26, డిసెంబర్ 2017, మంగళవారం

ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువతి


            అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సృష్టి ధర్మం. మరి అమ్మాయే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ యువతి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ముగ్గురమ్మాయిలను వివాహం చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతోంది. పులివెందులలో పెళ్లి పేరుతో ఓ యువతి ఆడిన నాటకం  2017 డిసెంబర్ 26న వెలుగుచూసింది. మగాడిలా వేషం మార్చుకుని మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. మగాడి వేషంలో మౌనిక అనే యువతితో పరిచయం పెంచుకున్న రమాదేవి ఆమెను వివాహం చేసుకుంది. రమాదేవి మోసాన్ని గుర్తించిన మౌనిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
               పోలీసులు విచారణ జరపగా మోసం బయటపడింది. పులివెందులలో ఓ కాటన్ మిల్లులో పని చేస్తున్న రమాదేవి, అదే మిల్లులో పనిచేస్తున్న మౌనికతో పరిచయం పెంచుకుంది. అది పెళ్లి వరకు దారి తీసింది. పెళ్లై రెండు నెలలు అవుతున్నా మౌనిక పుట్టింట్లోనే ఉంది. తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పలేదు. అయితే రమాదేవి స్వయంగా మౌనిక ఇంటికి వెళ్లి అసలు విషయం చెప్పింది. మొత్తం తెలుసుకున్న మౌనిక కుటుంబసభ్యులు జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. మౌనిక కంటే ముందే రమాదేవి మరో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెళ్లి కంటే ముందే బాధితులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సెటిల్ చేసుకున్నట్లు తెలియవచ్చింది. మూడు పెళ్లిళ్ల మాట నిజమే అని ఆమె స్వయంగా రమాదేవి ఒప్పుకుంది. రమాదేవికి ఊహ తెలిసినప్పటినుంచి మగాడిలా ఉండడమంటే ఇష్టమట. అసలు కాటన్ మిల్లులో పనికి కూడా మగాడులానే చేరింది. చుట్టుపక్కల ఉన్నవారు ఆమెలో తేడా గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు ఈ విషయంపై స్పందించిన మౌనిక... రమాదేవి తనకు 2సార్లు కూల్ డ్రింక్‌లో, ఓసారి పెరుగన్నంలో మత్తుమందు కలిపి ఇచ్చిందని తెలిపింది. పెళ్లి మాత్రం కాలేదని చెబుతోంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు: