11, మే 2015, సోమవారం

జయలలితకు ఊరట

      ఆదాయానికి మించి ఆస్తుల కేసును కొట్టివేసిన  కర్ణాటక హైకోర్టు
                తమిళనాడు మాజీ సిఎం జయలలితపై దాఖలైన అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో జయకు ఊరట లభించింది. ఈ కేసుపై సోమవారం కర్ణాటక హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. స్పెషల్‌ కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జయలలితకు, మరో ముగ్గురిపై నమోదైన అన్ని అభియోగాలను న్యాయస్థానం కొట్టివేసింది. 18 ఏళ్లుగా సాగిన ఈ కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.వందకోట్లు జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తమిళనాడు అంతటా అన్నాడిఎంకె కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటాయి. జయలలిత నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోడీ జయకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారని అన్నాడిఎంకె ప్రకటనలో తెలిపింది. కోర్టు తీర్పు అనంతరం జయలలిత మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసులు బనాయించారని జయలలిత విమర్శించారు. డిఎంకె వేసిన అభాండాలు నిరాధారమని నిరూపితమైందన్నారు. చివరికి ధర్మమే గెలిచిందన్నారు. తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుని మేలిమి బంగారంలా బయటపడ్డానని అన్నారు. హైకోర్టు తీర్పు తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తమిళ ప్రజల ప్రార్థనలను ఆలకిం చిన దేవుడు ఈ తీర్పు చెప్పించాడని తెలిపారు. ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం జయ లలితకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తనపైన ఉన్న అనర్హత వేటు రద్దయింది. ఈ మేరకు అధికారులు వేటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆమె ఎమ్మెల్యే కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనని తెలిపారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మళ్లీ పగ్గాలు  చేపట్టేందుకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్ధోషిగా తేల్చిచెప్పడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సహా మంత్రులందరూ ఆమె నివాసానికి వెళ్లి జయకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత ఆదేశిస్తే సిఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని పన్నీర్‌ సెల్వం తెలిపారు. దీంతో ఈ నెల 17న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్టన్‌ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు తీర్పు తుది తీర్పు కాదనీ, ఈ కేసును సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం కచ్చితంగా అప్పీలు చేయాలని పేర్కొన్నారు.
                                                        ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి
             జయలలితకు అనుకూలంగా కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వడంతో డిఎంకె అధినేత కరుణానిధి స్పందించారు. ఈ కేసుకు సంబంధించి ఇదే తుది తీర్పు కాబోదన్నారు. న్యాయ స్థానాలన్నింటి కంటే మనస్సాక్షే ఉన్నతమైనదని కరుణ అభిప్రాయపడ్డారు. తన ఇంటి వద్ద పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసే విషయమై చర్చించినట్లు సమాచారం.
                                                తీర్పు విని షాకయ్యా! : సుబ్రమణ్య స్వామి
            హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి పెదవి విరిచారు. కోర్టు తీర్పు తనను అసంతృప్తి పరిచిందన్నారు. తీర్పు విని తను షాక్‌కు గురయ్యానని తెలిపారు. తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
                                                     ట్విట్టర్‌లో విమర్శల వెల్లువ
                   హైకోర్టు తీర్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. పలువురు మమ్మీ రిటర్న్స్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధనికులు శిక్షల నుండి తప్పించుకోవచ్చునని మరో సారి రుజువైందని పేర్కొన్నారు.
                                                     పలువురి అభినందనలు
             అక్రమాస్తుల కేసులో ఊరట లభించడంతో పలువురు రాజకీయ ప్రముఖుల నుండి జయకు అభినందనలు వెల్లువెత్తాయి. స్వయానా ప్రధాని మోడీ ఫోన్‌ చేసి తనకు అభినందనలు తెలియజేయటం విశేషం. తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్‌, నజ్మా హెప్తుల్లా, ఎన్సిపి నేత శరద్‌ పవార్‌, టిఎంసి నేత జికె వాసన్‌, తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటు, తమిళ చలన చిత్ర ప్రముఖులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
                                                                      కేసు విచారణ ఇలా...
1996: జయలలితకు వ్యతిరేకంగా ప్రముఖ న్యాయవాది, రాజకీయ వేత్త సుబ్రమణ్య స్వామి ఫిర్యాదు
1996: డిసెంబర్‌7 జయలలిత అరెస్టు
1997: జయలలిత, ఇతర నిందితులకు వ్యతిరేకంగా చెన్నై అదనపు సెషన్స్‌ కోర్టులో విచారణ ప్రారంభం
1997, జూన్‌4: భారత శిక్షా స్మృతి 120`బి, 1988 అవినీతి నిరోధక చట్టం 13(1)(ఇ) కింద అభియోగ పత్రం దాఖలు
1997, అక్టోబర్‌1: విచారణకు గవర్నర్‌ ఫాతిమాబీవి జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని మద్రాస్‌ ఉన్నత న్యాయస్థానంచే కొట్టివేత
2000 ఆగస్టు: న్యాయస్థానంలో 250 సాక్షుల విచారణ, అప్పటికి ఇంకా పది మందిని విచారించాల్సి ఉండిరది.
2001 మే: విధాన సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయదుందుభి. ముఖ్యమంత్రి గద్దెపై మళ్లీ జయలలిత అధిరోహణ
తమిళనాడు చిన్న తరహా పరిశ్రమల సంస్థ(టాన్సి) కేసులో 2000 అక్టోబర్‌లో శిక్షకు గురైనందున ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంపై అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు
2001 సెప్టెంబర్‌21: జయలలిత నియామకాన్ని రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం
2003: నిష్పక్షపాత విచారణకు కర్ణాటక కోర్టుకు కేసు విచారణను బదిలీ చేయాలని డిఎంకె ప్రధాన కార్యదర్శి అన్భాళగన్‌చే అత్యున్నత న్యాయస్థానానికి ఫిర్యాదు
2003 నవంబర్‌18 కేసు కర్ణాటక న్యాయస్థానానికి బదిలీ
2005 ఫిబ్రవరి 19: ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, విశ్రాంత న్యాయవాది జనరల్‌ బివి ఆచార్య నియామకం
2011: జయలలిత విచారణ. న్యాయస్థానంలో 1,339 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
2012: ఆగస్టు 12: బివి ఆచార్య రాజీనామా
2013 ఫిబ్రవరి: ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా భగవాన్‌ సింగ్‌ నియామకం
2013 ఆగస్టు 26: కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించకుండా, ప్రత్యామ్నాయ నియామకాన్ని జరపకుండా భగవాన్‌ సింగ్‌ నియామకం ప్రభుత్వంచే రద్దు
2013 సెప్టెంబర్‌ 30: భగవాన్‌ సింగ్‌ రద్దు నియామకాన్ని కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం
2014 ఆగస్టు 28: తీర్పు సెప్టెంబర్‌ 20 కి వాయిదా. నిందితులు నలుగురూ హాజరు కావాలని న్యాయస్థానం ఉత్తర్వు
2014 సెప్టెంబర్‌ 20: తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు ప్రకటన
2014 సెప్టెంబర్‌ 27: జయలలిత, ఇతరులకు శిక్ష విధింపు
2014 అక్టోబర్‌ 7: బెయిల్‌ వినతి తిరస్కరణ
2014 అక్టోబర్‌ 17: బెయిల్‌ మంజూరు, 21 రోజుల చెరసాల నుండి విముక్తి
2015 మే 11 నిర్ధోషిగా కర్ణాటక హైకోర్టు తీర్పు

కామెంట్‌లు లేవు: