31, ఆగస్టు 2017, గురువారం

ఏడు దీవుల నగరం ముంబయి

        ఏడు దీవులను కలపడం ద్వారా      ముంబయి ఒక నగరం నిర్మించారు. కాల క్రమేణా ఆ దృశ్యం అదృశ్యమైంది. ముంబై నగర ఉత్తర భాగంలో కాందివలిలో లభించిన కళాఖండాల ఆధారంగా ఇక్కడ రాతియుగం నుండి నివసించినట్లు విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 250 నుండి వ్రాతపూర్వక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని గ్రీకు రచయిత హెప్టెనేషియాగా (గ్రీకు భాషలో:సప్త ద్వీప సమూహం) వ్యవహరించాడు. క్రీ.పూ 3 వ శతాబ్దంలో ఈ సప్త ద్వీపాలు మౌర్య బుద్ధ మత్యావలంబీకుడైన ఆశోక చక్రవర్తి సామ్రాజ్యంలో భాగంగా మారాయి. మొదటి కొన్ని శతాబ్ధాల వరకు ఈ ద్వీపాలపై ఆధిపత్యంలో ఇండో సితియన్ స్ట్రాప్స్ మరియు శాతవాహనుల మధ్య వివాదాలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఈ ద్వీపాలు సిల్హరా సామ్రాజ్యంలో భాగమైనాయి. 1343 వరకూ ఈ ద్వీపాలు గుజరాత్ లో కలిసే వరకూ సిల్హరా పాలనలోనే ఉన్నాయి. కొన్ని పురాతన నిర్మాణాలున్న ఎలెఫెంటా గృహలు, వాకేశ్వర్ గుడుల సమూహం ఇక్కడ ఉన్నాయి.
                 1534 లో ఈ ద్వీపాలు బహదూర్ షాహ్ ఆఫ్ గుజరాత్ నుండి పోర్చుగీస్ ఆధీనంలోకి వచ్చాయి. 1661లో ఈ ద్వీపాలు ఇంగ్లాండుకు చెందిన రెండవ చార్లెస్‌కు కేథరిన్ డీ బ్రగాంజాను వివాహమాడిన సందర్భంలో వరకట్నముగా లభించాయి. 1963లో ఈ ద్వీపాలు ఈస్టిండియా కంపనీకు 10 పౌండ్ల సంవత్సర లీజు కింద ఇవ్వబడ్డాయి. వారు ఈ ద్వీపాల తూర్పు తీరంలో భారత ద్వీపకల్పంపంలోని తమ మొదటి రేవుని నిర్మించారు. 1661లో 10,000 జనాభా ఉన్న ఈ ప్రాంతం జనాభా 1675 మరియు 1687నాటికి 60,000 జనాభాగా త్వరితగతిని అభివృద్ధి చెందింది.ది బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ తన ప్రధాన కార్యాలయాన్ని సూరత్ నుండి బాంబేకు మార్చింది. ఎట్టకేలకు ముంబై నగరం బాంబే ప్రెసిడెన్సీకు ప్రధాన నగరంగా మారింది. 1817 నుండి బృహత్తర నిర్మాణ ప్రణాళికల ద్వారా అన్ని ద్వీపాలను అనుసంధానించాలని తలపెట్టారు.1845 నాటికి హార్న్‌బై వల్లర్డ్ పేరుతో నిర్మాణకార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దీని ఫలితంగా మొత్తం ద్వీపాలు 438 చదరపు కిలోమీటర్ల ప్రదేశానికి విస్తరించాయి. 1853లో మొదటి రైలు మార్గాన్ని బాంబే నూడి థానే వరకు నిర్మించారు. అమెరికన్ సివిల్ వార్ (1861-1865) కాలంలో ముంబై నగరం నూలు వస్త్రాల వ్యాపార కేంద్రంగా మారింది. ఫలితంగా నగర ఆర్థిక పరిస్థితులలో పెను మార్పు సంభవించింది. ఆ కారణంగా నగర రూపురేఖలలో విశేష మార్పులు వచ్చాయి.
               1955లో బాంబే రాష్ట్రం భాషాపరంగా మహారాష్ట్రా మరియు గుజరాత్‌లుగా విభజింప బడిన తరువాత ఈ నగరం స్వయంపాలిత ప్రాంతంగా మార్చాలన్న ఆలోచనని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రీయులు బాంబే ముఖ్యపట్టణంగా మహారాష్ట్రా రాష్ట్రం కావాలని కోరుతూ సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం లేవదీయడంతో, పోలీసు కాల్పుల్లో 105 మంది మరణంతో ఉద్యమం విజయవంతంగా ముగిసింది. మహారాష్ట్రా రాష్ట్రం బాంబే ముఖ్యపట్టణంగా వెలిసింది.
                    1970 తరువాత నిర్మాణ కార్యక్రమాలు త్వరిత గతిని అభివృద్ధి చెందటం, వలస ప్రజల స్త్ఝిర నివాసం కారణంగా జనసంఖ్యలో బాంబే కలకత్తాను అధిగమించింది. వలస ప్రజల ప్రవాహం ముంచెత్తడం మహారాష్ట్రీయులను కొంత అశాంతికి గురి చేసింది. వారి నాగరికత, భాష మరియు ఉపాధి పరంగా జరిగే నష్టాలను ఊహించి ఆందోళన పడసాగారు. ఈ కారణంగా బాలాసాహెబ్ థాకరే నాయకత్వంలో మాహారాష్ట్రీయుల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యాంశంగా శివసేనా పార్టీ ప్రారంభం అయింది. 1992-1993లో నగర సర్వమత సౌజన్యం చీలికలైంది. దౌర్జన్యాలు విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల కారణంగా మారాయి. కొన్ని నెలల తరువాతి కాలంలో మార్చి 12 వ తారీఖున ముంబాయి మాఫియా ముఠాల ఆధ్వర్యంలో ప్రధాన ప్రదేశాలలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఈ సంఘటనలో 300 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. 1995లో శివసేనా ప్రభుత్వ పాలనలో ఈ నగరం పేరు పురాతన నామమైన మూంబైగా మార్చబడింది. 2006లో ముంబై మరో తీవ్రవాద దాడికి గురైంది ఈ సంఘటన 200 ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడి ముంబై నగర రైల్వే పైన జరిగింది.  అవిభాజ్యమైన నగరంగా ముంబయి రూపొందింది. విచ్చల విడిగా పెరిగిన నిర్మాణాలు ఒకప్పుడు వర్షపు నీటిని ఎప్పటికప్పుడు సముద్రానికి తరలించిన జల మార్గాలను పూర్తిగా మాయం చేశారు. ఫలితంగా వర్షపు నీటి ప్రవాహానికి ప్రకృతి సహజమైన మార్గాలు మూసుకుపోయాయి. దీనికి తోడు భూ గర్భ, ఉపరితల మిళితంగా ఉన్న డ్రెయినేజి వ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మురుగు నీటిని తరలించడానికి ఏకైక వాహకంగా ఉన్న మితి నది ఆక్రమణలకు గురైంది. అది పేరుకే నదిగా మిగిలింది. ఈ స్వయం కృతాపరాధమే ముంబయి వాసులకు వర్షకాలంలో తిప్పలు తెచ్చిపెడుతోంది. సమైక్య రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ ఇదే స్థితి. ఒక అధ్యయనం ప్రకారం 404 చెరువులు అదృశ్యమైనాయి. ప్రస్తుతం వీటి ఆనవాళ్లు కూడా దొరకడం లేదు. కీలకమైన హుస్సేన్‌సాగర్‌ 40 శాతం పైగా ఆక్రమణలకు గురైంది. మూసీ నది పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇటీవల భాగ్యనగర వాసులను కలవరపరుస్తున్న నురుగు సమస్యకు మురుగునీటి పారుదల వ్యవస్థలోని లోపాలే కారణం. 2015లో చెన్నై నగరాన్ని ముంచెత్తిన వరదకూ సహజ నీటి ప్రవాహనికి ఆటంకాలు ఏర్పడటమే కారణం. బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర కీలకమైన అన్ని ముఖ్య నగరాల్లోనూ ఇదే స్థితి! 
              2017లో   అతి తక్కువ రోజుల్లో అత్యధిక వర్షపాతం కురవడమన్నది  సాధారణ అంశంగా మారింది. అనూహ్యంగా విరుచుకుపడుతున్న ఈ వర్షపు ధాటికి మహా నగరాలు పండుటాకుల్లా వణికిపోతున్నాయి. మరోవైపు ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు నగరాలు, పట్టణాలపై పెనుభారం మోపుతున్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఫలితంగా అక్రమార్కులకు, కబ్జా రాయుళ్లకు పాలకవర్గాలు బాహాటంగానే మద్దతు పలుకుతున్నాయి. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం గత 30 సంవత్సరాల కాలంలోనే ముంబయి నగరంలో ఆక్రమణల పర్వం జోరుగా సాగింది. హైదరాబాద్‌లోనూ 1980వ దశాబ్దం తరువాతే కబ్జా రాయుళ్లు చెలరేగిపోయారు. మిగిలిన నగరాల్లోనూ ఇదే స్థితి. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలుకు పర్యావరణ విధ్వంసానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇది ధృవీకరిస్తోంది. జాతీయ విపత్తుల నివారణ కమిటీ నగరాల అభివృద్ధికి చేసిన ఎన్నో సూచనలు అమలు కాకపోవడానికి కూడా ఈ నేపథ్యమే కారణం. ఇక పర్యావరణ ఉద్యమకారులు చేసే విజ్ఞప్తులు ప్రభుత్వాల చెవికెక్కడం లేదు. వరుసగా సంభవిస్తున్న విపత్తుల నేపథ్యంలోనైనా పాలకవర్గాల వైఖరి మారాల్సివుంది. 




కామెంట్‌లు లేవు: