8, ఏప్రిల్ 2020, బుధవారం

భారత్‌ పై ట్రంప్‌ ప్రశంసల జల్లు...

భారత్‌ పై ట్రంప్‌ ప్రశంసల జల్లు...

          అమెరికా : కరోనా వ్యాప్తితో ఛిన్నాభిన్నమవుతున్న తమ దేశ పరిస్థితుల గురించి ఇటీవల మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో... హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను భారత్‌ తమకు ఎగుమతి చేయకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ ఔషధాల ఎగుమతిపై నిషేధాన్ని విధించిన భారత్‌ మళ్లీ ఎగుమతి చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్రంప్‌ మరోసారి మాట్లాడుతూ... తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.
         ' హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇప్పటికే కొన్ని మిలియన్‌ డోసులు కొన్నాను. దాదాపు 29 మిలియన్ల డోసులు కొన్నాను. భారత ప్రధాని మోడి తో నేను మాట్లాడాను.. భారత్‌ నుంచి మాకు ఆ ఔషధాలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉంది. వాటిని పంపిస్తారా? అని మోడి ని అడిగాను. సానుకూలంగా స్పందించారు. భారత్‌కు కూడా ఆ ఔషధాలు చాలా అవసరం అందుకే వాటి ఎగుమతులను ఆపేశారు ' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.
                ఇటీవల మోడి తో మాట్లాడిన ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరిక్విన్‌ను ఎగుమతి చేయాలని కోరారు. ఆ మరుసటి రోజే భారత్‌ హైడ్రాక్సీ క్లోరిక్విన్‌తో పాటు పలు ఔషధాల విడుదలపై నిషేధం విధించింది. దీంతో ట్రంప్‌ భారత్‌పై మండిపడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ భారత్‌ ఆ నిషేధాన్ని ఎత్తి వేస్తూ పలు దేశాలకు సరఫరా చేస్తామని ప్రకటించడంతో ట్రంప్‌ మళ్లీ కూల్‌ అయి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.

కామెంట్‌లు లేవు: