26, జనవరి 2011, బుధవారం

ఆర్థిక అసమానతలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు

ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌
దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పు అని ప్రముఖ జర్నలిస్టు, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 26న ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు కర్నూలు జిల్లా కేంద్రంలోని లలితాకళాసమితిలో ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్యం-ధనప్రభావం' అనే అంశంపై సదస్సు జరిగింది. ఫోరం కన్వీనర్‌ ప్రసాద్‌శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పాలగుమ్మి సాయినాథ్‌ ముఖ్యోపన్యాసం చేశారు. దేశంలో కోటీశ్వరులు పెరిగిపోతున్నట్లే పేదరికం విపరీతంగా పెరిగిపోతోందని తెలిపారు. 1991కి ముందు దేశంలో ఒక్కరు కూడా డాలర్‌ బిలీనియర్లు లేరని, ఇప్పుడు 53 మంది డాలర్‌ బిలీనియర్లు ఉన్నారని చెప్పారు. వీరి చేతిలో 1/3వ వంతు 83 కోట్ల ప్రజల జిడిపితో సమానమని అన్నారు. కోటీశ్వరులు కలిగి ఉన్న దేశాల్లో భారతదేశానిది నాలుగో స్థానంమని అన్నారు. ఆహారం, ఆరోగ్యం, విద్యలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో 135వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో 83 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.20ల కంటే తక్కువ ఖర్చు చేస్తున్నారని, ఈ రూ.20లతో ఏం వస్తుందని ఆయన ప్రశ్నించారు. 83 కోట్ల మంది పేదల్లో 88 శాతం దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఉన్నారని అన్నారు. పేదరికానికి కులం, వర్గం, స్త్రీ, పురుష బేధం కూడా కారణమవుతున్నాయని అన్నారు. దేశంలో ఇంత అసమానతలు ఉంటే ఈ దేశాన్ని ఏ వ్యవస్థా కాపాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో శాసనసభకు, పార్లమెంట్‌కు వెళ్లాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. అసెంబ్లీకి రూ.10 లక్షలు, పార్లమెంట్‌కు రూ.25 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదని నిబంధన ఉన్నా ఇప్పుడు రూ.40 నుంచి రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 288 మంది శాసనసభ్యులు ఉండే మహారాష్ట్రలో 212 మంది కోటీశ్వరులు పోటీ చేస్తే 186 మంది గెలిచారని చెప్పారు. మిగిలిన వారు ఎందుకు ఓడారని పరిశీలిస్తే వారి ప్రత్యర్థులు ఓడిన వారి కంటే పెద్ద కోటీశ్వరులు అని తెలిపారు. 70వ దశకంలో ముంబయిలో నవాల్‌ టాటా మీద ఒక సాధారణ కార్మికుడు పోటీ చేసి గెలిచాడని, ఈ పరిస్థితిలో ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. ఈ అవినీతిలో మీడియా పాత్ర కూడా కీలకంగా ఉందని అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పెయిడ్‌న్యూస్‌ల పేరుతో విపరీతంగా డబ్బును ఖర్చు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.వెయ్యి కోట్లను పెయిడ్‌ న్యూస్‌ కోసం ఖర్చు పెట్టారని తెలిపారు. ఆదర్శ కుంభకోణంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన అశోక్‌ ఛవాన్‌ లోకమత్‌ అనే న్యూస్‌ పేపర్‌లో 156 పేజీల పెయిడ్‌ న్యూస్‌ వేశారని చెప్పారు. ఈ 156 పేజీల పెయిడ్‌ న్యూస్‌పై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా లోకమత్‌ పేపర్‌ను విచారిస్తే అశోక్‌ ఛవాన్‌ గొప్ప నాయకుడు ప్రకటించుకున్నారు. అందుకే రాశామని, ఇవి వార్తలు అని చెప్పారని అన్నారు. ఆదర్శ కుంభకోణంలో ఇరుక్కుపోయి పదవి కోల్పోవడం చూస్తే ఎంత గొప్పనాయకుడో అర్థమవుతుందని అన్నారు. డబ్బులు ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు వారి ఆదాయంలో 350 శాతం నుంచి 7 వేల శాతం వరకూ వృద్ధి ఉంటుందని తెలిపారు. ఏడేళ్లుగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, ఈ డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గేయానంద్‌లాంటి సచ్చీలురులను శాసన మండలికి ఎన్నుకోవాలని కోరారు. కోటీశ్వరులు, కార్పొరేట్‌ సంస్థల అధినేతలు, బడారాజకీయ వేత్తలు కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల గ్లోబల్‌ ఇంటగ్రేటరీ సర్వీసెస్‌ అనే సంస్థ గత 50 ఏళ్లలో భారతదేశంలో రూ. 20 లక్షల కోట్లు లూటీ జరిగిందని బహిర్గతం చేసిందని తెలిపారు. ఈ 20 లక్షల కోట్ల కేవలం నల్లధనమేనని చెప్పారు. స్మగ్లింగ్‌, అవినీతి, అక్రమాలకు సంబంధం లేకుండానే కార్పొరేట్‌ సంస్థలు, కోటీశ్వరులు ఈ డబ్బును తీసుకెళ్లి స్విస్‌ బ్యాంకు, బెర్ముడా, లక్సంబర్గ్‌ లాంటి చోట్ల దాచారని తెలిపారు. వీటి ఖాతాదారుల వివరా లు ప్రభుత్వం వద్ద ఉన్నాయని అన్నారు. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వీటి ఖాతాదారుల పేర్లు చెప్పమంటే అది బ్యాంకు నిబంధనలకు విరుద్ధ మని చెబుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేద రైతుల పేర్లను మాత్రం బహిర్గతం చేస్తారని చెప్పారు. దేశం నుంచి తరలిపోయిన 20 లక్షల కోట్ల డాలర్లలో 50 శాతం డబ్బు ప్రపంచీకరణ తర్వాతే తరలి వెళ్లిందని అన్నారు. దాదాపు 2 వేల అకౌంట్లలో ఈ డబ్బు ఉందని తెలిపారు. ఈ ధనమే వస్తే దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అక్రమంగా డబ్బును బ్యాంకుల్లో దాచే ఖాతాదారులు ఇండియాలోనే ఎక్కువ అని ఐఎంఎఫ్‌ రిపోర్టు చెబుతుందని అన్నారు. దేశంలోని రైతులు అప్పులు దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు. 1995 నుంచి 2010 వరకూ దేశంలో 2.56 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇందులో 2/3వ వంతు ఐదు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 30 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలు ఇస్తారు కానీ వ్యవసాయ రంగానికి మాత్రం ఇవ్వరని విమర్శించారు. మెర్సిడెన్‌ బెంజిలాంటి కార్లు కొంటే 7 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులు రైతులు ట్రాక్టర్లను కొంటే 12 శాతానికి ఇస్తున్నా యని అన్నారు. సాధారణ రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో బయట 24శాతం వడ్డీకి అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయరంగంలో గత ఐదేళ్లలో పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థలైన టాటా, అంబాని, నీరారాడియా లాంటి వారు దేశాన్ని పాలిస్తున్నారని తెలిపారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది టాటా, అంబాని లాంటి వారు నిర్దేశిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని తెలిపారు. 2009 ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు ఉంటేనే చట్టసభలకు వెళ్తున్నారని, ఇది ప్రమాదకరమని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జార్జ్‌ విక్టర్‌ , పశ్చిమ రాయల సీమ పట్టభద్రుల ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ అభ్యర్థి డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ శాసన మండలిలో చుక్కా రామయ్య, కె నాగేశ్వర్‌, బాలసుబ్రమ ణ్యం, ఎంవిఎస్‌ శర్మ, లక్ష్మణ్‌రావు, రామిరెడ్డిలతో పిడిఎఫ్‌గా ఏర్పాటై ఆదర్శ రాజకీయాలకు దిక్సూచిగా పని చేస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్లాట్లు ఇచ్చిన తిరస్కరించామని తెలిపా రు. అలాంటి పిడిఎఫ్‌ నుంచి బరిలో పట్టభద్రుల అభ్యర్థిగా నిలిచిన డాక్టర్‌ గేయానంద్‌ను, టీచర్స్‌ అభ్యర్థి బీరం సుబ్బారెడ్డిని గెలిపించాలని కోరారు. లెక్చరర్స్‌ ఫోరం కన్వీనర్‌ చెన్నయ్య, జెవివి జిల్లా కార్యదర్శి బడేసాహెబ్‌ మాట్లాడారు. లలిత కళా సమితి చైర్మన్‌ పత్తి ఓబులయ్య , మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, నగర ప్రజలు హాజరయ్యారు. అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు సాయినాథ్‌ సమాధానం చెప్పారు.

కామెంట్‌లు లేవు: