23, జులై 2019, మంగళవారం

విశ్వాస పరీక్షలో కుమార ఓటమి!

   
            బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి సర్కార్‌ కుప్పకూలింది. 99- 105 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది. దీంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన కర్ణాటక రాజకీయానికి తెరపడింది. మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ఓటింగ్‌ నిర్వహించగా.. కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును కుమార సర్కార్‌ సంపాదించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 14 నెలల కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. అధికార కూటమికి చెందిన 15మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గత నెల రోజులుగా సాగుతున్న కర్ణాటకీయం ముగిసింది. సభలో డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది వరుసల వారీగా ఒక్కో సభ్యుడ్ని లెక్కించారు. ఈ విశ్వాస పరీక్షలో అధికార కూటమి వైపు 99 మంది సభ్యులు ఉండగా.. ప్రతిపక్ష కూటమికి 105 మంది సభ్యుల బలం ఉంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 103ను అందుకోలేకపోవడంతో జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 
ఫలించని కాంగ్రెస్‌- జేడీఎస్‌ ప్రయత్నాలు
               సంకీర్ణ కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మొదలైన రాజకీయ సంక్షోభం చివరకు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితికి దారితీసింది. దీంతో మూడు వారాలుగా అనేక మలుపులు తిరిగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడినట్టయింది. అధికారాన్ని నిలుపుకొనేందుకు అధికారపక్షం వ్యూహాలు ఫలించలేదు. ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోగల్గినప్పటికీ..  అసమ్మతి ఎమ్మెల్యేలను మాత్రం దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్‌ వైఫల్యం చెందింది. విధానసభలో బలపరీక్ష జాప్యం చేసినా అధికార కూటమికి ఫలితం లేకపోయింది. రెండు సార్లు సుప్రీంకోర్టు తలుపులు కాంగ్రెస్‌, జేడీఎస్‌ తట్టాయి. ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్‌వేదికగా అసమ్మతి రాజకీయం సాగింది. చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో చివరకు విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ నిర్వహించగా.. ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది, వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. కాంగ్రెస్‌కు చెందిన 12 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు.. జేడీఎస్‌ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి సభకు దూరంగా ఉన్నారు. అలాగే, రాజీనామా చేయకపోయినా కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్య కారణాల సాకుతో సభకు దూరమయ్యారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సభకు దూరంగా ఉండటంతో అధికార పక్షానికి తగిన సంఖ్యాబలం లేని కారణంగా కుమార సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. 
పట్టు సడలని రెబల్స్‌
                 కాలయాపన చేసి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకొనేందుకు అధికార కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసినా.. వారెవరూ వెనక్కి తగ్గలేదు. వారిని దారిలోకి తెచ్చుకొనేందుకు విశ్వప్రయత్నాలు జరిగాయి. సంప్రదింపులు జరిపినా.. విప్‌ ప్రయోగించినా.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగిస్తామని కొందరు నేతలు బెదిరించినా రెబల్స్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. కుమారస్వామి ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయిందని.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలేదని అందుకే తాము రాజీనామాలు చేసినట్టు స్పష్టంచేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండటంతో కుమార సర్కార్‌ ఓటమిపాలైంది.

1 కామెంట్‌:

బుచికి చెప్పారు...

ఈ వార్తలు పత్రికలలో ఛానెల్స్ లో చెబుతూనే ఉన్నారు కదా. మళ్లీ మీ బ్లాగులో ఇవ్వడం అవసరమా