8, జులై 2019, సోమవారం

15, 16 తేదీల్లో ‘మున్సిపల్‌’ నోటిఫికేషన్‌


నెలాఖరున పోలింగ్‌

14వ తేదీ నాటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు

వేగవంతంగా ఎన్నికల ప్రక్రియ
                        తెలంగాణ  రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో అవసరమైన ముందస్తు ప్రక్రియను మరింత ముందుకు తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ఈ నెల 14వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. గతంలో ఈ గడువు 18వ తేదీ వరకు ఉండగా దీన్ని నాలుగు రోజులు ముందుకు తీసుకువచ్చారు. వార్డుల వారీగా ఫొటోలతొ కూడిన ఓటర్ల జాబితాను 14న ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఈ నెల 15న పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ వెంటనే అంటే ఈ నెల 15న లేదా 16న రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయనుందని తెలిసింది. జులై 30 లేదా 31న రాష్ట్రంలోని 131 పురపాలక సంఘాలు, మూడు నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అనుగుణంగా రాష్ట్ర పురపాలకశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ముగిసిన వార్డుల పునర్విభజన

                ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆర్డినెన్స్‌ మేరకు రాష్ట్రంలో వార్డుల సంఖ్య పెరిగింది. కొత్త పురపాలక సంఘాల ఏర్పాటు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల విస్తరణ నేపథ్యంలో కొత్త వార్డులు ఏర్పడ్డాయి. వార్డులను ప్రకటించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు వాటిని పరిష్కరించి పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో పునర్విభజన మేరకు ఆదివారం వార్డులను ఖరారు చేశారు. కొత్త వార్డుల ప్రకారం ఈ నెల 14వ తేదీ లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించి ప్రకటించనున్నారు. ఇది పురపాలక ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుకు ప్రాతిపదిక కానుంది. పోలింగ్‌ కేంద్రాల ప్రకటనకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉంది. కానీ తాజాగా ఈ నెల 14 లోపు పురపాలక ఎన్నికల ముందస్తు ప్రక్రియను పూర్తి చేసే నేపథ్యంలో ఈ షెడ్యూలు కూడా మారనుందని తెలిసింది. ఈ నెల 14వ తేదీ లోపే పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రకటించనున్నారు.
పరోక్ష పద్ధతిలోనే ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక

         పురపాలక సంఘాల ఛైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లను ఈ సారీ పరోక్ష పద్ధతి ద్వారానే ఎన్నుకోనున్నారు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పురపాలక చట్టం నేపథ్యంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో చర్చించారు. పురపాలక చట్టంలో సమూల మార్పుల నేపథ్యంలో మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి ద్వారా నిర్వహించడం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఎన్నికలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలనే లక్ష్యం నేపథ్యంలో ఈ సారీ పరోక్ష పద్ధతి ద్వారానే ఎన్నుకునే విధానంతో ముందుకు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రక్రియ దీనికి అనుగుణంగానే సాగుతోంది. పురపాలిక ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు తాజా షెడ్యూలు ఇది

      ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ముసాయిదా ప్రచురణ : జులై 10

అభ్యంతరాల స్వీకరణకు గడువు : జులై 11, 12 తేదీల్లో

అభ్యంతరాల పరిష్కారం : జులై 13

తుది జాబితా ప్రచురణ : జులై 14

కామెంట్‌లు లేవు: