2, మే 2011, సోమవారం

బిన్‌లాడెన్‌ మృతితో ఉగ్రవాదం అంతమవుతుందా?



ఒసామాబిన్‌లాడెన్‌ను హతమార్చినంత మాత్రాన ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసినట్లు కాదు. ఆయనను చంపేసి జలసమాధి చేశారట. అల్‌ఖైదాకు ఎంత సైన్యం ఉంది. ఎక్కడెక్కడ విస్తరించి ఉంది. దానికి అమెరికా ఎంత సహకరించింది. ఇవన్ని చూడాల్సి ఉంది. అయితే లాడెన్‌ గతంలోనే చనిపోయాడని వార్తలొచ్చాయి. కాని ఆయన తిరిగి దర్శనమిచ్చారు. ఇప్పుడు చంపేశామని అనేక ఆధారాలు చూపుతుంది. అయితే పాకిస్తాన్‌లో చంపేయడం చర్చనీయాంశమైంది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి చేసినప్పుడు జరిగిన నష్టానికి ప్రస్తుతం లాడెన్‌ను చంపేశారని తెలియగానే అమెరికాలో సంబరాలు జరుపుకున్నారు. తీవ్రవాదాన్ని ప్రస్తుతం ఎవరు పోషిస్తున్నారో చూడాలి. అంతే కాదు ప్రపంచ పోలీసుగా పేరుపొందిన అమెరికా అనేక దేశాలలో వివిధ కారణాలు చూపి విధ్వంసాలకు పాల్పడింది. అక్కడి పాలకులను మార్చేసింది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెబుతూనే అమెరికానే ఉగ్రవాదిలా మారింది. కాబట్టే మత ఛాందస ఉగ్రవాదులు అమెరికాపై కుట్రపన్నుతున్నారు.
ఇరవైఒకటవ శతాబ్దంలో ఉగ్రవాదంతో అగ్రరాజ్యాన్ని వణికించిన అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ ప్రపంచంలో అందరికన్నా 'మోస్ట్‌ వాంటెడ్‌' వ్యక్తి. ఆదివారం పాకిస్తాన్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన లాడెన్‌ ఒక సౌదీ ప్రముఖుని కుమారుడు. 2001, సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, పెంటగాన్‌పై జరిపిన దాడులతో లాడెన్‌ గురించి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడతను హిట్లర్‌ కన్నా భయంకరమైన వ్యక్తి. దేశానికి సరికొత్త శత్రువు. మోస్ట్‌ వాంటెడ్‌ పోస్టర్లపై కన్పించే అతడి ముఖం అమెరికన్లను, పశ్చిమదేశాలనూ నిద్రలో కూడా వెంటాడుతోందంటే అతిశయోక్తి కాదు. అటువంటి లాడెన్‌ను అంతం చేసేందుకు అమెరికాకు దశాబ్ద కాలం పట్టింది. అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన లాడెన్‌ చివరికి ఆ దేశ సేనల చేతుల్లోనే కన్ను మూయడం విచిత్రం. ఇస్లామిక్‌ ప్రపంచానికి హీరోగా మారక ముందు లాడెన్‌ను సిఐఎ ప్రపంచ ఉగ్రవాద 'ధృవతార' అని పొగిడింది. ఈజిప్టు నుంచి చెచెన్యా వరకూ, ఎమెన్‌ నుంచి ఫిలిప్పైన్స్‌ వరకూ ఉన్న ఉగ్రవాద గ్రూపులను తన అల్‌ఖైదా పతాకచ్ఛాయలో ఏకం చేసి తన ఇస్లామిక్‌ తీవ్రవాద సిద్ధాంతానికి ఎల్లలు లేవని చాటాడు. లాడెన్‌కు ముందు ఉగ్రవాదమంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రాయోజితమే. అయితే లాడెన్‌ మాత్రం ఒక ప్రభుత్వాన్నే శాసించిన ఉగ్రవాది. 1996 నుంచి 2001 వరకూ అప్పటి ఆఫ్ఘన్‌ పాలకులు తాలిబాన్ల రక్షకుడిగా వ్యవహరించాడు. అల్‌ఖైదాను అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్ది ఉగ్రావాదాన్ని ప్రపంచమంతటా విస్తరించాడు. సెప్టెంబర్‌ 11 దాడుల తరువాత అల్‌ఖైదా, బిన్‌లాడెన్‌ 'ప్రతిష్ట' 21వ శతాబ్ది రాజకీయ 'ప్లేగు'లా విస్తరించింది. ఉగ్రవాద గ్రూపులు తమకు తామే అల్‌ఖైదా అని చెప్పుకుంటూ ఇరాక్‌లో అమెరికా సేనలపై దాడులు, బాలీలో పర్యాటక కేంద్రాలపై బాంబులు, స్పెయిన్‌లో ప్రయాణీకుల రైళ్లను పేల్చివేయడం వంటి ఘటనలకు పాల్పడ్డాయి.
టర్నింగ్‌ పాయింట్‌
1989లో ఆఫ్ఘన్‌లో సోవియట్‌ ఓటమి అటు అమెరికాకు, ఇటు లాడెన్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా తాను బలోపేతం చేసిన లాడెన్‌కు అమెరికా వందల కోట్ల డాలర్లతో భారీ ఆయుధాలను, ఆయుధ సామగ్రిని సమకూర్చింది. ఆఫ్ఘన్‌లో సోవియట్‌ ఓటమి నాటి ప్రచ్ఛన్న యుద్ధానికి తెరదించినా అప్పటి నుంచీ ప్రపంచంలో సరికొత్త ఉగ్రవాదానికి తెరలేచింది. ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యన్లకు ఎదురైన ప్రతిఘటనకు ఆర్థికంగా, నైతికంగా అండదండలు సమకూర్చిన లాడెన్‌ ఆ సమయాన్ని ఇస్లామిక్‌ రాజకీయ శక్తి పునఃస్థాపనకు, వివిధ దేశాల ప్రభుత్వాలను జిహాద్‌ (పవిత్ర యుద్ధం) ద్వారా కూలదోసేందుకు అవకాశంగా తీసుకున్నాడు. అమెరికా ప్రపంచాధిపత్యాన్ని అంతం చేయగల శక్తి ముస్లింలకే ఉందని అతడు ఒక ఇంటర్వ్యూలో ఉద్ఘాటించాడు. అప్పటి నుండే అమెరికా స్థానంలో తనదైన సామ్రాజ్య నిర్మాణానికి అతడు రంగం సిద్ధం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మొదలు ప్రపంచ దేశాలన్నింటినీటినీ ఏకం చేసి ఖలీఫియా పేరిట ఇస్లామిక్‌ సామ్రాజ్యాన్ని స్థాపించి దానికి తను యువరాజు కావాలని కలలు కన్నాడు. ప్రపంచ దేశాలన్నీ ఇస్లామ్‌కు సంబంధించినవే తప్ప పాలకులకు సంబంధించినవి కావని అతడు ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. తన కలను సాకారం చేసుకోవడానికి అల్‌ఖైదాను ఒక సాధనంగా మార్చుకున్నాడు. 90వ దశకం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఉగ్రవాద గ్రూపులను అక్కున చేర్చుకొని తన నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నాడు. సెప్టెంబర్‌ 11 దాడులకు ముందే అతడు సోమాలియా, సౌదీ అరేబియాలలో అమెరికా సైనికులను హతమార్చాడని అధికారులు చెబుతున్నారు.
జీవిత విశేషాలు
 రియాద్‌కు చెందిన శతకోటీశ్వరుడు మహ్మద్‌ బిన్‌ లాడెన్‌కు జన్మించిన 50 మంది సంతానంలో ఒసామా 17వ వాడు. ఒసామా బిన్‌ లాడెన్‌ పుట్టిన తేదీ రికార్డుల ప్రకారం 1957 అయినప్పటికీ అతడి వయస్సుపై ముసురుకుంటున్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. 1976లో జెడ్డా యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. 1979, డిసెంబర్‌ 26న సోవియట్‌ సేనలు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించాయి. 1984 నుంచే లాడెన్‌ పెషావర్‌కు చెందిన ఒక సేవల సంస్థలో పనిచేస్తూ విమానాలలో వచ్చిపోయే సోవియట్‌ సేనలకు సహాయం చేసే అరబ్‌ వాలంటీర్లకు మద్దతుగా పని చేశాడు. 1986లో లాడెన్‌ పెషావర్‌కు మారి అక్కడ ఆయుధాలను సమీకరించుకొని సొంతంగా ఒక ఫైటర్ల బ్రిగేడ్‌ను నిర్మించుకున్నాడు. 1988లో అల్‌ఖైదా తన ఛాందసవాద భావాలతో తీవ్రవాద ముస్లింలను సూదంటు రాయిలా ఆకర్షించింది. వీరంతా తమ స్వదేశాలలో ముస్లిం ప్రభుత్వాల ఏర్పాటుకు కృషిచేయడంతో పాటు అమెరికా, ఇజ్రాయిల్‌, అమెరికా మిత్ర దేశాలకు వ్యతిరేకంగా చేతులు కలిపారు. 1991లో ఇరాక్‌పై అమెరికా దాష్టీకాన్ని వ్యతిరేకిస్తూ లాడెన్‌ సౌదీ అరేబియాలో ప్రవాస జీవితంలోకి వెళ్లిపోయాడు. 1993, జూన్‌లో బిన్‌ లాడెన్‌ను అతడి కుటుంబ సభ్యులు కుటుంబం నుంచి, వ్యాపారం నుంచి వెలివేశారు. తమ పాలకులకు వ్యతిరేకంగా ప్రచారంచేస్తున్న లాడెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సౌదీ అరేబియా 1999, ఏప్రిల్‌ 9న అతడి పౌరసత్వాన్ని రద్దుచేసింది. దానితో లాడెన్‌ 1996, మేలో సూడాన్‌కు తరలి వెళ్లాడు. అక్కడ అమెరికా ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్నాడు. అమెరికా సైనికుల్ని హతమార్చాలంటూ 1996, ఆగస్టులో బిన్‌ లాడెన్‌ ఫత్వా (మతపరమైన డిక్రీ)ను జారీ చేశాడు. 1996, అక్టోబర్‌లో సౌదీలో జరిగిన రెండు బాంబు పేలుడు ఘటనల్లో లాడెన్‌ను ప్రధాన నిందితుడిగా అమెరికా ప్రకటించింది. 1998లో నైరోబీ, దారస్సలాంలోని అమెరికా రాయబార కార్యాలయాల వద్ద పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కు పేలి 12 మంది అమెరికన్లతో సహా 224 మంది మరణించారు. ఈ ఘటనల సూత్రధారిగా లాడెన్‌ను ప్రకటించిన అమెరికా అతడిపై క్రూయిజ్‌ క్షిపణుల దాడికి ఆదేశాలు జారీ చేసింది. 2000, అక్టోబర్‌ 12న ఎమెన్‌ ఓడరేవులో నిలిచి ఉన్న అమెరికా యుద్ధనౌకపై అల్‌ఖైదా దాడి చేసింది. ఆ దాడిలో 17 మంది నావికులు మరణించారు. 2001, సెప్టెంబర్‌ 11న అల్‌ఖైదా మూడు హైజాక్‌ చేసిన విమానాలతో అమెరికాలోని న్యూయార్క్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కట్టడాలుగా ఉన్న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి చేసి వాటిని కుప్పకూల్చింది. ఒక విమానం పెంటగాన్‌లోకి కూడా దూసుకెళ్లింది. హైజాక్‌ చేసిన నాలుగో విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఈ దాడిలో దాదాపు మూడు వేల మంది మరణించారు. అల్‌ఖైదా అంచనాలకు మించి విజయవంతమైనట్లు లాడెన్‌ ఆ దాడిపై సంతృప్తి వ్యక్తం చేశాడు. లాడెన్‌ను 'సజీవంగా లేదా నిర్జీవంగా' పట్టుకోవాలని 2001, సెప్టెంబర్‌ 17న అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ ఆదేశాలు జారీ చేశారు. 2001, అక్టోబర్‌ 7న లాడెన్‌కు, అల్‌ఖైదాకు ఆశ్రయమిచ్చారన్న సాకుతో ఆఫ్ఘన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వంపై అమెరికా దాడులు ప్రారంభించింది. 2001, అక్టోబర్‌ 26న విడుదల చేసిన ఒక వీడియోలో ఇజ్రాయిల్‌ను సమర్థించడం ఆపకపోతే మరోసారి ఆత్మాహుతి దాడులు చేస్తామని లాడెన్‌ అమెరికాను హెచ్చరించాడు. 2010, జనవరి 26న అమెరికా సైనిక చర్యతో అల్‌ఖైదా బలహీనపడినట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. సెప్టెంబర్‌ 11 దాడుల సూత్రధారులను అమెరికా జైల్లో పెడితే తాను అమెరికన్లనెవరినైనా చంపుతానని 2010, మార్చి 25న లాడెన్‌ అమెరికాను హెచ్చరించాడు.2011, మే 1న లాడెన్‌ను పాకిస్తాన్‌లోనే హతమార్చినట్లు ప్రకటించిన అమెరికా అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
లాడెన్‌ను పెంచి పోషించిన అమెరికా
గతంలో ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సోవియట్‌ యూనియన్‌ సైన్యాన్ని తప్పించేందుకు అక్కడి తిరుగుబాటుదారులకు, యుద్ధ ప్రభువులకు ఆయుధ సహాయం అందించిన అమెరికా వారికి నాయకత్వం వహించిన లాడెన్‌ను కూడా పెంచి పోషించింది. పాకిస్తాన్‌ కూడా అమెరికా తమకు అందచేసిన ఆయుధాలు, ఎకె-47 తుపాకులను తన మదర్సాల ద్వారా ఒసామా నేతృత్వంలోని తాలిబాన్లకు అందచేసేది. లాడెన్‌ నేతృత్వంలోని ఆఫ్ఘన్లు సోవియట్‌ సైన్యాలను వెనక్కి పంపేందుకు పోరాడుతుండగా అమెరికా మాత్రం సోవియట్‌పై తన ఆధిపత్య స్థాపన కోసం వీరికి సాయం చేసింది. సోవియట్‌ సేనలు ఉపసంహరించుకున్న తరువాత అమెరికా ఆఫ్ఘన్‌ యుద్ధంలో మిగిలిన తన ఆయుధాలను ఇక్కడి యుద్ధప్రభువులను అప్పగించి వెళ్లిపోయింది. ఆ తరువాతి క్రమంలో తాలిబాన్లు క్రమంగా బలంపుంజుకొని తమ ఆధిపత్యం కోసం పోరాటం చేయగా వారికి లాడెన్‌ సాయపడ్డాడు. నిన్నటి వరకూ ఉగ్రవాదానికి ప్రతీకగా నిలిచిన లాడెన్‌ బతికున్న సమయంలో ఈ ప్రాంతంలో అమెరికాకు కంటిలో నలుసుగా మారాడు. ఇప్పుడు లాడెన్‌ అనంతరం అమెరికా ఇక్కడ మళ్లీ రెక్కలు విప్పుతుందా? అన్నది ప్రధాన ప్రశ్న. బిన్‌లాడెన్‌ను అమెరికా కాల్చి చంపినంత మాత్రాన అల్‌ఖైదా పనితీరు మారబోదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ప్రపంచ రాజకీయాలను ఇది ప్రభావితం చేస్తుందనడంలో సందేహం అవసరం లేదు. లాడెన్‌ వారసుడిగా పగ్గాలు చేపట్టే వ్యక్తికి బరాక్‌ ఒబామా ఆగర్భ శత్రువుగా మారడం ఖాయం. అయితే గత అధ్యక్షులెవరూ సాధించలేని విజయం సాధించిన ఒబామాకు స్వదేశంలో ఇది కొంత ఊరటనిచ్చే మాట కూడా నిజమే.

కామెంట్‌లు లేవు: