8, అక్టోబర్ 2010, శుక్రవారం

కాటికాపరులకు కష్టకాలం


  • కాంట్రాక్ట్‌ పేరుతో పొట్టగొట్టే యత్నాలు
  • చిత్తశుద్ధి లేని జిహెచ్‌ఎంసి పాలకులు
కాలే కాష్టాల మధ్య బొందలు తీస్తూ, కాడులు పేరుస్తూ ఒంటరిగా శ్మశాన వాటికకు రక్షణగా వుండే కాటి కాపరులకు కష్టకాలం వచ్చింది. శ్మశాన వాటికలను కాంట్రాక్టుకు ఇవ్వాలన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) నిర్ణయం కాటికాపరుల పొట్టగొట్టేలా ఉంది. తరతరాలుగా శ్మశాన వాటికల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్న బ్యాగరీ బతుకులు రోడ్డున పడబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో నాలుగు విద్యుత్‌ శ్మశాన వాటికలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది తమ వృత్తిని బొందపెట్టేలా ఉందని కాటికాపరులు ఆందోళన చెందుతున్నారు. ఇదే తరుణంలో ఉన్న శ్మశాన వాటికలను కాంట్రాక్టుకు ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ వృత్తిపై ఆధారపడి బతుకుతోన్న కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఎంతో కష్టనష్టాలను భరిస్తూ, ఎండనక, వాననక, రాంత్రింబవళ్లు శ్మశాన వాటికల్లో కాటికాపరులు సేవలందిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు ఐదేళ్లకు కాంట్రాక్టుకు ఇవ్వాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఆ తర్వాత మరో ఐదేళ్లు కాంట్రాక్టును పొడింగచవచ్చు.
గ్రేటర్‌లో రెవెన్యూ రికార్డుల ప్రకారం వివిధ మతాలకు చెందిన 682 శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌ జిల్లాలో 391, రంగారెడ్డి జిల్లా పరిధిలో 291 శ్మశానాలు ఉన్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌ పరిధిలో దాదాపు వెయ్యి శ్మశాన వాటికలు ఉన్నట్లు అంచనా. ఒక్కో శ్మశాన వాటికలో కాటికాపరులుగా కనీసం ముగ్గురు పనిచేస్తున్నారు. పిల్లలు పెద్దవారై కుటుంబాలుగా విడిపోయి వంతుల వారీగా ఈ కుల వృత్తిని చేసుకుంటున్నారు. 2008 వరకు ఇవి రెవెన్యూ పరిధిలో ఉండగా ఆ తర్వాత వీటిని జిహెచ్‌ఎంసికి బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్మశాన వాటికలను మున్సిపాలిటీలకు, గ్రామపంచాయతీలకు అప్పజెప్పారు. అప్పటి నుండి శ్మశాన వాటికల గురించి పట్టించుకోని జిహెచ్‌ఎంసి తాజాగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కాటికాపరులుగా పనిచేసే వందలాది బ్యాగరి కుటుంబాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తోంది. కాంట్రాక్టర్లకు దహన సంస్కారాలు, పూడ్చడానికి సంబంధించి రేట్లను కూడా జిహెచ్‌ఎంసి నిర్ణయించనుంది. దీంతో వంశపారంపర్యంగా పనిచేస్తున్న వందలాది మంది కాటికాపరులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది.
కాంట్రాక్టర్ల చేతిలో శ్మశానాలకు రక్షణ ఉంటుందా...!
శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఏ మేరకు రక్షణ ఉంటుందనేది అనుమానమే. ఇప్పటికే నగరంలో అనేక శ్మశాన వాటికలు కబ్జాలకు గురయ్యాయి. ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉన్నవి కూడా మిగిలే పరిస్థితి ఉండదు.
కాటికాపరులుగా 25శాతం మహిళలే
నగరంలో మహిళలు కూడా కాటికాపరులుగా సేవలందిస్తున్నారు. వీరి సేవలకు గుర్తింపు లేదు. భర్తలు చనిపోయిన మహిళలు ఆ వృత్తిని చేసి కుటుంబాలను పోషిస్తున్న వారు నగరంలో దాదాపు 25 శాతం మంది వరకు ఉన్నారు. సైదాబాద్‌, సీతాఫల్‌మండీ, అడ్డగుట్ట, కొత్తపేట తదితర శ్మశాన వాటికల్లో మహిళలు కాటికాపరులుగా సేవలందిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాంట్రాక్టీకరణతో వీరు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతారు. ఇప్పటికే కాచిగూడ, పురానాపూల్‌, బన్సిలాల్‌పేట, మారెడ్‌పల్లి, సంజీవరావునగర్‌ శ్మశాన వాటికలు అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అక్కడ కాటికాపరులు ఎప్పుడో వృత్తిని కోల్పోయారు. అయితే కొన్ని చోట్ల బ్యాగరులనే కూలీలుగా తీసుకుంటున్నారు.
ప్రమాదకర నిర్ణయం : సిపిఎం
శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం ప్రమాదకర నిర్ణయమని సిపిఎం హైదరాబాద్‌ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌ అన్నారు. శ్మశాన వాటికలను రక్షించి అభివృద్ధి పరచాల్సింది పోయి ఏదైనా ప్రైవేటుపరం చేయడమే జిహెచ్‌ఎంసి పనిగా పెట్టుకున్నట్లుందని అన్నారు. దీనివల్ల శ్మశాన వాటికలకు రక్షణ లేకుండా పోతుందని, మరో వైపు కాటికాపరులు జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ధరలు పెరిగాక శ్మశాన వాటికలకు ప్రమాదం ఏర్పడిందని, ఇప్పటికే అనేక శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయని, ఇప్పుడు ఉన్న శ్మశాన వాటికలు కాటికాపరుల కారణంగానే మిగిలాయని అన్నారు. ప్రైవేటుపరం చేయకుండా శ్మశాన వాటికలను పరిరక్షించేందుకు చర్యలు జిహెచ్‌ఎంసి తీసుకోవాలని, వాటిని అభివృద్ధి పరచాలని ఆయన కోరారు.
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి : కాటికాపరుల సంఘం
అభివృద్ధి పేరుతో శ్మశానాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కాటికాపరుల బ్యాగరీ సంఘం డిమాండ్‌ చేసింది. కాటికాపరి వృత్తిని నమ్ముకొని బతుకుతున్న బ్యాగరీ కుటుంబాల పొట్టగొట్టే విధానాలు మానుకోవాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.కిష్టయ్య, ఎం.శ్రీధర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వృత్తిని నమ్ముకొని బతుకుతున్న వారిని ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకున్నది లేదని, ఉన్న వృత్తిని కూడా దూరం చేసి దళితుల పొట్టకొట్టాలనుకుంటే సహించేది లేదని వారు హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం వల్ల కాటికాపరులు రోడ్డున పడితే శ్మశాన వాటికలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనా కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యుత్‌ దహన వాటికల ఏర్పాటును విరమించుకోవాలని, కాటికాపరుల, బ్యాగరుల వృత్తికి రక్షణ కల్పించాలని, కాటికాపరులకు గుర్తింపు కార్డులివ్వాలని డిమాండ్‌ చేశారు. శ్మశాన వాటికల అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని, శ్మశానాలను కాటికాపరులకే అప్పగించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కాటికాపరులకు, బ్యాగరులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కాటికాపరులుగా పనిచేస్తున్న వారందరికీ గౌరవవేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శవాల మీద వ్యాపారం చేయడమే : ఆర్‌.కిష్టయ్య
అభివృద్ధి పేర శ్మశాన వాటికలకు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం శవాల మీద వ్యాపారం చేసుకునే విధంగా ఉందని చంద్రాయణగుట్టకు చెందిన ఆర్‌.కిష్టయ్య అన్నారు. కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంతో జిహెచ్‌ఎంసికి ఆదాయం సమకూరుతుంది. కానీ దీనిపై ఆధారపడి బతుకుతోన్న కాటికాపరులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. ఇక కాంట్రాక్టర్లు శవాలను పూడ్చడానికి, దహనం చేయడానికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వసూలు చేస్తారని. శ్మశాన వాటికల అభివృద్ధి ఏమో కానీ ఆక్రమణలు, పెరిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు చనిపోతే వారి దహన సంస్కారాలు పూర్తి చేయడం గగనమైపోతుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే వసూలు చేస్తారనే నమ్మకం లేదు. డబ్బు చెల్లించలేని పేదలు చనిపోతే పరిస్థితి ఆందోళనకరం.
ప్రభుత్వ సహకారం లేకున్నా సేవలు... : ఎం.శ్రీదర్‌
కాటికాపరులకు సమాజంలో తగిన గుర్తింపు లేకపోయినా, ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందకపోయినా తాము అన్ని వర్గాల ప్రజలకు రాత్రనక, పగలనక సేవలు అందిస్తున్నామని సైదాబాద్‌కు చెందిన వృత్తిదారుడు ఎం.శ్రీదర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బొందలు తీయడం, కాడులు పేర్చడం, శవాన్ని తగులబెట్టడం, బూడిదను పోగు చేయడం, లాంటి పనులన్నీ చేస్తున్నామన్నారు. అనాథ శవాలకు ఉచితంగా దహన సంస్కారాలు చేస్తున్నామని తెలిపారు. పేదలు ఇచ్చింది తీసుకొని తమ పనిచేసుకుపోతున్నామని, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా రోజు కూలి కంటె ఎక్కువ గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్నామన్నారు. పిల్లలను చదివించుకోలేని దయనీయ స్థితిలో ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. శ్మశాన వాటికల్లోనే జీవనం సాగిస్తూ ప్రమాదాలను ఎదుర్కొంటూ సేవలం దిస్తున్న తమ తరహా సేవలు కాంట్రాక్టర్లు అందించడం అనుమాన మేనన్నారు.

కామెంట్‌లు లేవు: