14, అక్టోబర్ 2012, ఆదివారం

ఆకలి కేకలు

వచ్చే ఏడాది మరింత ఆహార సంక్షోభం 

పెరిగే ధరలతో అశాంతికి ఆజ్యం 

వాతావరణ మార్పుల ప్రభావం 

ప్రపంచ దేశాలకు ఐరాస హెచ్చరిక

                  అంతంత మాత్రంగా ఉన్న ఆహార నిల్వలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. మరోవైపు ప్రపంచ జనాభాకు తగిన స్థాయిలో వాటి ఉత్పత్తీ లేదు. దీనికితోడు వాతావరణంలో అనూహ్యమైన మార్పులు. ఫలితంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు. వెరసి ఇప్పటికే అర్ధాకలి, పోషకాహార లోపంతో అలమటిస్తున్న ప్రజానీకానికి మున్ముందు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టనున్నాయి. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంటుందని, దారుణ దుర్భిక్ష పరిస్థితులను ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
                    కరువు పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి మరో దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెల్లడించింది. అమెరికా, ఉక్రెయిన్‌ తదితర దేశాల్లో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తగ్గిపోతుండటంతో ఈ ఏడాది ఆయా దేశాల్లో అత్యల్ప స్థాయికి ఆహార ధాన్యాల నిల్వలు పడిపోనున్నాయని, ఇవి 1974 స్థాయి నాటికి తగ్గిపోతాయని ఐరాస ఒక ప్రకటనలో వివరించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వడగాడ్పులతో పాటు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న అమెరికాలో ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో 6.5 శాతం మొక్కజొన్న నిల్వలు మాత్రమే ఉన్నాయని, వీటితో ఆ దేశ ప్రజలు వచ్చే ఏడాది సర్దుకోవాల్సి ఉంటుందని ఐరాస వివరించింది. 'మనం
              వినియోగిస్తున్న స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయలేకపోతున్నాం. దీంతో మిగులు నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వలు ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో ఉన్నాయి. వచ్చే ఏడాది అనూహ్య పరిస్థితులకు దారితీసే ప్రమాదముంది' అని ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఎఓ)కు చెందిన సీనియర్‌ ఆర్థికవేత్త అబ్డోల్‌రెజా అబ్బాసియన్‌ అభిప్రాయపడ్డారు. గత 11 ఏళ్ల కాలంతో పోలిస్తే ఆరేళ్ల నుండి ఆహార వినియోగం పెరుగుదల రికార్డు స్థాయిలో నమోదైంది. పదేళ్ల క్రితం ఏడాదిలో సగటున 107 రోజులకు సరిపడిన నిల్వలు ఉంటే, ఇప్పుడు అవి 74 రోజులకే సరిపోయే స్థాయికి పడిపోయాయి. వరి, గోధుమ, జొన్న వంటి ప్రధానమైన ఆహార పంటల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవి 25 దేశాల్లో దాదాపుగా 2008 నాటి స్థాయికి తిరిగి చేరుకుంటున్నాయి. 2008లో ఆహార ధాన్యాల ధరలు చుక్కలనంటిన పరిస్థితుల్లో అనేక దేశాల్లో వాటి కోసం దాడులు, ఘర్షణలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 87 కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఎఫ్‌ఎఓ గణాంకాలు తెలియచేస్తున్నాయి. పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహార సంక్షోభం నానాటికీ పెరుగుతోంది. ఈ ఏడాది వివిధ దేశాల్లో గోధుమ పంట ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 5.2 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయని, అదే విధంగా వరి, తదితర ఆహార పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోతోందని ఎఫ్‌ఎఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అనేక దేశాల్లో ఆహార సరఫరా వ్యవస్థ ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోయే అవకాశం ఉందని, ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ఆకలితో మలమల మాడిపోతారని తెలిపింది. తద్వారా ఆహార ధాన్యాల కోసం దాడులు, ఘర్షణలు చోటు చేసుకుని కొన్ని దేశాల్లో ప్రభుత్వాల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరించింది.
ఆజ్యం పోస్తున్న వాతావరణ మార్పులు
                      ఇదిలావుండగా వాతావరణంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుండటం కూడా ఆహార సంక్షోభానికి ఆజ్యం పోస్తోందని వాషింగ్టన్‌లోని ఒక భూభౌతిక పరిశోధనా కేంద్రం అధ్యక్షుడు లెస్టర్‌ బ్రౌన్‌ అంటున్నారు. ఈ వాతావరణ మార్పులను ఎదుర్కొని ప్రజల నుండి పెరుగుతున్న ఆహార డిమాండ్‌ను తీర్చేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్పెక్యులేటర్లు వేలాది ఎకరాల భూములను చౌక ధరలకు 'కబ్జా' చేస్తుండటంతో గత దశాబ్ద కాలంలో ఆహార ధరలు రెట్టింపు స్థాయిని దాటటమే కాక అనేక దేశాల్లో ఆహార ధాన్యాల నిల్వలు అడుగంటే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత 11 ఏళ్ల కాలంలో ఆరోసారి అనేక దేశాల్లో ఆహార సంక్షోభం ఉధృతం కానుందని ఐరాస స్పష్టం చేసింది. రానున్న రెండు దశాబ్దాల కాలంలో వరి, గోధుమ వంటి ప్రధాన పంటల ధరలు ప్రస్తుత స్థాయికి రెట్టింపయ్యే అవకాశాలున్నాయని ఆక్స్‌ఫామ్‌ సంస్థ గత వారం హెచ్చరిక జారీ చేసింది. దీంతో పేద ప్రజలు తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆహారం కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇది విపత్కర పరిణామాలకు దారితీసే ప్రమాదముందని ఆ సంస్థ హెచ్చరించింది.

కామెంట్‌లు లేవు: