12, జనవరి 2019, శనివారం

30 ఏళ్లుగా ‘టీ’ మాత్రమే ఆమె ఆహారం..!


                   కోరియా: చల్లటి వాతావరణంలో వేడి వేడిగా టీ తాగితే ఆ మజానే వేరు. కానీ అదే టీ ఆహారంగా మారితే.. చాలా కష్టమేమో. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం 30ఏళ్లుగా ఛాయ్‌నే ఆహారంగా తీసుకుంటుంది. ఏదైనా జబ్బు వల్ల ఆమె అలా చేస్తుందేమోనని కుటుంబసభ్యులు ఎంతోమంది వైద్యులకు చూపించారు. కానీ ఆమె పరిస్థితి చూసిన వైద్యులే ఆశ్చర్యపోయారు. 30ఏళ్లుగా కేవలం టీ మాత్రమే తాగుతూ ఎంతో ఆరోగ్యంగా ఉండటం నిజంగా ఆశ్చర్యమైన విషయమని అంటున్నారు.
                    బరాడియా గ్రామానికి చెందిన పిల్లై దేవి తన 11వ ఏట నుంచి టీ తాగడం మొదలుపెట్టింది. ‘నా కూతురు ఒకసారి జిల్లా స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొని ఇంటికి వచ్చింది. గబాగబా అన్నం తిని, మంచినీళ్లు తాగింది. ఆ తర్వాత టీ, బ్రెడ్‌, బిస్కెట్లు తీసుకుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆమె కేవలం బ్లాక్‌టీ మాత్రమే తాగడం ప్రారంభించింది. ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం టీని మాత్రమే తీసుకోవడంతో మేం ఆందోళన చెందాం. ఎంతోమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి చూపించాం. కానీ ఆమె ఎటువంటి అనారోగ్య సమస్యతో బాధపడటం లేదని వాళ్లు చెప్పారు’ అని ఆమె తండ్రి రతిరాం చెప్పుకొచ్చారు. పిల్లై దేవి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయినట్లు జిల్లా హాస్పిటల్‌లో పనిచేసే డా.ఎస్‌.కె.గుప్తా తెలిపారు. కేవలం టీ మాత్రమే తాగుతూ జీవించి ఉండటం నిజంగా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఇది ఆశ్చర్యం’ అని ఆయన పేర్కొన్నారు. టీ మాత్రమే ఆహారంగా సేవిస్తున్న ఆమెను అక్కడ అందరూ ‘ఛాయ్‌ వాలి ఛాఛి’ అని పిలుస్తుంటారు. ఆమె ఇంట్లో నుంచి చాలా తక్కువ సార్లు బయటకు వస్తుందట. రోజు మొత్తం శివనామస్మరణలోనే గడుపుతోందని ఆమె సోదరుడు చెప్పుకొచ్చాడు.

కామెంట్‌లు లేవు: