8, ఆగస్టు 2013, గురువారం

19నుంచి ఇంజనీరింగు కౌన్సిలింగు

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం -ఆన్‌లైన్‌లోనే బి కేటగిరీ సీట్ల భర్తీ

              విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌కు హైకోర్టు పచ్చజెండా ఊపింది.2013 ఆగస్టు 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆగస్టు8న ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వారం ముందు విడుదల చేయాలని కూడా సూచించింది. ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనే ప్రవేశాలు, యాజమాన్య కోటా సీట్ల భర్తీలపై వేసిన పిటీషన్లపై వాదనలు ముగిసిన తర్వాత గురువారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. దీనికి సంబంధించి జస్టీస్‌ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్‌ జరపాలని ప్రభుత్వానికి సూచించారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ పత్రికల్లో నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ, తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లోనే కౌన్సెలింగ్‌ జరపాలన్నారు. అన్ని విషయాలపై త్వరితగతిన చర్యలు తీసుకునేవిధంగా ఉన్నతవిద్యామండలికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాల్ని కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని హైకోర్టు సూచించింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ కూడా ఆన్‌లైన్‌ ్వరానే భర్తీ చేయాలని ఆదేశించింది. కన్వీనర్‌ కోటా మాదిరిగానే బీ కేటగిరి సీట్లకు కౌన్సెలింగ్‌పై పత్రికా ప్రకటనలు ఇవ్వాలన్నారు. దరఖాస్తుల జాబితాను అనుసరించి మెరిట్‌ లిస్టును వెబ్‌సైట్‌లో చూపాలన్నారు. మెరిట్‌ జాబితాపై ఉన్నత విద్యామండలి తరపున పరిశీలన చేయాలన్నారు. ప్రక్రియను త్వరగా ముగియడానికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 12న ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఆ రోజున అడ్మిషన్ల కమిటీ సమావేశమవుతుందని, అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళతామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజరుజైన్‌, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాశ్‌రావు తెలిపారు. హైకోర్టు నిర్ణయాన్ని తూచతప్పకుండా పాటిస్తామన్నారు. అయితే వారం ముందే ప్రకటన ఇవ్వాలని హైకోర్టు సూచించినా విభజన ప్రకటన నేపథ్యంలో జరుగుతున్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుంటామని అధికారులు చెబు తున్నారు. ఈ నెల 12 నుంచి ఎపి ఎన్‌జివోలు సమ్మెకు దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి పరి స్థితులను కూడా అంచనా వేసి హైకోర్టుకు వివరాలు అందజేస్తామన్నారు. ప్రభుత్వ అను మతితో19న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. అన్ని విషయాలపై ఈ నెల 12న సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రెండున్న లక్షల విద్యార్థుల ఎదురుచూపు
            ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో రెండున్నర లక్షలమంది విద్యార్థుల ఎదురుచూపులు ఫలించాయి. ఏప్రిల్‌లో ఇంటర్‌మీడియట్‌ ఫలితాలు వచ్చాయి. జూన్‌ మొదటివారంలో ఎంసెట్‌ ఫలితాలు విడుదల య్యాయి. రెండున్నర లక్షలమంది క్వాలిఫైడ్‌ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రకారం జూన్‌ రెండోవారం నుంచే ప్రవేశాలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటిం చింది. కానీ ఫీజులు ఖరారుకాకపోవడం, బీ కేటగిరి సీట్లపై హైకోర్టులో పిటీషన్‌ పడడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యమైంది. బీ కేటగిరి సీట్లపై ప్రభు త్వానికి, కాలేజీల యాజమాన్యాల మధ్య వాదనలు జరిగాయి. రెండువైపులా వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ సమ యంలో కౌన్సెలింగ్‌ ఆలస్యం కావడంపై హైకోర్టులో మరో పిటీషన్‌ పడింది. దాంతో రెండు పిటీషన్లపై గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకానొక సమయంలో కౌన్సెలింగ్‌ ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. రాష్ట్ర విభజనపై ప్రకటన నేప థ్యంలో ఒక ప్రాంతంలో ఆందోళనలు చెలరేగు తున్నాయి. హైకోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పట్లో కౌన్సెలింగ్‌ జరగదని అందరూ భావించారు. కానీ హైకోర్టే తన ఉత్తర్వుల్లో తేదీని కూడా చెప్పడంతో తప్పనిసరిగా కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేయకతప్పదు.

కామెంట్‌లు లేవు: