23, నవంబర్ 2018, శుక్రవారం

రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఇచ్చాం

యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ

మేడ్చల్‌: రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చామని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు. అందరికీ కార్తీక పూర్ణిమ, గురు నానక్‌ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ ఒక తల్లి సంవత్సరాల తర్వాత సొంతబిడ్డల దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత సంతోష పడుతుందో నేను అలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కష్టతరమైన సమస్య అనిపించింది. అప్పుడు ఆంధ్ర్రా, తెలంగాణ ప్రజల బాగోగులు రెండూ నా కళ్ల ముందు ఉన్నాయి. అంత పెద్ద సమస్య అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆంకాక్షల, స్ఫూర్తి గుర్తించి వారి కలను సాకారం చేశాం. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా మాకు నష్టం జరిగింది. అయినా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నాం’’
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తాం!‘‘ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్‌లో ప్రకటన చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. ప్రతి తల్లీ తన సంతానం బాగుపడాలని కోరుకుంటుంది. నేనూ అలాగే కోరుకున్నా. కానీ, మీ జీవితాలు, బతుకులు చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఈ నాలుగున్నర సంవత్సరాల కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం మీరు చేసిన పోరాటం తెరాస ప్రభుత్వం సాకారం చేసిందా?’’
వారి‌ కుటుంబానికి ఉపయోగ పడే పనులే చేసుకున్నారు‘‘ఈ నాలుగున్నరేళ్లలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భూసేకరణ చట్టం అమలు చేయకుండా రైతులకు నష్టం చేసింది. కూలీలకు ఎంతో మేలు చేసే ఉపాధి హామీ చట్టాన్ని కూడా తెరా అమలు చేయలేదు. కేసీఆర్‌ కుటుంబం, బంధువులకు మాత్రమే ఉపయోగపడే పనులు చేసుకున్నారు. ఎన్నో కలలు, ఆశయాలతో తెలంగాణ ఇస్తే.. అవి సాకారం కాలేదు’’
తెరాస పాలన అంతం చేసే సమయం ఇది!‘‘చిన్న పిల్లాడి పెంపకంలో లోపం ఉంటే అతడి భవిష్యత్‌ ఎలా నాశనం అవుంతుందో ఈ నాలుగున్నర పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టింది. భవిష్యత్‌ అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికలతోనే తెలంగాణ ప్రజల భవిష్యత్‌ ముడి పడి ఉంది. తెరాస పాలన అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా.’’ అంటూ తెరాస పాలనపై సోనియా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కామెంట్‌లు లేవు: