12, ఫిబ్రవరి 2019, మంగళవారం

మోదీ ఉండగానే మంత్రి అసభ్య ప్రవర్తన


                  అగర్తల: ఆయనో మంత్రి.. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి తోటి మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించాడు. అది కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో. ఎదురుగా ప్రధాని మోదీ శంకుస్థాపనలో బిజీగా ఉంటే.. ఈయనేమో పక్కన నిల్చున మహిళా మంత్రిపై వేధింపులకు పాల్పడుతూ కెమెరాకు చిక్కారు. త్రిపురలో జరిగిన ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే..
ప్రధాని మోదీ గత శనివారం త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, భాజపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండగా.. అక్కడే ఉన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్‌ కాంతి దేవ్‌ తన పక్కనే నిల్చున్న తోటి మహిళా మంత్రిని అసభ్యంగా తాకాడు.
                  దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. మనోజ్‌ కాంతి దేవ్‌ను వెంటనే తొలగించాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దీనిపై మనోజ్‌ను ప్రశ్నించగా.. ఘటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
కాగా.. భాజపా మాత్రం ఘటనను తోసిపుచ్చింది. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రతిపక్ష నేతలు ఇలా భాజపా మంత్రులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ ప్రతినిధి అన్నారు. ఆ వీడియో అంతా బూటకమని కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా ఘటనపై సదరు మహిళా మంత్రి నుంచి కూడా ఎటువంటి ఫిర్యాదు రాలేదు.

కామెంట్‌లు లేవు: