27, జులై 2019, శనివారం

భర్తకు 1వ ర్యాంక్‌.. భార్యకు 2వ ర్యాంక్‌

ఛత్తీస్‌గఢ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలో దంపతుల ఘనత
                   దిల్లీ: కలిసి చదువుకున్నవారు పెళ్లిచేసుకుని జీవితాన్ని పంచుకోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ జంట పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చదువుకున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. అలా ఏకంగా ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో అగ్ర స్థానాల్లో నిలిచారు. భర్త తొలి ర్యాంకు సాధించగా.. భార్య రెండో ర్యాంకులో నిలిచారు. వివరాల్లోకి వెళితే..
              ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్‌ సింగ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఎంపికవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం చదువు పూర్తవ్వగానే ప్రభుత్వ పరీక్షలకు సిద్ధం అవడం మొదలుపెట్టారు. పెళ్లయ్యాక భార్య విభా సింగ్‌తో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఇటీవల చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బీ, గ్రేడ్‌ సీ)కు పరీక్ష నిర్వహించగా.. వీరిద్దరూ హాజరయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో వీరిద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అనుభవ్‌కు 298.3744 మార్కులు రాగా.. విభా సింగ్‌కు 283.9151 మార్కులు వచ్చాయి. 
ఈ సందర్భంగా అనుభవ్‌ జంట మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేం. ఒకరికొకరం సాయం చేసుకున్నాం. విజయం సాధించాం. కుటుంబసభ్యులు కూడా మాకు ఎంతో అండగా నిలిచారు’ అని సంతోషం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు: