19, అక్టోబర్ 2012, శుక్రవారం

కడపలోనూ అవే సమస్యలు

జగన్‌ వస్తే మంచికాలం మళ్ళీ వస్తది
పాదయాత్రలో షర్మిల హామీ
              కడప జిల్లాలోనూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు న్నాయి. సొంత ఇలాకా పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు షర్మిలకు సమస్యలు ఏకరువు పెట్టడం గమనార్హం. అక్టోబర్‌ 19న శుక్రవారం రెండోరోజు పాదయాత్రలో విద్యుత్‌, తాగునీరు, పెన్షన్‌లు, ఇందిరమ్మ గృహాలకు బిల్లులు ఇవ్వకపోవడం, పంటలబీమా అందడం లేదని చెప్పగా మంచికాలం మళ్ళీ వస్తదని, రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని, జగన్‌ సిఎం అయ్యేవరకూ ఓపిక పట్టాలని షర్మిల కోరారు. మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రలో భాగంగా గురువారం కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్రను ప్రారంభించిన షర్మిల శుక్రవారం రెండో రోజు వేంపల్లిలోని రాజీవ్‌నగర్‌ కాలనీ నుండి నందిపల్లి, ముసలిరెడ్డిపల్లి మీదుగా వేముల వరకు 19 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దారిపొడవునా ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, రైతులు తమ సమస్యలను వివరించారు. ఒకచోట అరటితోటలోకి వెళ్ళి రైతులతో మాట్లాడారు. ముసలిరెడ్డిపల్లిలో అక్కడ మహిళలు, విద్యార్థులు షర్మిలను పూలతో స్వాగతం పలికారు.
మైసూరా దూరం..వివేకాను పట్టించుకోని నేతలు
                    కడప జిల్లా పులివెందులలో పాదయాత్ర జరుగుతున్నా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీలో చేరిన మైసూరారెడ్డి, వైఎస్‌ వివేకానందారెడ్డి పట్టించుకోకుండా దూరందూరంగా ఉంటున్నారు. మొదటిరోజు గురువారం పాల్గొన్నా రెండోరోజు యాత్రలో వారిద్దరూ ఎక్కడా పాల్గొనలేదు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను తనకు చెప్పడం లేదన్న బాధతో మైసూరారెడ్డి ఉన్నట్లు తెలిసింది. వివేకానందారెడ్డిని పిలిచేవారే కరువయ్యారు. సొంతంగా ఆయనే పాదయాత్రలో మొదటిరోజు పాల్గొన్నారు. రెండో రోజూ ఎవరూ ఆయనను పిలవలేదని తెలిసింది. పాదయాత్రలో వారిద్దరికీ ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు.

కామెంట్‌లు లేవు: