద్యకవిగా, అష్టావధానిగా ఎదిగారని అన్నారు. 2008లో ఆశావాది సాహితీస్వర్ణోత్సవాల సందర్భంగా పెనుకొండలో రెండు రోజులపాటు పది సాహితీ వేదికల్లో వివిధ ప్రక్రియల్లో కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారని చెప్పారు. అంతేకాకుండా ఆశావాదిని కుంచెంఅశ్వత్తయ్య గండెపిండేరం తొడిగి గొప్ప సన్మానం చేశారని అన్నారు. శాంతమ్మతో ఆశావాదికి ఉన్న సాహితీ పరిచయాన్ని కవిత్వంలో ఆమెను ప్రోత్సహించిన తీరును వివరించారు. సభాధ్యక్షులు హీరాలాల్‌ మాట్లాడుతూ అవదాన శిరోమణి డాక్టర్‌ ఆశావాదికి కళారత్న అవార్డు రావడం సంతోషించదగిన విషమని అన్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో విలువలు భ్రస్టుపట్టిన తరుణంలో విలువలతో కూడి సాహిత్యాన్ని ప్రజలకు అందించే వారు తక్కువని అన్నారు. వారు రచనలతోపాటు నిజజీవితంలో కూడా విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన ప్రముఖుడు డాక్టర్‌ ఆశావాది అని కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 28 అష్టావధానాలు చేశానని చెప్పారు.జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని , జిల్లా ప్రముఖ కవుల విశేషాలను ఈసందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు , సమావేశాలలో పాల్గొని సాహితీ మిత్రులను, శిష్యులను పొందానని స్నేహసంపద చాలా గొప్పదని చెప్పారు. ఆస్నేహాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అన్నారు. సమాజం పట్ల నిరంతర పరిశీలనా కవులకు, రచయితలకు అవసరమని సూచించారు. ఏ కవి పద్యాలు ప్రజల నోళ్లలో మెదులుతాయే అలాంటి వారే ప్రముఖులని చెప్పారు. కళలను గురించి వివరిస్తూ ఏది ధనాపేక్ష లేకుండా ఉండేదే నిజమైన కళ అన్నారు. సన్మాన పత్రాన్ని అధ్యాపకులు వేణుగోపాలశర్మ చదివి వినిపించారు. రిటైర్డ్‌ అధ్యాపకులు కాల్వసంజీవరాయుడు, జానపదకవి గిరిరాజులు, రోశయ్య, శశిధర్‌రావు తదితరులు మాట్లాడారు. గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ కె.జి గంగాధరరెడ్డి, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ప్రత్యేక జ్ఞాపికను అంజేపి సన్మానించారు.

20, మే 2012, ఆదివారం

ప్రపంచీకరణ దుష్పరిణామాలపై మేల్కొలపాలి

                                              'విన్యాసం' పుస్తకావిష్కరణ సభలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి

        ప్రపంచీకరణ దుష్పరిణామాలపై ప్రజలను మేల్కోలిపేలా తమ రచనల ద్వారా కృషి చేయాలని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి సాహితీవేత్తలను కోరారు. ఆదివారం కర్నూలు ఎంపిపి హాల్‌లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో కెంగార మోహన్‌ రచించిన 'విన్యాసం' పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ పి. బుచ్చన్న, అథితులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లబాపురం జనార్ధన్‌, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ సామాజిక ప్రయోజనం కోరేది సాహిత్యమని, సాహిత్యం ప్రజలకు చేరువ కావాలంటే విస్తృతంగా సమాజ హితం కోరే రచనలు రావాలని ఆకాక్షించారు. ప్రపంచీకరణలో మనిషి నుంచి మనిషి దూరమయ్యారని పేర్కొన్నారు. నైతిక, మానవతా విలువలు తగ్గిపోయి మనిషి వ్యాపార వస్తువుగా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ జీవితంపై సరళీకరణ ప్రభావం గరిలీకరణగా మారిందన్నారు. దేశం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు పాలకులు చెబుతున్నా మరోపక్క అన్నార్థులు సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శత కోటీశ్వరులు, పెట్టుబడిదారులకు స్వేచ్చ తప్ప కార్మికులకు, రైతులకు, పేదలకు మాత్రం కాదన్నారు. ప్రపంచీకరణ పేరుతో సాగుతున్న ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దురాక్రమణపైన, చొరుబాటు పైనా ఇలాంటి కవితా విన్యాసం చేయడం అవసరమన్నారు. ఈ ప్రాంతంలో ప్రగతిశీల సాహిత్యాన్ని పెంపొందించాలన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ మీద సినిమాలు చూపించి ఇక్కడ ప్రజా బతుకులను దుర్బర జీవితాలను తెరమరుగుపరుస్తున్నారు. హంద్రీనదీ తీరానా కవితా పుష్పాల్లా అనేక మంది కవులు, కళాకారులు వికసించాలని రవి అభిప్రాయపడ్డారు. అనంతరం డిఇఒ డాక్టర్‌ బుచ్చన్న మాట్లాడుతూ విష సంస్కృతి కోరల్లో మన కుటుంబాలు నలిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. తల్లి, చెల్లి అక్క, అన్న కూర్చోని వీక్షించలేని కార్యక్రమాలు టివిలో వస్తుంటే, చూడలేని దౌర్భాగ్యమైన స్థితి ఉందన్నారు. సామాజిక కోణాన్ని ఆవిష్కరించిన విన్యాసం కవితా సంపుటి అందరికీ ఆదర్శమన్నారు. పిల్లలు సక్రమమైన మార్గంలో నడిచేందుకు ఉపాధ్యాయులు కవితలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాబాపురం జనార్ధన మాట్లాడుతూ విన్యాసం కవితా సంపుటిలో మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు, సమకాలిన సంగతులు ప్రత్యక్షంగా కనిపిస్తాయన్నారు. మనిషికి మనిషికి దూరం పెరిగినప్పుడు దగ్గరచేసేది సాహిత్యమన్నారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె. సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సాహిత్య రంగంలో రానించడం అభినందనీయమన్నారు. కవి కెంగార మోహన్‌ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునీకతలో మనిషి మోసపోతున్న తీరు ఈ విన్యాసం కవితా సంపుటిలో ఉన్నాయన్నారు. ఇక ముందు సామాజిక అంశాలపై కవిత్వం రచిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ పుస్తకాన్ని తెలకపల్లి నరసింహయ్యకు అంకితమిచ్చారు. అంతకు ముందు తెలకపల్లి రవి పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం కవి కెంగార మోహన్‌ను ఘనంగా పలువురు సన్మానించారు. ప్రంపంచీకరణ నేపథ్యంలో మోహన్‌ రచించిన 'విన్యాసం' కవితా సంపుటి బాగుందని పలువురు అభినందించారు. పలువురు సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు హాజరయ్యారు.