15 కిలోమీటర్ల దూరం పాదయాత్ర
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పరామర్శ
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశంలోని కొంతమంది ధనికులు, బడా పారిశ్రామికవేత్తల కోసమే పని చేస్తోందని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్గాంధీ విమర్శించారు. భవిష్యత్తులో భూమికి బంగారం విలువ రాబోతోందని, దాన్ని కొంత మంది పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకే మోడీ భూ సేకరణ చట్టంలో మార్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి గురించి పట్టించుకోకుండా ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. (2015 మే 15న )శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని మామడ, లక్ష్మణచాంద మండలాల్లోని ఐదు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. గురువారం రాత్రే నాందేడ్ నుండి రాహుల్ గాంధీ నిర్మల్కు చేరుకొని మయూరి హోటల్లో బస చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు బయలుదేరి మామడ మండలంలోని కొరిటికల్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభించారు. తిరుపల్లి, లక్ష్మణచాంద, పొట్టపల్లి, రాచపూర్, వడ్యాల్ వరకు 15కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేశారు. అనంతరం నిర్మల్లో భోజనం చేసిన రాహుల్ గాంధీ సాయంత్రం 3 గంటలకు వడ్యాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. పాదయాత్ర సందర్భంగా ఐదు గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకొని ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఏదో విధంగా దేశానికి సేవ చేయగా, రైతులు మాత్రం రక్తం, శ్రమ ద్వారా సేవ చేస్తున్నారని తెలిపారు. రైతులకు వ్యవసాయ చేసుకునేందుకు తప్పనిసరిగా ఎరువులు, విత్తనాలు, విద్యుత్, రుణాలు అవసరమన్నారు. కాని ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటిని కల్పించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రాష్ట్రాల్లో రైతులకు అన్ని రకాల సాయం అందించి వారిని ముందుకు నడిపించామన్నారు. పదేళ్ల కాలంలో దేశంలో 6.5 కోట్ల రైతులకు రూ.70వేల కోట్లు రుణమాఫీ చేసినట్లుగా గుర్తు చేశారు. ప్రతి రైతుకు బ్యాంకు ద్వారా రుణాలు అవసరమని గుర్తించి అందజేశామని చెప్పారు. రైతులను మభ్యపెట్టి అధికారంలోకొచ్చిన మోడీ కనీసం కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రంలో ప్రధాని మోడీ, తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మోడీగాని, కెసిఆర్గాని రైతులను పట్టించుకుంటే రైతుల సమస్యలపై పాదయాత్ర చేయాల్సిన అవసరం తనకు ూండేది కాదన్నారు. అధికారంలోకొచ్చిన ఏడాది కాలంలో అటు మోడీగాని, ఇటు కెసిఆర్గాని ఏ ఒక్కరికీ ూద్యోగం కల్పించలేదన్నారు. కెసిఆర్ను ఆయన మినీ మోడీగా అభివర్ణించారు. రైతు రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర కోసం రైతుల తరపున పార్లమెంట్లో పోరాటం చేస్తానని భరోసా కల్పించారు. బిజెపి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా భూసేకరణ చట్టంలో మార్పులు చేసిందని మండిపడ్డారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే ప్రధాని మోడీ మాత్రం రూ.10లక్షల సూటు, బూటు వేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆయన వెంట ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు కుంతియా, దిగ్విజయ్సింగ్, రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, టిపిసిసి అధ్యక్షులు ూత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్కమిటీ ప్రెసిడెంట్ బట్టివిక్రమార్క, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, మండలి విపక్షనేత డి.శ్రీనివాస్, ఉపపక్షనేత షబ్బీర్అలీ, ఎంఎల్ఎలు గీతారెడ్డి, డికె.అరుణ, సంపత్, వంశీచందర్రెడ్డి, జీవన్రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, వివేక్, సిరిసిల్ల రాజయ్య, మధుయాష్కిగౌడ్, మాజీ కేంద్ర మంత్రులు జైపాల్రెడ్డి, బలరామ్నాయక్, రాష్ట్ర మాజీ మంత్రులు శ్రీధర్బాబు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి