12, ఆగస్టు 2019, సోమవారం

మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌2


           అహ్మదాబాద్‌: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ -2 మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చేరనుంది. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి.. సెప్టెంబరు 7న జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. 
    భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శివన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్‌ 2 విశేషాలను పంచుకున్నారు. ‘జులై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించిన తర్వాత ఐదు సార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టాం. అవన్నీ విజయవంతమయ్యాయి. అత్యంత కీలకమైన కక్ష్య పెంపు ప్రక్రియను బుధవారం ఉదయం చేపట్టనున్నాం. ఆగస్టు 14న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ట్రాన్స్‌-లూనార్‌ ఇంజెక్షన్‌ ప్రక్రియ జరుపుతాం. దీంతో చంద్రయాన్‌ -2 భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా పయనిస్తుంది. ఆ తర్వాత లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ చేపడతాం. ఆగస్టు 20 నాటికి జాబిల్లి స్థిర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కూడా కొన్ని కక్ష్య పెంపులు చేపట్టిన తర్వాత చివరగా సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుంది’ అని శివన్‌ తెలిపారు. 
           ప్రస్తుతం వ్యోమనౌక పక్కాగా ఉందని, అన్ని సిస్టమ్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. జులై 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు: