9, జనవరి 2019, బుధవారం

ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం


             దిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ అనంతరం డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ డివిజన్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించారు. ఈబీసీ బిల్లుకు అనుకూలంగా 149 మంది సభ్యులు, వ్యతిరేకంగా ఏడుగురు సభ్యులు ఓటు వేశారు. బిల్లను సెలెక్టు కమిటీకి పంపాలన్న సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 18 మంది సభ్యులు, వ్యతిరేకంగా 155 మంది సభ్యులు ఓటు వేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్న సవరణతో పాటు, విపక్షాల సవరణ ప్రతిపాదనలన్నీ వీగిపోయాయి. లోక్‌సభలో మంగళవారం ఆమోదం పొందిన రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ యథాతథంగా ఆమోదం తెలిపింది. ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది.
                అంతకు ముందు కేంద్ర సామాజిక, న్యాయశాఖమంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ మాట్లాడుతూ... ఈబీసీలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధాని బిల్లు తెస్తున్నారని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారి చేయూతకు ఇంతకన్నా మంచి ఉపాయమేమైనా ఉందా అని ప్రశ్నించారు. రెండు, మూడు పార్టీలు తప్ప అన్ని రాజకీయ పక్షాలు బిల్లుకు మద్దతిస్తున్నాయని తెలిపారు. చరిత్రాత్మక బిల్లులో భాగస్వాములైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

కామెంట్‌లు లేవు: