20, అక్టోబర్ 2012, శనివారం

ముగిసిన జీవవైవిధ్య సదస్సు

183 దేశాలు 14500 ప్రతినిధులు
మొక్కుబడిగా జపాన్‌ నిర్ణయాలు-కొరియాలో 2014లో సదస్సు
                     భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో 2012 అక్టోబర్‌ 1న ప్రారంభమైన జీవవైవిధ్య సదస్సు 19న ముగిసింది. 183 దేశాలు హాజరయిన ఈసదస్సులో 14,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి జయంతినటరాజన్‌ ప్రారంభించిన సదస్సులో అక్టోబరు 16న భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరయి ప్రసంగించారు. ఈసదస్సులో చర్చలతోనే సంతృప్తి చెందారు. 2014లో తిరిగి కొరియా దేశంలో నిర్వహించాలని నిర్ణయించారు. జీవ వైవిధ్య రక్షణ కోసం ఆర్థిక వనరుల సేకరణే అసలు సమస్యగా మారింది. అవసరమైన ఆర్థిక వనరులపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కన్వెన్షన్‌ ఆన్‌ బయోలాజికల్‌ డైవర్సిటీ (సిబిడి) సమాచార అధికారి డేవిడ్‌ ఎయిన్స్‌వర్త్‌ తెలిపారు. ఈ విషయంపై అక్టోబర్‌18న అర్థరాత్రి వరకు వివిధ దేశాలకు చెందిన మంత్రులతో చర్చలు జరిపామన్నారు. 19న ఆయన భాగస్వామ్య దేశాల సదస్సు (కాప్‌-11) జరుగుతున్న హైటెక్స్‌లో మీడియాతో మాట్లాడుతూ కాప్‌-11లో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించామని అన్నారు. చాలా అంశాలపై నిర్ణయాలు కూడా తీసుకున్నామని చెప్పారు. ఆర్థిక వనరుల సేకరణ విషయంలో మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. కాప్‌-11కు మొత్తం 183 దేశాల నుండి 14,500 మంది ప్రతినిధులు, పర్యవేక్షకులు హాజరయ్యారని తెలిపారు. మూడు రోజుల నుండి కొనసాగుతున్న హై లెవల్‌ సెగ్మంట్‌లో 77 దేశాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారని తెలిపారు. 98 దేశాల నుండి ప్రభుత్వ ప్రతినిధులు సదస్సులో భాగస్వాములయ్యారని చెప్పారు. 2014లో నగోయా ప్రోటోకాల్‌ అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. రానున్న 9 నెలల్లో చాలా దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు. అమెరికా, రష్యా వంటి దేశాలు సిబిడిలో లేకపోవడంపై ఎలా స్పందిస్తారని విలేకరులు ప్రశ్నించగా అమెరికా సిబిడిలోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అమెరికా 20 ఏళ్ల క్రితమే సమ్మతించిందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు నగోయా ప్రోటోకాల్‌ను సమ్మతించడం లేదని, అటువంటప్పుడు చిన్న దేశాలు ఎలా అంగీకరిస్తాయని విలేకరులు ప్రశ్నించగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ ప్రోటోకాల్‌ను ఆమోదిస్తున్నాయని, 2014 నాటికి ఈ ఒప్పందం అమలు జరిగేలా ప్రయత్నిస్తామని చెప్పారు. సుమారు 12 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. జీవవైవిధ్యాన్ని కాపాడటంలో అన్ని దేశాలు సహకరించుకోవాలన్నారు.
జీవవైవిధ్య రక్షణలో తాము ముందుంటామని జి4 బయోడైవర్సిటీ ప్రతినిధులు తెలిపారు. 19న ఉదయం వారు హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తాము జీవవైవిధ్య రక్షణ కోసం ప్రత్యేకంగా యూత్‌ ఫోరంను ఏర్పాటు చేసుకున్నామన్నారు. భవిష్యత్తులో జి4 బయోడైవర్సిటీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. భాగస్వామ్య దేశాల సదస్సు(కాప్‌)-10లో యూత్‌గా పాల్గొన్నామని, అనంతరం వివిధ దేశాల్లో యూత్‌ జీవవైవిధ్య రక్షణ కోసం కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే సముద్రతీర ప్రాంత రక్షణ కోసం కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఉత్సాహం ఉన్న యువతను తమతోపాటు చేర్చుకుంటామన్నారు. ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

కామెంట్‌లు లేవు: