28, డిసెంబర్ 2019, శనివారం

ఎన్‌ఆర్‌సి అందరి సమస్య

ఎన్‌ఆర్‌సి అందరి సమస్య

* ఐక్యంగా ప్రతిఘటించడమే మార్గం
* కర్నూలు రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభలో సీతారాం ఏచూరి
* భారీగా తరలివచ్చిన ప్రజానీకం
ప్రజాశక్తి -కర్నూలు ప్రతినిధి:
            నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌరపట్టిక) ముస్లింల సమస్య మాత్రమే కాదని, దేశ ప్రజలందరికి సమస్యే అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలులోని ఉస్మానియా కళాశాల మైదానంలో శనివారం జరిగిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) జాతీయ జనాభ పట్టిక (ఎన్‌పిఆర్‌)లను మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్యాకేజిగా ఆయన అభివర్ణించారు. ఇవి ముస్లింలకు మాత్రమే సమస్యయైనట్టుగా చిత్రీకరించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాస్తవం దీనికి భిన్నమని చెప్పారు. దీనివల్ల ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కునేది నిజమేనని, వారితో పాటు కుల, మతాలకు అతీతంగా దేశంలో ఉన్న సామాన్యులందరు కష్టాలు పడాల్సివస్తుందని వివరించారు. కులమతాలకు అతీతంగా ఐక్యంగా ప్రతిఘటించడం ద్వారా వీటిని తిప్పికొట్టగలమని చెప్పారు.
              సభకు ముందు కర్నూలు నగరంలో భారీ ర్యాలీ జరిగింది. అంబేద్కర్‌ భవన్‌ నుంచి రాజ్‌విహార్‌, గాంధీనగర్‌, కిడ్స్‌ వరల్డ్‌, వడ్డెగేరి మీదుగా ఉస్మానియా కళాశాల మైదానం వరకు సాగిన ఈ ప్రదర్శనలో వేలాది మంది ప్రజానీకం పాల్గొన్నారు అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్‌ అధ్యక్షతన జరిగిన సభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా మతం పేరుతో దేశ విచ్ఛినానికి పూనుకుంటున్నారని అన్నారు. దీనిని ప్రతిఘటించి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజానీకంపై ఉందన్నారు. మోడీకి, అమిత్‌షాకు వ్యతిరేకంగా సభకు హాజరైన వారితో నినాదాలు చేయించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిజెపి దేశ ప్రజల ఐక్యతను విఛ్చినం చేస్తోందన్నారు. పేదలు, గిరిజనులు, ఆదివాసీ సంచార జాతులు సైతం నివాస ధ్రువీకరణ పత్రాలు, జనన ధ్రువీకరణ పత్రాలు ఎలా తెచ్చుకుంటారని ప్రశ్నించారు. హాస్పిటల్‌లో లభ్యమయ్యే జనన ధ్రువీకరణ పత్రాల్లో పాప, బాబు అని ఉంటుంది తప్ప పేర్లు ఉండవని అన్నారు. అలాగే పేదలు నివసించే చిన్నపాటి ఇళ్లకు పట్టాలు కూడా ఉండవని, వారు ఏవిధమైన ధ్రువీకరణ పత్రాలు తీసుకు రాలేరని చెప్పారు. ఈ తరహా సమస్యలు మతాలకు అతీతంగా అందరికీ వస్తాయని, ప్రమాదకరమైన ఈ తరహా చట్టాలను రద్దు చేసే వరకూ మతాల కతీతంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు.ఈ సందర్భంగా అస్సాంలో రూపొందించిన పౌర పట్టిక వివరాలను ఆయన ప్రస్తావించారు. పౌర పట్టిక రూపకల్పనతో అస్సాంలో దాదాపుగా 20 లక్షల మంది పౌరసత్వం ప్రమాదంలో పడిందని, వీరిలో అత్యధికులు హిందువులేనని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాడి పరమవీర చక్ర పొందిన అబ్దుల్‌ హమీద్‌ వారసులకు కూడా అస్సాంలో పౌరసత్వం లభించలేదని అన్నారు. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్ర ప్రభుత్వాలు తాము కేంద్రం తెచ్చిన సిఎఎను అమలు చేయబోమంటూ ప్రకటనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిని వదిలి విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా మోడీ పెట్టుకున్నారని విమర్శించారు. మాతృభూమికోసం పోరాడటం తప్ప మరో మార్గం లేదన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక హిందూ-ముస్లింల మధ్య తగాదా పెట్టడమే అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు.. ఈ ఉద్యమం మోడీ గద్దె దిగేదాకా కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 8న కార్మిక వర్గమంతా రోడ్డుపైకి వస్తోందని, మైనార్టీలంతా ఆ పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పిసిపి ఉపాధ్యక్షులు ఎన్‌.తులసీరెడ్డి మాట్లాడుతూ లౌకికవాదం లేకపోతే మొత్తం రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విఘాతం ఏర్పడుతుందని తెలిపారు.
            లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌, ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఏళ్లుగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు కలిసిమెలసి జీవిస్తున్నారని తెలిపారు. విభిన్న సంస్కృతులు కలిస్తేనే భారతదేశం అయిందని అన్నారు. ప్రతేడాది జాతీయ పండగల నాడు జాతీయజెండాను ఎగురవేసే ఎర్రకోట, ప్రపంచంలోని పర్యాటకులందరినీ విశేషంగా ఆకర్షించే తాజ్‌మహల్‌ను ఎవరు నిర్మించారని ప్రశ్నించారు.
                   మోడీ ప్రభుత్వం అయోధ్య, ట్రిపుల్‌ తలాక్‌, జమ్మూకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను ఎత్తివేయడం లాంటి పచ్చి మతోన్మాద చర్యలకు పూనుకుందని విమర్శించారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, ఐద్వా రాష్ట్ర నాయకులు పి.నిర్మల, సిపిఐ రాష్ట్ర నాయకులు సత్యనారాయణమూర్తి, రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, ఆవాజ్‌ నాయకులు ఎస్‌ఎ.సుభాన్‌, డిసిసి అధ్యక్షులు అలీఖాన్‌, జనసేన నాయకులు హర్షద్‌, సీనియర్‌ దళిత సంఘం నాయకులు, న్యాయవాది వై.జయరాజ్‌, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

ఇవిఎం కుంభకోణంపై దేశవ్యాప్త ఉద్యమం

కాశీ నుంచి కన్యాకుమారి వరకు జాతా లు ,

జనవరిలో నూతన కార్యవర్గం ఎన్నిక,

బామ్‌సెఫ్‌, బిఎంఎం  జాతీయ సమ్మేళనం నిర్ణయం 

ప్రజాశక్తి`ప్రత్యేక ప్రతినిధి కర్నూలు

                    ప్రజా తీర్పును తప్పుదోవ పట్టిస్తున్న ఇవిఎం కుంభకోణంపై జనవరి 16 నుంచి ఏప్రెల్‌ 26 వరకు కాశీ నుంచి కన్యాకుమారి వరకు జాతా నిర్వహించనున్నట్లు బామ్‌సెఫ్‌, భారత్‌ ముక్తిమోర్చా జాతీయ సమ్మేళనం తీర్మానిచింది. బామ్‌సెఫ్‌, మూలవాసీ, భారత్‌ ముక్తిమోర్చా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలులో నిర్వహిస్తున్న జాతీయ సమ్మేళనం శుక్రవారం ముగిసింది.  2019 డిసెంబర్‌  23 నుంచి 27 వరకు జరిగిన జాతీయ  సమ్మేళనానికి దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు, జాతీయ నాయకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక కార్యకర్తులు హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో పాతకమిటీని రద్దు చేశారు. 2020 జనవరి 11,12 తేదీల్లో డిల్లి లోని కరోల్‌ బాగ్‌ లో నిర్వహించే ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో  జాతీయ కమిటీని ఎన్నుకోనున్నామని బామ్‌సెఫ్‌ జాతీయ అధ్యక్షులు వామన్‌ మేశ్రమ్‌ ప్రకటించారు.  చివరి రోజు రాఖీగఢ డిఎన్‌ఎ తవ్వకాలు, వైజ్ఞానిక అన్వేషణ, సంచార జాతుల, తెగల, పరిశీలన, 2020లో ఎస్‌సి, ఎస్‌టి రాజకీయ రిజర్వేషన్ల పొడగింపు ప్రపంచీకరణ , ప్రయివేటీకరణ నేపథ్యంలో రిజర్వేషన్లపై , బడుగు ప్లిలల ఆరోగ్య సమస్య తదితర అంశాలపై చర్చ జరిపారు. భారత్‌ ముక్తిమోర్చా జాయతీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ విలాస్‌ ఖరత్‌ మాట్లాడుతూ హర్యానాలోని రాఖిగఢ తవ్వకాల్లో బయటపడిన మృతదేహాల డిఎన్‌ఎ పరీక్ష  ఆధారంగా బ్రాహ్మణులు భాతర దేశానికి సంబంధించిన వారు కాదని తేలిందని తెలిపారు. డాక్టర్‌ వసంత్‌ సిండే, నీరబ్‌ రాయ్‌ మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకు 2011లో డాక్టర్‌ మైకెల్‌ బామ్‌సెఫ్‌ ఫిర్యాదు మేరకు వసంత్‌ సిండేకు లీగల్‌ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఈమెరకు లెప్ట్‌నెంట్‌ కల్నల్ పురోహిత్‌ ప్రసాద్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య సమావేశంలో బ్రాహ్మణులు  భారతీయులు    కారన్న విషయాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఆతరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ 100 బాంఋలు  పేల్చి విధ్వంసం సృష్టించిందని తెలిపారు. భారత్‌ ముక్తిమోర్చాపార్టీ జాతీయ ఉపాధ్యక్షు దాస్‌రామ్‌నాయక్‌ మాట్లాడుతూ సంచార జాతులు ఈదేశంలో 11 కోట్ల   మంది ఉన్నారని తెలిపారు. బ్రాహ్మణులు  కేవం 3 కోట్లు ఉన్నారని తెలిపారు. సంచార జాతులకు సంఘనిర్మాణం , నాయకత్వం, భాష లేదన్నారు. అందుకే వారికి స్థిరనివాసం, రిజర్వేషన్లు, కావల్సిన సట్టిఫికెట్లు ఏమి లేవని అన్నారు. అదే 3 కోట్ల బ్రాహ్మణుకు అన్నీ ఉన్నాయని తెలిపారు. లoబాడ, బుడగజంగాలు, వడ్డెరులు, తదితర సంచార జాతుల కోసం ప్రత్యేక షెడ్యూులు తయారు చేసి రాజ్యాంగపరమైన ఫలితాలు వారికి దక్కేలా చూడాలన్నారు.