1, ఫిబ్రవరి 2017, బుధవారం

భూగర్భంలో లగ్జరీ హౌస్‌

              


‘ఆదిత్య 369’ సినిమాలో హీరోయిన్‌.. కమెడియన్‌తో సహా హీరో బాలకృష్ణ టైం మిషన్‌ ఎక్కి గతంలోకి ప్రయాణించి ఆ తర్వాత భవిష్యత్‌లో కాలంలోకి వెళ్తాడు. ఆ కాలంలో మూడో ప్రపంచయుద్ధం జరిగి అణుశక్తి ప్రభావంతో భూమిపై మనుషులు జీవించే వీలులేకుండా పోతుంది. దీంతో ప్రజలు భూగర్భంలో నగరాలు నిర్మించుకొని జీవిస్తుంటారు. ఆ సన్నివేశాలు గుర్తున్నాయా? ఆ సంగతి ఇప్పుడెందుకు అంటారా? అచ్చం అలానే మూడు దశాబ్ధాల క్రితమే ఓ పెద్ద మనిషి యుద్ధం కారణంగా భూమిపై జీవించే వీలు ఉండదనుకొని ఇలాగే భూగర్భంలో ఓ ఇంటిని నిర్మించాడు.             1970లో అమెరికాలో కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. దీంతో అణుబాంబు ప్రయోగాలు జరిగి భూమి సర్వనాశనం అయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాన్ని చూసుకోవాలని.. సరిపడ ఆహార పదార్థాలను దాచుకోవాలని సూచించింది. దీంతో గిరార్డ్‌ బ్రౌన్‌ హెండర్సన్‌ అనే వ్యాపారవేత్త భయపడిపోయాడు. ఎక్కడ అణుబాంబులు పేలి తాను బతికే వీలులేకుండా పోతుందేమోనని .భయపడ్డాడు. వెంటనే తన ఇంట్లోనే భూమికి 26 అడుగుల లోతులో లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడు. 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్‌ రూమ్స్‌.. ఒక కిచెన్‌.. బాత్రూమ్స్‌.. స్విమ్మింగ్‌పూల్‌.. గార్డెన్‌.. లాన్‌ వాటర్‌ ఫాల్‌.. గోల్ఫ్‌ కోర్స్‌ ఇలా సర్వ సదుపాయాలతో అద్భుతంగా కట్టించాడు. అంతేకాదు.. కొన్ని ఏళ్లు జీవించడానికి సరిపడ సరుకులు సమకూర్చాడు. రాత్రి పగలు తేడా తెలిసేలా సమయాన్ని బట్టి వెలుతురు వచ్చేలా ప్రత్యేకంగా లైట్లను ఏర్పాటు చేశారు.
                   అయితే కోల్డ్‌వార్‌ అలాంటి భయంకర ప్రమాదాలు జగరకుండా ముగిసినా హెండర్సన్‌ మాత్రం ఆ భూగర్భ నివాసంలోనే జీవించాడు. 1983లో అతను మరిణించిన తర్వాత దాన్ని ఆయన బంధువులు స్వాధీనం చేసుకున్నారు. 2014లో ‘సోసైటీ ఫర్‌ ర ప్రిసర్వేషన్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎక్సిటిక్ట్‌ స్పీసెస్‌’ అనే సంస్థ కొనుగోలు చేసింది.

కామెంట్‌లు లేవు: