13, ఏప్రిల్ 2015, సోమవారం

సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేద్కర్‌


                                                                       
    నేడు  125వ జయంతి
          సామాజిక న్యాయం కోసం డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ జీవితాంతం పోరాడారు.  స్వతంత్ర భారత రాజ్యాంగనిర్మాత. మనదేశంలో అంటరానితనం నిర్మూలనకు, కులనిర్మూలనకు, ఛాందసభావాలకు,  మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం కృషిచేసిన మహావ్యక్తి అంబేద్కర్‌ . ఆయన 125వ జయంతిని  ఏప్రిల్‌ 14న దేశం జరుపుకుంటుంది.     ఈ సందర్భంగా ఆయన జీవితంపై ప్రత్యేక కథనం....
             డాక్టర్‌ అంబేద్కర్‌ 1891 ఏప్రెల్‌ 14న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ పట్టణంలో  రాంజీమలోజి లక్పాల్‌, భీమబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించారు. కఠోరమైన పరిశ్రమ,  నిరంతరమైన పఠనా వ్యాసంగం, అంచంచలమైన దీక్ష ఆయనను ప్రపంచంలో ప్రథమశ్రేణిలో నిలబెట్టాయి. అంబేద్కర్‌ చదువుకు ఎక్కువ ప్రాధన్యతను ఇచ్చేవారు. పుస్తకాలకు ఎక్కువ ఖర్చు పెట్టేవారు. ఆయన లండన్‌లో ఒక్క నిమిషం కూడా వృథా చేయకూండా చదివేవారు. బ్రిటిషు మ్యూజియంలోని గ్రంధాలనే కాకుండా ఇండియా ఆఫీసు గ్రంధాలయం, నగరంలోని గ్రంధాలయంలో ఎక్కువ సేపు గడిపేవారు. న్యాయశాస్త్రం ఒక్కటే కాకుండా అర్ధశాస్త్రంలో ఎంఎస్‌సి డాక్టరేట్‌ పట్టాకోసం విశేష కృషిని సల్పి రెండెళ్ళ వ్యవధిలో మూడు పట్టాలు సాధించారు. 1921లో లండన్‌ విశ్వవిద్యాలయానికి   ‘‘ ప్రొవిన్షియల్‌ డీసెంట్రలైజేషన్‌ ఆఫ్‌ ఇంఫీరియల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటీష్‌ ఇండియా ’’ అనే పరిశోధన పత్రాన్ని సమర్పించి ఎంఎస్‌సి పట్టా పొందారు.‘‘ ప్రాబ్లమ్‌ ఆఫ్‌ ది రూఫీ ’’ అనే వ్యాసం సమర్పించి బిఎస్‌సి పట్టా పొందారు. డాక్టర్‌ బిఆర్‌అంబేద్కర్‌ బారిష్టర్‌ వృత్తిలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో బొంబాయి గాంచ్‌ కోర్టులో ఒక కేసు విషయమై ఏడు గంటలు ఏకధాటిగా ఇంగ్లాండ్‌, భారతదేశ న్యాయస్ధానాల తీర్పులను ఉదహరిస్తూ వాదించారు.‘‘ నేషనల్‌ డివిడెండ్‌ ఆఫ్‌ ఇండియా ఎ హిస్టారికల్‌ అండ్‌ అనలిటికల్‌ స్టడీ ’’ అనే దానిపై ఆయన రాసిన పరిశోధనా వ్యాసానికి కొలంబియా విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్‌ ఇచ్చారు. డాక్టర్‌ అంబేద్కర్‌ చిన్నతనంలోనూ, స్కూలులో చదువుకునే రోజులలోనూ అంటరానితనాన్ని, అవమానాలు స్వయంగా అనుభవించారు. ఆ అనుభవాలు ఆయనలో వ్యవస్ధ పట్ల ద్వేషాన్ని పెంచాయి. విద్యాభ్యాసం చేసి అమెరికా నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయన అంటరానితనానికి గురవుతున్న వారిలో చైతన్యాన్ని పెంపొందించి, వారిలో బానిస ప్రవృత్తిని నిర్మూలించేందుకు, మానవ హక్కులు, సమానత్వం కోసం వారు పాటుపడేటట్లు నిర్విరామంగా కృషి చేశారు. బహిరంగ చెరువుల్లో నీరు తాగే హక్కుకోసం మహద్‌లో 1927లోనూ, 1930లో నాశిక్‌ దేవాలయ ప్రవేశం కోసం పోరాడేందుకు అంటరాని వారిని సమీకరించి పోరాటాలు నిర్వహించారు. హిందూ మతంలో సంస్కరణల కోసం కృషి చేశారు.    1937సెప్టెంబరులో మైసూర్‌లో జరిగిన దళిత మహాసభలో అధ్యక్షోపన్యాసమిస్తూ ‘‘ సాంఫీుక, ఆర్ధిక సమానత్వం అనే లక్ష్యాల ద్వారా మాత్రమే సామాన్య మానవునికి తన అభిమతానుసారం స్వేచ్చగా పురోగమించడానికి అవకాశాలు ఏర్పడుతాయనీ, ఉత్పత్తి సాధనాలు కొద్ది మంది చేతులోనే వుండి దోపిడీ చేయటానికి వీలున్నంతవరకు సామాన్య మానవుడుఅభివృద్ధి చెందడానికి ఏమాత్రం అవకాశం వుండదు ’’ అని అంబేద్కర్‌ అన్నారు. 1938లో కొంకణ్‌లో భూస్వామ్య వ్యవస్ధ రద్దు కోసం జరిగిన రైతాంగ ప్రదర్శనలో పాల్గొన్నారు.         ప్రపంచ చరిత్ర అంతా వర్గ సమాజ చరిత్రే. ఆందుకు ఇండియా మినహాయింపు కాదు. వర్గం లోనే కులం ఇమిడి వుంది. అని ఆయన మన దేశంలోని వర్గ వ్యవస్ధ గురించి వివరించారు.  ‘‘ రాష్ట్రాలు`మైనారిటీలు ’’ అన్న అంశం మీద రాజ్యాంగ నిర్మాణ సభకు షెడ్యూల్‌ కులాల ఫెడరేషన్‌ తరుపున సమర్పించిన డాక్యుమెంట్‌లో అంబేద్కర్‌ ప్రణాళికబద్ద ఆర్ధిక విధానాన్ని కోరుకున్నారు. మౌలికమైన కీలక ప్రరిశ్రమలు, ఇన్సూరెన్స్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, సాగుకు అనుకూలమైన భూములకు పరిహారం చెల్లించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పేదరైతులకు, భూమిలేని  వ్యవసాయ కార్మికులకు పంచాలన్నారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలని, మైనారిటీలకు తగు రక్షణ కల్పించాలని కోరారు. కార్మికులకు పంచాలన్నారు.
           గొప్ప మేధావి, న్యాయశాస్త్రంలో నిష్ణాతుడైన అంబేద్కర్‌ను స్వాతంత్య్ర భారతదేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలోకి మంత్రిగా తీసుకున్నారు. హిందూ కోడ్‌ బిల్లు ద్వారా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించేందుకు ఆయన కృషికి నెహ్రూ ప్రభుత్వం ఆటంకాలు కల్పించటంతో రాజీనామా చేశారు.       హిందూ మతంలోని వర్ణవ్యవస్ధ అసమానతలతో, వివక్షలతో కూడి ఉన్నదని, బౌద్దమతం సమాజాన్ని మానవత్వంతో పునర్‌నిర్మించగలదని, బుద్దుడు చెప్పిన దుఃఖం అన్నదానిని నిరుపేదరికంతోనూ, దోపిడితో సమాన అర్థంగా భావించారు. ప్రెవేటు ఆస్తులను రద్దు చేయడం ద్వారా దీనిని నివారించవచ్చని ఆయన భావించారు. అందుకే లక్షలాది మంది తన అనుచరులతో బౌద్దమతం స్వీకరించారు.     మనం స్వాతంత్య్రం సాధించుకుని 68 సంవత్సరాలు గడచినప్పటికి, నాడు డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ ఏ వివక్షతకు వ్యతిరేకంగా జీవితాంతం పొరాడారో ఆ వివక్షత నేటికీ కొనసాడుతూనే ఉంది. జనాభాలో 70శాతం పైగా వున్న దళితులు, గిరిజనులు, వెనుకబడినతరగతులవారు అనాగరికమైన కులవివక్షతకు గురౌవుతున్నారు.  అణిచివేత, అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. వీరిలో అత్యధికులు వ్యవసాయకార్మికులు, పేద, సన్నకారురైతులు, చేతివృత్తులు, అసంఘటిత రంగ కార్మికులుగా ఉండి ఆర్ధిక దోపిడీకి కూడా గురౌతున్నారు. కులపరమైన దోపిడీ వీరి జీవితాలను మరింత దుర్భరం చేసున్నాయి. ఈ వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం అనేక ఉద్యమాలు సాగుతున్నాయి. వాటిలో భాగస్వాములు కావడం డా॥బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆశయ సాధన కృషిలో భాగం కాగలదు. నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్ధిక విధానాలు సామాజిక న్యాయానికి భంగం కలిగించేవిగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణ ద్వారా ఉపాధిని దెబ్బతీస్తున్నారు. అంబేద్కర్‌ కోరుకున్న ప్రణాళికాబద్ద ఆర్ధిక విధానం స్ధానంలో ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, బహుళజాతిసంస్థలు, వాటి ప్రభావంతో పరిశ్రమలను ప్రైవేటురంగం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నాయి. కీలకమైన భూసంస్కరణలు అమలు చేసి భూమిలేని పేదలకు, వ్యవసాయ కార్మికులకు పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడంలేదు. దేశాభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్న ఇన్సూరెన్స్‌రంగాన్ని, బ్యాంకులను, ఉపాధి కల్పనలో ప్రధాన పాత్ర పొషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్ధలను లాభార్జనే పరమావధిగా గల్గిన ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నారు. దేశంలో కుల, మతశక్తులు ప్రజల ఐక్యతకు భంగం కలిగిస్తున్నాయి. సామాజిక న్యాయానికి, దేశసమైక్యతకు నష్టం కలిగించే విధంగా పాలకవర్గాలు విధానాలను రూపొందిస్తున్నారు. ఈ నేపద్యంలోనే డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ బోధనలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.   ॥బి.ఆర్‌,అంబేద్కర్‌ బోధించినట్లు సామాజిక న్యాయానికి భంగం కలిగిస్తున్న, పేదప్రజల జీవన ప్రమాణాలను దిగజారుస్తున్న విధానాలను అధ్యయనం చేద్దాం. వీటికి వ్యతిరేకంగా పేద ప్రజానీకాన్ని సమీకరిద్దాం. ఉద్యమాలు నిర్వహిద్దాం. అదే అంబేద్కర్‌కు మనం అర్పించే నిజమైన నివాళి.       

కామెంట్‌లు లేవు: