27, జనవరి 2013, ఆదివారం

సామాజిక చైతన్యంతోనే మహిళకు రక్షణ

'మహిళా రక్షణ చట్టాలు-సామాజిక బాధ్యత ' సదస్సులో జస్టిస్‌ చంద్రకుమార్‌
                సామాజిక చైతన్యంతోనే మహిళలకు రక్షణ సాధ్యమవుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి చంద్రకుమార్‌ సూచించారు. ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ స్టడీ ఫోరం ఆధ్వర్యంలో ' మహిళా రక్షణ చట్టాలు- సామాజిక బాధ్యత' అంశంపై ఆదివారం కర్నూలు సునయన ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. సమాజంలో ఏ అన్యాయం జరిగినా సమస్య నాకేందుకులే అని దూరంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ స్పందించిననాడే అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగవని అన్నారు. ఫోరం జిల్లా కన్వీనర్‌ బిఎల్‌ఎన్‌ ప్రసాద్‌శర్మ అధ్యక్షత వహించారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ సమాజంలో ప్రతి సమస్యకు డబ్బు కారణమవుతుందన్నారు. ప్రతీది లాభం దృష్టితో చూస్తూ మహిళలను సంపదను సృష్టించే వస్తువుగా చూసే ఇలాంటి ధోరణి పోవాలన్నారు. టీవీలు, సినిమాలు మహిళలను అసభ్యంగా చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లింగ, కుల, మత, సామాజిక, ప్రాంతీయ అసమానతలు లేని సమాజ నిర్మాణానికి అందరూ నడుంబిగించాలని కోరారు. మాతృసామ్య వ్యవస్థలో మహిళలదే కీలకమైన పాత్ర అని, ఆస్తి అనేది వచ్చాక భూస్వామ్య, రాచరిక వ్యవస్థలో మహిళలను ఆస్తికింద పరిగణించారని అన్నారు. మన ప్రజాస్వామ్యంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నందున పెట్టుబడిదారుడు లాభం కోసం మహిళను వస్తువుగానే పరిగణిస్తున్నారని అన్నారు. ఈ వ్యవస్థను మార్చుకునేందుకు అవకాశం మన చేతుల్లోనే ఉందన్నారు. రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు పరిచే వారికే ఓటు వేసి ఎన్నుకోవాలని సూచించారు. వంద కోట్ల రూపాయల అవినీతి చేసిన వాడిని ఎన్నుకుంటే సమాజంలో ఇలాంటి రుగ్మతలు వస్తాయని అన్నారు. స్త్రీలు, పురుషులు ప్రకృతిలో ఒక భాగమని, మహిళలు లేకుంటే మానవజాతికి మనుగడలేదని, అలాంటి మహిళల పట్ల సమాజం వివక్ష చూపటం సరికాదని అన్నారు. మహిళల పట్ల బాల్యం నుంచే వివక్ష వుంటుందని అన్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పిస్తే వివక్ష అంతమవుతుందని చెప్పారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోవడానికి కారణం సమాజంలోని అసమానతలేనని అన్నారు. మహిళలపై జరిగే దాడుల విషయంలో, సంఘటనల్లో కోర్టులు సరైన శిక్షలు వేయడం లేదనే భావన ఉందని ఇది సరి కాదన్నారు. చట్టం చేసే అధికారం కోర్టులకు లేదని అన్నారు. చట్టసభలైన పార్లమెంటు, అసెంబ్లీలో చట్టాలు చేస్తారని చెప్పారు. ఈ చట్ట సభల్లో రాజ్యాంగాన్ని గౌరవించి పకడ్బందీగా అమలు పరిచే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పెడధోరణులను చూస్తే దేశంలోని ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందా అన్న ఆందోళన కలుగుతుందని అన్నారు. మహిళల కేసుల్లో చాలా వరకు సత్వర న్యాయం జరగకపోవడానికి కారణం కేసులకు తగ్గట్టు కోర్టులు, న్యాయమూర్లులు లేకపోవడమేనని అన్నారు. మహిళలపై దాడులు జరగగానే రిపోర్టు చేయాలనే అవగాహన కూడా ప్రజల్లో ఉండాలని, విచారణ అధికారి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయాలన్నారు. సాక్షులు నిర్భయంగా వచ్చి జరిగిన సంఘటన కోర్టులో చెప్పిననాడే శిక్షలు పడతాయని అన్నారు. నేరం జరిగిన తరువాత తీసుకోవాల్సిన చర్యల కంటే నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉందన్నారు. సమాజంలో ప్రతీ పని లాభంతో ముడిపెట్టి చూస్తున్నందునే మహిళలు విలాస వస్తువులుగా మారారని అన్నారు. డబ్బు పిచ్చితో మానవతా విలువలు మంట కలుస్తున్నాయని, ఈ ధోరణి పోయేందుకు ప్రతి ఒక్కరూ చట్ట సభలకు మంచి వాళ్లను పంపించాలని సూచించారు. అదే విధంగా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అఘాయిత్యాలను అడ్డుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. మన కళ్లముందే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదనీ అన్నారు. ఏ స్త్రీకి అన్యాయం జరిగినా స్పందించాలని కోరారు. అయితే దీనిర్థం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్‌చాన్సలర్‌ ఆవుల మంజులత, జిల్లా జడ్జి జస్టిస్‌ జ్యోతిర్మయి మహిళా చట్టాలు, అమలు తీరుపై వివరించారు. ఈ సదస్సులో జిల్లా జడ్జిలు బి బసయ్య, రామలింగారెడ్డి, వెంకట జ్యోతిర్మయి, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి, న్యాయవాది పి నిర్మల, ఐసిడిఎస్‌ పిడి జుబేదాబేగం, ఐలు నాయకులు కె కుమార్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ ఆశీర్వాదమ్మ, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: