6, జనవరి 2011, గురువారం

శ్రీ కృష్ణ కమిటీ ఏం చెప్పిందంటే?

శ్రీకృష్ణ కమిటీ అన్ని ప్రాంతాల అభిప్రయాలు సేకరించింది. పాము చావకుండా కర్ర ఇరుగకుండా రిపోర్టు ఉంది. అన్ని అధ్యయనం చేసినట్లే ఉంది. ఏదీ ప్రజలకు అర్థం కానట్లే ఉంది.
ఏడాది పొడవునా అధ్యయనం చేసినదాంట్లో ఏమి లేదు.... అనే వారు ఎక్కువగా ఉన్నారు. వాస్తవమే ఓ కమిటీకి రాష్ట్రం ఇవ్వండని, ఇవ్వొద్దని చెప్పే అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే తేల్చుతుంది. లేందంటే గొడలు తప్పవు....తేల్చడానికి కాంగ్రెస్‌ లాభనష్టాలను బేరీజు వేసుకుంటుంది. కాంగ్రెస్‌కు కూడా
కొన్ని చిక్కులున్నాయి. పెద్ద స్వార్థం ఉంది. మూడేళ్లు ఇంకా అధికారంలో ఉండాలి. దీని ఆధారంగా మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రణాలిక చేసుకోవాలి. ప్రజల ప్రయోజనాలు కాంగ్రెస్‌కు అవసరం లేదు. ఈ గొడవ మధ్య ప్రజల సమస్యలు కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ధైర్యంగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
న్యాయమూర్తి బిఎన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఏర్పడిన కమిటీ తన నివేదికను కేంద్రప్రభుత్వానికి 2010 డిసెంబర్‌ 30 వతేదీన అందచేసింది. కమిటీ అధ్యయనాంశాలను ఈ దిగువ పొందుపర్చటమైనది.
కమిటీ తన 461 పేజీల నివేదికలో ఈ దిగువ అంశాలను సమగ్రంగా పరిశీలించింది.
1. ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలు, చారిత్రక నేపథ్యం.
2. ప్రాంతీయ ఆర్థిక, సమానత్వ విశ్లేషణ,
3. విద్య, ఆరోగ్యం,
4. జలవనరులు, సాగునీటి వసతి, విద్యుత్‌ అభివృద్ధి
5. ప్రభుత్వ ఉద్యోగావకాశాలకు సంబంధించిన అంశాలు.
6. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలు.
7. సామాజిక, సాంస్కృతిక అంశాలు.
పై తెలిపిన పరిమితులకు లోబడి ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు డిమాండ్‌, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ కొనసాగింపు డిమాండ్ల నేపథ్యంలో ఆయా అంశాలను కమిటీ సమగ్రంగా పరిశీలించి విశ్లేషించింది. రాష్ట్రంలోని పరిస్థితులను అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ ఆయా స్థానిక, ప్రాంతీయ, జాతీయ దృక్పధాలను దృష్టిలో వుంచుకుని సమస్యకు ఈ దిగువ పరిష్కారాలు/పరిష్కారానికి అనువైన మార్గాలను సూచించింది.
1. యధాతథ స్థితిని కొనసాగించటం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొని వున్న పరిస్థితుల్లో కేవలం యధాతథ స్థితిని కొనసాగించటం ఆచరణ సాధ్యం కాదని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడుతోంది. ఈ యధాతథ స్థితిని కొనసాగించేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం వుందని భావిస్తోంది. యధాతథ స్థితిని కొనసాగించటం ఒక మార్గమే అయినా దీనికి కమిటీ కొంతమేర మాత్రమే సానుకూలత వ్యక్తం చేస్తోంది.
2. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణా,రాష్ట్రాలుగా విభజించటం, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా వుంచటం, ఇదే సమయంలో రెండు రాష్ట్రాలు తమ సొంత రాజధానులను అభివృద్ధి పరుచుకునేందుకు అవకాశం కల్పించటం.
తెలంగాణా ప్రాంతంలో అభివృద్ధి లోపం తీవ్రంగా వున్న విషయాన్ని కమిటీ పరిశీలించింది.
అయితే మొత్తం మీద పరిశీలిస్తే రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా విభజించటం, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా వుంచటం ఆచరణలో సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడుతోంది.
3. రాష్ట్రాన్ని రాయల-తెలంగాణా, కోస్తా ఆంధ్రాలుగా విభజించి హైదరాబాద్‌ను రాయల-తెలంగాణాలో అంతర్భాగంగా కొనసాగించటం.
ఈ పరిస్థితి అటు తెలంగాణా అనుకూల వాదులకు కానీ, ఇటు సమైక్య ఆంధ్ర వాదులకు కానీ ఆమోదయోగ్యం కాదని కమిటీ భావిస్తోంది. ఈ మార్గంలో ఆర్థిక సమతుల్యత సాధించే అవకాశం వున్నప్పటికీ ఇది మూడు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కాదని కమిటీ భావిస్తోంది.
4. ఆంధ్రప్రదేశ్‌ను సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలుగా విభజించి, హైదరాబాద్‌ మహానగరాన్ని విస్తృతపరిచి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయటం. కేంద్ర పాలిత ప్రాంతానికి కోస్తా ఆంధ్రాలోని గుంటూరు జిల్లా నైరుతి ప్రాంతంలోని నల్గొండ జిల్లా మీదుగాను, దక్షిణాన మహబూబ్‌నగర్‌ జిల్లా మీదుగా రాయలసీమలోని కర్నూలు జిల్లాకు భౌగోళిక, రవాణా సంబంధాలు (మార్గాలు) వుంటాయి.
ఈ ప్రతిపాదనకు తెలంగాణా వాదులనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్న దృష్ట్యా ఈ అంశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా చేయటం కోసం రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించటం దాదాపు కష్టసాధ్యమే.
5. రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల్లోనే తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాలుగా విభజించి హైదరాబాద్‌ను తెలంగాణా రాజధానిగా కొనసాగించటం, సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయటం.
ఈ అంశాన్ని పరిశీలనకు తీసుకోవచ్చని కమిటీ భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు డిమాండ్‌ పూర్తిగా సమర్ధించదగినది కాకపోయినా అందులో కొంత న్యాయం వుందని కమిటీ భావిస్తోంది. ఈ అంశాన్ని ఆచరణలో పెడితే హైదరాబాద్‌, ఇతర తెలంగాణా జిల్లాల్లో స్థిరపడిన కోస్తాంధ్రా, రాయలసీమ ప్రజలు, ఇతరులకు తమ ఆస్తులు, పెట్టుబడులు, జీవనాధారం, ఉద్యోగావకాశాలపై ఉన్న భయాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు ఈ ప్రాంతంలోని మెజార్టీ ప్రజలకు సంతృప్తి కలిగించినప్పటికీ అది అనేక తీవ్ర సమస్యలకు దారి తీస్తుందని భావిస్తోంది. అనుకూలతలు, ప్రతికూలతలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ అంశం అత్యంత ప్రాధాన్యత ఇవ్వదగినది కాదని, రెండో అత్యుత్తమ మార్గం మాత్రమేనని భావిస్తోంది. అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్ర విభజన జరగాలని, ఈ నిర్ణయానికి మూడు ప్రాంతాల ప్రజల ఆమోదం పొందేందుకు కృషి చేయాలని సూచిస్తోంది.
6. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించటం, అదే సమయంలో తెలంగాణా ప్రాంతానికి నిశ్చిత, ఖచ్చితమైన రాజ్యాంగ/చట్టపరమైన సామాజిక, ఆర్థిక, అభివృద్ధి, రాజకీయ సాధికారికత కల్పన కోసం ఉన్నతాధికార తెలంగాణా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం.
ఈ మార్గంలో రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించటంతో పాటు తెలంగాణా ఆర్థిక, సామాజిక అబివృద్ధికి సంబంధించి రాజ్యాంగ/చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతిపాదిస్తోంది. సమగ్రమైన విధులు, నిధులు, అధికారాలతో చట్టబద్ధమైన ఉన్నతాధికార తెలంగాణా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయటం ద్వారా మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. ప్రాంతీయ మండలికి సంబంధించిన అంశాలతో వ్యవహరించేందుకు శాసనబద్ధమైన సంప్రదింపుల యంత్రాంగాన్ని మండలి ఏర్పాటు చేయవచ్చు. జాతీయ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలుగకుండా వుండేందుకు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కమిటీ సూచిస్తోంది. స్థిరమైన రాజకీయ, పాలనా నిర్వహణతో ఈ అంశంపై ప్రజలకు అవగాహన కలిగించటం సాధ్యమే కాక అందరి ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలోని అధికసంఖ్యాకులైన ప్రజలకు ఇది సంతృప్తి కలిగిస్తుందని కమిటీ భావిస్తోంది. విద్యా, పారిశ్రామిక, ఐటి రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగర భవిష్యత్తుపై నెలకొని వున్న అనిశ్చితికి కూడా ఇది జవాబు చెబుతుంది. జలవనరులు, సాగునీటి వనరులను సమాన ప్రాతిపదికపై పంపిణీ చేసేందుకు సాంకేతిక పరమైన సంస్థ (జల నిర్వహణా బోర్డు, ఇరిగేషన్‌ ప్రాజెక్టు డెవలెప్‌మెంట్‌ కార్పోరేషన్‌)ను విస్తృత స్థాయిలో ఏర్పాటుచేయాలని కమిటీ సూచిస్తోంది. ఈ కార్యాచరణ తెలంగాణా ప్రజలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలకు సరైన జవాబుగా నిలుస్తుంది. ఈ అంశానికి సంబందించిన అన్ని కోణాలను సమగ్రంగా చర్చించిన కమిటీ దీని అమలులో కొన్ని అడ్డంకులు వుండవచ్చని భావిస్తోంది. సమతుల్యతను, మూడు ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక సంక్షేమాన్ని, ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుంటే ఇది పైన సూచించిన పరిస్థితుల్లో ఇది అత్యంత ఆచరణ సాధ్యమైన అంశమని కమిటీ భావిస్తోంది. సామాజిక, ఆర్థికాభివృది ్ధ, సుపరిపాలన ఇందులో కీలకం. జాతీయ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నింటికన్నా ఈ మార్గం అత్యుత్తమమైన మార్గమని కమిటీ అభిప్రాయపడుతోంది.
అనుబంధం
కమిటీ అధ్యయనానికి సూచించిన ప్రస్తావనాంశాలు
1. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ కొనసాగింపు డిమాండ్‌లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేయటం.
2. రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుండి ఇప్పటి వరకూ చోటు చేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రగతి, అభివృద్ధిపై వాటి ప్రభావం.
3. మహిళలు, పిల్లలు, విద్యార్ధులు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డు కులాలు, తెగల వంటి విభిన్న వర్గాల ప్రజలపై ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావం.
4. పై 1,2, 3 అంశాలలో సూచించిన అంశాలలో కీలకమైన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు సూచించటం.
5. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా రాజకీయ పార్టీలను పై చెప్పిన పరిస్తితులపై సంప్రదించి వారి అభిప్రాయాలను తీసుకోవటంతో పాటు ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిని పరిష్కరించేందుకు రాజకీయపార్టీలు ఇతర సంస్థల నుండి పరిష్కార మార్గాలను ఆహ్వానించటం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కొనసాగించటం.
ఇందుకు అనువైన పరిష్కారాలను సూచించి కార్యాచరణ ప్రణాళికను, ఆచరణ మార్గాన్ని ప్రభుత్వానికి సూచించటం.
6. పారిశ్రామిక, వాణిజ్య, కార్మిక, రైతు, మహిళా, విద్యార్ధి సంఘాల వంటి విభిన్న సామాజిక తరగతులతో పై చెప్పిన అంశాలపై సంప్రదించి రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి వారి అభిప్రాయాలను స్వీకరించటం.
7. పై అంశాలన్నింటినీ విశ్లేషించి రాష్ట్ర పరిస్థితులకు తగినది అని కమిటీ భావించిన పరిష్కారాన్ని సూచించటం లేదా సిఫార్సు చేయటం.

కామెంట్‌లు లేవు: