కొత్త ఔషధాన్ని ఆవిష్కరించిన హెచ్సీయూ బయోకెమిస్ట్రీ విభాగం
మలేరియాపై జరుగుతున్న యుద్ధంలో మన దగ్గరి నుంచే ఓ
ప్రత్యామ్నాయ ఔషధం ఆవిష్కృతమవుతోంది. వ్యాధి కారక ‘ప్లాస్మోడియం
ఫాల్సిపారమ్’ అనే పరాన్నజీవి ఇప్పటికే ఉన్న ఔషధాలను తట్టుకొని.. మొండిగా
తయారైంది. ఈ నేపథ్యంలో ఆ పరాన్నజీవిని పూర్తిగా చంపేందుకు ‘బీఓ2’ అనే
మందును హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) బయోకెమిస్ట్రీ
విభాగం కనుగొంది. వర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి మ్రిణాల్కాంతి
భట్టాచార్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులు ప్రతాప్ వైద్యం, డిబుయేందు
దత్తా, నిరంజన్ సూత్రంతోపాటు బయోటెక్నాలజీ విభాగం ఫ్యాకల్టీ సునందా
భట్టాచార్య పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఈ ఆవిష్కరణ వివరాలు అమెరికాకు
చెందిన ప్రతిష్ఠాత్మక జర్నల్ ఆఫ్ బయోలాజికల్ కెమిస్ట్రీలో
ప్రచురితమయ్యాయి.
మలేరియా ఎలా వస్తుంది ?
ప్లాస్మోడియం
ఫాల్సిపారమ్ అనే ప్రోటోజోవా పరాన్నజీవితో మలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలస్
దోమ కుడితే ఇది మనషుల రక్తంలోకి ప్రవేశిస్తుంది. తొలుత కాలేయం, ఆ తర్వాత
ఎర్ర రక్తకణాల్లోకి చేరుతుంది. దీని కారణంగా ఎర్ర రక్తకణాలు నిర్వీర్యమై
వ్యాధి తీవ్ర పెరుగుతుంది. చికిత్స ఆలస్యమైతే పి.పాల్సిపారమ్ మెదడుకు చేరి
ప్రాణాపాయం ఏర్పడుతుంది.
ప్రస్తుతం ఉన్న ఔషధాలు..
ప్రస్తుతం
మలేరియాను తగ్గించడానికి క్లోరోక్విన్, ఆర్టిమిసినిన్ అనే రెండు రకాల
ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిగ్రస్థులు ఈ మందులు వేసుకుంటే
పి.ఫాల్సిపారమ్ డీఎన్ఏను విచ్ఛిన్నం చేస్తాయి. అలా వ్యాధి కారకం
చనిపోతుంది. కానీ, ఇటీవలికాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మందులు
అంతగా పని చేయడం లేదు. వ్యాధికారక జీవి ఆ ఔషధాలను తట్టుకొని.. విచ్ఛిన్నమైన
తన డీఎన్ఏను తిరిగి బాగుచేసుకుని బతుకుతోంది. దీన్నే వైద్య పరిభాషలో
‘హోమోలొగస్ రీ కాంబినేషన్’గా వ్యవహరిస్తారు. దీంతో వ్యాధి ముదురుతోంది.
ఫాల్సిపారమ్లో ఉండే ‘ఆర్ఏడీ51’ అనే ఎంజైమ్ కారణంగా డీఎన్ఏ తిరిగి
బాగవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. విచ్ఛిమైన డీఎన్ఏ రిపేర్
కాకుండా చేయగలిగితే వ్యాధి తగ్గుతుందని భావించిన హెచ్సీయూ పరిశోధక బృందం
నాలుగేళ్లపాటు శ్రమించి ఈ ఔషధాన్ని కనిపెట్టింది.
బీఓ2 పనితీరు ఇలా..
పరాన్నజీవి
నమూనాను సేకరించి దానిపై ప్రస్తుతం ఉన్న ఔషధాలు ప్రయోగించారు. వ్యాధికారకం
డీఎన్ఏ విచ్ఛిన్నమై.. తిరిగి రిపేర్ చేసుకునే క్రమంలో బీఓ2 మందును
ప్రయోగించారు. దీంతో విచ్ఛిన్నమైన డీఎన్ఏను బాగు చేసుకునే శక్తిని అది
కోల్పోయింది. క్రమంగా వ్యాధి తగ్గింది. బీఓ2 వల్ల ఇతర అవయవాలపై ఎలాంటి
దుష్ప్రభావం ఉండదని తేలినట్లు పరిశోధకులు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి