11, జనవరి 2011, మంగళవారం

పాలకులకు చిత్తశుద్ధి లేదు ?

ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న ఈ వ్యవస్థలో నిరుద్యోగం, పేదరికం ,అవినీతి, ఆకలి, రైతులకు అందని గిట్టుబాటు వంటి సమస్యలు పరిష్కారమవుతాయా?. అసలు ఆర్థిక అసమానతలు పోవడానికి ఏం చేయాలి. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఏం చేయాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరుదశాబ్దాలు దాటినా మనిషిని మనిషిగా చూడలేని మనుషులున్న వ్యవస్థ నేటికీ ఉంది. పాలకుల తప్పుడు విధానాలే కారణమని కొందరంటుంటే. ఒకపార్టీమీద మరోపార్టీ విమర్శలు, ఒకే పార్టీలో రెండు మూడు రకాల వైఖరులు వంటి గొడవల మధ్య ప్రజల సమస్యలను పక్కన పెట్టారు. నీతిమాలిన రాజకీయ నాయకుల వల్ల ప్రజల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్రమంగా కోటీశ్వరులయిన రాజకీయ నాయకులు ప్రజల పక్షాన పోరాడుతామంటారు. ఎలా సాధ్యమవుతుంది. చిత్తశుద్ధి ఉంటే ముందుగా మత వద్ద ఉన్న కోట్లను ప్రభుత్వానికి అప్పగించి పోరాడితే ప్రజలు నమ్మె అవకాశం ఉంది. అనుకున్న పదవులు రాలేదని బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేసే వారు ప్రజలకు సేవ చేస్తారనుకుంటే పొరపాటే. వరదలలో సర్వం కోల్పోయిన ప్రజలు ఏడాదిదాటినా గుడారాల్లో ఉంటున్నారు. వారి గురించి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. వరదల వల్ల కోస్తాలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కూలీలకు ఉపాధిలేక వలసలు పోతున్నారు. వ్యవసాయ కార్మికులు, దళితులు తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడం వల్ల దళిత , బడుగు , బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర వంటి ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే సమస్యలు పరిష్కార మవుతాయి.

కామెంట్‌లు లేవు: