2, అక్టోబర్ 2014, గురువారం

కలుషిత విధానాలతో స్వచ్ఛ భారత్‌ సాధ్యమా?

            దేశ సార్వభౌమత్వాన్ని కాపాడలేని పాలకులు దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలనే ఆలోచన సాధ్యమా?. రోడ్లు, టాయిలెట్స్‌, పరిసరాలు శుభ్రంగా ఉంచితే దేశం స్వచ్ఛమౌతుందా?. ఎవరి పరిసరాలు వారు శుభ్రం చేసుకోవడమనేది అత్యధిక మందికి తెలుసు.  నిరక్షరాస్యత, పేదరికం పోనంతకాలం కొన్ని ప్రాంతాలు శుభ్రం చేయలేం. కొన్నింటిని శుభ్రం చేయడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సిబ్బందినే నియమించుకోలేక పోతున్నాం. ఉన్న సిబ్బంది రిటైర్‌ అయితే ఆ ఖాళీలను భర్తీ చేయించుకోలేక పోతున్నాం. కాంట్రాక్టు లెక్కన సిబ్బందిని తీసుకుని వారి కష్టంనుంచే కాంట్రాక్టర్ల తాపేదార్లు దోచుకుంటున్నారు.
                                                      చేతల్లో  విదేశీ... మాటల్లో స్వదేశీ
      విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానిస్తే మన దేశ ప్రయోజనాలుండాలి. అవెక్కడా లేవు. ఒక వేల ఉంటే సంస్కరణలు ప్రారంభమైన నాటినుంచి లెక్కలు చూస్తే మన దేశంలో సంపన్నుల  ఆదాయం పెరుగుతూ పోతుంది. పేదరికం పెరుగుతూనే ఉంది. మనుగడ కోసం జరిగే పోరాటంలో అక్కడక్కడా విజయం సాధించిన బడుగులు బాగుపడుతున్నారు. పాలకుల విధానాల వల్ల సామాన్యునికి  ప్రయోజనం లేదు.
         స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాక ప్రధాన మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రం సాధించుకున్నాం.  మహాత్ముడి స్వచ్ఛభారత్‌ కల మాత్రం నేటికీ సాకారం కాలేదు. క్విట్‌ ఇండియా...క్లీన్‌ ఇండియా అని మహాత్ముడు  సందేశమిచ్చారని  మోడీ గుర్తు చేశారు. పాలకులు విదేశీ విధానాలను అమలు చేసి సంస్కృతి సాంప్రదాయాలను కలుషితం చేసి స్వదేశీనినాదం చేసిన గాంధీ గురించి మాటల్లో గొప్పలు చెప్పుకుంటే ప్రయోజం ఏమిటి?. ఇలాంటి పబ్లిసిటీ కార్యక్రమాలు కాకుండా మన రాజ్యాంగంలోని నిబంధనలను సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది. 
                                                        మోడీ ప్రధాని అయ్యాక........
                 రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)ను అనుమతించారు. బీమారంగంలో 49 శాతం ఎఫ్‌డిఐలకు వీలు కల్పిస్తూ బిల్లు రూపొందించారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను అమ్మకానికి పెట్టారు. నిర్వీర్యం చేయడానికి సిద్దమయ్యారు.  ఓఎన్‌జిసి, కోల్‌ఇండియా, ఎన్‌హెచ్‌పిసిలలో  వాటాల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ప్రయివేటు శక్తులకు కట్టబెట్టబెడుతున్నారు.  ధరలకు కళ్లెం వేయలేక పోయారు. బడాపారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తున్నారు.  శాస్త్ర వేత్తలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ జెనిటిక్‌ మోడిఫైడ్‌ పంటలకు అనుమతిచ్చారు. ఇవ్వన్ని ప్రజల ప్రయోజనాలకు కాకుండా కొందరి ప్రయోజనాలకోసం చేశారు. గాంధీ విదేశీ వస్తువుల దిగుమతులను వ్యతిరేకించారు. మనవాళ్లు అంటే ముందు పాలకులు, నేటి పాలకులు ఆహ్వానించారు. మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు పెట్టి ఆరోగ్యం పాడు చేస్తున్నారు. సంస్కరణల పుణ్యమాని అవినీతి పెనుభూతమైంది. మోడీ కేబినెట్‌లోనే 18 మంది మంత్రులపై వివిధ రూపాల్లో అభియోగాలొచ్చాయి. మోడిగారు చంద్రబాబును గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆయన హామీలు మాత్రం అమలుకావడం లేదు. విజ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని పంచే విద్యా, వైద్య రంగాల్లో ప్రయివేటు భాగస్వామ్యం పెరిగింది.  ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన భారత్‌ ఎలాసాధ్యమో ఆలోచించాలి.


కామెంట్‌లు లేవు: