20, ఆగస్టు 2011, శనివారం

'నేను సైతం' పార్టీ ఫిరాయించగలను

                2009 ఎన్నికలకు ముందు సామాజిక న్యాయం పేరుతో ప్రముఖ సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను. అనే శ్రీశ్రీ గీతం కాస్త చిరంజీవి విషయంలో తిరబడిందనిపిస్తోంది. నేనుసైతం పార్టీ ఫిరాయించగలను అని చిరంజీవి నిరూపించుకున్నారు. ఎన్‌టి రామారావు మాదిరిగా రాజకీయ రంగంలో గొప్ప సంచలనం సృష్టిస్తారని అనుకున్నారు ప్రజాదరణ చూసి. కాని సినీ నటుడు కావడం వల్లనే జనం అంతగా వచ్చారని ఎన్నికల తరువాత తేలిపోయింది. ఆయన సామాజిక న్యాయం అనే గొప్ప నినాదం చేశారు. ప్రజారాజ్యం పార్టీలో అంతా డబ్బున్న వాళ్ళకే ప్రాధాన్యత ఉందని కొందరు నాయకులు చిరంజీవి కంటే ముందే పార్టీ ఫిరాయించారు. సామాజిక న్యాయం అనగానే అప్పుడప్పుడే ఎదుగుతున్న కొందరు బడుగు, బలహీన వర్గాల నాయకులు ప్రజారాజ్యంలో చేరారు. సామాజిక న్యాయం సాధ్యం కాదని తెలుసుకుని ఆపార్టీకి కార్యకర్తలు దూరమయ్యారు. 20-08-2011న రాజీవ్‌ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు చిరంజీవి. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తానని , సామాజిక న్యాయం కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. చిరంజీవి. ఆరు దశాబ్ధాల కాలంలో సాధ్యం కాని సామాజిక న్యాయం చిరంజీవి కాంగ్రెస్‌లో చేరగానే ఎలా సాధ్యమో చిరంజీవి ఆలోచించాలి. ఆర్థిక అంతరాలు పెంచి సామాజికంగా వెనుకబడిన వారిని దోపిడీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీతో సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుంది?.

కామెంట్‌లు లేవు: