20, జనవరి 2011, గురువారం

రచ్చబండ రచ్చరచ్చ...!?

రచ్చబండ కార్యక్రమం తెలంగాణాలో రచ్చరచ్చ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు సమస్యలతో సతమత మవుతున్నారు. ఎన్నికలకు ముందు రేషన్‌ కార్డులు తరువాత బోగస్‌వని లాగేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇస్తామని రచ్చబండ కార్యక్రమంలో అంశంగా పెట్టారు. ఇందిరమ్మ పెండింగు బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. మహిళలకు పావలావడ్డీ రుణాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పథకాలన్నీ పెండింగులో ఉన్నాయి. అదేవిధంగా ఈమధ్య అన్ని రకాల ధరలు పెరిగాయి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రోశయ్య ముఖ్యమంత్రినుంచి తప్పించాక అభివృద్ధి పనులన్నీ పెండింగులో లోనే ఉన్నాయి. వాటన్నింటికీ మించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రజలు కోరుతున్నారు. ఈనేపథ్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజలు అడ్డుకునే అవకాశం ఉంది. పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమం జరిగినా అనేక అవాంతరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా నిర్వహిస్తారో వేచిచూడాలి. ఇలా నిర్వహిస్తామని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈనెల 20న ఆయన మహబూబ్‌నగర్‌ రెవెన్యూ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, డికె అరుణ, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. ఏడు ప్రధానమైన అంశాలపై రచ్చబండలో చర్చ ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, అభయహస్తం, పావలావడ్డీ, ఉచిత విద్యుత్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, సంక్షేమం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించన్నుట్లు తెలిపారు. ప్రతి గ్రామంలోనూ కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాపితంగా ఐదు లక్షలా 70 వేల మందికి రేషన్‌ కార్డులు పంపిణీ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా సమస్యను పరిష్కరించి, లబ్ధిదారులకు తాత్కాలిక రేషన్‌ కార్డులు, కూపన్లు పంపిణీ చేస్తామన్నారు. జిల్లా పరిధిలో 19,500 మందికి కూపన్లు పంపిణీ చేస్తామన్నారు. కూపన్లు పొందిన ప్రతి కుటుంబానికీ మార్చి నుండి రెండు రూపాయల కిలో బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. 37,084 ఇళ్లు ఇందిరమ్మ పథకం కింద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వీటన్నింటికి సంబంధించిన బిల్లులను విడుదల చేస్తామని చెప్పారు. అభయహస్తం పథకం కింద కోటీ 45 లక్షల రూపాయల నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పావలావడ్డీ పథకం కింద జిల్లాలోని మహిళా స్వయం సంఘాలకు రూ.10 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. పావలా వడ్డీ కింద రాష్ట్ర వ్యాప్తంగా 440 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి 4.60 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. జిల్లా పరిధిలో 25,011 మందికి కోటీ 45 లక్షల రూపాయలతో లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద జిల్లాలో 16,000 మందికి కొత్త కూపన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పని దినాలను 125 రోజులకు పెంచామని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం 1,400 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, డికె అరుణ మాట్లాడారు. కలెక్టర్‌ పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 12 వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండలంలోనూ నాలుగు నుండి ఐదు రోజుల పాటు కార్యక్రమం నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 14 నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కె.దామోదర్‌రెడ్డి, ఎస్పీ సుధీర్‌బాబు, ఎమ్మెల్యేలు అబ్రహం, రాజేశ్వర్‌రెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ చంద్రకాంత్‌రెడ్డి, డ్వామా పీడీ జాన్‌వెస్లీ ఉన్నారు.
27న జిల్లాకు సిఎం
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాను సందర్శించనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటించనున్న గ్రామాన్ని ఇంకా ఖరారు చేయలేదు. రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు.
కాంగ్రెస్‌ శ్రేణులు చురుకుగా పాల్గొనాలి
రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు చురుకుగా పాల్గొని, విజయవంతం చేయాలని మంత్రులు రాంరెడ్డివెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డికె అరుణ కోరారు. సమీక్షా సమావేశం అనంతరం వారు కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ, మండల స్థాయి నాయకులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాలన్నారు.

కామెంట్‌లు లేవు: