
అది 2018 అక్టోబర్. గుజరాత్లోని అద్గామ్ గ్రామంలో ఎప్పటిలా కాకుండా కాస్త భిన్నంగా గ్రామసభ జరుగుతోంది. మూడు గంటలుగా ఓ మహిళ చెబుతున్న అంశాలను గ్రామస్థులు శ్రద్ధగా వింటున్నారు. ఆమె మాటలు వింటుంటే తమ ప్రాంతంలో నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం వారిలో కలుగుతోంది. కొద్దిసేపటి తర్వాత ఆమె తన ప్రసంగాన్ని ముగించి వారి వైపు చూసింది. అంతా నిశ్శబ్దం. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడే గ్రామ పెద్ద ఒకరు లేచి నిలబడి గొంతు సవరించుకుంటూ ‘‘గ్రామాభివృద్ధి కోసం అందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది. నీకు మేము చేయగలిగిన సహాయమంతా చేస్తాం.’’ అన్నాడు.

కలెక్టర్ అవుదామనుకొని..
గుజరాత్లోని శంఖల్పుర్కు చెందిన మిత్తల్ పటేల్ కలెక్టర్ కావాలనే ఆశయంతో అహ్మదాబాద్కు చేరుకుంది. అయితే కాకతాళీయంగా గుజరాత్ విద్యాపీఠంలో జర్నలిజం కోర్సులో ప్రవేశం పొందింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె తన కోర్సులో భాగంగా గుజరాత్లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలపై అధ్యయనం చేసింది. ఈ ప్రయత్నంలో ఆమె బనస్కాంత్ జిల్లాలోని సంచార జాతులు, ప్రభుత్వ గుర్తింపు పొందని గిరిజన తెగలను కలిసింది. వారు గడుపుతున్న దుర్భర జీవితం ఆమెను కలచివేసింది. సరైన గుర్తింపు లేని కారణంగా వారంతా ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలకు దూరమయ్యారని గుర్తించింది. ఇక కలెక్టర్ కావాలన్న తన ఆశయాన్ని పక్కనపెట్టి గిరిజన తెగల హక్కుల కోసం పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే 2006లో ‘విచర్త సముదాయ్ సమర్థన్ మంచ్’ అనే ఎన్జీవోను స్థాపించింది.

గ్రామస్థులను ఏకం చేసి..
బనస్కాంత్ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. భూగర్భ జలాలు 900-1000 అడుగుల లోతుకు వెళ్తే గాని అందవు. దీంతో ఆ ప్రాంతంలో తాగు, సాగునీరుకు కటకటలాడాల్సిందే. అక్కడి మారుమూల గ్రామాలకు ప్రభుత్వ పైపులైన్ల ద్వారా వచ్చే తాగునీరు సరిపోవడం లేదు. అయితే ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్లందరినీ ఐకమత్యం చేసి ఆ ప్రాంతంలోని చెరువులను పునరుద్ధరించడం ద్వారా వాన నీటిని ఒడిసి పట్టొచ్చు అనుకుంది.
2015 ప్రారంభంలో తన ఏడుగురు బృందంతో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రతి ఊరిలో సమావేశాలు నిర్వహించి స్థానికుల్లో చైతన్యం నింపింది. మొదట్లో ఆయా గ్రామ పెద్దల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయినా వెనుదిరగకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది. అలా కేవలం రెండు సంవత్సరాల్లోనే 87 చెరువులను పునరుద్ధరించగలిగారు.

నీటి సంరక్షణ కార్యక్రమాలతో పాటు గిరిజన తెగల హక్కుల కోసమూ కృషి చేస్తున్నారామె. బ్రిటిష్ కాలం నాటి ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1871’ ప్రకారం సుమారు 198 గిరిజన తెగలను నేర స్వభావం కలిగిన వారిగా గుర్తించారు. తర్వాత ఆ చట్టాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. అయినా వారిని ఇంకా నేరస్థులగానే పరిగణిస్తున్నారు. ఆ తెగలకు చెందిన ప్రజల హక్కుల సాధన కోసం ఆమె కృషి చేస్తోంది. ఇప్పటి దాకా సుమారు 60వేల మందికి వ్యక్తిగత ఓటరు కార్డులు, వెయ్యి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజురయ్యేలా చేశారు. వారి స్వయం ఉపాధి కోసం ప్రభుత్వంతో మాట్లాడి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి