25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు జీవిత ప్రస్థానం

'అక్షర' సాహితీ సమాలోచన
ఆధ్వర్యం
యువభారతి, సాధన సాహితీ స్రవంతి , తెలుగు రథం, మానస ఆర్ట్‌ థియేటర్స్‌
నా జీవిత ప్రస్థానం

(ఆయన  ప్రసంగం ఆధారంగా )
ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని ప్రసంగాలు, రచనలు చేయాలని కోరుతూ ......
వక్త : డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు, పెనుకొండ -515110
cel: 9440488600
యశఃకండూతి:
                 కళాశాల ప్రవేశం చేసే దాకా సాహిత్యం అంటే ఏమిటో నాకు తెలియదు. రచయితలంటే అప్పటి సమాజం 1954-74 మధ్యకాలంలో చూపే గౌరవం చూసి ఆ కీర్తి ఏ కొంతమేరయైనా మూట కట్టుకోవాలని ఆశించాను.


కీరితి లేనిచో వనమృగీతతి తుల్యుడు మానవుండు సం
స్కారవచః ప్రపాకము విశాల మనస్సొనగూడు కాన ఆ
కీరితి కోసమే తనువు కీడ్పడ జేయగ దీక్ష బూనితిన్‌
కీరసమంబునౌ నుడుల కేల్గవ వీణియమీటు తల్లికై
                                         (అవధాన వసంతం)
            ఈ యశఃకండూతియే అనంతరకాలంలో సాహిత్యలోకంతోడి సాన్నిహిత్యాన్ని నాలో పెంచింది.
నా జీవితంలో సాహిత్యవికాసం ఒక క్రమగతిలో సాగలేదు. ఏవో ప్రేరణాంశాలు, అవకాశాలు నన్ను అటుగా ఈడ్చుకొని వెళ్లాయి. కలగాపులగంగా వివిధ సాహిత్యప్రక్రియల్లో తలదూర్చి పరిశ్రమిస్తూ వచ్చాను. పట్టు సాధించేకొద్దీ కొన్నింటిని మానుకుంటూ మరికొన్నింటిని బలమైన ఆలంబనగా చేసుకుంటూ నిలబడ్డాను.
బీజావాపం:
           నా ప్రాథమిక విద్య మా నాన్న దగ్గరే. ఆయన ఉపాధ్యాయుడుగా నాతో కృష్ణ, భాస్కర, సుమతి, వేమనశతక పద్యాలు ఓ వందదాకా ఐదవ తరగతి ముగిసేలోపుగా కంఠస్థం చేయించాడు. పెద్దబాలశిక్ష చదివించాడు.
               నాటి ఉన్నత పాఠశాలల్లో అక్షరజీవులుగా మమ్మల్ని మలచటానికి ఎన్నెన్నో పోటీలు నిర్వహించే వారు. పద్యధారణలో ఒకరి తరువాత ఒకరు, ఒకరు చెప్పిన పద్యం మరొక్కరు చెప్పకుండా నిలబడవలసి వచ్చేది. పద్యపఠనంలో పూర్వకవుల గ్రంథాల్లో ఏ పుట తెరిచి చూపిస్తే అక్కడి పద్య గద్యాలను చదువవలసి వచ్చేది.
ఒక పిరియడ్‌లో మొదటి 20 నిమిషాలు కొన్ని గద్య గ్రంథాలను మౌనంగా చదువుకొమ్మనే వారు. సాధారణంగా అవి కథలో, నాటకాలో, మహాత్ముల జీవితచరిత్రలో అయి ఉండేవి. చివరి 20 నిమిషాలల్లో చదివినదానిలో మాకు అర్థమైన, గుర్తున్న, నచ్చిన అంశాలను పేర్కొంటూ కొన్ని వాక్యాలను వ్రాయుమనే వారు.
              వ్యాసరచనలో శీర్షిక అప్పటికప్పుడే నిర్దేశించే వారు. ముందుగా ఆలోచించుకోవడానికో , తయారుచేసికొని కంఠస్థం పట్టి రావటానికో అవకాశం ఉండేది కాదు.
                 కళాశాలలో సారస్వతసంఘ ఆధ్వర్యంలో తరచు ప్రసిద్ధ కవిపండితుల ప్రసంగాలు ఉండేవి. ఊళ్లలో నాటకసమాజాల వాళ్లు మూడు నెలలకు ఒక్కమారైనా తప్పక పద్యనాటకాలు ప్రదర్శించే వాళ్లు. ఆసక్తిగా వీటికి హాజరయ్యే వాడిని. వీటిలోని ఆకర్షణాకోణాలు ఏ కొన్నైనా నాపై అజ్ఞాతముద్ర వేశాయనడంలో సందేహం లేదు.
తోడుగా అప్పటి బోధనా పద్ధతులు, పరీక్షా విధానాలు సృజనాత్మకతను పెంచేవిగా ఉండేవి. మా అధ్యాపకులు ఒక్కొక్క పాఠానికి అనేకమైన ఉపశీర్షికల క్రింద ఇస్తూ ఉండిన పుటల కొలది' నోట్స్‌' భాషపై పట్టు సాధించడానికి కారణమయ్యేది. పరీక్షల్లో పాఠ్యాంశాలలో లేని క్రొత్త పద్యాలకు తాత్పర్యం వ్రాయవలసి వచ్చేది. అట్లే ఇచ్చిన సుదీర్ఘగద్యం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం వ్రాసేవాళ్లం.
            పై నేపథ్యం పద్యంపై ప్రీతి పెంచుకోవడానికి, అవగాహనలో ఒదిగివచ్చిన వాటికి చక్కని వ్యాసరూపం ఇవ్వటానికి, ధైర్యంగా వేదికపై ప్రసంగించటానికి తగిన బీజాలు వేశాయి.
వ్యాసవికాసం:
             13వ ఏట నాలో రచయిత తయారైనాడు. నేను చదివే పాఠశాలలో, నివసించే వసతి గృహంలో, వ్యాసరచనల పోటీల్లో బహుమతులు నావే. 10వ తరగతిలో 'అస్పృశ్యతా నివారణ' ను గూర్చి ఒక వ్యాసం వ్రాసి మా పాఠశాల వార్షికసంచికకు ఇచ్చాను. దాని సంపాదకులు '' స్వాతంత్య్ర వచ్చి పదేళ్లు దాటింది. ఇంకా ఎక్కడుంది అస్పృశ్యత? బుద్ధి లేకుంటే సరి పట్టు పట్టు'' అంటూ కాగితాలను విసిరి కొట్టారు. అది నాలో పట్టుదలను పెంచింది. సహనంతో కార్యం సాధించుకోవలసిన దీక్షను గుర్తు చేసింది.
             పౌర గ్రంధాలయం వెళ్లి ఆసక్తి గల గ్రంధాన్ని తీసుకొనే వాడిని. దానిని ఆద్యంతం చదవకుండా పీఠిక తప్పనిసరి చదివేవాడిని. నాకంటే ముందే దాన్ని చూచిన పాఠకులు ఆ పుటల్లో ఎక్కడైనా క్రీగీటులు గుర్తులు ఉంచారా? స్పందనలు వ్రాశారా? అని చూచి వాటిపై దృష్టి నిలిపి దానికి కారణాలు అన్వేషించే వాడిని. దీనివల్ల తక్కువ కాలంలో విజ్ఞానం పెరిగేది. వ్రాతకు బలం చేకూర్చే అనేక విషయాలు తెలిసివచ్చేవి. ఈ విధంగా కూర్చుకొన్న రచనాసామర్థ్యం తరచూ చుట్టూజరిగే చాల అసంబద్ధతలపై కరపత్రాలు తయారు చేసి పంచేదాకా వెళ్లింది. నా ప్రయత్నాన్ని ప్రత్యర్థులు వమ్ముచేస్తూ రావటంతో ఆ విధానం మానుకున్నాను.
              మా కళాశాలలో మతసామరస్యంపై , పోతన భాగవతంపై విద్యార్థులకు ఏటేటా నిర్వహిస్తూ ఉండిన ధర్మనిధి పురస్కారాల వ్యాసరచన పోటీలలో గెలుపొందినాను. కళాశాల వార్షికసంచికకు 'అష్టావధానం' వ్యాసం ఇచ్చాను. అధ్యాపకులమధ్య, ఉపాధ్యాయులమధ్య, మంచి గుర్తింపు వచ్చింది.
                     తెలుగు పండితుడుగా, ఆంధ్రభాషోపన్యాసకుడుగా స్థిరపడిన దశలో నా జీవన మార్గదర్శి 'విద్యావిభూషణ' శ్రీ భోగిసెట్టి జూగప్పగారి జీవితచరిత్ర వ్రాశాను. పలువురి గ్రంథాలకు వ్రాసిన ముందుమాటలు 'సమీక్షా స్రవంతి' పేర వెలువడ్డాయి. చిత్రకవి శ్రీ రాప్తాటి ఓచిరెడ్డి, సాయిలీలాగుచ్ఛ కావ్యకర్త శ్రీ యన్‌. యం . సహాయాచారి, శతావధాని శ్రీ దోమావేంకటస్వామిగుప్తల సాహిత్య సృజనపై సుదీర్ఘ వ్యాసాలు వ్రాశాను. ఇవి 'సమారాధన'లో చేరాయి. నా ఆకాశవాణి ప్రసంగాలు 'ప్రసార కిరణాలు'గా , సూక్తి ముక్తావళులు, 'ప్రత్యూష పవనాలు'గా ముద్రణలో వచ్చాయి. పోతన భాగవతంపై ప్రత్యేక శ్రద్ధతో పరిశ్రమించిన కారణంగా ''భాగవత సౌరభం'' వెలువడింది. మాజీమంత్రి శ్రీ కొత్తపల్లి జయరాం సౌజన్యంతో ముద్రించి అమూల్య ప్రసాదంగా ముముక్షువులకు పంచుతున్నాను.
అనువాద వికాసం:
              తిరుమలతిరుపతి దేవస్థానంవారి పోతనభాగవతం ప్రాజెక్టునుండి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసికోదలచి తృతీయస్కంధానికి సరళగద్యానువాదం చేశాను. దీని ప్రధాన సంపాదకులు డాక్టర్‌ కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి మున్నుడిలో '' ఆశావాది ప్రకాశరావు అష్టావధాన కళలో ఆరితేరినవాడు. వినయభూషణుడు, మధురభాషణుడు. వీరి అనువాదం సరసంగా సాగింది'' . అన్నారు. ఆంగ్లంలో ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌, రచించిన 'సిటీ నైట్‌ పీస్‌' ను ' చీకటి కోణం' శీర్షికతో వచన కవితగా అనువాదించాను. పుట్టపర్తి సాయిబాబాగారి సూక్తులకు 'విభూతిగీత' పేర పద్యరూపం ఇచ్చాను.
పరిశోధనా వికాసం:
                       తాళ్లపాక అన్నమాచార్య పౌత్రుడు అన్నయ రచించిన 'చెల్లపిళ్లరాయచరిత్రము' అనే అముద్రిత యక్షగాన తాళపత్రప్రతి పరిశీలించి , క్రిమిదష్టభాగాలను పూరించి, కవి కాలాదులు నిర్ణయిస్తూ విపులమైన పీటికతో ప్రచురించాను. శ్రీ రాప్తాటి నిరోష్ఠ్య కృష్ణశతకానికి లఘుటీక వ్రాసే అవకాశం లభించింది.
పిహెచ్‌. డి., పట్టాకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పేరు నమోదు చేసికొని కొన్ని అవాచ్య సంఘనటలమధ్య విరమించాను. కొన్నేళ్ల విరామంతో శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలోనూ చేరి సరపడని సంగతులు తలెత్తటంతో దానిఆశావదులుకొన్నాను. 'అంతకంటె మించిన డిగ్రీ రాకుండా పోతుందా' అని యథాలాపంగా పలికిన నా మాటను దైవం నెగ్గించాడు. నా 56వ యేట పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ (డి.లిట్‌) లభించింది.
                       ఈ పరిశోధనా ప్రస్థానంలో సోదరతుల్యుడు శ్రీ గంగప్పగారి చెన్నయ్యను కలుపుకుని ఎఱ్ఱనపీఠం వారి ప్రకటనకు స్పందించి ''ప్రహ్లాద చరిత్ర-ఎఱ్ఱన, పోతన తులనాత్మక పరిశీలన'' అనే గ్రంథం వ్రాసి ఉత్తమ సిద్ధాంతగ్రంథ రచనాపురస్కారం పొందాము.
                  రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులకు సమర్పించిన కొన్ని పరిశోధనా పత్రాలు 'సువర్ణ గోపురం' గా పుస్తకాకృతి పొందినాయి.
కవన వికాసం:
           నా 15వ యేట అప్పటికి నాకు తెలిసిన ఛందోవిజ్ఞానంతో పద్యాలు వ్రాయాలన్న ఆలోచన కలిగింది. అంతలోనే మా నాన్న వ్రాసి ఎవరికీ చూపకుండా తన జేబులోనే భద్రపరుచుకొన్న కొన్ని పద్యాలను ఆకస్మికంగా చూచాను. ఆ తండ్రి కొడుకుగా పద్యరచనలో పేరు నిలుపుకోవాలన్న ఆశ తలెత్తింది.
ఒకవైపు సినిమాబాణిలో పాటలు వ్రాస్తూ, మరో వైపు చిటిపొటి పద్యాలు అల్లేవాడిని. మరికొన్ని తెలిసిన వాళ్ల పెళ్లిళ్లకు, పండుగలకు శుభాకాంక్ష రూపంగా అందించే వాడిని. ఇంకాకొన్ని పెద్దలను గౌరవించే సందర్భాలకు స్తుతిరూపంగా ఉండేవి.
             తెలుగు పండితునిగా విద్యార్థుల కోర్కె తీర్చడానికై తరచూ చెప్పుతూ వచ్చిన ఆటవెలది పద్యాలే వరదరాజు శతకం. ఇందులో చవర దశావతారస్తుతి ఉంది. ఈ శతకానికి '' చదివినాడ వరద శతకమ్ము సకలమ్ము, కరగినాడ నీదు కైత పసకు, కలదు నీకు ఆంధ్రకవికోటిలో పీట, వలదు జంకు వినయవత్‌ ప్రకాశ'' అని శ్రీ తుమ్మల సీతారామమూర్తిచౌదరి గారు దీవించారు. డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని, శ్రీ చర్లా గణపతిశాస్త్రి వగైరాల అభినందనలు అందుకొన్నాను. తర్వాతి కాలంలో ఆశతకమే మకుట విరహితంగా 'లోకలీలాసూక్తం' గా రూపు దిద్దుకొనింది.
               మూడు సంవత్సరాల పండితవృత్తి వదిలి ఎం.ఏ.,లో చేరాను. ఈ సమయంలో అవధాన గురుదేవులు డా|| సి.వి.సుబ్బన్న శతావధాని వెంట అవధానసభలకు వెళ్లుతూ వారి స్తుత్యాత్మకంగా చెప్పిన పద్యాలే ' పుష్పాంజలి ' పేర వెలుగు చూచింది. ఇది ఆకృతిలో లఘువైనా కవితా విషయికంగా , గురుభక్తి గుబాళించిన కారణంగా , అలఘుత్వాన్ని పొందిందనీ ప్రశంస నందింది. అలా నాకు శుభాశంస అందించిన సాహితీ మేరువులు డా|| మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, డా|| దాశరథి కృష్ణమాచార్యులు , డా|| సి.నారాయణరెడ్డి వగైరాలు.
ఎం.ఏ., ముగిసి డిగ్రీకళాశాలలో పనిచేస్తున్న సమయంలో '' మెరుపుతీగలు'' పద్య ఖండికల సంపుటి ముద్రితమైంది. దీనిని కవితా గురుదేవులు డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యుల వారికి అంకితమిచ్చాను.
                నేను ప్రధానంగా పద్యజీవినే. అయినా వచనకవితను ఏనాడు నిరసించలేదు. నినాదప్రాయంగా కాకుండ హృదయపూర్వకంగా వెల్వడే ఏ చిన్నమాటనైనా ఆదరించేవాడిని. అడపాదడపా నేనూ రసాత్మక వాక్యాలను వ్రాయడానికి ఆసక్తి చూపేవాడిని. కళాశాల వార్షికసంచికలో 'నీవు-నేను' అనే నా వచనకవిత అచ్చయింది. ఒక దశాబ్ది పిమ్మట ఆదే కవిత డా|| కమల్‌నాథ్‌పంకజ్‌ గారిచే హిందీభాషలోనికి అనూదితమై గుర్తింపు పొందింది.
               నేను సాహిత్యవిభాగ కార్యదర్శిగా అనంతపురంలో రాయలసీమ రచయితల మహాసభలు నిర్వహించాను. కొందరు నన్ను అనభ్యుదయవాదిగా , నేను చేపట్టే సాహిత్య కార్యక్రమాలన్నీ శవ సమాలోచనలుగా చిత్రించి కరపత్రాలు సభలో పంచారు. వెంటనే స్పందించి వారికి సమాధానంగా ఆశువుగా చెప్పిందే 'రొయ్య మీసాలు' వచనకవిత. అప్పటి నుండి విక్రమించి ఆకాశవాణి, తదితర సంస్థలు, శ్రోతల సమక్షంలో నిర్వహించే కవిసమ్మేళనాలకు ఒకమారు పద్యం, మరొకమారు వచనం కాన్క చేసేవాడిని. ఈ వచనకవితల సంపుటియే '' అంతరంగ తరంగాలు''. దీనిపై స్పందిస్తూ సుప్రసిద్ధసాహిత్య విమర్శకులు శ్రీ ఆర్‌.యస్‌. సుదర్శనంగారు '' తెలుగు మహాకావ్యాలను అధ్యయనం చేయడం, ఆధునికుల ప్రతిభకు అభివ్యక్తికి దోహదం చేస్తుందే తప్ప గతానికి బందీల్ని చేయదు-అన్న సత్యానికి ఆశావాది ప్రకాశరావు వ్రాసిన కవితలు మరో తార్కాణం'' అన్నారు. డాక్టర్‌ యన్‌.శాంతమ్మ గారు కూడా దీనిపై 'ఆశావాది కవితాతరంగం' పేరిట విశ్లేషణాత్మక వ్యాససంపుటి ప్రచురించి తన సౌమనస్యాన్ని చాటుకున్నారు.
          మిత్రులు శ్రీ దోర్నాదుల వరదరాజులు గారి షష్టిపూర్తి సందర్భంగా వారి అభిమతం మేరకు మూడుగంటల వ్యవధిలో 34 వృత్తాలతో ఆశువుగా చెప్పింది 'రామకథా కలశం'. శిష్యుడు జె. నీలకంఠరాయుడు తృప్త్యర్థమై వ్రాసింది 'పార్వతీశతకం'. శ్రీశ్రీశ్రీ రామకోటిరామకృష్ణానందస్వామి వారి భావాలకు పద్యరూపం ఇచ్చింది 'ఆత్మతత్వ ప్రబోధం'. జీవితంలో స్థిరపడే వధూవరులకు సందేశాత్మకంగా ఆశీర్వాదరూపంగా ఇచ్చిన చిరు కానుకయే 'దీవన సేనలు'.
అవధాన వికాసం
                 నేను మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉంగానే శ్రీ సి.వి. సుబ్బన్న శతావధాని గారి అష్టావధానం చూచాను. పేదరికం కారణంగా ఆ మార్గంలో పరిశ్రమిస్తే కీర్తితో పాటు నాలుగు డబ్బులూ వస్తాయనే ప్రలోభం తలెత్తింది. అప్పటికే పద్యరచనలో కొంతమేర పరిశ్రమించిన నేను, కొన్ని సందర్భాలలో నాకు నేనుగా, మరికొన్ని సందర్భాలలో స్నేహితుల ద్వారా, రకరకాల నిబంధనల్ని విధించుకొని వాటికి లొంగి పద్యం అల్లటమేకాక ధారణపట్టి అప్పజెప్పడం నేర్చుకొన్నాను.
                 ఈ లోగా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎండకాలం సెలవుల్లోవెళ్లి ఏలూరులోని ఫ్లడ్స్‌ కంట్రోల్‌ సర్కిల్‌లో గుమాస్తాగా చేరాను. అక్కడ శ్రీ బస్వా సింహాద్రి అప్పారావు గారి సాహచర్యంలో మూడు నెలలపాటు చేమకూర వేంకటకవి విజయవిలాసం అధ్యయనం చేశాను. అది నా పద్యాలకు మరింత వెలుగునిచ్చే అచ్చు తెనుగు ముచ్చట్లను పదబంధాలను సమకూర్చింది.
             ఉద్యోగం వదిలి 2వ యేడు కళాశాలలో అడుగు పెట్టాను. ఎన్నో సంఘటనలు మీద మీద తారసిల్లుతూ వచ్చాయి. రిటైర్డు కలెక్టర్‌ శ్రీ బి.జూగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారికి స్వాగతపద్యాలు సమర్పించి 'బాలకవి'గా అమృతాశీర్వాదాలు అందుకొన్నాను. తెలుగు శాఖ పక్షాన ఏర్పాటైన శ్రీ గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారి అష్టావధానంలో పృచ్ఛకస్థానం పొందాను. భువన విజయంలో నేపథ్య పద్యగాయకుడిని అయ్యాను.
             ఇవన్నీ ఒకరకమైన బలాన్ని తృప్తిని కలిగించడంతో ఆ యేడే కేశవవిద్యానికేతన్‌ (శివశంకరం హాస్టల్‌)లో స్నేహితుల మధ్య 02-10-1963న గాంధీజయంతి సందర్భంగా మొదటి అష్టావధానం జయప్రదంగా ముగించాను. ఈ వార్త మా తెలుగుశాఖ హెడ్‌ డాక్టర్‌ నండూరి వారి చెవిలో పడింది. వారు నన్ను 'డిపార్ట్‌మెంట్‌'కు పిలిపించి ఉపన్యాసకుల సన్నిధిలో సమస్యాపూరణ పరీక్ష నిర్వహించారు. వారిచ్చిన 'ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికిన్‌'. అనే సమస్యకు నా పూరణ. ప్రశ్నలపై వడి ప్రశ్నలు, ప్రశ్నించెడి తనదు భర్త భావం చేమో ప్రశ్నించును, తన యెదలో ''ప్రశ్నకు ప్రశ్నయె జవాబు'' భామిని పలికెన్‌'.
             నా పూరణతో సంతోషించి నీకు ధైర్యం ఉంది. ఎక్కడైనా నెట్టుకొస్తావు. నేటి నుంచి నీవు ఆసాదివి కావు. ఆశావాదివి అని ఆశ్వీరదించారు. అప్పటినుండి నేను ఆసాది ప్రకాశరావుగా కాకుండా ఆశావాది ప్రకాశరావును అయ్యాను. నిషేధాక్షరిలోని మెలకువలను నాకు నేర్పవలసిందిగా శ్రీ గాడేపల్లి వారిని కుదిర్చారు నండూరువారు. వారి అంతేవాసిత్వంలో ఒక్క సంవత్సరం కూడా గడవకుండానే ఆ ఇరువురు బదిలీ అయ్యారు. నేను నా వికాసానికి కొండంత అండను కోల్పోయాను.
             మూడవయేడు చదువు రకరకాల కష్టాలమధ్య ముగించుకొని శిక్షణలేని తెలుగు పండిత వృత్తిలో చేరి శ్రీ సి.వి. సుబ్బన్న శతావధానిగారి గురుత్వం సంపాదించాను. వారి అవధానసభలకు వీలు కలుగజేసికుని హాజరయ్యేవాడిని. వారి వెంట ప్రయాణిస్తూ కొన్ని, ఉత్తరాల ద్వారా మరెన్నో , సందేహాలు తీర్చుకొనేవాడిని. శ్రీ సి.వి.సుబ్బన్నగారి ద్వారా నా అవధాన సువిధానానికి బలమైన పునాదులు పడ్డాయి.
                నా 19వ యేట ప్రారంభించిన అవధానం 26 వసంతాల పాటు నిరాఘాటంగా విస్తరిల్లింది. రాష్ట్రమంతటా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలోనూ, న్యూఢిల్లీలోనూ 171 అవధానాలు చేశాను. అవధాన పద్యాలను జారిపోనివ్వకుండా భద్రపరిచి ఐదు సంపుటాలుగా ఆంధ్రసరస్వతికి కానుక చేశాను. నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానమే. అయినా పెరుగుతున్న వయస్సుతో పాటు తరుగుతున్న ధారణ, నిరంతర ప్రయాణాలతో అనుకున్న ఎన్నో రచనలు సకాలంలో ముగించలేకపోవటం, ఉద్యోగంలో రాజీధోరణి అవలంబించలేక అనారోగ్యాన్ని కోరి తెచ్చుకోవటం, ఉత్సాహంగా అవధాన రంగప్రవేశం చేస్తున్న ఆశావహులైన కొందరు యువకులకు అవకాశాలు కల్పించాలన్న ధ్యేయం-అన్నీ కలిసి 55వ యేట 1999 ఉగాది నాడు అవధానాలకు మంగళం పాడేటట్లు చేశాయి.
                ఈ సందర్భంలో ఒకమాట చెప్పాలి. మాది ఆసాది వృత్తి. మా పూర్వులు గ్రామదేవతా పూజారులు. ఆయా దేవతలపై, పెద్దలపై జాతర్లలో ఆశువుగా పాటలు కట్టేవారు. ఆ పాటయే సంప్రదాయసాహిత్యం అధ్యయనంచేసి, అందులో శ్రద్ధ కనుబరచిన నా దగ్గర ఆశుపద్యమైంది. ఆ ఆశువు మరొకొన్ని అదనపు జాగ్రత్తలతో అవధానానికి దారితీసింది. ఈ విషయాన్నే ఒక అవధాన సభలో ఇలా చెప్పాను.
గ్రామాలన్‌ గల దేవతా కథనముల్‌ గానంబునన్‌ దీర్చుచున్‌
రోమాంచంబును గూర్చి కాన్కలుగొనే ప్రోద్యత్కులాచారమే
ధీమంతుల్‌ కొనియాడ పద్యయయి సందీపించె నా వాక్కునన్‌
శ్రీమద్దివ్య వధాన ముఖ్యగురువౌ శ్రీ సీ వి సుబ్బన్నచేన్‌
                                       (అవధాన కళా తోరణం)
సాహిత్యసేవా వికాసం:
        నేను బదిలీపై ఎక్కడికి వెళ్లినా అక్కడి సాహితీకళాప్రియత్వంగల వారిని కూడగట్టుకొని, సాహితీ ప్రచార ప్రోత్సాహాలకు అనువైన సంస్థ స్థాపించి, అందులో క్రియాశీలక పాత్ర పోషించేవాడిని. పాఠశాల విద్యాభ్యాసంలో, వసతిగృహ సాంస్కృతికవిభాగ కార్యదర్శిగా, కళాశాలలో ఆంధ్ర సారస్వత సంఘ కార్యదర్శిగా, నా అనుభవాలు సంస్థల ఆశయాలను సఫలీకృతం చేయటానికి కొంత ఉపకరించాయి.
       1974లో అనంతపురంలో కొందరు సుహృత్తుల తోడ్పాటుతో స్థాపించింది రాయల కళాగోష్ఠి. ప్రధాన కార్యదర్శిగా 15 సంవత్సరాలు సంస్థకు సేవలందించాను. 'గోష్ఠి అంటే ఆశావాది' అనే ప్రచారం ఊపు అందుకొనింది. పుస్తక ప్రచురణ, గ్రంథావిష్కరణ, కవి సమ్మేళనాలు, కావ్య పరిచయాలు, సాహిత్య మూల్యాంకనాలు, వైతాళికుల సంస్కరణలు, అష్టావధానాలు, ముఖాముఖి చర్యలు- ఇవి మేము చేపట్టిన కార్యక్రమాలు. సామర్థ్యం గల యువకుల్ని వెదికి తెచ్చి ఆయా సాహిత్యకార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసేవాళ్లం. అలా తయారైన వాళ్లు నేడు మా జిల్లా సుప్రసిద్ధులుగా ఉన్నారు.
              ఆం.ప్ర. సాహిత్య అకాడమీ రజతోత్సవసంచికలో 'తెలుగులో సాహిత్యపరిశోధన-సంస్థల పాత్ర' అనే వ్యాసం వ్రాస్తూ డాక్టర్‌ కె గోపాలకృష్ణారావు 'అనంతపురంలో స్థాపించబడిన రాయల కళాగోష్ఠి తెలుగుభాషాసాహిత్యములకు సంబంధించిన అనేకాంశములపై చర్చలు, సమావేశములు నిర్వహించుచున్నది. ఈ వేదికనుండి ప్రముఖులొనర్చిన ఉపన్యాసములు గ్రంథరూపమున వెలువడునని సహృదయలోక మెదురుచూచుచున్నది' అన్నారు.
             గుంతకల్లులో భువనవిజయము శారదాపీఠము అధ్యక్షుడుగా అష్టదిగ్గజ కవుల సాహిత్య సృజనపై విశ్లేషణలే కాక. పద్యకవులకు పెద్దపీట వేసి కవితాశిక్షణ తరగతులు నిర్వహింపబడినాయి.
        పెనుగొండలో ఘనగిరి సాంస్కృతికమండలి ప్రధానకార్యదర్శిగా పట్టణం నడిబొడ్డులో శ్రీకృష్ణదేవరాయ విగ్రహప్రతిష్ఠాపనకై సఫలప్రయత్నం చేశాను. సుప్రసిద్ధ కళాకారుడు శ్రీ సి.యన్‌ . వెంకటరావుగారి తైలవర్ణ చిత్రాలప్రదర్శన, విద్యార్థుల నేత్రావధానాదులు, కళావిభావరులు నిర్వహింపజేశాను.
        ఆంధ్ర పద్యకవితాసదస్సు అధ్యక్షుడుగా, తిరుమల తిరుపతి దేవస్థాన గ్రంథనిపుణుల మండలి సభ్యుడుగా, అజ్ఞాతకవులకు గుర్తింపు నివ్వడంలో కృతకృత్యుడనయ్యాను. ఆం.ప్ర సాహిత్య అకాడెమీ కార్యవర్గసభ్యుడుగానూ సేవల్ని విస్తరించాను. ప్రతి సంస్థలోనూ ఇతరసభ్యులతో కలిసిపోయి, కార్య సాధనయే ధ్యేయంగా నడుచుకోవటం వల్ల ఎందరిలోనో చైతన్యం నింపటం సాధ్యమైంది.
               నేను ప్రధానంగా భాషాజీవిని. కవుల సాంగత్యంలో పండిత సేవలో వినమ్రంగా ఉంటాను. చూపోపని వారు తప్ప అందరూ నన్ను అభిమానించారు. వివిధ వేళల్లో నాపై కవితల సుగంధాలు జల్లారు. దానికి సాక్ష్యంగా శ్రీశాంతినారాయణ, కల్యాణవాణి, శ్రీ సి రామసుబ్బారెడ్డి, అక్షర కిరీటం, ఆశావాది, అనే సంకలన గ్రంథాలు నిలుస్తాయి. కృతిపోషక సామర్థ్యం నాలో లేకున్నా వారే ముద్రణాభారం వహించి శ్రీ బెళ్లూరి శ్రీనివాసమూర్తి, శ్రీ చెప్యాల రామకృష్ణారావు, శ్రీ ఎంపి జానుకవి వంటి ప్రసిద్ధులు తమ గ్రంథాలను నాకు అంకితమిచ్చారు. నాపై ప్రేమామృతం కురిపించారు. స్నేహశీలురు నా గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహాయం చేశారు.
       భువన విజయంలో పెద్దన పాత్రధారిగా కృత్రిమ గండపెండేరం పండిన నా వామ పాదానికి, అత్యాశ్చర్యకంగా 2008 ఆగస్టు 10న విజయనగర రాజుల రెండవ రాజధానియైన పెనుకొండలో శ్రీ కుంచం అశ్వత్థయ్య సౌహృద సాక్ష్యంగా స్వచ్ఛ స్వర్ణగండ పెండేర ప్రదానం జరిగింది.
           నిత్య సాహిత్య వ్యవసాయినై ప్రొద్దు గడిపే వాడిని కావటంతో నాపై విశ్లేషణాత్మక సాహిత్య వ్యాసాలు అనేకం వెలువడినాయి. సాహితీ లోకం అనేక పురస్కారాలతో బిరుదాలతో నన్ను మన్నించింది. శ్రీమంకాల రామచంద్రుడు నా సాహిత్యాన్ని అనుశీలనం చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందాడు. సిద్ధాంత గ్రంథాన్ని కూడా ముద్రించాడు. శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా, విశ్వవిద్యాలయాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. నన్ను అనుసరిస్తున్న అవధానులు ఆముదాల మురళీ, లోకా జగన్నాథశాస్త్రి, నా కీర్తిని పెంచుతున్నారు. ఉత్తమ బోధకులు, పాలకులు కవులు, పత్రికల నిర్వాహకులు అయిన శిష్యులు గణనీయంగానే ఉన్నారు.
       నిర్ద్వంద్వంగా నాది బహుముఖీనమైన కృషి, అన్నింటానేనున్నానని చాటుకోగలిగానే తప్ప, ఎందులోరే నా ప్రత్యేకతనో, ప్రగాఢతనో చాటుకున్నానని అనలేను. నేను సాహిత్యానికి చేసిన దానికంటే సాహితీలోకం నాకు చేసిందే ఎక్కువ. నేను నిబద్ధత కలవాడిని కాను. ఆయా సందర్భాలు ఎటు ఈడిస్తే అటుగా వెళ్లుతూ అక్కడ నన్ను ప్రతిష్టించుకొనే ప్రయత్నం చేశాను. సాహిత్యానికి దూరంగా బ్రతుకలేని బలహీనత నా నరనరాల్లో జీర్ణించుకొనిపోయింది.
చిరు సందేశం
      బాధాకరమైన విషయమేమిటంటే రచయితలు ఎందరో ఉన్నారు. 'సామాజిక స్పృహ' పేరిట తామరతంపరగా రచనలు చేస్తున్నారు. తాము ఏ సందేశాన్ని ఎదుటివారికి ఇస్తున్నారో అందులో వాడు జీవించడం లేదు. కవి మాటకు చేతనకు పొంతన లేకపోతే అతనికి రాజకీయ నాయకుడికి భేదమేముంది. కుడిగా బ్రతకాలనే కక్కుర్తితో సాహిత్య రాజకీయాలు చేయటం బాగులేదు. ఈ సోదరులు ఘోషించే మహిళావాదం, లంచగొండితనం, కులమత సామరస్యం, తల్లిదండ్రుల సేవ, సాటి రచయితల పట్ల సదవగాహన వగైరాలు, వారి నిజ జీవితాల్లో అపహాస్యానికి గురి అవుతున్నాయి. వాగ్రూపంలో అందంగా ఆవిష్కరిచుకోవటం దగ్గర ఆగిపోవటం కాకుండా ఆ చరణాల అనువదించ వలసినదిగా రచయితను ఆభ్యర్థిస్తున్నాను. నా సాహిత్య జీవిత ప్రస్థానంలో వ్యక్తవ్యక్తంగా తారసిల్లిన జ్ఞాతాజ్ఞాత శక్తులకు ఈ కింది పద్యంలో నిల్పి కొంతమేర నాలో పవిత్ర సంతృప్తి మిగిలించుకుంటాను.

ఏ దేవి కల్మియో ఈ నను దీవించి
పెద్దల మధ్యన పేర్మినిల్పె
ఏ గురు కరుణమో ఈ వాక్య బంధాల
మతితోడజతగూండి మ్మలయజేసె
ఏ గుప్త రూపమో ఎలయించి నన్నెప్డు
ఏ నీడకానీడ నెలమి గాచె
ఏనాటి బంధమో ఈ నాటి కొనకూడి
సాహిత్య వీధుల శక్తిబెంచె
అది పురాతసుకృతంబు, అదిపునీత
మద్ది భాగ్యోన్నతంబు, అయ్యదియలేక
ఈ ప్రకాంశ మాశావాదియెన్నడగును
ఈ మధుర మధుస్మృతి సంకెట్లగలుగు.
                                            (అవధాన కౌముది)