30, ఏప్రిల్ 2011, శనివారం

అమెరికాలో మరో తెలుగోడి హత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఫార్మసీ యజమాని అమెరికాలోని న్యూజెర్సీలో హత్యకు గుర య్యారు. సరైన ప్రిస్క్రిప్షన్‌ లేకపో వడంతో మందులు ఇవ్వడానికి నిరాకరించాడన్న కారణంగా ఒక యువకుడు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయాడు. స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన అర్జున్‌ రెడ్డి ద్యాపా (52) బ్రాడ్‌ స్ట్రీట్‌లోని బ్రన్‌స్విక్‌ అవెన్యూ ఫార్మసీకి యజమాని. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆఫ్రికా-అమెరికా సంతతికి చెందిన ఒక యువకుడు సరైన మందుల చీటీ లేకుండానే మందులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీనికి అర్జున్‌రెడ్డి మర్యాదపూర్వకంగానే తిరస్కరించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయినా ఆ యువకుడు పదే పదే డిమాండ్‌ చేస్తూ అర్జున్‌ ఛాతీ భాగంలో పిస్టల్‌తో కాల్పులు జరపాడు. అర్జున్‌ను తక్షణమే కేపిటల్‌ హెల్త్‌ రీజినల్‌ మెడికల్‌ సెంటర్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. షాపులో వీడియో రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (తానా) వ్యవస్థాపక సభ్యుల్లో అర్జున్‌ ఒకరు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా)లో సీనియర్‌ నాయకునిగా కూడా ఉన్నారు. న్యూజెర్సీలో నిర్వహించిన పలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అర్జున్‌ రెడ్డి చాలా మర్యాదస్తుడు, తోటివారికి సహాయం చేసే వ్యక్తి అని మరో ఫార్మసీ యజమాని స్టీవ్‌ ఎట్మాన్‌ అన్నారు. అర్జున్‌ మృతిపట్ల తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేసిన ఆయన, హంతకుడిని అరెస్టు చేయడానికి తగిన సమాచారం ఇచ్చిన వారికి వెయ్యి డాలర్ల రివార్డు ఇస్తానని ప్రకటించారు. ఇలాంటి దారుణం తమలో ఎవరికైనా జరగొచ్చని స్టీవ్‌ వ్యాఖ్యానించారు. అర్జున్‌ హత్యతో దిగ్భ్రాంతికి గురైన ఇండో-అమెరికన్‌ కమ్యూనిటీ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుని సంతాపం ప్రకటించారు. మిడ్జిల్‌ మండలంలో మారుమూల గ్రామం మాదారంలో జన్మించిన ఆయన 1984లో అమెరికా వెళ్ళి స్థిర పడ్డారు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వారూ అమెరికాలోనే స్థిర పడ్డారు. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న తరువాత పలుమార్లు రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించేవారు. కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఆయన కొనసాగారు. పలుమార్లు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బస్సుయాత్రకు బాగా సహకరించారు. అర్జున్‌రెడ్డి మృతి వార్త తెలిసి బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
అమెరికా శాంతిభద్రతలు కాపాడకపోతే ఎలా?
భారతీయుల మృతిపై ప్రధాని దృష్టి తీసుకెళ్తా : విహెచ్‌
చట్టాలను కఠినంగా అమలు చేసే అమెరికాలోనే శాంతిభద్రతలు కాపాడకపోతే ఎలా? అని కాంగ్రెస్‌ ఎంపి వి హనుమంతరావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అర్జున్‌రెడ్డిని అమెరికాలోని న్యూజెర్సీలో కొందరు దుండగులు చంపడం బాధాకరమన్నారు. భారతీయుల మృతికి సంబంధించిన అంశాలను ప్రధాని, విదేశీ వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. శనివారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అమెరికాలో గత కొంత కాలంగా 18 నుంచి 20 మంది చనిపోయారని తెలిపారు. భారతీయులపై జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. అమెరికాలో భారతీయులకు తగిన రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కామెంట్‌లు లేవు: