22, అక్టోబర్ 2012, సోమవారం

ఇందు గలదందు లేదని సందేహము వలదు

                       మంగళూరు : 'ఇందు గలదందు లేదని సందేహము వలదు... ఎందెందు వెతకి చూసినా అందందే గలదు కుల వివక్ష....' అని కర్నాటకలో జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. కర్నాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష నేటికీ కొనసాగుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఇతర కులాలకు చెందిన విద్యార్థుల నుంచి తమను వేరుగా కూర్చోవాలని ఉపాధ్యాయులే ఆదేశించినట్లు దాదాపు 13.7 శాతం మంది దళిత పిల్లలు చెప్పినట్లు మంగళూరు యూనివర్శిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ పాలసీ తాజా అధ్యయనం పేర్కొంది.
                 'కర్నాటకలో దళితుల అభివృద్ధి, అనుభవాలు' అనే అంశంపై జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కర్నాటకలోని షెడ్యూల్డ్‌ కులాల జనాభా అధికంగా ఉన్న బెల్గాం, గుల్బర్గా, చిత్రదుర్గ, మైసూర్‌, కోలార్‌ వంటి 10 జిల్లాల్లో వారి సామాజిక, సాంస్కృతిక పరిస్థితులపై ఈ అధ్యయనం నిర్వహించారు. 2011 జులై నాటికి ముగిసిన పది నెలల్లో 50 గ్రామాల్లో ఈ అధ్యయనం ప్రకారం 2,425 కుటుంబాలు లేదా 12,677 మంది దళితులు వివక్ష, ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందులోని 825 కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. సర్వే నిర్వహించిన అన్ని జిల్లాల్లోనూ వివిక్షకు చెందిన వాస్తవాలు ఇదే స్థాయిలో కనిపించాయి. పాఠశాలల్లో ఈ వివక్షకు ఉపాధ్యాయులే కారణమని అధ్యయనం పేర్కొంది. మధ్యాహ్న భోజనంలోనూ ఈ వివక్ష కొనసాగుతోంది. భోజన సమయంలో తమ పిల్లలను ప్రత్యేంగా కూర్చోబెడుతున్నారని, వారు తినే ప్లేట్లను సైతం వేరుగా ఉంచుతారని దాదాపు 114 కుటుంబాలకు చెందినవారు చెప్పారు. భోజనం వడ్డించేందుకుగానీ లేదా వంటగదిలోకి ప్రవేశించేందుకుగానీ దళిత చిన్నారులను పాఠశాల అధికారులు అనుమతిం చడం లేదన్న విషయం పరిశీలనలో తేలింది. ఆశ్చర్యకరమైన విషయమే మిటంటే, తమ పిల్లలను క్లాస్‌ మానిటర్‌గా ఎప్పుడూ నియమించరని 72.8 శాతం తల్లిదండ్రులు చెప్పారు. అయితే తమ పిల్లలతోనే క్లాస్‌ రూమును తరచుగా శుభ్రం చేయిస్తుంటారని 33 శాతం మంది దళిత చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. ఇదిలా ఉండగా పిల్లల్లల మధ్య వివక్ష వ్యక్తమయ్యే సందర్భాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. దాదాపు 14 శాతం మంది తమను ఇతర కులాల పిల్లలు వారి ఇళ్లకు ఆహ్వానించారని చెప్పారు. అయితే వారి ఇళ్లకు వెళ్లిన సందర్భాల్లో అతితక్కువ మంది పెద్దలు మాత్రమే అనుమతించేవారనీ, వాటిలోనూ ఇంటి వసారాకే పరిమితమనీ పిల్లలు తెలిపారని నివేదిక పేర్కొంది. తాము పరిశీలించిన గ్రామాల్లో నిరక్షరాస్యత ఒక సమస్యగా ఉన్నట్లు పరిశీలకులు పేర్కొన్నారు. చదువుకున్న వారిలోనూ కేవలం 12.6 శాతం మంది పియుసి(ఇంటర్‌) పూర్తి చేయగలుగుతున్నారు. వృత్తి, ఉన్నత విద్య వరకు వెళ్ళేవారు స్వల్పం. కేవలం 1.2 శాతం మంది మాత్రమే డిప్లొమా, పారిశ్రామిక శిక్షణ పూర్తిచేసిన వారున్నారని ఈ అధ్యయనం పేర్కొంది.

కామెంట్‌లు లేవు: